Category Archives: ధర్మశాస్త్రము

Permalink to single post

జుడాయిజంలో అన్యాచారాలు

నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్య పడితిని.” (లే.కాం.20:23)

ప్రభువైన దేవుడు తాను ప్రత్యేక పరచుకున ఇశ్రాయేలీయులను హెచ్చరిస్తూ పై ఆజ్ఙను అందించాడు. అయితే, ఇశ్రాయేలీయులు ఈ ఆజ్ఙవిశయములో అనేక పర్యాయాలు తప్పిపోయారు. దాని పర్యవసానమే ఇశ్రాయేలీయులు తమ దేశమైన పాలస్తీనాలోనుండి పెకిళించబడి అన్యదేశాలలోకి చెదరగొట్టబడ్డారు.

విస్తుపోయే విశయమేమిటంటే, చెదరగొట్టబడిన ఇశ్రాయేలీయులు లేక యూదులు ఆయా దేశాలలోని అన్య ఆచారాలనూ సాంప్రదాయాలను నేర్చుకొని తాము యేర్పాటుచేసుకున్న యూదు మతములో చేర్చుకుంటూ తమ మతాన్ని విస్తరించుకుంటూ వస్తున్నారు. తద్వారా వారు ప్రభువైన దేవునికి సమీపం కాకుండా ఆయనకు ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నారు.

ప్రభువైన దేవుడు తన ప్రవక్తలద్వారా అందించిన గ్రంథాలలో లేని ఆచారాలు సాంప్రదాయాలు ఈనాటి జూడాయిజం వారి మతప్రయత్నాలలో విరివిగా కనిపిస్తుంటాయి. అందులో కొన్ని ఈ క్రింద యివ్వబడినవి:

Permalink to single post

మౌఖిక తోరాహ్: రబ్బీల దగా

దాదాపు 1400 క్రీ.పూ.లో అదోనాయ్ ఎలోహిం [ప్రభువైన దేవుడు] మోషేద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో ఒక నిబంధనను చేసాడు. ఆసందర్భములో ఇశ్రాయేలీయులకు మోషేద్వారా ఎలోహిం ఒక ఉపదేశాన్ని లేక ధర్మాన్ని అందించాడు. ఆ ఉపదేశాన్నే మోషే ధర్మశాస్త్రము [תּֽוֹרַת מֹשֶׁ֣ה/తవ్రాత్ మోషే] లేక ‘తోరాహ్’ [תּוֹרָה/తోరాహ్] అని లేఖనాలు పేర్కొంటున్నాయి.

ఎలోహిం [దేవుడు] యొక్క ఆజ్ఙను బట్టి దైవజనుడు మోషే ఆ ఉపదేశాన్ని/ధర్మాన్ని అంతటిని గ్రంథస్త రూపములో భావితరాలవారికొరకై భద్రపరచాడు. గ్రంథస్తరూపములోని ఉపదేశానుసారంగానే జీవించాలంటూ ఇశ్రాయేలీయులకు ఎలోహిం [దేవుడు] స్పష్టమైన సూచనలను తనాఖ్ లో [పాతనిబంధన గ్రంథములో] అందించాడు. కాని, గ్రంథానికి వేరుగా కేవలం మౌఖికంగా యివ్వబడిన సూచనలనుగురించి అంటే రబ్బీలు బోధిస్తున్న మౌఖిక తోరాహ్ ను గురించి ఎలోహిం [దేవుడు] ఏ మాటా చెప్పలేదు.

క్రీస్తుశకం మొదటిశతాబ్ధము తరువాత యూదు మతపెద్దలు అంతకు ముందు ఏ ప్రవక్త కనీ వినీ ఎరుగని రెండవ తోరాహ్ లేక మౌఖిక తోరాహ్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మౌఖిక తోరాహ్ యొక్క వ్రాతరూప సంకలనాన్నే యూదు మతస్తులు మిష్నా [מִשְׁנָה] అని పేర్కొంటారు.

మిష్నా [מִשְׁנָה] అంటే హీబ్రూ భాషలో “వల్లేవేయడం ద్వారా ధ్యానించటము” అని భావం. మిష్నా ఆరు ఆదేశాలుగా [orders] విభజించబడింది. ఈ ఆదేశాలలోని ప్రతి ఆదేశం 7-12 వ్యాసాలు [tranctates] గా వ్రాయబడింది. వెరసి అన్నీ కలిపి 63 వ్యాసాలుగా మిష్నా సంకలనం చేయబడింది.

