Category Archives: ధర్మశాస్త్రము

Permalink to single post

అంత్యకాల జూడాయిజం

ప్రపంచంలోని ప్రాచీన మతాలలో జుడాయిజం (Judaism) లేక యూదుమతం ఒకటి. ఇది మధ్యప్రాచ్యంలో (Middle-East) ఆవిర్భవించినా ప్రపంచములోని అనేక దేశాలలో అనుసరించబడుతున్నది. ఈ మతం ప్రధానంగా యూదులమధ్య యూదులకొరకు యూదు మతపెద్దలైన రబ్బీలచేత ప్రారంభించబడినా ఈమధ్యే విస్తృతమైన మతప్రచారాన్ని మతమార్పిడులనుకూడా చేపట్టింది.

గత రెండువేల సంవత్సరాలుగా ప్రపంచములో ఉనికిని కొనసాగిస్తున్న యూదుమతం నిజానికి ఒకప్పటి బైబిలువిశ్వాసం లేక తనాక్ ధార్మిక మార్గం యొక్క కొనసాగింపు కాదుగాని దాని తదనంతరము ఆవిర్భవించి విస్తరిస్తున్న తాల్ముద్ ఆధారిత మతం లేక రబ్బీలమతం అన్నది గమనములో వుంచుకోవాలి. ఈనాటి యూదుమతం (జూడాయిజం) బైబిలు ప్రబోధాలకు మరియు వాటిపై ఆధారపడిన విశ్వాసానికి సుదూరమైనది. నిజానికి దీన్ని ‘అంత్యకాల జూడాయిజం’ అని అభివర్ణించవచ్చు.

‘జూడాయిజం’ (Judaism) మరియు ‘యూదుమతం’ అన్న పదప్రయోగాలు గాని లేక అవి ప్రాతినిథ్యం వహిస్తున్న మతవిధానము గాని క్రీస్తుకు పుర్వమున్న దైవప్రవక్తలెవరు ఎరుగనివి. అయితే, జూడాయిజం [యూదుమతం] అంటే యూదుల మతం అన్నది ఈనాటి సర్వసాధారణ భావం. కాని, పాతనిబంధన గ్రంథం (తనాక్) అంతటిలో ఒక్కసారికూడా ఈ పదం ఉపయోగించబడలేదు. వాస్తవానికి ఈ పదం రబ్బీల సృష్టి!

‘యూదుడు’ అన్నపదం ‘యూదా’ అనే హెబ్రీ నామములోనుండి పుట్టిన పదమైనప్పటికిని ఇది అబ్రహాము ఎరుగని పదం, మోషే ఎరుగని పదం, చివరకు దావీదుగాని లేక అతని సంతానములోనుండి వచ్చిన ఏలికలలోనివారుగాని ఇశ్రాయేలీయుల గోత్రాలన్నీ దాసత్వములోకి వెళ్ళకముందు వరకు ఎరుగని పదం.

ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకముగా పదేపదే పాపము చేయడముద్వారా తమతో దేవుడు చేసిన నిబంధనను భంగంచేసి తత్ఫలితంగా దేవుని ఉగ్రతను కొనితెచ్చుకున్నారు. దాని పర్యవసానమే దేవుడు 722 క్రీ.పూ. లో పది గోత్రాలతోకూడిన ఉత్తరరాజ్యం ఇశ్రాయేలును అన్యులైన అష్షూరుదేశస్తులకు అలాగే 586 క్రీ.పూ. లో రెండు గోత్రాలతోకూడిన దక్షిణరాజ్యం యూదాను బబులోనుదేశస్తులకు బానిసలుగా అప్పగించాడు. ఆరకమైన దుస్థితిలో వారు కొనసాగుతున్న సమయములో కేవలము రెండు గోత్రాల ప్రజలను అంటే యూదా గోత్రము మరియు బెన్యామీను గోత్రము వారిని సూచిస్తూ పలికేందుకు పుట్టింది ‘యూదులు’ (יְהוּדִים/యెహుదిం) అన్న పదం. ఈనాటి కొందరు యూదు పండితుల అభిప్రాయప్రకారం ఆఫ్రికాలోని నల్లజాతీయులను వివక్షతతో ‘నీగ్రోలు’ అంటూ పేర్కొన్నట్లు అన్యజాతీయులు ఇశ్రాయేలీయుల రెండుగోత్రాలవారిని తిరస్కారభావంతో ‘యూదులు’ అంటూ పిలవడం ప్రారంభించారు. చరిత్రాధారాలను బట్టి చూస్తే ప్రారంభములో బబులోనుదేశస్తులు యూదా రాజ్యములోనుండి వచ్చిన వారందరిని యుదులు అంటూ పిలిచారు. అప్పట్లో ఇది మతాన్నికాక జాతీయతను ఎత్తిచూపే పదంగా ఉపయోగించబడింది.

ఈ నేపద్యంలో ఇశ్రాయేలీయులు చెరలో వున్న సమయములో ప్రవక్తలు వ్రాసిన గ్రంథాలలో ‘యూదుడు’ మరియు ‘యూదులు’ అన్న పదాలు చూడగలము. కాలక్రమేణా ఈ పదాలు ఇశ్రాయేలు గోత్రాలన్నింటిలోనివారికి ఆపాదించడం మొదలైంది. ఇశ్రాయేలీయుల మతవిశ్వాసాలు పాతనిబంధన (తనాక్) బోధలతో మరియు యెరూషలేములోని దేవుని ఆలయముతో ముడిపడివుండటాన్ని ఈసందర్భంగా జ్ఙాపకం చేసుకోవాలి. ఈ కారణాన్నిబట్టి 70 క్రీ.శ. లో రోమీయులు యెరూషలేములో రెండవసారి కట్టబడిన దేవుని మందిరాన్ని ద్వంసముచేయడముతో ఇశ్రాయేలీయుల మతవిశ్వాసాలకు ఉపద్రవం యేర్పడింది. ఈ పరిస్థితి తమ మతగ్రంథాలను సంస్కరిస్తూ క్రొత్త గ్రంథాలను వ్రాసుకునేందుకు యూదుల మతపెద్దలకు అంటే ‘రబ్బీలకు’ తోడ్పడింది.

అప్పటినుండి యూదుజాతీయులు మరియు యూదుమతప్రవిష్టులు (యూదుమతాన్ని స్వీకరించినవారు) బైబిలు గ్రంథబోధలను ప్రక్కకుబెట్టి పాతనిబంధన లేఖనాలకు రబ్బీలు చెప్పే పొంతనలేని వ్యాఖ్యానాలను, వారు చేసే బోధలను, అలాగే వారు ప్రవేశపెట్టిన పితృపారంపార్యాచారాలను పాటించడం మొదలుబెట్టారు.

ప్రఖ్యాత ననాతన యూదు రచయిత మరియు రబ్బీ (యూదు బోధకుడు) ఖెయిం షిమ్మెల్ తాను వ్రాసిన “మౌఖిక తోరా” అన్న గ్రంథములో యదార్థంగా ఒప్పుకుంటూ వ్రాసిన మాటలు:

తోరాలో వ్రాయబడిన అసలు మాటల ప్రకారం యూదులు ఎప్పుడూ జీవించలేదు, అయితే వారు జీవించింది రబ్బీలు ప్రవేశపెట్టిన సంప్రదాయాల ప్రకారం! (రబ్బీ ఖెయిం షిమ్మెల్)

ఈ మతస్తులు తమ మతప్రచారములో ఇతర మతస్తులను ఆకట్టుకునేందుకు హెబ్రీ బైబిలును విరివిగా పేర్కొంటుంటారు. అయినా, వీరి మత విశ్వాసాలు ఆచారవ్యవహారాలు ప్రధానంగా రబ్బీలు చేసిన బోధలపై వారు ప్రవేశపెట్టిన ఆచారాలపై ఆధారపడి వుంటాయి.

యెరూషలేములోని హీబ్రూ విశ్వవిధ్యాలయములో ఆచార్యునిగా పనిచేసిన కిప్పాను ధరించి జుడాయిజములో కొనసాగుతున్న అవిగ్దోర్ షినాన్ ప్రస్తుతమున్న జూడాయిజంలోని వారు పాటించే ఆచారాల మూలాలను వివరిస్తూ చెప్పిన సత్యం,

“మా ధార్మికవిధ్య పాతనిబంధనాగ్రంథంపై (తనాక్ పై) ఆధారపడింది కాదు. ఈనాడు మేము అనుకరిస్తున్న ఆచారాలు పాతనిబంధనాగ్రంథపు ఆచారాలు కావు, అవి మా పూర్వికులలోని విజ్ఙులు (sages) ప్రారంభించిన ఆచారాలు.
      
“సబ్బాతు (విశ్రాంతిదిన) ఆచారాలు, కష్రుత్  నియమాలు మొదలైనవి లేఖనాలలో పాతనిబంధన గ్రంథములో లేనివి. పాతనిబంధనాగ్రంథములో సినగోగు లేదు, కద్దీష్ లేదు, కోల్ నిద్రె లేదు, బార్ మిట్స్ వ లేదు, తల్లీల్ లేదు. ఈనాడు యూదుత్వానికి చెందినదంటూ నిర్వచించబడే వాటిలో మొదలును పరిశోధించి చూస్తే అవి పాతనిబంధనాగ్రంథములోనివి కావుగాని మాపూర్వికులలోని విజ్ఙులు (sages) అందించిన సాహిత్య గ్రంథములలోనివి. అక్కడే ప్రతీది మొదలయ్యింది. యూదుమతం పాతనిబంధ గ్రంథములో ఎక్కడుంది? మోషే యూదుడని పిలువబడలేదు. అబ్రహాముకూడా అలా పిలువబడలేదు. కేవళం మొర్దెకై “యూదుడైన మొర్దెకై” గా పిలువబడ్డాడు, అదీ పాతనిబంధన గ్రంథములోని చివరి భాగములో పారసీకుల కాలములో జరిగిన సంఘటన.” (ఆచార్య అ. షినాన్) 

వీరు ఒకవైపు పాతనిబంధనాగ్రంథము యొక్క సహజ కొనసాగింపుగా యివ్వబడిన క్రొత్తనిబంధనాగ్రంథాన్ని తప్పుబడుతూ, తిరస్కరిస్తూ, ఇంకా దానిపై ఎన్నో అసత్యారోపణలు చేస్తూ మరొకవైపు పాతనిబంధనాగ్రంథానికి వేరైన వ్యతిరేకమైన బోధలు కలిగిన రబ్బీల గ్రంథాలలోని అంటే మిష్నా మరియు గమరాలతోకూడిన యెరూషలేము తాల్ముదు, బబులోను తాల్ముదు, జోహర్ మొదలైన బబులోనులోని అన్యుల ప్రభావముతో వ్రాయబడిన గ్రంథాలలోని ప్రబోధాలను మరియు ఆచారాలను అనుసరించే ప్రయత్నం చేస్తుంటారు.

ఈనాటి జూడాయిజం వారు అనుకరిస్తున్న అనేక ఆచారాలు సాంప్రదాయాలు ఒకప్పుడు యూదులు చెరలో జీవిస్తున్నప్పుడు వారిని చెరగా తీసుకుపోయిన అన్యజనుల ఆచారాలలోనుండి అరువుతీసుకున్నవే:

తలిస్మానులు, హంసాలు (హస్తరూప తాయత్తులు), లాగ్ బౌమ (ఒమెర్ 33వ దినాన జరుపుకునే యూదుమత పండుగ), కిప్పా (యూదులు ధరించే పుర్రె టోపి) ధరించటం, మరణించిన ఆత్మలతో షంభాషించే సమావేశాలు, టెఫిలీనులను కట్టుకోవడము, ద్వారబంధాలకు మెజుజాలను వ్రేలాడదీయడము, ప్రసిద్దిగాంచిన రబ్బీల సమాధులపై సాష్టాంగపడటము, మాంసాన్ని మరియు పాలవ్యుత్పత్తులను వేరుచేసే కష్రుత్ నియమాలను పాటించటం, మంత్రజాలాలు, కౌమార ప్రాయపు ప్రారంభ వేడుకలు (బార్ మిట్జ్వ) జరుపుకోవటం, పేరెన్నికగల రబ్బీల చిత్రపటాలను గోడలకు వ్రేలాడదీయడం, మంత్రోచ్చరణలు, మరియు వివాహ వేడుకలలో ద్రాక్షారసాన్ని త్రాగుటకు ఉపయోగించే గాజు పాత్రను పగలగొట్టడం మొదలైనవి.

ఓసారి ఓ జ్ఙాని యిలా అన్నాడు, “రబ్బీలు పెంపొందించిన జూడాయిజాన్ని ఈరోజు మోషే గనుక దర్శిస్తే ఆ మహానుభావుడే దాన్ని ఏకోశనా గుర్తించలేడు!”

ఇది చాలదన్నట్లు వారిలో కొందరు ముఖ్యంగా అన్యజాతులలోనుండి జూడాయిజమును స్వీకరించినవారు క్రొత్తనిబంధన గ్రంథాన్ని అలాగే పరమతండ్రి అభిషేకించి పంపిన మెస్సయ్యను తూలనాడుతు దుర్భాషలతో దుమ్మెత్తిపోస్తుంటారు. వారి ప్రయత్నం మధ్యాహ్నపు సూర్యునిపై దుమ్మెత్తిపోసే మూర్ఖుల ప్రయత్నాలను తలదన్నేస్థాయిలో వుంటుంది.

ఇతరుల విశ్వాసాలను ప్రశ్నించటం, పరిశోధించటం, లేక తిరస్కరించటం అన్నవి సభ్యసమాజములో ప్రతివ్యక్తికీ వున్న సాధారణ హక్కులు. కాని, పనిగట్టుకొని ఇతరులను వ్యక్తి దూషణకు గురిచేయటము లేక ఇతరుల విశ్వాసాలను దూషించటము తూలనాడటము అన్నవి సంస్కారవంతులు చేసే పనికాదు. అవి సంస్కారహీనులకు చెందినవి.

మానవాళి రక్షణకై/విమోచనకై పరమతండ్రి చూపిన అపార ప్రేమ యొక్క ప్రత్యక్షతగా తననుతాను పాపపరిహారార్థబలిగా సమర్పించుకున్న మెస్సయ్య అయిన యషువ (యేసు) పై తాము ఎత్తిపోసే దుర్భాషల దుమ్ము తమ కళ్ళలలో, నోటిలో, మరియు బ్రతుకుళ్ళోనే పడుతుందన్న చేదు నిజాన్ని గ్రహించలేని అజ్ఙానాంధులు ఈబాపతు జూడాయిజం వారు!

తమ మతవిశ్వాసాల ప్రచారానికై క్రొత్తనిబంధనను శంకించేందుకు అనువుగా అనేక తర్కరాహిత్యమైన, ద్వంద్వనీతీప్రాయమైన, సాహిత్యపరిజ్ఙానలోపముతోకూడిన ప్రశ్నలు సంశయాలను లేవనెత్తుతు అమాయక క్రైస్తవులను విశ్వాసభ్రష్టులను చేస్తున్నారు. ఇలాంటివారినిగూర్చే క్రొత్తనిబంధనా లేఖనాలు రెండువేల సంవత్సరాలక్రితమే ప్రవచనాత్మకంగా క్రింది మాటలలో హెచ్చరించాయి:

అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. (1తిమోతీ.4:1-2)

తమ మోసపూరిత కుతంత్రాలను ప్రయోగించే ప్రయత్నములో వీరు సోషల్ మీడియాను మరిముఖ్యంగా వాట్సాప్ గ్రూపులను విరివిగా ఉపయోగిస్తుంటారు. తమ విశ్వాసాలతో ఏకీభవించనివారిని వ్యక్తిగత దూషణ చేయటం, ఇతరుల విశ్వాసాలను తూలనాడటం, క్రొత్తనిబంధన లేఖనాలను ఎగతాళిచేయటం, ప్రభువైన యేసు క్రీస్తును దూషించటం వీరి ప్రత్యేక లక్షణాలు. వారి భాషా మరియు పదజాలము పతనావస్తలోవున్న వారి వ్యక్తిగత స్వభావలక్షణాలనేగాక వారిపై ప్రభావాన్ని చూపుతున్న వారి మత స్వభావాన్నికూడా అవగతం చేసుకోవడానికి ఉపకరిస్తాయి.

ఈరకమైన ప్రయత్నాలు ప్రముఖంగా నామకార్థ క్రైస్తవులమధ్య చేయటం ఈ మతవిశ్వాసుల ప్రధాన వ్యూహంగా గమనించగలం.