యూదుమతపెద్దలైన రబ్బీలు వ్రాసి ప్రవేశపెట్టిన ‘మౌఖిక తోరాహ్’ [תורה שבעל פה/తోరాహ్ షె-బె అల్-పెహ్/Oral Torah] అన్నది తనాఖ్ [39 గ్రంథాలతో కూడిన పాతనిబంధన గ్రంథము] కు పూర్తిగా వ్యతిరేకమైనది. అందుకుగల కారణాలు ఈ క్రింద యివ్వబడినవి:

(1) యూదుమతపెద్దలైన రబ్బీలను వారి బోధలను ప్రామాణికంగా స్వీకరించెందుకు తనాఖ్ గ్రంథములో ఎలాంటి సూచన యివ్వబడలేదు. నిజానికి యూదుమతపెద్దలు తమకుతాము అలంకరించుకున్న ‘రబ్బీ(లు)’ అన్న పదమే తనాఖ్ గ్రంథములో ఉపయోగించబడలేదు. 

(2) ‘మౌఖిక తోరాహ్’ [תורה שבעל פה/తోరాహ్ షె-బె అల్-పెహ్/Oral Torah] అన్న పదజాలము తనాఖ్ లో ఒక్క సారికూడా పేర్కొనబడలేదు.

(3) తనాఖ్ లో రెండు తోరాలున్నాయి అన్న మాటలేవీ వ్రాయబడలేదు.

(4) “లేని వార్తను పుట్టిచకూడదు” (ని.కాం.23:1-2) అన్నది తోరాహ్ లోని అతి ప్రాముఖ్యమైన ఆజ్ఙ. తోరాహ్ లో లేని ‘మౌఖిక తోరాహ్’ [תורה שבעל פה/తోరాహ్ షె-బె అల్-పెహ్/Oral Torah] ను ప్రవేశపెట్టడమన్నది పరమతండ్రికే వ్యతిరేంకంగా లేని వార్తను పుట్టించడము! అలాంటి సాహసము ఏ మానవుడు చేయకూడదు. ఒకవేల ఎవరైనా ఆ సాహసం చేస్తే దైవసంబంధులెవరు ఆ వ్యక్తితో సహవసించకూడదు. 

(5) మోషేద్వారా ఇశ్రాయేలీయులకు యివ్వబడిన తోరాహ్ కు మార్పులుచేర్పులు చేసే హక్కు కేవలం దాన్ని యిచ్చిన పరమతండ్రి అదొనాయ్ ఎలోహింకు [ప్రభువైన దేవుడు] మాత్రమే చెందినది. నరులెవ్వరికీ ఆ హక్కు యివ్వబడలేదు. పండితులైనా పాష్టర్లు అయినా, రాజులైనా రబ్బీలైనా, క్రైస్తవులైనా యూదులైనా మోషేధర్మశాస్త్రాన్ని మార్చేందుకు ఎవరికీ హక్కు లేదు.

మోషేధర్మశాస్త్ర విషయములో ఎవైనా మార్పులు తీసుకురావాలని పరమతండ్రి ఉద్ధేశిస్తే ఆయన ధర్మశాస్త్రాన్ని ఏవిధంగా తన సేవకుడు మరియు ప్రవక్త అయిన మోషేద్వారా అందించాడో అదేవింధంగా తన సేవకులైన ప్రవక్తలద్వారానే ఆ ధర్మశాస్త్రానికి తన చిత్తప్రకారమైన మార్పులను ప్రవేశపెట్టగలడు. అంతేగాని, ధర్మశాస్త్రానికి మాటలను కలపటంగాని లేక తీసివేయటంగాని పండితులచేత, పాష్టర్లచేత, గొప్పవారిచేత లేక రబ్బీలచేత ఎట్టిపరిస్తితులలోను చేయించడు. అలాంటి ప్రయత్నము అదొనాయ్ ఎలోహింకు వ్యతిరిక్తమైనది.

అయితే, పండితులుగా రాజులుగా తమనుతాము పరిచయం చేసుకునే యూదుమతపెద్దలైన రబ్బీలు మోషేధర్మశాస్త్రానికి వేరుగా రెండవ తోరాహ్ ను సృష్టించుకొని అదొనాయ్ ఎలోహింకు [ప్రభువైన దేవునికి] వ్యతిరేకంగా యూదు సంస్కృతి ముసుగులో వేరొక మతధర్మాన్ని ప్రవేశపెట్టి అనేకులను మార్గభ్రష్టత్వం పట్టిస్తున్నారు.

మోషే వ్రాసిన తోరాహ్ గ్రంథానికి అంటే మోషేద్వారా యివ్వబడిన పంచకాండాలకు ఏమాటలను కలపకూడదని అలాగే ఏమాటలను తీసివేయకూడదని వాటిని అందుకున్న యూదు సమాజానికి మోషే వ్రాసిన తోరాహ్ లో స్పష్టమైన ఆజ్ఙ యివ్వబడింది:  

కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనునట్లు, మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. (ద్వి.కాం.4:1-2) 

పై లేఖన వెలుగులో మోషేద్వారా యివ్వబడిన దేవుని మాటలకు అంటే మోషే తోరాహ్ కు ఏకంగా మరొక తోరాహ్ అంటే ‘మౌఖిక తోరాహ్’ ను కలపడమన్నది ఊహకందనంత విస్తారమైన దైవవ్యతిరేక పాపము. ఈ పాపములో ఏదైవసంబంధులుకూడా ప్రత్యక్షంగానైన లేక పరోక్షంగానైనా పాల్గొనకూడదు.  

(6) ప్రభువైన దేవుడు సెలవిస్తున్నదాని ప్రకారం మానవుల విధులనుబట్టి నేర్చుకున్న భయభక్తులు దేవునికి అంగీకారము కావు:    

ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి. (యెషయా.29:13) 

పై లేఖన వెలుగులో యూదు మతపెద్దలైన రబ్బీలు మౌఖిక తోరాహ్ పేరుతో బోధిస్తున్న స్వంత అభిప్రాయాలను, పారంపర్యాచారాలను, మరియు విధులను పాటించడమన్నది ప్రభువైన దేవునికి విరుద్ధమన్న సత్యం మరచిపోకూడదు. 

(7) మోషేద్వారా వ్రాయబడిన తోరాహ్ [ధర్మశాస్త్రము] గ్రహించలేనంత కఠినమైనది కాదు అందుకోలేనంత దూరమైనది కాదు అంటూ లేఖనమే సాక్ష్యమిస్తున్నది:  

ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని, నీ దేవుడైన యెహోవా మాట విని, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్లునప్పుడు యెహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయందును ఆనందించి నీవైపు మళ్లును. నేడు నేను నీ కాజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. (ద్వి.కాం.30:10-11) 

పై లేఖన ప్రకటనను బట్టి గ్రంథ రూపములోనున్న తోరాహ్ ను వివరించేందుకు మరొక తోరాహ్ లేక మౌఖిక తోరాహ్ ను అందించాల్సిన ఆవశ్యకత ఎంతమాత్రము లేదు.

(8) క్రీస్తుశకం రెండవ శతాబ్ధం నుండే మౌఖిక తోరాహ్ [Oral Torah] అన్న పదప్రయోగము, ప్రతిపాదన మరియు సిద్ధాంతం వునికిలోకి వచ్చాయి. తత్ఫలితంగా రబ్బీల నిర్విరామ కృషి క్రీస్తు శకము ఐదవ శతాబ్ధముకల్లా మౌఖిక తోరాను గ్రంథస్తరూపములో ప్రత్యక్షం చేయగలిగింది. అంతకుముందు మౌఖిక తోరాహ్ అన్న పదప్రయోగముగాని లేక అలాంటి తోరాహ్ ఉనికి యొక్క సమాచారముగాని లేవు.

ఒకవేల క్రీస్తుకు పూర్వమే వాటికి ఉనికి వుండివుంటే యూదు మతవిశ్వాసాలలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న వాటి ఉనికిని గూర్చిన సమాచారము క్రీస్తుకు పూర్వము వ్రాయబడిన యూదు గ్రంథాలలో [Apocripha] లేక క్రీస్తుకు పూర్వం మూడవ మరియు మొదటి శతాబ్ధాల మధ్య వ్రాయబడి భద్రం చేయబడిన కొన్ని వేల సంఖ్యలో వున్న మృతసముద్ర-తాళపత్ర ప్రతులలో [Dead Sea Scrolls] తప్పకుండా పేర్కొనబడేవే. కాని, అలాంటిది యేది జరుగలేదు. కారణం, క్రీస్తుకు పూర్వం అవి ఉనికిలో లేవు. క్రీస్తు తరువాత రబ్బీల చలువతో ఉనికిలోకి వచ్చింది మౌఖిక తోరాహ్!