ఈనాటి క్రైస్తవ్యములో అధిక శాతం నామకార్థ క్రైస్తవులు లేక మతక్రైస్తవులేనన్నది సుస్పష్టం. పొట్టు విస్తారం, గింజలు స్వల్పం! అన్యమతాలనుండి మరియు దుర్బోధకులనుండి క్రైస్తవ సత్యం పై జరుగుతున్న దాడికి అనేకులు కదిలిపోయి నిజక్రైస్తవ్యాన్ని వదిలి నాశనమార్గాలలోకి అడుగిడుతున్నారు. ఇది అనిర్వార్యం. గాలివీస్తేనే పొట్టు గింజలు వేరయ్యేది. గాలికి పొట్టులాంటి క్రైస్తవులు చెదరగొట్టబడ్డప్పుడే స్థిరంగా నిలిచే గింజలలాంటి నిజక్రైస్తవులు గుర్తించబడేది.

ఆయన (మెస్సయ్య) చేట ఆయన చేతిలోనున్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి, తన కొట్టులో గోధుమలుపోసి, ఆరని అగ్నితో పొట్టు కాల్చి వేయునని అందరితో చెప్పెను.” (లూకా.3:17)

Permalink to single post

ధర్మశాస్త్రపు నీతి Vs. దేవుని నీతి

మోషేధర్మశాస్త్రము (מֹשֶׁ֣ה תּוֹרַ֖ת /tawrat Moshe)…

  • మేలైనది
  • నీతిగలది
  • శ్రేష్టమైనది
  • సత్యమైనది
  • నమ్మదగినది
  • పరిశుద్ధమైనది
  • అర్థంకానిది కాదు
  • దూరమైనది కాదు
  • ప్రయోజనకరమైనది
  • దేవుడు నియమించినది
  • పూర్వ/పాత నిబంధనలోనిది
    (ద్వి.కాం.30:11; నెహెమ్యా 9:13; కీర్తనలు. 19:7, 119:72,142; రోమా. 7:12,16; 15:4; 1కొరింథీ.10:1-11; 1తిమోతి.1:8-11; 2తిమోతి.3:16-17)

మోషేధర్మశాస్త్రముద్వారా నీతిమంతులుగా తీర్చబడవచ్చు. అందుకు శరతులు ఈ క్రింద యివ్వబడినవి

అ) ధర్మశాస్రములోని ఆజ్ఙలన్నింటిని పాటించాలి (ని.కాం.15:26; ద్వి.కాం.5:29, 6:2; 12:32; 13:18, 26:18, 27:1; రోమా.2:13; యాకోబు 2:10)
ఆ) ధర్మశాస్త్రములోని ఆజ్ఙలను అన్నివేళలా పాటించాలి (ద్వి.కాం.5:29, 6:2) 
ఇ) ధర్మశాస్త్రములోని ఆజ్ఙలను తప్పిపోకుండా పాటించాలి (ద్వి.కాం.27:26; యిర్మీయా.11:1-4; గలతీ.3:10; యాకోబు 2:10-11)
ఈ) అప్పుడు, ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా తీర్చబడగలరు (ద్వి.కాం.6:25) 
ఉ) ధర్మశాస్త్రాన్ని పాటించడములో తప్పిపోతే (కొంత తప్పినా) శాపగ్రస్తులవుతారు    (ద్వి.కాం.27:26; యిర్మీయా 11:1-4; గలతీ.3:10; యాకోబు 2:10-11)

పై వాస్తవాలను బట్టి పాతనిబంధనగా గుర్తించబడిన తనాక్ గ్రంథమంతటిలో కేవలము మోషేధర్మశాస్త్రాన్ని పరిపూర్ణముగా అనుసరించడముద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తి ఒక్కరుకూడా లేరు అన్నది గమనార్హమైన విశయం.

పరమతండ్రి మోషేధర్మశాస్త్రములో పాపాము చేసినవారికి శాపవిమోచననొసిగే పాపక్షమాపణ మార్గాలను విశదీకరించాడు

i. సమాజ పాపాలకు బల్యర్పణలను (రక్తబలులు) నిర్ధేశించాడు.
(లేవీ.కాం.; సం.కాం.15:22-26)       
ii. వ్యక్తిగత పాపాలకు:
– తెలిసి చేసిన కొన్ని పాపాలకు బల్యర్పణలు (లేవీ.కాం.6:1-7; సం.కాం.5:6-8, 15:)
– యాదృచ్ఛిక పాపాలకు బల్యర్పణలు లేక గొధుమ పిండితో కూడిన నైవేద్యము/హోమద్రవ్యము (లేవీ.కాం.4:1-31, 5:1-13; సం.కాం.15:27-29)
– దైవదూషణతోకూడిన ధిక్కారంతో చేసిన పాపాలకు మరణశిక్ష (సం.కాం.15:30-31)
iii. మోషేధర్మశాస్త్రములోని పదిఆజ్ఙలను మీరిన వారికి శిక్షలు:
పదిఆజ్ఙలలోని ఆరు అజ్ఙలను మీరిన వారికి మరణశిక్ష. (ద్వి.కాం.13:1-18; 17:2-5; లే.కాం.24:11-16; ని.కాం.31:14-15, 35:2; ద్వి.కాం.21:18-21; ని.కాం.21:17; ని.కాం.21:12-14; లే.కాం.20:10) 

గమనిక: కేవలము యాదృచ్ఛిక పాపాల విశయములో మాత్రమే ఒకవేళ రక్తబలులర్పించే పరిస్థితి లేక స్థోమత లేని సందర్భాలలో గోధుమపిండి యర్పణద్వారా పాపక్షమాపణ పొందే అవకాశమివ్వబడింది. ఈ వెసలుబాటు అంటే గోధుమపిండి యర్పణద్వారా పాపక్షమాపణ పొందే అవకాశం అన్నది తెలిసి చేసిన పాపాల విశయములో ఇవ్వబడలేదు.   

మోషేధర్మశాస్త్రము చేయలేనివి

– దేవుని ఆజ్ఙలను మీరి పాపము చేసిన వ్యక్తులకు నీతిమీంతులయ్యే మార్గం చూపలేదు
– తెలిసిచేసిన అనేక పాపాలకు క్షమాపణ/ప్రాయశ్చిత్తం పొందే మార్గం యివ్వలేదు
– మరణకరమైన పాపాలకు క్షమాపణ మార్గం నిర్దేశించలేదు
– అన్యులకు అంటే యూదేతరులకు పరిశుద్దస్థలములోకి ప్రవేశించె అనుమతి యివ్వలేదు
– అన్యులకు యూదులతో సమానంగా ఆత్మీయ మేళ్ళను అందించలేదు
– అన్యులకు యూదులలాంటి స్థానాన్ని యివ్వలేదు
– ఒక్క పాపినికూడా నీతిమంతునిగా/నీతిమంతురాలుగా తీర్చలేకపోయింది (రోమా.3:20; అపో.కా.13:39; గలతీ.2:16)

సృష్టికర్త మోషేధర్మశాస్త్రనికి వేరుగా అది చేయలేని వాటిని చేశాడు

– దేవుని ఆజ్ఙలను మీరి పాపము చేసిన వ్యక్తులను నీతిమంతులుగా చేశాడు [అబ్రహాము (ఆది.కాం.12:11-13; 15:6; 20:1-2, 5; రోమా.4:3; గలతీ.3:6)]
– తెలిసీతెలియక చేసిన అన్ని పాపాలకు (పరిశుద్ధాత్మ దూశణకు తప్ప) క్షమాపణ/ప్రాయశ్చిత్తం పొందే మార్గం అనుగ్రహించాడు (అపో.కా.13:39; కొలొస్సీ.2:13; 1యోహాను.1:9)
– మరణకరమైన పాపము చేసిన వ్యక్తులకు క్షమాపణను అందించాడు [దావీదు (2సమూయేలు.12:1-13)]
– అన్యులకు అంటే యూదేతరులకు పరిశుద్దస్థలములోకి ప్రవేశించె అనుమతి ఇచ్చాడు (ఎఫెసీ.2:11-22; 1పేతురు.2:9-10)
– అన్యులకు యూదులతో సమానంగా ఆత్మీయ మేళ్ళను అనుగ్రహించాడు (2పేతురు.1:1)
– అన్యులకు యూదులలాంటి స్థానాన్ని ఇచ్చాడు (గలతీ.3:28-29)
– పాపులైన అనేకమందిని యూదులు మరియు యూదేతరులు అన్న భేదం లేకుండా నీతిమంతులుగా మార్చాడు (రోమా.3:23-30)

 లేఖనాల ప్రకారం పరమతండ్రి… 

  • నోవహునిబంధనను మానవులందరితో చేసాడు (ఆది.కాం.9:9-10) 
  • అబ్రహామునిబంధనను అబ్రహాము సంతతితో చేసాడు [మానవులందరితో కాదు] (ఆది.కాం.17:7-8) 
  • దావీదునిబంధనను దావీదు సంతతితో చేసాడు [ఇశ్రాయేలీయులందరితో కాదు] (2సమూయేలు.23:5; యిర్మీయా.33:20-22) 

అయితే, మోషేనిబధనను పరమతండ్రి కేవలము ఇశ్రాయేలీయులతో మాత్రమే చేసాడా…?

లేఖనాల సాక్ష్యం ప్రకారము ప్రభువైన దేవుడు మోషేనిబంధనను ప్రధానంగా ఇశ్రాయేలీయులతో చేసినా అది కేవలం వారితో మాత్రమే కాకుండా వారిమధ్య జీవిస్తూ వారితోపాటు వాగ్దత్త దేశమైన కానానులో స్వాస్థ్యము పొందబోతున్న అన్యులతో/పరదేశులతో అలాగే ఆసమయములో అక్కడ వారితోకూడాలేని వారిసంబంధికులందరితో అంటే కనానుదేశములో స్వాస్థ్యము పొందబోతున్న రాబోవుతరాలతో కూడా (ద్వి.కాం.29:29) చేశాడు. కాని, మానవులందరితో లేక అన్యులందరితో కాదు (ద్వి.కాం.29:11-15). 

లేఖనాలు ప్రకటిస్తున్నదాని ప్రకారం…

  • నోవహునిబంధన నిత్యనిబంధన [עוֹלָֽם׃ בְּרִ֣ית/brith olam] (ఆది.కాం. 9:16)
  • అబ్రహామునిబంధన నిత్యనిబంధన [עוֹלָֽם׃ בְּרִ֣ית/brith olam] (ఆది.కాం.17:7,19; 1దిన.వృ.16:15-18; కీర్తన.105:8-12)
  • దావీదునిబంధన నిత్యనిబంధన [עוֹלָֽם׃ בְּרִ֣ית/berith olam] (2సమూయేలు.23:5). 

కాని, మోషేనిబంధనను నిత్యనిబంధనగా లేఖనాలు పేర్కొనడం లేదు! 

గమనార్హమైన విశయం

మోషేనిబంధనను నిత్యనిబంధనగా పరమతండ్రి తనాక్ లో ఎక్కడా పేర్కొనలేదు. తనాక్ (పాతనిబంధన గ్రంథము) లోని నిత్యనిబంధనలకు మరియు మోషేనిబంధనకు గల ఈ వ్యత్యాసం ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని నిత్య సంకల్పములో రూపకల్పన చేయబడిన క్రొత్తనిబంధన మోషేనిబంధన స్థానములో ఆవిష్కరించబడి నిత్యనిబంధనగా కొనసాగబోతున్నందున (యిర్మీయా.31:31-34, 32:37-40) తనాక్ లో ఎక్కడకూడా మోషేనిబంధనను నిత్యనిబంధనగా పరమతండ్రి పేర్కొనలేదు. ఇది ఆయన ఆనాదికాల ప్రణాళిక. ఆయన బుద్ధి జ్ఙానముల బాహుళ్యము ఎంతో గొప్పది అనడానికి ఇదో మచ్చుతునక! 

మోషేధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా అన్నికాలాలలో తప్పిపోకుండా నెరవేర్చి తద్వారా నీతిమంతులుగా తీర్చబడినవారు పాతనిబంధన గ్రంథమంతటిలో (తనాక్) ఒక్కరు కూడా లేరు. మరోమాటలో చెప్పలంటే మోషేధర్మశాస్త్రము ఒక్కరినికూడా నీతిమంతునిగా తీర్చలేకపోయింది. (1రాజులు 8:46; కీర్తనలు 14:1-3, 53:1-3, 143:2; ప్రసంగి 7:20; రోమా.3:20; గలతీ.2:16, 3:10-11)

[గమనిక: పాతనిబంధన గ్రంథములో (తనాక్) లో నీతిమంతులున్నారు. అయితే వారు విశ్వాసమునుబట్టి నీతిమంతులని పేర్కొనబడ్డారు అన్నది లేఖనాల సాక్ష్యం! (ఆది.కాం.15:6; హబక్కూకు.2:2; గలతీ.3:12)] 

మోషేద్వారా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనను తాను మీరను అని పరమతండ్రి వాగ్ధానం చేసాడు (న్యాయాధిపతులు.2:1). 

అయితే, ఇశ్రాయేలీయులు తామే పదే పదే విశ్వాసఘాతకులుగా మారి ఆనిబంధనను మీరి భంగం చేసారు (యిర్మీయా.11:10, 31:32; యెహెజ్కేలు.44:7; హోషేయ 6:7, 8:1). 

ఈ సందర్భంగా వాగ్ధానాన్ని భంగం చేస్తూ వచ్చిన ఇశ్రాయేలు జనాంగాన్ని వుద్దేశించి పరమతండ్రి, నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను అంటూ చెప్పేసాడు (యెహెజ్కేలు.16:59). 

ఈ నేపథ్యములో దేవుడు ఇశ్రాయేలీయులచేత భంగం చేయబడిన మోషేనిబంధన స్థానములో నిత్యమూ వుండబోయే ఒక సరిక్రొత్తనిబంధనను చేయబోతున్నట్లుకూడా వాగ్ధానం చేసాడు (యెషయా.42:1-3,6, 55:1-5, 61:1-11; యిర్మీయా.31:31-34; యెహెజ్కేలు 16:60, 37:24-28).

అయితే, ఆ క్రొత్తనిబంధన పూర్వముండిన మోషేనిబంధనవంటిది కాదు అన్న పరమతండ్రి ప్రకటన ఇక్కడ అతిప్రాముఖ్యమైన అంశంగా గుర్తుంచుకోవాలి.

“​ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. ​అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు…”  (యిర్మీయా.31:31-32)    

పరమతండ్రి పూర్వ లేక పాతనిబంధనను మోషేద్వారా చేశాడు (ని.కాం.24:7-8). కాని, ప్రవక్తలద్వారా తాను వాగ్ధానము చేసిన నిబంధనను/నిత్యనిబంధనను/క్రొత్తనిబంధనను (యెషయా.55:3, 61:8; యిర్మీయ.31:31-34, 32:37-40; యెహెజ్కేలు.16:60, 37:26) తన సేవకుడు/కుమారుడు/మెస్సయ్య ద్వారా చేయబోతున్నట్లు లేఖనాల సాక్షాన్ని అందించాడు (యెషయా 42:5-7, 49:5-8, 55:3-5, 59:20-21, 65:1).

క్రొత్తనిబంధనను పరమతండ్రి కేవలము ఇశ్రాయేలీయులతో మాత్రమే చేస్తాడా…?

లేఖనాల సాక్ష్యం ప్రకారము… 

– ప్రభువైన దేవుడు క్రొత్తనిబంధనను ప్రధానంగా ఇశ్రాయేలీయులతో చేయబోతున్నా అది కేవలం వారితో మాత్రమే చేస్తాను అని ఎక్కడా చెప్పలేదు.

– ప్రవక్తల కాలంలో ఒకవైపు “ఇశ్రాయేలీయులతో నేను ఒక నిబంధన చేయబోతున్నాను,” “ఇశ్రాయేలీయులతో ఒక నిత్యనిబంధన చేయబోతున్నాను,” “ఇశ్రాయేలీయులతో ఒక క్రొత్తనిబంధన చేయబోతున్నాను” అని ప్రభువైన దేవుడు పదే పదే ప్రకటిస్తూనే మరోవైపు ప్రజలకు/మానవకోటికి (కేవలం ఇశ్రాయేలీయులు అని కాదు లేక కేవలం అన్యజనులు అని కాదు) అంటే మానవులందరికి నిబంధన అందించబోతున్నట్లు కూడా ప్రకటించాడు (యెషయా.42:1-7, 49:5-8; యిర్మీయా.31:31-34; యెహెజ్కేలు 16:60-62, 37:24-28). నిస్పక్షపాతి అయిన పరమతండ్రి మానవాళికి చేసిన వాగ్ధానాల నెరవేర్పే క్రొత్తనిబంధన మరియు దాని ఆవిష్కరణ! 

– అన్యజనులకు తన సేవకున్ని/కుమారున్ని/మెస్సయ్యను నిబంధనగా మరియు వెలుగుగా వుంచుతాను అని విస్పష్టమైన వాగ్ధానాలిచ్చాడు (యెషయా.42:1-7). ఆవాగ్ధానాలయొక్క నేరవేర్పును క్రొత్తనిబంధనలో అన్యజనులందరిని చేర్చడముద్వారా దేవుడు నెరవేర్చాడు!

– అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్ధానాలలో ఆయన ద్వారా లోకములోని వంశాలనన్నిటిని ఆశీర్వదిస్తానంటూ వాగ్ధానం చేసాడు (ఆది.కాం.12:3; 18:18, 22:18, 26:4, 28:14 = అపో.కా.3:25-26; గలతీ.3:8-14). ఆవాగ్ధానము యొక్క నెరవేర్పు క్రొత్తనిబంధనలో దేవుడు అన్యజనులందరిని చేర్చడముద్వారా నెరవేర్చాడు!

– ఒక ప్రత్యేకమైన జనాంగముతో మాత్రమే దేవుడు మోషేనిబంధనను చేసి దాని తరువాత తాను చేయబోతున్న క్రొత్తనిబంధన మోషేనిబంధనవంటిది కాదు అని విస్పష్టముగా నొక్కిచెప్పటముద్వారా (యిర్మీయ.31:31-32) ఆ నిబంధన (క్రొత్తనిబంధన) ఒక ప్రత్యేకమైన జనాగమునకు మాత్రమేగాక లోకములోని ప్రజలందరితో చేయబోయే నిబంధన అన్న సత్యానికి తిరుగులేని సాక్ష్యాన్ని అందించాడు.

– పక్షపాతరహితుడైన పరమతండ్రి తన నిత్యసంకల్పములోని  మహోత్తర ప్రణాళిక ప్రకారము తన స్వరూపమందు తన పోలికచొప్పున సృష్టింపబడిన మానవులందరిని ఆశీర్వాదించడానికై నిత్యనిబంధనగా వుండే క్రొత్తనిబంధనను ప్రజలతో అంటే మానవులందరితో చేయబోతున్నాడు గనుక ఇశ్రాయేలీయులకు ‘అన్యజనుల వలన రోషము పుట్టించబోతున్నాను’ అంటూ ప్రవచనాత్మకంగా ప్రకటించాడు (ద్వి.కాం.32:21). ఒక రకంగా దాని ఫలితమే ఈనాటి యూదులు మరియు జూడాయిజంవారు యషువ మషియాఖ్ (యేసు క్రీస్తు) పై అలాగే ఆయన బోధలపై వేస్తున్న నీలాపనిందలు మరియు వెళ్ళగక్కుతున్న అక్కసు మరియు విషం అంతా!

– “నన్ను వెదకని వారికి నేను దొరికితిని” మరియు “నా జనము కానివారితో మీరే నా జనము అని నేను చెప్పుదును” అంటూ ఇశ్రాయేలీయులకు మాత్రమేగాక తాను అన్యజనులకు సహితం నిబంధనద్వారా దేవునిగా వుండబోతున్న సత్యాన్ని ప్రవచనాత్మకంగా ముందే ప్రకటించాడు (యెషయా.65:1; హోషేయ.2:23). దాని నెరవేర్పే అన్యజనులు సహితం ప్రవేశించేందుకు వీలుగా దేవుని రాజ్య ద్వారాలను తెరచిన క్రొత్తనిబంధన!    

మోషేధర్మశాస్త్రము చేయలేకపోయినదాన్ని దేవుడు చేసాడు:

కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము దేవుడు తన సొంత కుమారుని (యషువ మషియాఖ్/యేసు క్రీస్తు) పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.” (రోమా.8:1-4)

ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.[ఆది.కాం.15:6;  యెషయా.46:13, 53:8-11; హబక్కూకు.2:4; దానియేలు.9:24] అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై,నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.” (రోమా.3:20-22) 

మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయముల మీదనున్నది గాని వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.” (2కొరింథీ.3:14-16) 

Permalink to single post

సబ్బాతు సమాచారం

1. పదప్రయోగం: సబ్బాతు లేక విశ్రాంతిదినము అన్న హీబ్రూ పదం (שַׁבַּת/shabbat/షబ్బాత్) పాత నిబంధన గ్రంథములో (O.T./తనాఖ్) 111 సార్లు వుపయోగించబడింది. గమనించాల్సిన విశయమేమిటంటే ఈ పదం బైబిలులోని మొదటి గ్రంథమైన ఆదికాండములోని 50 అధ్యాయాలలో యెక్కడా వుపయోగించబడలేదు. సబ్బాతు (విశ్రాంతిదినము) ను పాటించే ఆచారాన్ని లేక ఆజ్ఙను దేవుడు ఆదాము మొదలుకొని యోసేపువరకు యేవరికీ యివ్వలేదు. కాబట్టి, మోషేకు ముందు యేవరూ ఆ ఆచారాన్ని పాటించలేదు.  

వారములోని ఏడు దినాలు ఆదినుండే వున్నాయి. అందులో యేడవదినము కూడావుంది. యేడవదినాన్ని ఆదిలోనే దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు (ఆది.కాం.2:3). అయితే, యేడవదినాన్ని విశ్రాంతిదినముగా పాటించే ఆచారము మాత్రము మోషే కాలమునుండే ప్రారంభమయింది. అంతకుముందు ఆ ఆచారాన్ని పాటించాలన్న ఆజ్ఙ యివ్వబడలేదు పాటించిన దాఖలాలుకూడా లేఖనాలలో యేవీ లేవు.  

రెండుహీబ్రూపదాలు:

i) షబత్ (שָׁבַת/shabath): ఆగిపోవుట; విరమించుట; విశ్రమించుట (క్రియావాచక పదము/verb). ఈపదం పాత నిబంధన గ్రంథములో (O.T./తనాఖ్) 71 సార్లు వుపయోగించబడింది (ఉదా. ఆది.కాం.2:2,3, 8:22; నిర్గ.కాం.5:5, 12:15).    

ii) షబ్బాత్ (שַׁבַּת/shabbat): విశ్రాంతి; విశ్రాంతిదినము (నామవాచక పదము/noun).  ఈ పదం పాత నిబంధన గ్రంథములో (O.T./తనాఖ్) 111 సార్లు వుపయోగించబడింది (ఉదా. నిర్గ.కాం.16:23,25,26,29)

గమనించాలి, ఇక్కడ చర్చించబడుతున్నది “షబత్” (שָׁבַת/shabath) గురించి కాదు. ఇక్కడ చర్చించబడుతున్నది “షబ్బాత్” (שַׁבַּת/shabbat) గురించి. ఈ రెండు హీబ్రూ పదాలమధ్యనున్న సూక్ష్మమైన, సున్నితమైన, మరియు సంక్లిష్టమైన వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతే లేఖనాల అంతర్గతములో నిభిడీకృతమైవున్న  దైవ సత్యాన్ని గ్రహించడం అసాధ్యం.

ఈ సందర్భంగా మనం లేఖనాలలో వుపయోగించబడిన క్రింది మూడు పదాలను అవి వ్యక్తపరుస్తున్న భావాలను సరియైన విధంగా అర్థంచేసుకోవాల్సివుంది: 

విశ్రాంతి: ఇది దేవుని విశ్రాంతి. బైబిలు అనువాదాలలో ఆదికాండము 2:1-2 ప్రకారము దేవుడు ఆరుదినాలలో సమస్తాన్ని సృష్టించడం పూర్తిచేసి ఏడవదినం విశ్రమించినట్లు చదువుతాము. అంటే, దాని భావం దేవుడు ఆరు దినాలుగా సృష్టిస్తూ చెమటోడ్చి అలిసిపోయాడనా?! ససేమిరా కాదు. ఆమాటకొస్తే దేవుడు అలసిపోడు, సొమ్మసిల్లడు, మరియు ఆయనకు విశ్రాంతి తీసుకోవలసిన ఆగత్యమూ లేదు (యెషయా.40:28)! ఇక్కడ వుపయోగించబడిన మూలభాషా పదాలు సూచిస్తున్నదాని ప్రకారం దేవుడు ఆరు దినాలుగా ఆయావాటిని సృష్టిస్తూవచ్చి ఆరవదినము సమస్తాన్ని సృష్టించడము పూర్తిచేసాడు. దానితరువాత, యేడవదినము సృష్టిక్రియనుండి విరమించాడు. దేవుడు సృష్టిక్రియనుండి విరమించిన యేడవ దినములోనే యిప్పటికీ కొనసాగుతున్నాడు. ఆవిధమైన ‘విశ్రాంతి’ లో దేవుడు కొనసాగుతూ తన ప్రజలనుకూడా తన ‘విశ్రాంతి’ లోకి ఆహ్వానించి చేర్చుకోబోతున్నాడు.  

విశ్రాంతిదినం: దేవుడు తాను చేస్తూవచ్చిన సృష్టి కార్యాన్ని ఆపిన దినాన్ని విశ్రాంతిదినముగా పేర్కొన్నాడు. దాని భావం ఆదినం దేవుడు విశ్రాంతి తీసుకున్నడని కాదుగాని, తాను చేస్తూవచ్చిన కార్యాలనుండి విరమించాడని. అది ఆత్మీయ విశ్రమాన్ని సూచించే దినం. మానవులు తమ స్వంత క్రియలతో ప్రయత్నాలతో సంపూర్ణతను/పరిపూర్ణతను సంపాదించి దేవున్ని తృప్తిపరచి తద్వారా ఆయనమెప్పు పొందగలము అనుకుంటూ చేస్తున్న ఆయా స్వనీతిప్రయత్నాలనుండి విరమించుకునే దినం. ఆదినానికి మెస్సయ్యగా వచ్చిన యేసు ప్రభువుగా వున్నాడు. ఆయన మానవుల పక్షాన తనే సమస్తాన్ని నిర్వహించి నెరవేర్చి తద్వారా దేవున్ని తృప్తిపరచి వారి సంపూర్ణతను/పరిపూర్ణతను సంపాదించాడు. అందునుబట్టే తనయొద్దకు వచ్చే ప్రతివ్యక్తికీ ‘విశ్రాంతిని’ యిస్తాను అంటూ ప్రకటించాడు.       

విశ్రాంతిదినాచారము: రాబోవుదినాలలో తన శ్రేష్టమైన విశ్రాంతిలోకి ప్రవేశించబోతున్న వాస్తవాన్ని దృష్టిపథంలో వుంచుకొని తన ప్రజలు ఈలోకములో జీవించినంతకాలము శుభప్రదమైన నిరీక్షణతో జీవితాన్ని గడపాలన్న ప్రణాలికతో దేవుడు విశ్రాంతిదినాచారాన్ని తాను ఎన్నుకొని ప్రత్యేకపరచుకొన్న ప్రజలకు ఒక సూచనగా నిర్దేశించాడు. ఇది కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఈలోకములోనికి పంపబోతున్న తన ప్రియకుమారుడైన మెస్సయ్యానందు తన ప్రజలకు అనుగ్రహించబోయే తన ‘విశ్రాంతికి’ ఛాయారూపకమైన ఆచారము మాత్రమే. ఛాయారూపమైన విశ్రాంతిదినాచారము వెయ్యిన్నర సంవత్సరాలు (1470 క్రీ.పూ. – 30 క్రీ.శ.) పాటించబడిన తరువాత దాని నిజస్వరూపము క్రీస్తునందు నెరవేర్చబడింది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునందున్నవారందరు దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించి అ విశ్రాంతిలో కొనసాగుతున్నారు. కనుక, నిజవిశ్వాసులు యిప్పుడు వారములోని ఒక రోజును మాత్రమే విశ్రాంతిదినముగా (ఛాయారూపమైన) పాటించే ప్రయత్నము చేయక ప్రతిదినాన్ని పరిశుద్ధ దినముగా ప్రతిదినము దేవుని విశ్రాంతిని అనుభవించే దినముగా పరిగణిస్తూ జీవించాలి. ఈ గ్రహింపులో వారములోని ఏదినమైనా సంఘముగా కూడి దేవున్ని ఆరాధించవచ్చు. శక్యమైతే ప్రతిదినం విశ్వాసులు సంఘముగా కూడి దేవున్ని ఆరాధించవచ్చు అన్నది లేఖన బోధ మరియు మాదిరి (హెబ్రీ.10:25; అపో.కా.2:46-47).                        

2. విశ్రాంతిదినాచారము మనుష్యులు సృష్టించబడిన తరువాతే నియమించబడింది: దేవుడు తన విశ్రాంతిలోనికి ప్రవేశించే ధన్యత తాను సృష్టించిన నరులకుకూడా అనుగ్రహించబోతున్నందున ఆ ధన్యతనుగూర్చిన ఆధారము అందించడానికి వారిలో కొందరిని తన ప్రత్యేక ప్రజగా ఎన్నుకొని  వారు విశ్రాంతిదినాచారాన్ని పాటించే సంస్కారాన్ని వారికి అందించాడు. ఈ ఆచారము నరులకు నియమించబడటమన్నది నరులు సృష్టించబడిన తరువాత అదీ దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని తన ప్రజగా యెన్నుకొన్నతరువాతే జరిగిన సంఘటన (ని.కాం.16:22-30). ఈ వాస్తవాన్ని సూచిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు (యషువ మషియాఖ్) “విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను…” (మార్కు 2:27) అంటూ ప్రకటించాడు. 

3. సబ్బాతు (విశ్రాంతిదినము) ఆచారము: విశ్రాంతిదినాచారమన్నది దేవుడు ఇశ్రాయేలీయులకు యిచ్చిన ఆచారము. ఇది వారికి తరతరాలకు యివ్వబడిన నిబంధనలోని భాగం. అంటే వారు పాతనిబంధనలో కొనసాగినంతకాలం ఈ ఆచారాన్ని పాటించాలి.  అదీ మోషేధర్మశాస్త్రములో సూచించినవిధంగా పాటించాలి. ఈ దినాన అంటే ఏడవదినాన వారు యేపని చేయకూడదు. ఇది ఇంటిలోని అందరికీ అంటే పనివారితోసహా అందరికి వర్తిస్తుంది. నిబంధనను మీరినవారికి మరణశిక్ష విధించాలి. ఆదినాన ఇంటిలో అగ్ని రాజబెట్టకూడదు (ని.కాం.31:12-17, 35:1-3; ద్వితీ.కాం.5:12-15). గమనించాలి, దేవుడు నోవహుద్వారా సర్వమానవులతో నిబంధనచేస్తూ నాలుగు ఆజ్ఙలను సర్వమానవులకు యివ్వడము జరిగింది (ఆది.కాం.9:1-17). కాని, ఈ గంభీరమైన విశ్రాంతిదినాచారాన్నిగూర్చిన ఆజ్ఙ మాత్రము మానవులందరికికాకుండా కేవళము ఇశ్రాయేలీయులకు పాతనిబంధన కాలానికి మాత్రమే యివ్వబడిన ఆజ్ఙ అన్నది గమనములో వుంచుకోవాలి!

“ఆరు దినములు పనిచేయ వచ్చును; ఏడవదినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతిదినము. ఆవిశ్రాంతిదినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమతరతరములకు విశ్రాంతిదినాచారమును అనుసరించి ఆ దినమునాచరింపవలెను; అది నిత్యనిబంధన. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడును గురుతై యుండును; ఏలయనగా ఆరుదినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి యేడవదినమున పని మాని విశ్రమించెనని చెప్పుము.” (ని.కాం.31:15-17) 

పై లేఖనాలు బోధిస్తున్న విశయాలు:    

(అ) సబ్బాతు దినాన్ని ఆచరించడము అన్నది నిత్యనిబంధనలోని  భాగము. ఇక్కడ నిత్యము అన్న పదము (עוֹלָם/ఓలాం) యొక్క భావము నిరంతరము లేక నిత్యత్వమంతా అనికాదు. ఓలాం (עוֹלָם) అన్న హీబ్రూ పదము యొక్క భావము సుధీర్ఘకాలము లేక ఒక తరమంతా లేక అనేక తరాలు. ఈ పదముయొక్క సరియైన భావాన్ని అది వుపయోగించబడిన సందర్భాన్ని బట్టి గ్రహించాలి. ఈ వాక్యములోని సందర్భం “ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను.” ఇశ్రాయేలీయులు సబ్బాతుదినాచారాన్ని తరతరాలు ఆచరించాలి. అంతేకాని, నిరంతరం లేక నిత్యత్వం అంతా ఆచరిస్తూ వుండాలని కాదు.      