(9) లిఖిత తోరాహ్ తోపాటు మౌఖిక తోరాహ్ కూడా మోషే ఎలోహిం నుండి అందుకున్నాడు అని చెప్పే రబ్బీల కథనం కేవలం ఒక కపట ప్రయత్నమేతప్ప అందులో సత్యం లేశమాత్రమైనా లేదు అనడానికి మరొక లేఖనసాక్ష్యం ధర్మశాస్త్రాన్ని అంటే లిఖిత తోరాహ్ ను అందుకున్న తరువాత మోషే కొన్ని సందర్భాలలో కార్యాచరణ విశయములో ఎలోహిం యొక్క సూచనలకై ఎదురుచూడటం. ఈ రకమైన సందర్భాలలో నాలుగు ప్రధానమైనవి ఈ క్రింద యివ్వబడినవి:

అ) సంఖ్యాకాండము 9:5-8

యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి. కొందరు నరశవమును ముట్టుటవలన అపవిత్రులై ఆ దినమున పస్కాపండుగను ఆచరింపలేకపోయిరి. వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో నరశవమును ముట్టుటవలన అపవిత్రులమైతివిు; యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇశ్రాయేలీయుల మధ్యను అర్పింపకుండునట్లు ఏల అడ్డగింపబడితిమని అడుగగా మోషేనిలువుడి; మీ విషయములో యెహోవా యేమి సెలవిచ్చునో నేను తెలిసి కొందునని వారితో అనెను.”

ఆ తరువాత ఆ సందర్భములో మోషే చేయవలసిన వివరాలను ఎలోహిం [దేవుడు] మోషేకు తెలియచేసాడు. ఒకవేల మౌఖిక తోరాహ్ అన్నది అదివరకే మోషేకు అందించబడితే ఈ సందర్భములో మోషే ఎలోహిం [దేవుని] యొక్క వివరణకై ఎదురుచూడాల్సి వచ్చేది కాదు.

ఆ) సంఖ్యాకాండము 15:32-36

ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతిదినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచినవారు మోషేయొద్దకును అహరోనునొద్ద కును సర్వసమాజమునొద్దకును వానిని తీసికొనివచ్చిరి. వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వసమాజము పాళెము వెలుపలికి వాని తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టెను.”

గమనిక: మౌఖిక తోరాహ్ [Oral Torah] లో సూచించబడిన దాని ప్రకారము సబ్బాతు దినాన కట్టెలు యేరుకునేవ్యక్తులకు విధించబడాల్సిన శిక్ష ‘రాల్లతో కొట్టి చంపడం’ [మైమోనిడెస్, మిష్నెహ్ తోరాహ్, షబ్బాత్ 1].

కనుక, ఈ వివరాన్ని కలిగివున్న మౌఖిక తోరాహ్ [Oral Torah] ను మోషే లిఖిత తోరాహ్ తోపాటు అందుకొని వుండివుంటే ఆ సందర్భములో ఎలోహిం యొక్క సూచనకొరకు తిరిగి కనిపెట్టేవాడు కాదు. కాని మోషే ఆ సందర్భములో ఎలోహిం యొక్క సూచనకొరకు వేచివుండాల్సి వచ్చింది. కారణం, మోషేకు తెలియని మౌఖిక తోరాహ్ [Oral Torah] అన్నది రబ్బీల స్వంత సృష్టి!
 
ఇ) సంఖ్యాకాండము 27:1-7

అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై యుండెను. అతని కుమార్తెల పేళ్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద మోషే యెదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల యెదుటను సర్వసమాజము యెదుటను నిలిచి చెప్పినదేమనగా మా తండ్రి అరణ్యములో మరణ మాయెను. అతడు కోరహు సమూహములో, అనగా యెహోవాకు విరోధముగా కూడినవారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతిబొందెను. అతనికి కుమారులు కలుగలేదు; అతనికి కుమారులు లేనంత మాత్రముచేత మా తండ్రిపేరు అతని వంశములోనుండి మాసిపోనేల? మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయుమనిరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవిచేయగా యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను.”

మోషే వద్ద మౌఖిక తోరాహ్ వుండివుంటే పై లేఖనాలలో వ్యక్తపరచబడినవిధంగా సెలోపెహాదు కుమార్తెల సమస్యకు పరిష్కారం మోషే వెంటనే అందించివుండేవాడు. కాని మోషే వద్ద మౌఖిక తోరాహ్ అన్నదేదీ లేకుండింది కాబట్టే వారి సమస్యకు ఎలోహిం [దేవుని] యొక్క సూచనలకై వేడుకోవలసి వచ్చింది.

ఈ) లేవికాండము 24:10-14

ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను. ​​ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషేయొద్దకు వాని తీసి కొనివచ్చిరి. వాని తల్లిపేరు షెలోమీతు; ఆమె దాను గోత్రికుడైన దిబ్రీకుమార్తె. యెహోవా యేమి సెలవిచ్చునో తెలిసికొనువరకు వానిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. శపించినవానిని పాళెము వెలుపలికి తీసి కొనిరమ్ము; వాని శాపవచనమును వినినవారందరు వాని తలమీద తమ చేతులుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాని చావగొట్టవలెను.”