(ఆ) సబ్బాతు దినాన్ని ఆచరించడమన్నది దేవుడు ఇశ్రాయేలీయులకు తనకు మధ్య గుర్తుగా యిచ్చాడు. 

(ఇ) ఆదినాన్ని ఆచరించని ఇశ్రాయేలీయునికి మరణశిక్ష విధించాలి. 

ఇశ్రాయేలీయులకు యివ్వబడిన మోషేధర్మశాత్రానికి సంబంధించిన నిబంధనలో భాగంగా వున్న పది ఆజ్ఙలలోని సబ్బాతు ఆచారపు ఆజ్ఙను యిప్పుడుకూడా అంటే క్రొత్తనిబంధన కాలములో మేమూ ఆచరిస్తాము అని మొండిపట్టు పట్టేవారు ఆ ఆచారాన్ని తమకు వీలయినవిధనములోనో లేక అనుకూలమైన విధానములోనో గాక దేవుడు మోషేద్వారా ఆజ్ఙాపించిన విధానములోనే ఆచరించాలన్నది ఈసందర్భంగా జ్ఙాపకము చేసుకోవాలి. 

4. సబ్బాతు (విశ్రాంతిదినము) ను పాటించే ఆచారము మోషేతో మొదలైంది: ఇది కేవళము ఇశ్రాయేలియులకు మాత్రమే యివ్వబడిన మోషేధర్మశాస్త్రములోని పది ఆజ్ఙలలో ఒక ఆజ్ఙ (ని.కాం.19:3-6, 24:3-8, 31:12-14,16; ద్వితీ.కాం.4:7-8, 5:1-5, 29:1; మలాకి 4:4; రోమా.2:11-12, 3:19, 9:4; ఎఫెసీ. 2:11-12; హెబ్రీ.8:9). ఈ ఆజ్ఙ కాని లేక ఈ ఆజ్ఙకు సంబంధించిన నిబంధనకాని అన్యజనులకు యివ్వబడలేదు అన్న సత్యాన్ని మరచిపోకూడదు. అయితే ఈసందర్భంగా అన్యజనులకు సంబంధించి మనం గుర్తుంచుకోవలసినది ఒకటుంది. పూర్వ/పాత నిబంధనలో భాగమై యున్న మోషేధర్మశాస్త్రము అన్నది ఇశ్రాయేలీయులతోపాటు వారిమధ్య నివసిస్తూ ఈలోకములో పాలస్తినాదేశస్వాస్థ్యన్ని గూర్చిన వాగ్ధానములో పాలుపొందబోతున్న అన్యులకు అంటే ఇశ్రాయేలీయుల దాసదాసీలకు మరియు ఇశ్రాయేలు మతప్రవిష్టులకు కూడా వర్తిస్తుంది (ని.కాం.12:47-50; సం.కా.15:15,30; యెషయా 56:2-7). అంతేకాని లోకములో వున్న అన్యులందరికీ వర్తిస్తుందని కాదు.  

5. విశ్రాంతిదినాచారాన్ని పాటించిన యేసుక్రీస్తు: ప్రభువైన యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) ఒక యూదునిగా పుట్టి మోషేధర్మశాస్త్రము క్రింద శాపగ్రస్తులుగా వున్న వారిని విడిపించడానికి తాను మోషేధర్మశాస్త్రముక్రింద సంపూర్ణముగా జీవించి దాన్ని తు.చ. తప్పకుండా పాటించి/అనుసరించి (φυλάσσω/ఫులస్సో) తద్వారా పాపరహితుడుగా జీవించగలిగాడు (లూకా 24:44-48; యోహాను 8:46; 2కొరింథి.5:21; హెబ్రీ.2:14-17, 4:15, 5:7-9, 7:26, 9:14; 1పేతురు 2:22). అందుకే తాను ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ఒక ధర్మశాస్త్ర బద్ధుడయిన యూదునిగా సబ్బాతు (విశ్రాంతిదినాన్ని) ఆచరించాడు. ఆ సమయములో తన రక్తముతో ప్రారంభించబోయే క్రొత్త నిబంధనను యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) యింకా ఆవిష్కరించలేదన్నది యిక్కడ గుర్తుంచుకోవాలి.  

6. క్రొత్తనిబంధనలో నివిశ్రాంతిదినము: యూదుడని యూదేతరుడని బేధంలేకుండా విశ్వసించు ప్రతివానికి సమాధానాధిపతి అయిన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా పరమతండ్రి విశ్రాంతి అనుగ్రహిస్తున్నాడు (మత్తయి 11:28-30). ఈ విశ్రాంతిని పొందిన ప్రతివ్యక్తి దేవుడు వాగ్ధానము చేసిన ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాడు. ఇందునుబట్టే ప్రతి నిజ క్రైస్తవునికి ప్రతిదినము అత్మీయంగా విశ్రాంతిదినము మరియు పరిశుద్ధ దినము.

దేవుని గొర్రెపిల్లగా మానవుల పాపరిహారార్థనిమిత్తము కలువరిసిలువలో మరణించిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క రక్తంతో ప్రారంభమైన క్రొత్త నిబంధనలో (లూకా 22:14-21) విశ్రాంతిదినాన్ని (సబ్బాతును) మోషేధర్మశాస్త్రప్రకారము ఆచరించాలన్న ఆజ్ఙ కాని లేక సూచన కాని యివ్వబడలేదు. అంతమాత్రమే కాకుండా క్రొత్త నిబంధన ప్రారంభము తరువాత యేసు క్రీస్తునందు విశ్వాసముద్వారా దేవుని పిల్లలుగా మారిన యూదులైనా లేక యూదేతరులైనా విశ్రాంతిదినాన్ని మోషేధర్మశాస్త్ర ప్రకారము ఆచరించిన దాఖలాలు క్రొత్త నిబంధన లేఖనాలలో లేశమైనా లేవు.

లేఖనాలు యిస్తున్న సాక్షాన్ని బట్టి నిజమైన విశ్వాసులందరూ యేసు క్రీస్తులోకి (యషువ మషియాఖ్) బాప్తీస్మము పొందడముద్వారా ఆత్మీయంగా మరణించి క్రీస్తుతోకూడా తిరిగిలేచారు అన్న సాక్షాన్ని పొందుతారు (రోమా.6:3-4; కొలస్సీ.2:13-14; ఎఫెస్సీ.2:5). కనుక, క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించిన నిజవిశ్వాసులందరు పాత నిబంధనకు సంబంధించిన మోషేధర్మశాస్త్రాముపట్ల చనిపోయి క్రొత్త నిబంధనకు సంబంధించిన క్రీస్తుధర్మశాస్త్రాముక్రింద జీవించబద్ధులై వున్నారు (రోమా. 7:1, 4-6).

ఈ సందర్భంగా మనం గమనములో వుంచుకోవలసిన విశయమేమిటంటే క్రొత్తనిబంధనలో భాగంగా పాతనిబంధనలోని పది ఆజ్ఙలలో కేవళము తొమ్మిదింటిని మాత్రమే తిరిగి ప్రవేశపెట్టడము జరిగింది. క్రొత్తనిబంధనలో భాగంగా తిరిగి యివ్వబడని ఒకే ఒక ఆజ్ఙ సబ్బాతు ఆచరాన్ని సూచించే ఆజ్ఙ (ప్రకటన 14:7; అపో.కా.15:20; 1తిమోతి.6:1; మత్తయి 15:4-9; ఎఫేసీ.6:1; రోమా.13:8-10). 

7. పాతనిబంధనలోని విశ్రాంతిదినము: పాత నిబంధనలో పాలుపొంది మోషేధర్మశాస్త్రాన్ని యెరిగిన తన తోటి యూదులకు/ఇశ్రాయేలీయులకు వ్రాస్తు (హెబ్రీ.1:1) “హెబ్రీయులకు వ్రాసిన పత్రిక” యొక్క గ్రంథకర్త ఇశ్రాయేలీయులకు దేవుడు వాగ్ధానము చేసిన విశ్రాంతిని గురించి 3 మరియు 4 అధ్యాయాలలో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలను బహిర్గతంచేసాడు. ఇక్కడ గ్రంథకర్త ‘దేవుని విశ్రాంతిని’ గురించి వివరిస్తున్నాడు. విశ్రాంతిదినాన్ని గురించిగాని లేక విశ్రాంతిదినాచారాన్ని గురించిగాని యిక్కడ ప్రస్తావించడము లేదు అన్నది గమనములో వుంచుకోవాలి. 

దేవుని విశ్రాంతినిగురించి హెబ్రీ గ్రంథకర్త చేసిన ప్రబోధ:

– ఐగుప్తుదాసత్వములోనుండి రక్షింపబడిన ఇశ్రాయేలీయులలోని అనేకులు తమ అవిధేయత వలన అలాగే తమ అవిశ్వాసము వలన చివరికి దేవుడు వాగ్ధానము చేసిన విశ్రాంతిలో (విశ్రాంతిదినములో లేక విశ్రాంతిదినాచారములో కాదు) ప్రవేశించలేకపోయారు (హెబ్రీ.3:16-19).  

– దేవుని ప్రజలకు (యిక్కడ అన్యులగురించి చెప్పడములేదు) అంటే ఇశ్రాయేలీయులకు/యూదులకు (2సమూయేలు 14:13; హెబ్రీ.11:25) విశ్రాంతి (విశ్రాంతిదినము కాదు) యింకా నిలిచివుంది (హెబ్రీ.4:9). కాని, ఈనాడు యూదులలోని/ఇశ్రాయేలీయులలోని అనేకులు ఆ సత్యాన్ని గ్రహించడములేదు.   

– అయితే, యిప్పుడు అంటే ఈ క్రొత్ర నిబంధన కాలములో యూదులలోని/ఇశ్రాయేలీయులలోని కొందరు పై సత్యాన్ని గ్రహించి విశ్వాసముద్వారా ఆ విశ్రాంతిలో (ప్రభువైన యేసుక్రీస్తునందు అనుగ్రహించబడే దేవుని విశ్రాంతి) ప్రవేశించగలుగుతున్నారు (హెబ్రీ.4:2-3)   

-కనుక యిప్పుడు యేసు క్రీస్తునందు విశ్వాసముద్వారా దేవుడు వాగ్ధానము చేసిన విశ్రాంతిలోకి ప్రవేశించిన యూదుడు/ఇశ్రాయేలీయుడు తన కార్యములనుండి అంటే మోషేధర్మశాస్త్ర విధులను ముగించి క్రీస్తు (మషియాఖ్) సంపూర్ణముచేసి సిద్ధపరచిన రక్షణకార్యములో విశ్రమిస్తాడు (హెబ్రీ.4:10). అందునుబట్టి ఒకప్పుడు మోషేధర్మశాస్రమనే కాడీక్రింద శాపగ్రస్తునిగా జీవించిన  యూదుడు/ఇశ్రాయేలీయుడు సహితము ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముద్వారా రక్షించబడి మోషేధర్మశాస్త్రమునుండికూడా విడుదల పొందాడు.           

– ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రకటింపబడిన సువార్తను విన్న యూదులు/ఇశ్రాయేలీయులు ఒకవేళ ఆ సువార్తకు విధేయులు కాకుండా కొనసాగితే వారు దేవుని ప్రజలకు నిలిచివున్న విశ్రాంతిలోకి ప్రవేశించలేరు. కనుక వారు ప్రకటింపబడిన సువార్తకు విధేయత చూపడములో జాగ్రత్తవహించాలి (హెబ్రీ.4:11). 

8. విశ్రాంతిదినము సువార్తప్రచారానికి అనుకూలము: క్రీస్తు యేసు రక్తములో కడుగబడి క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించిన నిజవిశ్వాసులు క్రొత్త నిబంధన ఆదిలో యూదుల సమావేశమందిరాలకు వెళ్ళేవారు (అపొ. కా.2:46; 13:14-44; 17:2; 18:4). దానికి కారణం తమతోటి యూదులకు సువార్త ప్రకటించి వారిని దేవుని రక్షణలోనికి తీసుకురావాలన్న తపన. మోషేధర్మశాస్త్రముయొక్క కాడీక్రింద జీవిస్తూ మోషేధర్మశాస్త్రములో యివ్వబడిన ఆజ్ఙ ప్రకారము యేడవ దినాన్ని సబ్బాతుగా లేక విశ్రాంతిదినముగా ఆచరించడానికి సమకూడే యూదులకు లేక యూదామతప్రవిష్టులకు పాత నిబంధన లేఖనాల (తనాఖ్) వెలుగులో సువార్తను ప్రకటించడానికి అలాగే యషువాయే (యేసే) హ మషియాఖ్ (క్రీస్తు) అని వప్పించడానికి వారు యుదుల విశ్రాంతిదినాన్ని యెన్నుకున్నారు. ఈ ప్రయత్నములో వారు సువార్త సకలజనులకు అన్న దేవుని నిత్యసంకల్పాన్ని మరిచిపోయి అన్యులవైపే కన్నెత్తలేదు. దీని పర్యవసానమే యెరుశలేములో ప్రారంభమైన మొదటి శ్రమలు మరియు వాటి ఫలితం విశ్వాసులు అన్యజనులలోకి చెదరిపోవటము (అపొ. కా.8:1). 

9. క్రీస్తుధర్మశాస్త్రములో ఆరాధనదినము: ఇప్పుడు క్రీస్తు యేసు (యషువ మషియాఖ్) నందున్న నిజమైన దేవుని సంబంధులందరు క్రీస్తు నియమము (క్రీస్తుధర్మశాస్త్రము) క్రిందికి వచ్చి (యోహాను 13:34, 14:26, 16:12-15; 1కొరింథీ.9:21; 1యోహాను 2:3-6) తొమ్మిది ఆజ్ఙలతోపాటు (ప్రకటన 14:7; అపో.కా.15:20; 1తిమోతి.6:1; మత్తయి 15:4-9; ఎఫేసీ.6:1; రోమా.13:8-10) ప్రతిదినము దేవుని సంబంధులందరు విశ్రాంతిని అనుభవిస్తూ పరమతండ్రి సన్నిధిలో జీవిస్తూ ఆయనను సేవించాలి. ఇది కేవలం యేదో ఒక ప్రత్యేకదినాన ఒక ప్రత్యేకమైన స్థలములోమాత్రమే కాదు (యోహాను 4:20-24). దేవుని  సంబంధులందరు ప్రతిదినము ఆత్మీయ విశ్రాంతిని అనుభవిస్తూ ప్రతిస్థలములోనూ (1తిమోతీ.2:8) పరమతండ్రి సన్నిధిలో జీవిస్తూ ఆయనను సేవించాలి. కేవలం శుక్రవారమని లేక శనివారమని లేక ఆదివారమని క్రొత్త నిబంధనానియమము లేక క్రొత్త ధర్మశాస్త్రము సూచించటములేదు. (అపో.కా.2:37-47).

10. విశ్రాంతిదినములో అన్యులపాత్ర: యెషయా గ్రంథములో సబ్బాతు/విశ్రాంతిదినము పాటించే అన్యుల ప్రస్తావనవుంది. అది క్రొత్త నిబంధన లేక యెహోవా రక్షణ రాకముందు వున్న మోషేధర్మశాస్త్రపు కాలానికి సంబంధించిన విశయాలు (యెషయా 56:1). ఆదినాలలో అన్యులలో ఎవరయినా సబ్బాతు/విశ్రాంతిదినాన్ని ఆచరిస్తూ మోషేద్వారా చేయబడిన నిబంధన (పూర్వ/పాత) ఆధారంగా దేవుని పక్షము చేరి ఆయనను హత్తుకొని ఆయన పరిచర్య చేయాలని ఆశిస్తే అలాంటివారు దేవుని సన్నిధిలోకి ప్రవేశిస్తారని, వారి బలులు దేవుడు అంగీకరిస్తాడని, అలాగే వారు దేవుని మందిరములో ఆనందిస్తారని లేఖనాలు ఘోషిస్తున్నాయి (యెషయా 56:6-7). అయితే యిక్కడ మనం గమనములో వుంచుకోవలసిన అతిప్రాముఖ్యమైన విశయమేమిటంటే, పాత నిబంధన కాలములో అంటే మోషేధర్మశాస్త్ర కాలములోకూడా అన్యులకు నిజదేవున్ని తెలుసుకొని ఆయన సన్నిధికి చేరే అవకాశము దేవుడిచ్చాడు (ఉదా.యోబు, తామారు, రాహాబు, రూతు, ఊరియా), కాని వారినికూడా యూదులని/ఇశ్రాయేలీయులని దేవునిప్రజల పేరుతో పిలువలేదు అలా పిలువబడిన సందర్భాలుకూడా యేవీ లేఖనాలలో యివ్వలేదు.

11. దేవునిరాజ్యములో విశ్రాంతిదినము: యెషయా గ్రంథములో క్రొత్త నిబంధన కాలములో లేక దేవుని నిత్య రాజ్యములోకూడా విశ్రాంతిదినాన్ని గురించి ప్రస్తావించబడింది (యెషయా 66:22-24). గమనించాలి, క్రొత్త నిబంధన కాలములో మరిముఖ్యంగా నిత్యరాజ్యములో నిజవిశ్వాసులు లేక దేవుని బిడ్డలు దేవుడు వాగ్ధానము చేసిన ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తారు (హెబ్రీ.4:1-11). కనుక ఆ కాలములో (క్రొత్త నిబంధన) ప్రతిదినమూ సబ్బాతు/విశ్రాంతి దినమే. మూలభాష అయిన హీబ్రూ భాషలో “అమావాస్యదినమునుండి అమావాస్యదినమువరకు, విశ్రాంతిదినమునుండి విశ్రాంతిదినమువరకు నాసన్నిధికి మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు” (యెషయా 66:23) అని వ్రాయబడివుంది. అంటే, పాత నిబంధన కాలములో దేవుని ప్రజలు అమావాస్య దినాలలో అలాగే విశ్రాంతిదినాలలో మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి ఆయనను ఆరాదించేవారు, కాని క్రొత్త నిబంధన కాలములో ప్రతిదినము యూదులని యూదేతరులని బేధము లేకుండా దేవుని సన్నిధికి ఆయనను ఆరాధించడానికి వస్తారు అని దాని భావము. 

12. సబ్బాతు (విశ్రాంతిదినాచారము) పట్ల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వైఖరి: తన మరణంద్వారా ప్రారంభించబోతున్న క్రొత్తనిబంధనలోని ప్రత్యేకమైన జీవనవిధానానికి పునాదివేస్తు అందులో భాగంగా ఎన్నో విధులను ఆజ్ఙలను తన బోధలలో అందించాడు. ఈసందర్భంగా మనం జ్ఙాపకం చేసుకోవలసిన ఆయన బోధలలోని సబ్బాతుకు సంబంధించిన కొన్ని బోధలు ఈ క్రింద యివ్వబడినవి:

(అ) సబ్బాతు కొరకు మనుషులు నియమించబడలేదు, మనుషులకొరకు సబ్బాతు నియమించబడింది (మార్కు 2:27).

(ఆ) సబ్బాతునాడుకూడా తండ్రి అయిన దేవుడు దొడ్డకార్యాలు (మంచిపనులు) చేస్తున్నాడు, కనుక మనముకూడా మంచికార్యాలు చేయడములో వెనుకంజవేయకూడదు. ఈ కారణాన్ని బట్టే యేసు ప్రభువు సబ్బతునాడుకూడా అనేకులను స్వస్థపరచడం జరిగింది (యోహాను.5:16-17). 

(ఇ) సబ్బాతునాడు యాజకులు దేవాలయములో పనిచేసి సబ్బాతును మీరుతారు, అయినా అది వారివిశయములో అపరాధముగా ఎంచబడదు (మత్తయి.12:15). 

(ఈ)క్రీస్తు సబ్బాతుకు ప్రభువు (మత్తయి.12:8; మార్కు.2:28; లూకా.6:5).   

ఉ) మోషేధర్మశాస్త్రముక్రింద వుండి శాపగ్రస్తులుగా తీర్చబడిన వారిని రక్షించే  నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు తాను కూడా ఈలోకములో ఒక యూదునిగా పుట్టి పెరిగి మోషేధర్మశాస్త్రము క్రింద జీవించి ఆ ధర్మశాస్త్రములోనివన్నిఏ తు.చ. తప్పకుండా పరిపూర్ణంగా పాటించాడు/అనుసరించాడు. అందులో భాగంగా ఆయన సబ్బాతుదినాన్ని ఆచరించాడు. ఇదంతా ఆయన తన మరణముద్వారా క్రొత్తనిబంధనను ప్రారంభించకముందే చేసాడు.                  

విశ్రాంతిదినాన్ని ఆచరించే విశయములో క్రొత్తనిబంధనలో జీవిస్తున్న దేవుని సంబంధికులకు యివ్వబడిన సూచన: ఒకప్పుడు అన్యులుగా వుండి మెస్సయ్య రక్తంతో చేయబడిన క్రొత్తనిబంధన ద్వారా యిప్పుడు దేవుని ప్రజగా మారిన విశ్వాసులైన మిమ్ములను సబ్బాతును (విశ్రాంతిదినాన్ని) ఆచరించే విశయములో తీర్పుతీర్చడానికి యెవనికీ అధికారము యివ్వకూడదు అలాగే యెవనికీ మీరు ఈ విశయములో తీర్పుతీర్చకూడదు (రోమా.14:5-6; గలతీ.4:10; కొలస్సీ.2:13-17).

  • పరుని సేవకునికి తీర్పుతీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒకదినముకంటె మరియొకదినము మంచిదినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతిదినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకుతానే తనమనస్సులో రూఢిపరచుకొనవలెను. 6 దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుటమాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమై యున్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహో దరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము.” (రోమా.14:4-10)
    [పై లేఖనాలలో అపోస్తలుడైన పౌలు విశ్వాసులలో సంభవిస్తున్న పరస్పర విమర్శలను గురించి మరిముఖ్యముగా దినములను ఆచరించే విశయములో అంటే సబ్బాతును లేక విశ్రాంతిదినాన్ని ఆచరించే విశయములో జరుగుతున్న నిందాప్రతినిందలను గురించి వ్రాస్తున్నాడు. విశ్వాసులలో కొందరు అన్ని దినాలను సమానముగా పరిగణిస్తే కొందరు ఒక దినాన్ని (ఏడవదినాన్ని) ప్రత్యేకముగా లెక్కిస్తున్నారు. రెండువర్గాలుకూడా దేవున్ని ప్రేమించి ఆయనను ఘనపరుస్తూ దినాలవిశయములో తమతమ విశ్వాసాలను ఏర్పరచుకున్నారు. కనుక, వారిని దీవించే విశయములో లేక గద్దించే విశయములో దేవుడే తీర్పరి. ఒకరినొకరు విమర్శిస్తూ తీర్పుతీర్చుకోకూడదు అన్నది పౌలుద్వారా యివ్వబడిన బోధ.]
  • “ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బల హీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల? మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీవిషయమై నేనుపడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మునుగూర్చి భయపడుచున్నాను.” (గలతీ.4:8-11)
    [గలతీ ప్రాంతములోని సంఘాలలో చాలామట్టుకు అన్యజనులలోనుండి వచ్చిన విశ్వాసులే. అయితే, ఆ ప్రాంతములో అనేక మంది చెదిరిపోయిన యూదులుకూడా జీవించేవారు (1పేతురు.1:1). వారిలోనుండికూడా అనేకులు యేసు క్రీస్తునందు విశ్వాసముద్వారా రక్షించబడి దేవుని సంఘములో చేర్చబడ్డారు. అలాంటివారు ఇంకా మోషేధర్మశాస్త్ర విధులను అంటే దినములను (అమావాస్యదినములను మరియు విశ్రాంతిదినములను) పండుగదినములను ఆచరించడం కొనసాగిస్తూ వచ్చారు. అలాంటివారినుద్దేశించి పై లేఖనాలలో అపోస్తలుడైన పౌలు తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఒకప్పుడు మోషేధర్మశాస్త్రముయొక్క దాసత్వములో వుండి అటుతరువాత సువార్తను విని క్రీస్తు యేసునందు నిజవిశ్వాసులైన తరువాతకూడా అదే దాసత్వములో కొనసాగుతూవుంటే యిక తాను వారిని క్రీస్తునందు విశ్వాసులుగా చేయటానికి పడిన శ్రమంతా వృధా అవుతుంది అన్నది పౌలు ఆవేధన.]
  • “దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి,మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను;ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటివిషయములోనైనను, మీకు తీర్పుతీర్చనెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజస్వరూపము క్రీస్తులోఉన్నది.” (కొలస్సీ.2:14-17)
    [పైలేఖనాల బోధ ప్రకారం నిజవిశ్వాసులు దేవుని మహాగొప్ప కృపనుబట్టి అపరాధముల విశయములో చనిపోయి క్రీస్తుతోకూడా తిరిగి బ్రతికింపబడ్డారు. కనుక, నిజవిశ్వాసులు మోషేధర్మశాస్త్రముయొక్క దాసత్వము క్రింద లేరు యిప్పుడు. వారు క్రీస్తు అధికారముక్రింద జీవిస్తూ క్రీస్తునందున్న ఆత్మీయ స్వాతంత్రాన్ని అనుభవించే వారు కనుక తమను ఏవ్యక్తీ పండుగ అమావాస్య విశ్రాందినము అనువాటి విశయములో తీర్పుతీర్చడానికి ఒప్పుకోకూడదు. నిజానికి ఒకప్పుడు అవన్నీకూడా రాబోవు వాటికి ఛాయారూపాలే. వాటి నిజస్వరూపం క్రీస్తునందున్నది. కాలము సంపూర్ణమైనప్పుడు ఆ నిజస్వరూపం రెండువేల సంవత్సరాల క్రితమే క్రీస్తు రాకడతో నెరవేర్చబడింది. నిజస్వరూపం ప్రత్యక్షపరచబడిన తరువాతకూడా ఛాయారూపములోనే జీవించడం అన్నది హాస్యాస్పదం అర్థరహితం మరియు గర్హనీయం!]
Permalink to single post

సున్నతి సంస్కారము

1. సున్నతి సంస్కారము:బైబిలులోని సున్నతి (హీబ్రూ:מוּל/మూల్=circumcision; గ్రీకు:περιτομή/పెరిటొమె=circumcision) సంస్కారము పురుషుల మర్మాంగము చివరి భాగాన్ని కప్పివుంచే చర్మాన్ని (గోప్యాంగ చర్మము) దేవుడు ఆజ్ఙాపించిన ప్రజలు ఆయన చెప్పిన కారణాన్నిబట్టి ఆయనకు అంగీకారమైన విధానములో తొలగించడము. దీనికి అనుకరణగా ఈనాడు పురుషుల గోప్యాంగ చర్మాన్ని తొలగించే ప్రక్రియను సున్నతిగా పేర్కొంటూ దాన్ని అనేకులు తమ స్వంత కారణాలను బట్టి అనుసరిస్తున్నారు. కొందరు పారంపర్యాచారాలనుబట్టి, కొందరు మతాచారాన్నిబట్టి, మరికొందరు వైద్యుల సలహామేరకు శారీరక ఆరోగ్యపరిరక్షణకొరకు ఈ ప్రక్రియను అనుసరిస్తున్నారు.     

2. బైబిలులోని సున్నతి ఆచారము దేవుడే ప్రవేశపెట్టిన పరిశుద్ధ సంస్కారము . అయితే, ఈ ఆచారము దేవుడు నరులందరికీ యిచ్చిన ఆచారము కాదు అన్నది గమనములో వుంచుకోవాలి. పాలస్తీనా దేశాన్ని అబ్రహాముకు మరియు ఆయన సంతానానికి స్వాస్థ్యముగా ఇస్తానంటూ దేవుడు అబ్రహాముతో ఒక నిబంధనను చేసి దానికి గుర్తుగా సున్నతి ఆచారాన్ని అబ్రహాముకు ఆయన సంతతికి అలాగే ఆయన ఇంటపుట్టిన వారందరికి నిర్ధేశించాడు (ఆది.కాం.17:1-14).

1 అబ్రాము తొంబదితొమ్మిది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమైనేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.
నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెద నని అతనితో చెప్పెను.
అబ్రాము సాగిలపడియుండగా దేవుడతనితో మాటలాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను;
నీవు అనేక జనములకు తండ్రివగుదువు.
మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అన బడును.
నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలోనుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజు లును నీలోనుండి వచ్చెదరు.నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను. 
నీకును నీతరు వాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను. 
మరియు దేవుడునీవును, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొన వలెను.  
10 నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన యేదనగామీలో ప్రతి మగవాడును సున్నతి పొంద వలెను.  
11 మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును.  
12 ఎనిమిది దినముల వయస్సుగలవాడు, అనగా నీ యింట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యునియొద్ద వెండితో కొనబడినవాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను.  
13 నీ యింట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును, తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీర మందు నిత్య నిబంధనగా ఉండును.  
14 సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగచర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలోనుండి కొట్టి వేయ బడును. వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రాహాముతో చెప్పెను. 

దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనలోని ప్రాముఖ్యమైన అంశాలు:

– దేవుడు అబ్రహామును అత్యధికముగా అభివృద్ధి చెందించును (ఆది.కాం.17:2)
– దేవుడు అబ్రహామును అనేక జనులకు తండ్రిగా చేయును (ఆది.కాం.17:4-4)
– దేవుడు అబ్రహాముకు సంతానాభివృద్ది కలుగచేయును (ఆది.కాం.17:6)
– దేవుడు అబ్రహాములోనుండి జనములు మరియు రాజులు వచ్చునట్లు చేయును (ఆది.కాం.17:6)
– దేవుడు అబ్రహాముకును అతని సంతానమునకును దేవుడుగా వుండును (ఆది.కాం.17:7)
– దేవుడు అబ్రహాముకును అతని సంతానమునకును యిహలోకములోని కనాను దేశ ప్రాంతాన్ని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చును (ఆది.కాం.15:7, 17-21, 17:8; 1దిన.వృ.16:15-18; కీర్తన.105:8-12)

దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్ధానములోని పై అంశాలన్నీకూడా అబ్రహాము యొక్క శారీరక సంతానమునకే అనువర్తించదగును. ఈ వాగ్ధానము ఇహలోకానికి చెందినది. అందునుబట్టే పాలస్తీనా దేశస్వాస్థ్యపు వాగ్ధానములో పాలుపొందని/పాలుపొందజాలని ఒక్క అన్యుడైనా సున్నతిపొంది దేవునిచేత ఇశ్రాయేలీయునిగా లెక్కించబడ్డ సంఘటన బైబిలులో ఒక్కటికూడా లేదు. ఈ వాగ్ధాన ఫలాలు విశ్వాసముద్వారా అబ్రహాముకు సంతానముగా మారే వారిని వుద్దేశించి యివ్వబడినవి కావు. అలాంటివారికి వర్తించే దీవెనలు ఆశీర్వాదాలు క్రొత్తనిబంధనలో భాగంగా క్రీస్తు యేసునందు అనుగ్రహించబడ్డాయి. అందులో యిహలోకానికి సంబంధించిన కనాను దేశస్వాస్థ్యము అన్నది లేనేలేదు!      

ఈ కారణాన్నిబట్టే అబ్రహాము యొక్క వాగ్దాన పుత్రుడు ఇస్సాకు మరియు ఆయన సంతానమేగాక (ఇశ్రాయేలీయులు) అబ్రహాము యొక్క యితర పుత్రులు మరియు వారి సంతానము కూడా ఈ ఆచారాన్ని పాటిస్తుండటాన్ని ఈనాటికీ చూడగలము. ఇస్సాకుకు వేరుగా వున్న అబ్రహాము సంతానములో హాగరుద్వారా పుట్టిన సంతానము (ఇష్మాయేలీయులు) మరియు కెతూరాద్వారా పుట్టిన సంతానముకూడా (ఏడుగురు కుమారులు) వున్నారు. మధ్య ప్రాశ్చములో (Middle-East) స్థిరపడిన వీరంతా ఇశ్రాయేలీయులు కాదు, వారిమతం జూడాయిజం కాదు. అయినా వీరంతా సున్నతి ఆచారాన్ని పాటించే వారు. చాలామట్టుకు వీరి వంశస్తులు క్రీస్తు శకము 10వ శతాబ్దములోపే ఇస్లాము మతాన్ని స్వీకరించి ముస్లీములుగా మారారు. అయితే ఇస్లాముకంటే ముందు వీరు మధ్య ప్రాశ్చములో విగ్రహారాధికులుగా వుండేవారు. అయినా, ఆసమయములోకూడా వీరు సున్నతి ఆచారాన్ని పాటించేవారన్నది గమనార్హమైన విశయము.

దురదృష్టవశాత్తు కాలక్రమంలో దేవుడు ఆజ్ఙాపించినట్లుగా కేవలం పురుషుల శరీరాలలో జరిగించాల్సిన ఈ సున్నతి ఆచారాన్ని కొన్ని తెగలు మతాలు వక్రీకరించి స్త్రీలకు కూడా చేయడం మొదలు బెట్టాయి. ఈ దైవవ్యతిరేకమైన పోకడ స్త్రీల లైగిక జీవితాన్ని నాశనం చేసే కడునీచమైన దుష్ క్రియ. స్త్రీల సున్నతిని యేనాగరిక సమాజము కూడా సహించకూడదు.   

3. అబ్రహాము యొక్క గొప్పదనాన్ని బట్టి ఆయన జీవించిన ప్రదేశములో అలాగే దాని చుట్టుప్రక్కల స్థిరపడిన ప్రజలు అబ్రహాములా తాముకూడా శారీరక సున్నతిని చేసుకొని దాన్ని పిత్రుపారంపర్యాచారముగా మార్చుకొని పాటించడము మొదలుబెట్టారు. అబ్రహాము యొక్క శారీరక సంతానములో జన్మించకున్నా, దేవుని ఆజ్ఙ తమకు వర్తించకున్నా పులిని చూసి నక్క వాతపెట్టుకున్న చందాన అనేక మతస్తులు దేశస్తులు శారీరక సున్నతిని అబ్రహాము పంథాలో అవలంబించడం ఈనాటికి చూడవచ్చు. అన్య మతాలవారు అన్య వంశాలవారు మాత్రమే కాకుండా విశ్వాసమూలముగా అబ్రహాము సంతానముగా మారిన కొందరు అబద్ద బోధకుల వక్రవ్యాఖ్యానాలకు మోసపోయి తాముకూడా శరీర సున్నతిని పొంది క్రీస్తునుండి పుర్తిగా కొట్టివేయబడి తిరిగి శాపగ్రస్తులుగా మారుతున్నారు (గలతీ.5:2-4). 

4. అబ్రహాముకు రెండురకాల సంతానమున్నట్లుగా బైబిలులోని సాక్షాధారాలను బట్టి గ్రహించగలము. మొదటిది శరీరసంబంధమైన సంతానము. ఈసంతానము అబ్రహాము యొక్క శారీరవంశావళికి సంబంధించిన సంతానము. రెండవది ఆత్మీయసంబంధమైన సంతానము. ఈసంతానము అబ్రహాముకుండిన  విశ్వాసమువంటి విశ్వాసముగలిగి ఆయనకు సంతానముగా లెక్కించబడేవారు (రోమా.4:11).    

అబ్రహాముయొక్క మొదటిసంతానము కేవలం ఇశ్రాయేలీయులుగా (యూదులుగా) పుట్టినవారు. వీరికే శారీరక సున్నతి అన్నది అతిప్రాముఖ్యమైన నిబంధనయొక్క గుర్తుగా యివ్వబడింది. ఇకపోతే, అబ్రహాముయొక్క రెండవసంతానము విశ్వాసులు/పరిశుద్ధులు లేక యేసుక్రీస్తునందు విశ్వాసమువలన దేవుని ప్రజలుగా తీర్చబడినవారు. వీరినే నిజక్రైస్తవులు అనవచ్చు. ఈ సంతానములో యూదుడని యూదేతరుడని, స్త్రీ అని పురుషుడని, లేక దాసుడని స్వతంత్రుడని బేధం లేదు (గలతీ.3:26-29). వీరందరికి అత్మీయ సున్నతి అన్నది నూతననిబంధనకు గుర్తుగా యివ్వబడింది (కొలస్సీ. 2:11).             

అబ్రహాముకు ముందుతరాలలో జీవించిన  నోవహు, హానోకు, హేబేలు వంటి భక్తులకు విశ్వాసులకు దేవుడు సున్నతి ఆచారాన్ని సూచించలేదు. కనుక వారు సున్నతి సంస్కారమును ఎరిగినవారు కాని లేక పాటించినవారు కాని కాదు. ఈ వాస్తవాన్నిబట్టి ఆకాలములోని దైవజనులు శారీరక సున్నతి లేనివారు అన్నదికూడా మనం మరచిపోకూడదు.     

5. అబ్రహాముతో నిబంధన చేసిన దాదాపు నలుగువందల సంవత్సరాల తరువాత దేవుడు మోషేద్వారా అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు జనాంగముతో మరొక  నిబంధనను చేస్తూ అందులోని నియమాలలో భాగంగా సున్నతి ఆచారాన్ని తిరిగి పేర్కొనడం జరిగింది. అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీయులు అబ్రహాము-నిబంధన (Abrahamic Covenant) ప్రకారము అలాగే మోషే-నిబంధనలో (Mosaic Covenant) భాగమైన మోషేధర్మశాస్త్రము (Law of Moses) ప్రకారము తమ పిల్లలకు ‘ఎనిమిదవ దినాన’ సున్నతి జరిగించాలన్నది దేవుని ఆజ్ఙ మరియు విధి (లే.కాం.12:3).    

6. తనాక్ లేక పాతనిబంధన గ్రంథమంతటిలో అన్యులకు లేక అన్యులలోనుండి యూదా మతములో చేరినవారికి సున్నతి ఆచారాన్ని పాటించాలన్న ఆజ్ఙ కాని లేక సున్నతి ఆచారాన్ని పాటించిన వైనాలు కాని మచ్చుకు ఒక్కటైనా కానరావు. అయితే, నిర్గమాకాండము 12:43-49 వరకుగల లేఖనాల ప్రకారం వెండితో కొనబడిన దాసులు అలాగే ఇశ్రాయేలీయుల మధ్య వారి దేశములో నివసిస్తున్న పరదేశీయులు ఒకవేళ పస్కా పండుగను ఆచరింప గోరినయెడల అలాంటివారు మొదట సున్నతి (శరీర) పొంది తద్వారా ఇశ్రాయేలీయుల సమాజములో చేరి వారితోపాటు పస్కాను ఆచరింపవచ్చు. 

ఉదాహరణకు, సిరియారాజు సైన్యాధిపతియైన నయమాను యెహోవా ప్రవక్త అయిన ఎలీషా మాటచేత కుష్ఠరోగము నుండి స్వస్థత పొంది ఎలీషా దేవుడైన యెహోవాను విశ్వసించాడు. అయితే, నయమాను ఇశ్రాయేలీయుల దేశములో వారిమధ్య నివసించలేదు. కనుక, నయమానులాంటి విశ్వాసులకు సున్నతి నియమము యివ్వబడలేదు (2రాజులు.5:1-19). బబులోనులోని పారసీక దేశపు రాజు కోరెషు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను విశ్వసించాడు మరియు దేవునిచేత “అభిషిక్తుడు” అని గుర్తించబడ్డాడు అంతేకాక యెరూషలేములోని దేవుని మందిరము మరల కట్టబడుటకు దేవునిచేత వాడబడ్డాడు. అయినా, రాజైన కోరెషు దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్ధానము ద్వారా స్వాస్థ్యముగా యిచ్చిన పాలస్తీనాలో ఇశ్రాయేలీయుల మధ్య నివసించలేదు. కనుక, రాజైన కోరెషు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను విశ్వసించి సేవించినా అతడు సున్నతి పొంది ఇశ్రాయేలీయుడుగా మారలేదు (2ది.వృ.36:22-23; ఎజ్రా 1:1-4,7-8, 5:13-15, 6:3-5; యెషయా.44:28, 45:1).

దేవుడు అన్యజనులకు లేక అన్యజనులలోనుండి వచ్చినవారికి ఆజ్ఙాపించనిదాన్ని మరియు నిర్దేశించనిదాన్ని ఒక ఆజ్ఙగా బోధించడమైనా లేక ఆచరించడమైనా లేఖనవిరుద్దమైన పాపానికేకాకుండా దైవోగ్రతకుకూడా దారితీస్తుంది అన్నది దైవసంబంధులు గమనములో వుంచుకోవాలి. 

7. దేవునిదృష్టికి హృదయసున్నతి లేక ఆత్మీయసున్నతి లేనివారు అసహ్యులు. అలాంటివారిని ఆయన శిక్షించబోతున్నాడు అన్న వాస్తవాన్ని లేఖనాలు ప్రస్పుటంగా పేర్కొంటున్నాయి:

“అన్యజనులందరును సున్నతిపొందనివారు గనుక, ఇశ్రాయేలీయులందరు హృదయసంబంధమైన సున్నతినొందినవారు కారుగనుక, రాబోవుదినములలో సున్నతి పొందియు సున్నతిలేనివారివలె నుండుఐగుప్తీయులను యూదావారిని ఎదోమీయులను అమ్మోనీయులను మోయాబీయులను గడ్డపుప్రక్క లను కత్తిరించుకొను అరణ్యనివాసులైన వారినందరిని నేనుశిక్షించెదను, ఇదే యెహోవా వాక్కు.” (యిర్మీయా.9:25-26) 

“బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడుకాడు; శరీరమందు బాహ్యమైనసున్నతి సున్నతికాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయసంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగునది కాదు.” (రోమా.2:28-29)

8. లేఖనాల సాక్షాన్ని బట్టి దేవుని ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ఈ లోకములోకి శరీరధారిగా వచ్చిన సందర్భములో సున్నతి సంస్కారాన్ని అనుభవించినట్లు గ్రహించవచ్చు. ఒక యూదు కుటుంభములో జన్మించి ఒక యూదు మగశిశువుగా వుండిన అతనికి తల్లిదండ్రులు ఎనిమిదవదినాన్న సున్నతి జరిగించినట్లు గ్రహించాలి (లూకా 2:21). అయితే, ఇశ్రాయేలీయుల మధ్య ఒక యూదుడిగా పుట్టిన కారణమే కాకుండా తాను మోషేధర్మశాస్త్రమనే కాడీక్రింద వుండి అందులో తాను పాటించాల్సినదంతా పరిపూర్ణముగా పాటించి దాని క్రింద వుండి శాపగ్రస్తులుగా వున్నవారిని విమోచించడానికి దేవుని బృహత్తర ప్రణాలికలోని భాగంగా కూడా ఆయనకు సున్నతి జరిగినట్లు మనం గ్రహించాలి (గలతీ.4:4-5).

“ఎవడైనను అన్యాయ ముగా శ్రమపొందుచు, దేవునిగూర్చిన మనస్సాక్షికలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును. తప్పిద మునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును; ఇందుకు మీరు పిలువబడితిరి.క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకుమాదిరి యుంచిపోయెను. ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.” (పేతురు. 2:19-23)

“ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను; ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగునడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము.” (1యోహాను.2:4-6) 

పై రెండు వాక్యభాగాల ఆధారంగా క్రొత్తనిబంధనలోకూడా యేసుక్రీస్తునందు విశ్వసముద్వారా దేవుని సంబందులుగా మారిన విశ్వాసులు/క్రైస్తవులు యేసు ప్రభువును వెంబడిస్తూ ఆయన ఏవిధంగా మోషేధర్మశాస్త్రము ప్రకారము నడుచుకొని అందులో భాగంగా తన శారీరములో సున్నతి పొందాడో అదేవిధంగా శారీరక సున్నతి పొందాలి అంటూ వాదిస్తున్నారు బోధిస్తున్నారు. ఇది వాక్యానుసారమైన సద్బోధ కాదు! 

గమనించండి, పైవాక్యభాగాలలో సూచిస్తున్నదాని ప్రకారము యేసుక్రీస్తును పోలి నడుచుకోవడము లేక జీవించడము అంటే యేమిటి…?

  • ఆయనలా ఇశ్రాయేలీయుల మధ్య పుట్టి పెరగటమా…?
  • ఆయనలా మోషేధర్మశాస్త్రము క్రింద జీవించి దాన్ని పరిపూర్ణముగా అనుసరించటమా…?
  • ఆయనలా సున్నతి పొందటమా…?
  • ఆయనలా అవివాహితునిగా వుండటమా…?
  • ఆయనలా ఇశ్రాయేలీయుల మధ్యే దేవునివాక్యం ప్రకటించడమా…?
  • ఆయనలా సంవత్సరానికి మూడుసార్లు యెరుషలేముకు వెళ్ళి పండుగలను ఆచరించటమా…? 
  • ఆయనలా వేశధారులైన యూదామతాదికారులను అంటే శాస్త్రులను పరిసయ్యులను ఎండగడుతూ వుండటమా…?

ఆయన పైవన్నీ చేసాడు! మరి యివన్నీ ఆయన మాదిరినిబట్టి ఈలోకములో జీవించడానికి పాటించాల్సిన అవసరం లేదా?! లేదని లేఖనాల వెలుగులో ఖచ్చితంగా చెప్పవచ్చు. పైన యివ్వబడిన రెండు లేఖనసందర్భాలను జాగ్రత్తగా పరిశీలించిచూస్తే ‘తనను హింసించిన వారినికూడా క్షమిస్తూ ఏపాపము లేకుండా జీవించిన యేసుక్రీస్తు మాదిరిని అనుసరిస్తూ మన శత్రువులనుకూడా క్షమించి ప్రేమించాలని అలాగే ఆయన యిచ్చిన ఆజ్ఙలను (ఉదాహరణ: యోహాను 13:34) పాటించాలి’ అన్నది ఈ వాక్యాల ప్రబోధ.

యేసు క్రీస్తు మాత్రమే కాకుండా ఆయనతో పాటు మూడున్నర సంవత్సరాలు జీవించి శిక్షణ పొందిన పన్నెండ్రుగురు శిష్యులుకూడా యూదులైవుండి యూదుల ఆచారము ప్రకారం లేక మోషేధర్మశాస్త్రము యొక్క నియమము ప్రకారం సున్నతి పొందినవారేనన్నది ఈ సందర్భంగా మనం జ్ఙాపకం చేసుకోవాలి.  

9. యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) యొక్క ఉపదేశము/బోధ/తోరా (యెషయా.42:4; గలతీ.6:2): మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు గల లేఖనాలు

“నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.” (మత్తయి.28:20)

“ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.” (యోహాను.14:26)

యేసు క్రీస్తు తన బోధలో సున్నతి పొందాలి అంటూ ఆజ్ఙాపించాడా…? 

ఆజ్ఙాపించలేదు!

ఒకప్పుడు అన్యులుగా జీవించి అటుతరువాత సువార్తవిని యేసు క్రీస్తునందు విశ్వాసముద్వారా నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడి దేవుని ప్రజలలో చేర్చబడిన తరువాత వారు రక్షణలో కొనసాగడానికి శరీరసున్నతిని కూడా పొందాలి అని ఎక్కడైనా సూచించబడిందా…? 

బైబిలులో లేదు!

10. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తరక్తముద్వారా ప్రారంభించబడిన క్రొత్తనిబంధనలో ప్రవేశించినవారివిశయములో మాత్రము శారీరక సున్నతికి ఇక ఏ ఆత్మీయ మేలుతోకూడా సంబంధము లేదన్నది గ్రహించాలి. ఈ విషయములో లేఖనాలు స్పష్టమైన మరియు ఖచ్చితమైన వివరణ అందిస్తున్నాయి. (1కొరింథీ.7:17-19; గలతీ.5:6) 

“సున్నతి పొందినవాడెవడైనను పిలువబడెనా? అతడు సున్నతిపోగొట్టుకొన వలదు; సున్నతి పొందని వాడెవడైనను పిలువబడెనా? సున్నతి పొందవలదు.”
(1కొరింథీ.7:18)
[ఈ వాక్యము ఒక అవిశ్వాసి అయిన వ్యక్తి ఏరకంగా విశ్వాసిగా మారి రక్షణపొందగలడోనన్నది వివరిస్తూ ఆ వ్యక్తి సున్నతిపొందని వ్యక్తి అయితే అలాంటివ్యక్తి విశ్వాసములోకి ప్రవేశించి రక్షణపొందినతరువాత కూడా సున్నతి పొందని స్థితిలోనే కొనసాగలి అని బోధిస్తున్నది] 

యేసుక్రీస్తునందుండువారికి సున్నతి పొందుటయందేమియులేదు, పొందకపోవుటయందేమియు లేదుగాని ప్రేమవలన కార్యసాధకమగువిశ్వాసమే ప్రయోజనకరమగును.” (గలతీ.5:6)
[ఈ వాక్యము నిజవిశ్వాసులైనవారు సున్నతిపొందుట లేక పొందకపోవుట వారి అత్మీయ స్థితిలో ఏ వ్యత్యాసాన్ని కలుగజేయదన్న సత్యాన్ని బోధిస్తున్నది]  

“క్రొత్తసృష్టి పొందుటయే గాని సున్నతిపొందుటయందేమియులేదు, పొందకపోవుటయందేమియులేదు.” (గలతీ.5:6)
[ఈ వాక్యము కూడా నిజవిశ్వాసులైనవారు సున్నతిపొందుట లేక పొందకపోవుట వారి అత్మీయ స్థితిలో ఏ వ్యత్యాసాన్ని కలుగజేయదన్న సత్యాన్ని బోధిస్తూ నిజవిశ్వాసులు క్రొత్తసృష్తిగా మారడమే అతి ప్రాముఖ్యమైన విశయమంటూ నొక్కి వక్కాణిస్తున్నది]

“మీరును, క్రీస్తుసున్నతియందు, శరీరేచ్ఛలతోకూడిన స్వభావమును విసర్జించి ఆయనయందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి.” (కొలస్సీ. 2:11)
[ఈ వాక్యము నిజవిశ్వాసులైనవారు క్రీస్తు యేసు తాను శారీరమందు పొందిన సున్నతిని బట్టి అలాగే తాము పాతజీవితాన్ని విడిచిపెట్టి క్రొత్తదైన పరిశుద్ధజీవితములో కొనసాగుతుండటాన్ని బట్టి చేతులతో చేయబడని ఆత్మీయ సున్నతిని పొందియున్నారు అంటూ బోధిస్తున్నది]

ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి;ఏలయనగా ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతనపరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు. ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతిపొందకపోవుటయని భేదములేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు.” (కొలొస్సీ.3:8-11)
[ఈ వాక్యము బోధిస్తున్నదాని ప్రకారము క్రీస్తు యేసునందున్న నిజవిశ్వాసులు పాతదైన అపవిత్ర జీవితాన్ని వదిలి క్రొత్తదైన పరిశుద్ద జీవితాన్ని జీవిస్తూ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు స్వారూప్యములో ఎదుగుతునారు. అల అంటివారి విశయములో యూదుడని లేక అన్యుడని, దాసుడని లేక స్వతంత్రుడని, సున్నతిపొందినవాడని లేక సున్నతిపొందనివాడని ఏబేధము లేదు. అందరూ సమానులే, ఎందుకంటే అందరిలో వున్నది క్రీస్తే!]

11. ఈ క్రొత్తనిబంధన కాలములో సున్నతి (శారీరక) పొందితేనేగాని రక్షణపొందలేరు అని బోధిస్తున్నవారు అబద్దబోధకులు. అలాంటివారు బైబిలు బోధలకు వ్యతిరేకులు. ఇలాంటి బోధలు దైవలేఖనాలకు విరుద్ధమైన దుర్బోధలు.
(అపో.కా.15:1-35; రోమా. 2:25; గలతీ.2:3-5, 5:1-4,10-12, 6:12-15; ఫిలిపీ.3:1-11; తీతుకు.1:10-11) 

 “కొందరు యూదయనుండి వచ్చి మీరు మోషేనియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనేగాని రక్షణపొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహో దరులు నిశ్చయించిరి…” (అపో.కా.15:1-6)

మోషేనియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని కొందరు బోధించడం ప్రారంభించారు. వీరు నిజమైన విశ్వాసులు కాదు, కపట సోదరులు. వీరు దొంగతనముగా విశ్వాసులమధ్య ప్రవేశించారన్న విశయాన్ని అపోస్తలుడైన పౌలు గలతీయలోని విశ్వాసులకు వ్రాస్తూ పేర్కొన్నాడు (గలతీ.2:4). వీరుచేస్తున్న దుర్బోధను వ్యతిరేకిస్తూ పౌలు మరియు బర్నబాలిరువురూ వారితో వాదించడము జరిగింది. ఇదే సందర్భములో కొందరు యూదామతములోని పరిసయ్యుల తెగలోనుండి వచ్చిన విశ్వాసులుకూడా లేచి అన్యులలోనుండి మెస్సయ్యద్వారా విశ్వాసులుగా మారినవారు సహితం సున్నతిని పొంది మోషేధర్మశాస్త్రమును అనుసరించాలని ప్రతిపాదించారు. 

గమనించాలి, ఇక్కడ ప్రతిపాదించబడుతున్న రెండు విశయాలుకూడా అదివరకు యెవరూ అన్యులలోనుండి వచ్చిన విశ్వాసులకు బోధించలేదు వారు వాటిని పాటించనూ లేదు (అపో.కా.8:1-17, 10:45). ఈ అంశాలనుగురించిన తగాదా సంఘ చరిత్రలోనే మొట్టమొదటి క్రైస్తవనాయకుల సమావేశము చోటుచేసుకోవడానికి దోహదపడింది. చివరికి, ఆ సమావేశపు తీర్మానములో అన్యులలోనుండి వచ్చిన విశ్వాసులు యూదులనుసరిస్తున్నవాటిలోని కేవళము మూడింటిని మాత్రము పాటించాలని నిర్ధారించారు. అందులో శారీరసున్నతిని పొందటము మరియు మోషేధర్మశాస్త్రమును గైకొనడము అన్న రెండింటిని సంపూర్ణముగా తొలగించేసారు (అపో.కా.15:28-29). అంతేకాక, ఆ సమావేశ నాయకులు ‘సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని’ బోధించి విశ్వాసులను కలవరపెట్టిన కపటసోదరులను తాము పంపలేదు కనుక వారి మాటలకు తలవంచొద్దన్న హితోపదేశము అన్యులలోనుండి వచ్చిన విశ్వాసులకు చేసారు (అపో.కా.15:24). ఇది నిజ విశ్వాసులకివ్వబడిన అపోస్తలుల బోధ మరియు మాదిరి! దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు లేక బోధించేవాడు అబద్ధ బోధకుడు మరియు నీతి విరోధి. 

12. అపోస్తలుడైన పౌలుద్వారా యివ్వబడిన లేఖనాలు క్రొత్తనిబంధనలో పాలుపొందే విశ్వాసులు రక్షణపొందుటకై శరీరసున్నతి పొందకూడదు అని సవివరమైన సమగ్ర బోధను అందిస్తున్నాయి. అయితే, కొందరు నీతివిరోధులు వాటిని వక్రీకరిస్తున్నారు. పౌలుద్వారా యివ్వబడిన లేఖనాల వక్రీకరణనుగూర్చి పేతురుద్వారా యివ్వబడిన లేఖనాలు ముందే హెచ్చరించాయి:

మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలుకూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి యున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును [ గ్రీకు: ἀμαθής/అమథెస్=నేర్చుకోనటువంటి], అస్థిరులైనవారును [గ్రీకు: ἀστήρικτος/ఆస్టెరిక్టోస్=స్థిరత్వములేనటువంటి], తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచు కొనియుండుడి. (2పేతురు.3:15-17)  

శరీరసున్నతిని గురించి పౌలుద్వారా యివ్వబడిన లేఖనాల సమగ్ర బోధ: 

“నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీసున్నతి సున్నతికాకపోవును.” (రోమా. 2:25)
[మోషేధర్మశాస్త్రాన్ని తప్పిపోకుండా పాటించే వ్యక్తి సున్నతి పొందితే ప్రయోజనకరంగా వుంటుంది. అలా కాకుండా ఒకవైపు మోషేధర్మశాస్త్రాన్ని మీరుతూ మరొకవైపు సున్నతిని పొందితే దానివలన ఏ ప్రయోజనమూ వుండదు అన్నది ఇక్కడ పౌలుద్వారా చెప్పబడుతున్న బోధ]

“అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతోకూడ యెరూష లేమునకు తిరిగి వెళ్లితిని. దేవదర్శన ప్రకా రమే వెళ్లితిని. మరియు నా ప్రయాసము వ్యర్థమవు నేమో, లేక వ్యర్థమై పోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైనవారికిని విశదపరచితిని. అయినను నాతోకూడనున్న తీతు గ్రీసుదేశస్థుడైనను అతడు సున్నతిపొందుటకు బలవంతపెట్టబడలేదు.” (గలతీ.2:1-3)
[అపోస్తలుడైన పౌలు అన్యజనులకు సువార్తను ప్రకటించడము మొదలుబెట్టాడు. దాని ఫలితంగా తీతు అనే అన్యుడు రక్షించబడ్డాడు. పౌలు ఈ అన్యజాతిలోనుండి విశ్వాసిగా మారిన తీతును తీసుకొని యెరూషలేముకు వెళ్ళి అక్కడి సంఘ పెద్దలకు అతడిని పరిచయంచేసి అన్యులలో జరుగుతున్న సేవను గురించి వివరించాడు. అది విని సున్నతిలేని తీతును చూసిన సంఘ పెద్దలు అతడు విశ్వాసములోకి వచ్చాడు కనుక ఇప్పుడు అతడు రక్షణలో కొనసాగటానికి సున్నతి పొందాలి అంటు అతన్ని కోరలేదు]

“ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరలదాస్యమనుకాడిక్రింద చిక్కుకొనకుడి. చూడుడి; మీరు సున్నతి పొందినయెడల క్రీస్తువలన మీకు ప్రయోజనమేమియు కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడై యున్నాడని సున్నతిపొందిన ప్రతి మను ష్యునికి నేను మరల దృఢముగ చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృపలోనుండి తొలగిపోయి యున్నారు.” (గలతీ.5:1-4)
[గలతీయులకు వ్రాసిన పత్రికలోని 4వ అధ్యాయములో ధర్మశాస్త్రమునకు లోబడియుండాలని కోరుతున్న వారికి అది దాసత్వమని క్రీస్తునందున్నవారు ఆ దాసత్వములోనుండి విడిపించబడి స్వతంత్రులుగా చేయబడ్డారన్నది వివరించి 5వ ధ్యాయములో తిరిగి ఆ దాసత్వము క్రిందికి అంటే ధర్మశాస్త్రము క్రిందికి వెళ్ళొద్దు అని బుద్దిచెపుతున్నాడు. అందులో భాగంగా ధర్మశాస్త్రాన్ని పాటించే ప్రయత్నముతో సున్నతిని పొందవద్దని బోధిస్తున్నాడు. అలా చేసే వారు క్రీస్తునుండి తొలగించబడటమేగాక వారు ధర్మశాస్త్రము అంతటిని తు.చ. తప్పకుండా పాటించాల్సిన ఆవశ్యకత వుంది అంటూ హెచ్చరిస్తున్నాడు.]

“మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మునుగూర్చి నేను రూఢిగా నమ్ముకొను చున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును.సహోదరులారా, సున్నతి పొందవలెనని నేనింకను ప్రకటించుచున్నయెడల ఇప్పటికిని హింసింపబడనేల? ఆ పక్షమున సిలువవిషయమైన అభ్యంతరము తీసివేయబడునుగదా? మిమ్మును కలవరపెట్టువారు తమ్మునుతాము ఛేదించుకొనుట మేలు.” (గలతీ.5:10-12)
[గలతీయులకు వ్రాసిన పత్రికలోని 4వ అధ్యాయములో ధర్మశాస్త్రమన్నది దాసత్వానికి సాదృశ్యమని వివరించి 5వ అధ్యాయములో ధర్మశాస్త్రాన్ని పాటించడములో భాగంగా సున్నతిని పొందకండి అంటూ బోధిస్తూ పై వాక్యాలలో తాను యూదులకు సువార్తను ఏరకంగా ప్రకటిస్తున్నాడో తద్వారా తాను ఏరకమైన బాధలు పడుతున్నాడో వివరిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని పాటించనవసరము లేదు అలాగే దాన్ని పాటించే ప్రయత్నములో సున్నతిని పొందనవసరముకూడా లేదు అని అపోస్తలుడైన పౌలు యూదులకు బోధిస్తుండటాన్ని బట్టే యూదులు పౌలును హింసించారు. అలా కాకుండ ఒక వేళ పౌలు సువార్తను ప్రకటిస్తూ మోషేధర్మశాస్త్రాన్ని అనుసరించండి అలాగే సున్నతినికూడా పొందండి అని బోధించడం ప్రారంభిస్తే అతడికి యూదులనుండి హింసలుండేవి కావు! అయితే కొందరు కపట సోదరులు/విశ్వాసులు ఈ పంథాలో క్రీస్తును ప్రకటిస్తూ యూదులనుండి వచ్చే హింసలబారినుండి తమను తాము కాపడుకుంటున్నారు అన్నది పౌలు 6వ అధ్యాయములో తెలియచేస్తున్నాడు]

“శరీరవిషయమందు చక్కగా అగపడగోరువారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువవిషయమై హింసపొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు.అయితే వారు సున్నతిపొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు; తాము మీశరీరవిషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతిపొందవలెనని కోరుచున్నారు.” (గలతీ.6:12-13)
[కపట సోదరులు/విశ్వాసులు తాము ప్రకటిస్తున్న సువార్త విశయములో యూదులనుండి తమకు ఏసమస్యా రాకుండుటకై తాము సున్నతిని పొంది క్రొత్తగా అన్యజనులలోనుండి విశ్వాసములోకి వచ్చిన వారిని కూడా సున్నతి పొందండి అంటూ బలవంతము చేస్తున్నారు. సున్నతిని పొందినవారు మోషేధర్మశాస్త్రము అంటటిని తప్పిపోకుండా పాటించాలి. అయితే, ఈ కపట సోదరులు/విశ్వాసులు తాము సున్నతిని మాత్రము పొంది ధర్మశాస్త్రమును పాటించడము వదిలేసారు. వీరు బోధిస్తున్నది పాటిస్తున్నది పౌలు బోధిస్తున్నదానికి పూర్తిగా వ్యతిరేకమైనది.] 

కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైనపనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదననాచరించువారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదముచేసికొనక దేవుని యొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము.” (ఫిలిపీ.3:2-3)
[లేఖనాల బోధ ప్రకారం నిజమైన సున్నతి హృదయసున్నతి. శరీరసున్నతిపై ఆధారపడకుండా పరిశుద్ధాత్మతో ఆరాధిస్తూ క్రీస్తు యేసునందు అతిశయిస్తూ జీవిస్తున్న వారే నిజమైన సున్నతి ఆచారాన్ని పాటిస్తున్నవారు అన్నది అపోస్తలుడైన పౌలుద్వారా యివాబడిన పై లేఖనాల బోధ. అయితే, దీనికి వ్యతిరేకంగా బోధిస్తున్నవారు దుష్టబోధకులు. వారు కుక్కలతో సమానులు. అలాంటివారికి దూరంగా వుండండి అని పై లేఖనాల ఉవాచ.]

“అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులును, అవిధేయులును వదరుబోతులును మోసపుచ్చువారునైయున్నారు. వారి నోళ్లుమూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడనివాటిని దుర్లాభముకొరకు ఉపదేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయుచున్నారు.” (తీతుకు.1:10-11)
[పై లేఖనాలలో అపోస్తలుడైన పౌలు సున్నతి సంబంధులు అంటే సున్నతి పొందాలి అంటు అన్యులలోనుండి వచ్చిన విశ్వాసులకు బోధిస్తూ వారిని కలవర పెట్టి అపోస్తలుల బోధకు విరుద్ధంగా శరీరసున్నతిని పొందేటట్లు చేస్తున్న వారు మోసపుచ్చే వారు అని వివరిస్తూన్నాడు. అలాంటివారు తాము అపోస్తలుల బోధకు అవిధేయులుగా వుండటమేగాక తమ మాటకారితనముచేత అనేకులను మోసపుచ్చుతూ కుటుంబాలకు కుటుంబాలనే విశ్వాసబ్రష్టులనుగా చేస్తున్నారంటూ హెచ్చరిక ఇస్తున్నాడు. (ఈ కోవకు చెందిన మోసగాళ్ళు ఈ దినాలలో అనేకులు బయలుదేరారు తెలుగు క్రైస్తవుల మధ్య)]

తమ గారడీమాటలతో వక్రవ్యాఖ్యానాలతో అమాయక క్రైస్తవులను మభ్యపెట్టి వారిని శారీరక సున్నతిని పొందేటట్లు చేసి తద్వారా వారిని క్రీస్తునుండి వేరుచేసే దుర్భోధకులు ఈనాడు అనేకులు లోకములో బయలుదేరారు. అలాంటి అబద్ధబోధకులను పరిశుద్ధ లేఖనాలు ‘సున్నతి సంబంధులు,’ ‘కపటసోదరులు,’ ‘విశ్వాసులను కలవరపెట్టే వారు,’ ‘అవిధేయులు,’ ‘వదరుబోతులు,’ ‘మోసపుచ్చువారు,’ ‘దుష్టులైన పనివారు,’ ‘శరీరమును ఆస్పదముచేసుకొనేవారు,’ ‘దుర్లాభముకొరకు ఉపదేశించేవారు,’ ‘కుక్కలు’ అంటూ వారికి తగిన విశేషణ నామాలతో గుర్తిస్తున్నది. అలాంటివారికి వారి బోధలకు నిజవిశ్వాసులు దూరంగా వుంటూ తాము క్రీస్తు యేసునందు కేవళము విశ్వాసముద్వారా దేవుని కృపచేత పొందిన రక్షణలో కొనసాగాలన్నది లేఖనాల బోధ.

13. అపోస్తలుడైన పౌలు కూడా  ఒక యూదునిగా ఎనిమిదవ దినాన సున్నతి పొందిన వ్యక్తి (ఫిలిప్పీ.3:5). తాను ప్రభువైన యేసే (యషువ) క్రీస్తు (మషియాఖ్) అని గ్రహించి ఆయనయందు విశ్వాసముద్వారా క్రొత్తనిబంధనలోకి ప్రవేశించిన తదుపరి ఒకానొక సందర్భములో తాను సువార్త ప్రకటించగా రక్షించబడిన యువవిశ్వాసి తిమోతికి సున్నతి చేయించడము జరిగింది. ఇందుకుగల కారణమేమిటి? దీని పర్యవసానమేమిటి? ఇది రక్షణపొందటానికా లేక రక్షణలో కొనసాగటానికా?  

పౌలు ఈవిధంగా చేయడముద్వారా క్రీస్తు యేసునందు విశ్వాసముద్వారా రక్షించబడిన వ్యక్తి ‘శరీరములో సున్నతినికూడా పొందాలి’ అనిగాని లేక ఆ వ్యక్తి ‘సున్నతి పొందితేనేగాని రక్షణ నిలుపుకోలేడు’ అనిగాని చూపించే ప్రయతనము చేయడము లేదు. అయితే, లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించి చూస్తే పౌలు ఆవిధంగా చేయడానికిగల కారణముకూడా అక్కడే వ్రాయబడి వున్న విషయాన్ని గమనించగలము.  

“పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు…అతని తండ్రి గ్రీసుదేశస్థుడని ఆప్రదేశములోని యూదులకందరికి తెలియును గనుక వారినిబట్టి అతని తీసికొని సున్నతిచేయించెను.” (అపో.కా.16:1…3)

‘వారినిబట్టి’ అన్నది ఇక్కడ అసలు కారణము.

గ్రీసుదేశస్థుని కుమారుడైన తిమోతి సున్నతిని పొందకుండిన స్థితిలోనే మెస్సయ్య అయిన యేసు (యషువ) నందు విశ్వాసముంచి రక్షణపొంది శిష్యుడిగా మారాడు. విశ్వాసజీవితములో ఎదుగుతూ యితరవిశ్వాసులచేత మంచిపేరుకూడా సంపాదించాడు. అయినా ఆసమయములో సున్నతి పొందలేదు. అక్కడున్న విశ్వాసులెవరూ తిమోతిని సున్నతి పొందమంటూ బలవంతముచేయలేదు సూచించనూలేదు. అపోస్తలుడైన పౌలు తిమోతి వుంటున్న ప్రాంతానికి వచ్చిన సందర్భములో తిమోతిని తనతోకూడా పరిచర్య నిమిత్తం తీసుకొని వెళ్ళాలని ఆశించాడు. కాని, గ్రీసుదేశస్థుని కుమారుడైన తిమోతికి సున్నతి లేదన్న సంగతి ఆ ప్రాంతములోని యూదులకు తెలుసు. వారినిబట్టి అంటే ఆప్రాంతములోని యూదులకు తిమోతికి సున్నతి లేకపోవడమన్నది ఒక అభ్యంతరకారణముగా వుండకూడదని తిమోతికి సున్నతి చేయించాడు పౌలు. దీనిద్వారా పౌలుకు మరియు పౌలుతోపాటు పరిచర్యలో పయనించిన తిమోతికి యూదులమధ్యకు నిరాటంకంగా వెళ్ళి వారికి సువార్తను ప్రకటించడానికి వీలయ్యింది. అంతేగాని రక్షణపొందటానికో లేక రక్షణలో కొనసాగటానికో తిమోతికి పౌలు సున్నతి చేయించలేదు.    

ఈ సందర్భంగా మనం జ్ఙాపకము చేసుకోవలసిన లేఖన సత్యాలు, “యేసుక్రీస్తునందుండువారికి సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందేమియు లేదు” (గలతీ.5:6, 6:15) మరియు “యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని” (1 కొరింథీ.9:20). ఇవి అపోస్తలుడైన పౌలుద్వారా యివ్వబడిన దైవసందేశాలు. వీటి సమిష్టి తాత్పర్యము పౌలు తిమోతికి చేయించిన సున్నతిని తప్పుబట్టడములేదు అన్నది విజ్ఙులు మరియు దైవసంబంధులు గ్రహించగలరు.  

14. “నాతోకూడ చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీపజ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పు చున్నారు; ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి. మరియు యూస్తు అను యేసుకూడ మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతిపొందినవారిలో చేరిన వారు, వీరుమాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై యున్నారు, వీరివలన నాకు ఆదరణ కలిగెను.” (కొలొస్సీ.4:10-11)

పై వాక్యాన్ని కొందరు సున్నతిసంబంధులు తాము అపార్థము చేసుకోవడమేగాక యితరులకు వక్రభాశ్యాలు చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజవిశ్వాసులు ఈవిశయములో అప్రమత్తులుగా వుంటూ అబద్ధబోధకులకు ఆవేశాలకుగాక లేఖనాధారమైన సత్యాన్వేషణకే పెద్దపీట వేయాలి.  

పేతురు సున్నతిగలవారికి అంటే యూదులకు సువార్తను ప్రకటిస్తుండగా పౌలు సున్నతిలేనివారికి అంటే అన్యులకు లేక యూదేతరులకు సువార్తను ప్రకటించే పిలుపును అందుకున్నాడు (గలతీ.2:7). ఈరకంగా క్రీస్తు యేసునందు మానవాళికనుగ్రహించబడిన దేవుని సువార్తను అందరికీ అందించే ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈప్రయత్నములో పౌలుకు సహకరించిన వారిలో ఒకప్పుడు యూదామతములో (జుడాయిజం) వుండిన కొందరు సువార్త సత్యాన్ని విని, గ్రహించి, దానిలో విశ్వాసముంచడముద్వారా రక్షించబడి పౌలు చేస్తున్న పరిచర్యకు సహకరించడం మొదలుబెట్టారు. వీరంతా యుదులు కాబట్టి శారీర సున్నతి పొందియున్నవారు. పౌలుకు సువార్తపరిచర్యలో సహకరిస్తున్నవారిలో కేవళము యూదులేకాదు యూదేతరులుకూడా వున్నారు. అయితే, పౌలు చేస్తున్న సువార్తపరిచర్యలో ఒకప్పుడు యూదమతస్తులైవుండి యేసుక్రీస్తు శిష్యులుగా మారుతున్న వారిసంఖ్య రానురాను తగ్గిపోతూ యూదేతరులలోనుండి విశ్వాసములోనికి వస్తున్నవారి సంఖ్య పెరగడము ప్రారంభించింది. ప్రత్యేకించి రోములోని ఈ పరిస్థితిని ప్రతిబింభిస్తూ పౌలు పై మాట చెప్పడము జరిగింది. 

ఆయాప్రాంతాలలో పౌలుతో కలిసి పనిచేస్తున్న వారిలో సున్నతి పొందినవారు అంటే యూదామతములోనుండి వచ్చినవారు వున్నారు అలాగే సున్నతిపొందనివారు అంటే అన్యులుకూడా వున్నారు. పౌలు రోములోని చెఱసాలలోనుండి కొలొస్సీలోని విశ్వాసులకు వ్రాస్తూ తానున్న పరిస్థితిలో దేవునిరాజ్య విస్తరణ విశయములో తనకు రోములో సహాయం చేస్తున్న వారు కొలస్సీ.4:10-11 వరకు పేర్కొన్న దాని ప్రకారం యూదా మతములోనుండి వచ్చిన విశ్వాసులు మాత్రమే అని సూచిస్తున్నాడు. గమనించాలి, అన్నిస్థలాలలో తనతో కలిసి పరిచర్యలో పాలుపొందుతున్నవారంతా సున్నతిపొందినవారేనని ఇక్కడ పౌలు చెప్పడము లేదు. ఇది కేవళం రోములో పౌలు చెఱసాలలోవున్నప్పటి పరిస్థితిని గురించిన వివరణ.  

15. యెహెజ్కేలు-మూడవమందిరము: కొందరు యెహెజ్కేలు గ్రంథములోని 44:7-9 వచనాలను రాబోవు కాలములో యెరూషలేము నగరములో మూడవ మందిరము కట్టబడిన సందర్భాన్ని సూచిస్తున్నవంటూ తప్పుడు భాష్యం చెపుతారు. 

“ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నా కర్పించునప్పుడు నా పరిశుద్ధస్థలములో ఉండి దాని నపవిత్రపరచునట్లు హృదయమందును, శరీరమందును సున్నతిలేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొనిరాగా వారు మీ హేయ క్రియలన్నిటిని ఆధారముచేసికొని నా నిబంధనను భంగపరచిరి. ​నేను మీకప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక, వారు కాపాడవలెనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాహృదయమందును, శరీరమందును సున్నతిలేని అన్యులై యుండి ఇశ్రాయేలీయులమధ్య నివసించువారిలో ఎవడును నా పరిశుద్ధస్థలములో ప్రవేశింపకూడదు.”

సొలోమోను కట్టించిన మొదటి మందిరం 586 క్రీ.పూ. లో బబులోను రాజైన నెబుకద్నెజర్ సైనికులచేత నాశనం చేయబడింది. ప్రవక్త అయిన యెహెజ్కేలు 622 క్రీ.పూ. – 550 క్రీ.పూ. మధ్య జీవించాడు. తాను బబులోను చెరలో జీవిస్తూ అక్కడి యూదులమధ్య దేవుని వాక్యం ప్రకటిస్తూ వచ్చాడు. ఆ సందర్భములోనే యెహెజ్కేలు 44 వ అధ్యాయము వ్రాయబడింది. అప్పుడు యెరూషలేములో దేవుని మందిరము లేదు. 516 క్రీ.పూ. లో జెరుబ్బాబేలు నాయకత్వములో రెండవమందిరం కట్టబడింది. దాన్ని కూడా రోమీయులు 70 క్రీ.శ. లో నేలమట్టం చేసారు.         

పై లేఖనాలను జాగ్రత్తగా చదివి చూస్తే అక్కడ ప్రభువైన యెహోవా మొదటిమందిరము నాశనమవడానికిగల కారణాలను యూదులకు జ్ఙాపకం చేస్తూ తన మందిరములో అంటే కట్టబడబోతున్న రెండవమందిరములో అలాంటివి పునరావృతం కాకూడదంటు హెచ్చరిస్తున్నాడు. ఆ సందర్భములోనే శరీరమందు సున్నతిలేని అన్యులు తన మందిరములో (రెండవ మందిరములో) ప్రవేశించకూడదు అన్నది వివరిస్తున్నాడు. మూడవమందిరమునుగురించిగాని ఆసమయములోని శారీర సున్నతినిగురించిగాని పైవచనాలలో ప్రస్తావించడము లేదు.  

పై బైబిలు బోధల వెలుగులో క్రింది సత్యాలను విశ్వాసులు గమనములో వుంచుకోవాలి:

(1) కొందరు వైద్యుల సలహామేరకు ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం సున్నతిపొందుతారు. అలాంటి సున్నతిని లేఖనాలు నిశేధించడము లేదు మరియు సమర్థించడము లేదు. 

(2) కొందరు తమప్రాంత సంసృతిని బట్టి లేక తాముంటున్న సమాజములోని ఆచారాన్ని బట్టి సున్నతిపొందుతారు. అలాంటి సున్నతిని లేఖనాలు తప్పుబట్టడము లేదు.    

(3) కొందరు ఒకప్పుడు అన్యులుగా వుండి తరువాత బైబిలు దేవున్ని విశ్వసించి ధర్మశాస్త్రాన్ని (మోషే-ధర్మశాస్త్రం) పాటించి తద్వారా దేవుని మెప్పును పొందాలన్న సదుద్దేశములో భాగంగా సున్నతిపొందే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి సున్నతి లేఖనానుసారమైన సున్నతి కాదు. అందుకు కారణాలు:     

అ) అలాంటి సున్నతిని పేర్కొంటున్న వుదాహరణలుగాని లేక మాదిరిగా చూపే సంఘటనలుగాని బైబిలులో లేవు.

ఆ) ఒకవేళ ఎవరైనా దేవుని దృష్టిలో నీతిమంతునిగా కనబడాలన్న వుద్దేశముతో మోషేధర్మశాస్త్ర ప్రకారం సున్నతి తీసుకుంటే ఆ వ్యక్తి మోషేధర్మశాస్త్రమును మొత్తము తు.చ. తప్పకుండా పాటించాల్సి వుంటుంది. అలా కానిపక్షములో ఆవ్యక్తి పొందిన సున్నతికి విలువలేదు (రోమా. 2:25).   

(4) ఈమధ్య కొందరు యషువ మషియాఖ్ (యేసు క్రీస్తు) నందు విశ్వాసముంచినా సరే రక్షణపొందటానికి యింకా సున్నతిపొందాలి అన్న అబద్ధబోధకుల ఉవాచను బట్టి సున్నతి పొందుతున్నారు. ఈ రకమైన సున్నతి వాక్య విరుద్దమైన దుర్బోధ యొక్క ఫలితం! అలాంటి సున్నతి పొందినవారు యషువ మషియాఖ్ నుండి వేరై శాపగ్రస్తులుగా జీవించి నిత్యనాశనములోకి ప్రవేశిస్తారు అన్నది లేఖనాల హెచ్చరిక (గలతీ.5:1-4).   

(5) నిజవిశ్వాసులకు లేక నిజక్రైస్తవులకు చేతులతో చేయబడే సున్నతిగాక క్రీస్తు పొందిన సున్నతినిబట్టి హృదయమందు అత్మీయ సున్నతి  అనుగ్రహించబడింది (రోమా.2:28-29; ఫిలిపీ.3:2-3; కొలస్సీ.2:11). కనుక, వారు తిరిగి శరీర సున్నతిని పొందనవసరము లేదు (1కొరింథీ.7:18; గలతీ.2:1-3, 5:10-12, 6:12-13).  ఈ సత్యాన్ని ప్రతిబింబిస్తూ ఒకప్పుడు అన్యుడుగా వుండి క్రీస్తుయేసునందు నిజవిశ్వాసిగా మారి దేవుని కుటుంబములో చేరిన తీతు కూడా సున్నతిపొందవలెనంటు బలవంతము చేయబడలేదు (గలతీ.2:3).

(6) మెస్సయ్య యూదుడిగా మోషేధర్మశాస్త్రము క్రింద జీవించినవానిగా సున్నతిని పొందాడు. కాని, తన రక్తముద్వారా ఆవిష్కరించబోతున్న క్రొత్తనిబంధనలో పాలుపొందే వారందరిని ఉద్దేశించి సున్నతి పొందాలి అంటూ యేఆజ్ఙా ఇవ్వలేదు. మెస్సయ్యను విశ్వసించి ఆయన బోధ ప్రకారం జీవిస్తున్న వారికి రక్షించబడటానికి లేక ఆ రక్షణలో కొనసాగటానికి సున్నతి అన్నదాని ఆవశ్యకత అసలు లేనేలేదు.

(7) ఒకప్పుడు అన్యులుగా వుండి సువార్తను విని మెస్సయ్య (యషువ మషియాఖ్) నందు విశ్వాసముద్వారా నీతిమంతులుగా తీర్చబడి దేవుని ప్రజలలో చేరినతరువాత మెస్సయ్య ఉపదేశానికి అంటే మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథము వరకుగల లేఖనాల సమగ్ర బోధకు వ్యతిరేకంగా శరీర సున్నతిని పొందితే మెస్సయ్యనుండి వేరుచేయబడి శాపగ్రస్తులవుతారు. అలాంటివారు తిరిగి మెస్సయ్య కృపలోకి చేరుకొని రక్షణలో కొనసాగడానికి తిరిగి మెస్సయ్య ముందు హృదయపూర్వకంగా పశ్చత్తాపపడి క్షమాపణ కోరి ఆయన కనికరము కొరకు ఎదురుచూడటము తప్ప వేరే మార్గము లేదు.  

Recent Entries »