పై లేఖనాల వెలుగులో దైవదూషణకు మరణదండన అన్నది ఎలోహిం వివరించేంతవరకు ఇశ్రాయేలీయులు మరియు మోషే ఎదురుచూడాల్సి వచ్చింది. రబ్బీల కథనం ప్రకారం అదివరకే అందించబడి లిఖిత తోరాహ్ గా మార్చబడిన ఎలోహిం యొక్క సూచనలలో లేని వివరాలు మౌఖిక తోరాహ్ లో వుండాలి. అయితే, మౌఖిక తోరాహ్ అన్నది కేవలం క్రీస్తు శకములోని రబ్బీల సృష్టి కాబట్టి మోషేవద్ద అలాంటిదేది లేకుండింది. ఆ కారణాన్నిబట్టి ఆ సందర్భములో పాటించాల్సిన కార్యాచరణాన్ని తెలుసుకునేందుకు ఎలోహిం [దేవుని] యొద్దనుండి మోషే ఎదురుచూడాల్సివచ్చింది. అది తెలియపరచబడిన తరువాత ఆ వివరాలు లిఖిత తోరాహ్ లో చేర్చబడ్డాయి.

(10) రబ్బీలు తమ మతానికి ప్రధాన పునాదియైన రెండవ తోరాహ్ కు చెల్లుబాటును తెచ్చుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా, రెండవ తోరాహ్ మోషేనుండి మౌఖికంగా తరతరాలకు అందించబడింది అంటూ వ్రాతపూర్వకంగా యివ్వబడిన తోరాహ్ లోని ప్రకటనకే వ్యతిరేకంగా అసత్య ప్రచారం చేస్తూ అమాయకులను తప్పుదోవపట్టిస్తున్నారు.

గ్రంథస్తరూపములోని తోరాహ్ ప్రకటిస్తున్న సత్యము ప్రకారము ప్రభువైన దేవుడు తనతో మాట్లాడిన మాటలన్నింటిని దైవజనుడు మోషే వ్రాసి పెట్టాడు.

దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను.” (ని.కాం.20:1)

మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి” (ని.కాం.24:4)

పై లేఖనాల సాక్ష్యం ప్రకారం కేవలం ఆజ్ఙలను మాత్రమే కాదు వాటి వివరాలతో సహా యెహోవా పలికిన మాటలన్నింటిని మోషే వ్రాసాడు.

మోషే వద్ద తాను వ్రాసి యిచ్చిన దేవుని మాటలకు అంటే లిఖిత తోరాహ్ కు వేరైన దేవుని మాటలంటూ వేరే ఏవీ లేవు అన్న సత్యం పై లేఖనాధారంగా ప్రస్పుటమవుతున్నది. అయినా, ఈ సత్యానికి వ్యతిరేకంగా రబ్బీలు తమ స్వసృష్టియైన మౌఖిక తొరాహ్ [Oral Torah] మోషే ద్వారానే యివ్వబడింది అంటూ ప్రభువైన దేవునికి మరియు ఆయన సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా అసత్యాలను పుట్టించుకొని తద్వారా తమ మతాన్ని సమర్ధించుకునే మోసయుక్తమైన ప్రయత్నాన్ని చేపట్టారు. లేఖన జ్ఙానం లేని ఆమాయకులు అనేకులు వారి మోసానికి బలియై అసత్య మార్గములో ప్రవేశిస్తున్నారు.

(11) ప్రభువైన దేవుడు మోషేద్వారా గ్రంథ రూపములో అందించిన తోరాహ్ [ధర్మశాస్త్రము] దాదాపు ముప్పై సార్లకు పైగా తనాఖ్ [పాతనిబంధన గ్రంథము] లో విస్పష్టంగా పేర్కొనబడింది. అయితే, రబ్బీలు చెప్పుకుంటున్న ‘మౌఖిక తోరాహ్’ [תורה שבעל פה/తోరాహ్ షె-బె అల్-పెహ్/Oral Torah] అంటే మోషే చేత గ్రంథస్థము చేయబడకుండా కేవలము మాటల రూపములో అందించబడిన  రెండవ తోరాహ్ గురించి మాత్రము తనాఖ్ [పాతనిబంధన గ్రంథము] లో ఎక్కడా చెప్పబడలేదు అన్నది గమనార్హమైన విశయము: 

నీవు జాగ్రత్త పడి యీ గ్రంథములో వ్రాయబడిన యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు, నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనియెడల…” (ద్వి.కాం.28:58)

మరియు నీవు నశించువరకు ఈ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును.” (ద్వి.కాం.28:61)

అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు; అట్టివాడు మీలోనుండినయెడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యునిమీద పొగరాజును; ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నియు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రిందనుండకుండ తుడిచివేయును. ఈ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటినిబట్టి వానికి కీడు కలుగజేయుటకై యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి వాని వేరుపరచును.” (ద్వి.కాం.29:20-21) 

గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటిని యీ దేశముమీదికి తెప్పించుటకు దానిమీద యెహోవా కోపము రవులుకొనెను.” (ద్వి.కాం.29:27)

ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని, నీ దేవుడైన యెహోవా మాట విని, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్లునప్పుడు యెహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయందును ఆనందించి నీవైపు మళ్లును.” (ద్వి.కాం.30:10)

అయితే నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపో కూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.” (యెహోషువ.1:7-8)

మోషే ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయుల కాజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండమీద కట్టించెను. దానిమీద వారు యెహోవాకు దహనబలులను సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రగ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్లమీద వ్రాయించెను.” (యెహోషువ.8:30-32)

ఆ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములనన్నిటిని, అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలును పిల్ల లును వారి మధ్యనుండు పరదేశులును వినుచుండగా యెహోషువ సర్వసమాజము నెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాటయొక్క టియు లేదు.” (యెహోషువ.8:34-35)

కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసికొని, యెడమకుగాని కుడికిగాని దానినుండి తొలగిపోక…” (యెహోషువ.23:6)

నీ దేవుడైన యెహోవా అప్పగించినదానిని కాపాడి,ఆయన మార్గముల ననుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము;” (1రాజులు.2:3)

అయితే కుమారుల దోషమునుబట్టి తండ్రులకు మరణశిక్ష విధింప కూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపమునిమిత్తము వాడే మరణ శిక్ష నొందును, అని మోషే వ్రాసియిచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా యిచ్చిన ఆజ్ఞనుబట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు.” (2రాజులు.14:5)

మీరు పోయి దొరికిన యీ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యెహోవాయొద్ద విచారణచేయుడి; మన పితరులు తమ విషయములో వ్రాయబడియున్న దానంతటి ప్రకారము చేయక యీ గ్రంథపు మాటలను విననివారైరి గనుక యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుచున్నది.” (2రాజులుs.22:13)

రాజు ఒక స్తంభముదగ్గర నిలిచియెహోవా మార్గములయందు నడచి, ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను గైకొని, యీ గ్రంథమందు వ్రాయబడియున్న నిబంధన సంబంధమైన మాటలన్నిటిని స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరు ఆ నిబంధనకు సమ్మతించిరి.” (2రాజులు.23:3)

అంతట రాజునిబంధన గ్రంథమునందు వ్రాసి యున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగను ఆచరించుడని జనులకందరికి ఆజ్ఞాపింపగా” (2రాజులు.23:21)

మరియు కర్ణపిశాచి గలవారిని సోదెచెప్పువారిని గృహదేవతలను విగ్రహములను, యూదాదేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటిని యోషీయా తీసివేసి, యెహోవామందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను.” (2రాజులు.23:24)

“గిబియోనులోని ఉన్నతస్థలముననున్న యెహోవా గుడారముమీదను అచ్చటి బలిపీఠముమీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహనబలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను.” (1ది.వృ.16:39-40)

మరియు మోషే యిచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడినదానినిబట్టి ఉత్సాహముతోను గానముతోను యెహోవాకు అర్పింపవలసిన దహనబలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించునట్లు, లేవీయులైన యాజకుల చేతిక్రింద నుండునట్టియు, యెహోవా మందిర మందు దావీదు పనులు పంచివేసినట్టియునైన యెహోవా మందిరపు కావలివారికి యెహోయాదా నిర్ణయించెను.” (2ది.వృ.23:18)

మరియు యెహోవాధర్మశాస్త్రమునందు వ్రాయబడియున్న విధినిబట్టి జరుగు ఉదయాస్తమయముల దహనబలులను విశ్రాంతిదినములకును అమావాస్యలకును నియా మకకాలములకును ఏర్పడియున్న దహనబలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలోనుండి రాజు ఒక భాగమును ఏర్పాటుచేసెను.” (2ది.వృ.31:3)

మీరు వెళ్లి దొరకిన యీ గ్రంథములోని మాటలవిషయమై నాకొరకును, ఇశ్రాయేలు యూదావారిలో శేషించి యున్నవారికొరకును యెహోవాయొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడియున్న సమస్తమును అనుసరింపకయు, యెహోవా ఆజ్ఞలను గైకొనకయు నుండిరి గనుక యెహోవా కోపము మనమీదికి అత్యధికముగా వచ్చియున్నది.” (2ది.వృ.34:21)

ఆలకించుడి, నేను ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడియున్న శాపములన్నిటిని రప్పించెదను.” (2ది.వృ.34:24)

పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి నేను యెహోవాను అనుసరించుచు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణమనస్సుతోను పూర్ణహృదయముతోను గైకొనుచు, ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనెను.” (2ది.వృ.34:31)

మోషే గ్రంథములో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశుమాంసమును యాజకులు తీసికొనిరి.” (2ది.వృ.35:12)     

యోజాదాకు కుమారుడైన యేషూవయును యాజకులైన అతని సంబంధులును షయల్తీ యేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులును లేచి, దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రము నందు వ్రాయబడిన ప్రకారముగా దహనబలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి.” (ఎజ్రా.3:2)

మరియు గ్రంథమునుబట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి,ఏ దినమునకు నియ మింపబడిన లెక్కచొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి.” (ఎజ్రా.3:4)

మరియు వారు యెరూష లేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానినిబట్టి తరగతులచొప్పున యాజకులను వరుసలచొప్పున లేవీయులను నిర్ణయించిరి.” (ఎజ్రా.6:18)

ఏడవ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై యుండిరి. అప్పుడు జనులందరును ఏక మనస్కులై, నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రగ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా యాజకుడైన ఎజ్రా యేడవ మాసము మొదటి దినమున చదువబడుదాని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి యెదుటను ఆ ధర్మశాస్త్రగ్రంథము తీసికొనివచ్చి…” (నెహెమ్యా.8:1-2)

యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా, ఏడవ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలెనని వ్రాయబడి యుండుటకనుగొనెను. మరియు వారు తమ పట్టణము లన్నిటిలోను యెరూషలేములోను ప్రకటనచేసి తెలియజేయవలసినదేమనగా మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను అడవి ఒలీవచెట్ల కొమ్మలను గొంజిచెట్ల కొమ్మలను ఈతచెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను.” (నెహెమ్యా.8:14-15)

మరియు మా పితరుల యింటి మర్యాదప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠముమీద దహింప జేయుటకు యాజకులలోను లేవీయులలోను జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లువేసికొని నిర్ణయించుకొంటిమి.” (నెహెమ్యా.10:34)

మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను, ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను, మన దేవుని మందిరములో సేవచేయు యాజకులయొద్దకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి.” (నెహెమ్యా.10:36)

“ఇశ్రాయేలీయులందరు నీ ధర్మశాస్త్రము నతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితివిు గనుకనేను శపించెదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసియున్నట్లు ఆ శాపమును మామీద కుమ్మరించితివి.” (దానియేలు.9:11)

మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడునడవడి మానక పోతివిు; నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనునట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనక పోతివిు.” (దానియేలు.9:13)

Permalink to single post

రక్తము – ప్రాయశ్చిత్తము

రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదు” (హెబ్రీ.9:22)

బైబిలు బోధలలో రక్తానికి [blood] మరియు ప్రాయశ్చిత్త [atonement] ప్రయత్నాలకు అవినాభావ సంబంధముంది. లేఖనాల బోధప్రకారము ప్రాయశ్చిత్తమన్నది ఎంతో విలువైనది, అందునుబట్టే ప్రాణాన్నే ఫణంగా పెడితె తప్ప ప్రాయశ్చిత్తానికి మార్గము లేదు అన్నది బైబిలు సూత్రము. ఈ సూత్రాన్ని ప్రతిబింబిస్తు పాత మరియు క్రొత్త నిబంధనా లేఖనాలు మానవుల పాపాలకు ప్రయశ్చిత్తమార్గాలను నిర్ధేశిస్తూ వాటి నెరవేర్పులను మరియు వాటి ఫలితాలను వివరిస్తున్నాయి.

ఈ కారణాన్నిబట్టి బైబిలు ప్రకటించే పాపక్షమాపణ మరియు నిత్యజీవాలను సరిగ్గా అర్థం చేసుకోవటానికై రక్తమునుగురించి మరియు ప్రాయశ్చిత్తమునుగురించి అలాగే వాటిమధ్యవున్న సంబంధాన్నిగురించి లోతుగా ధ్యానించాల్సిన ఆవశ్యకత వుంది.

కొందరు హెబ్రీపత్రిక 9:22 లోని “రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదు” అన్న క్రొత్తనిబంధన ప్రకటన “రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును” (లేవీయకాండము 17:11) అన్న పాతనిబంధన వచనానికి వివరణ లేక వ్యాఖ్యానము అంటూ అభిప్రాయపడుతుంటారు. నిజానికి అలాంటి అభిప్రాయాన్ని సమర్ధించే ఆధారాలేవి హెబ్రీ పత్రిక 9:22 లో లేవు.  

రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదు” అన్నది క్రొత్తనిబంధనలోని ప్రబోధం. అయితే యిది పాతనిబంధన కాలములో ఛాయారూపకంగా పాపపరిహారార్థము నిమిత్తము అర్పించబడిన రక్తబలుల యొక్క సమిష్టి నిజస్వరూపము క్రీస్తునందు నెరవేర్చబడటాన్ని సూచిస్తున్నది. ఇక్కడ “రక్తము చిందించబడుట” అన్న పదజాలము యొక్క భావము కేవలము రక్తాన్ని వొలికించడమని కాదు. రక్తము కారేవిధంగా శరీరాన్ని గాయపరచడమో లేక ఒక అంగాన్ని తెగనరకడమో కాదు. “రక్తము చిందించుట” అంటే “ప్రాణము తీయడము” అని భావము. 

నరుని రక్తమును చిందించువాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.” (ఆది.కాం.9:6)

రక్తము ప్రాణమునకు ఆధారము. మరో మాటలో చెప్పలంటే, రక్తమే ప్రాణము అని చెప్పవచ్చు. ఆ కారణాన్నిబట్టే “మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును” అంటూ ప్రభువైన దేవుడు నోవహు నిబంధనలో భాగంగా పేర్కొనడం జరిగింది. పై వాక్యములోని “నరుని రక్తము చిందించుట” అన్నది నరుని ప్రాణము తీయుటను సూచిస్తున్నది. 

సర్వసాధారణంగా నిబంధనలు రక్తం చిందించడముద్వారా అంటే ఒక ప్రాణిని బలి అర్పించడముద్వారా ప్రారంభమవుతాయి. క్రొత్తనిబంధన మరియు పాతనిబంధన రెండు నిబంధనలు కూడా బలులద్వారానే ప్రారంభించబడ్డాయి (ని.కాం.24:3-8; లూకా.26:26-28).

క్రొత్తనిబంధనా నియమాల ప్రకారము మానవాళికి పాపక్షమాపణను అందించడములో “రక్తము చిందించడము” యొక్క పాత్రను గ్రహించటానికి పాతనిబంధనా నియమాలలోని బలుల పాత్రను ధ్యానించి చూడాలి. 

దుర్బోధలు

నేటి ఆధునిక జుడాయిజములోని కొందరు రబ్బీలుగా చలామణి అవుతున్నవారు [రబ్బి డానియెల్ అసొర్, రబ్బి టోవియా సింగర్, రబ్బి బ్లూమెంతాల్ మొదలగువారు] అలాగే ఈనాటి యూదా మతప్రవిష్టులు క్రైస్తవ విశ్వాసాన్ని తిరస్కరించే ప్రయత్నములో క్రొత్తనిబంధనా బోధలను తప్పుబట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. తమ ప్రయత్నాలలో భాగంగా క్రొత్తనిబంధనా బోధలను అలాగే క్రైస్తవ విశ్వాసాలను వక్రీకరించడమేగాక పాతనిబంధనా బోధలనుకూడా చెరుపుతు దుర్బోధలకు పాల్పడుతున్నారు. వారు పాతనిబంధన గ్రంథములో మానవుల పాపాలకు ప్రయశ్చిత్తము జరిగించడములోని “రక్తము” యొక్క పాత్రకు సంబంధించి క్రింది దుర్బోధలకు పాల్పడుతున్నారు:

1) రక్తము/బలి ఒక్కటే ప్రాయశ్చిత్తానికి మార్గము కాదు [❌]
2) రక్తము/బలి కేవలము తెలియక చేసిన పాపాలకు మాత్రమే ప్రాయశ్చిత్తము చేయగలదు [❌]
3) రక్తము/బలి లేకుండానే పశ్చత్తాపహృదయములోనుండి వచ్చిన మాటలు పాపములకు క్షమాపణను అందించగలవు [❌]

పై బోధలు ఏరకంగా దైవలేఖనాలైన పాతనిబంధన లేఖనాలకు వ్యతిరేకమోనన్నది కూలంకశంగా పరిశీలించెందుకు ముందు అవి పురాతన రబ్బీలు వ్రాసిపెట్టిన తాల్ముదు గ్రంథాలకుకూడా వ్యతిరేకమైన బోధలన్నది క్రింది ఆధారాలు నిరూపిస్తున్నాయి:

“ప్రాయశ్చిత్తము అన్నది కేవలము రక్తముద్వారానే సంభవిస్తుంది.” [తాల్ముద్ ట్రాక్టేట్ జెవాహిం 6అ]

“…ప్రాయశ్చిత్తము రక్తముద్వారానేకదా వచ్చేది?” [ట్రాక్టేట్ యొమ 5అ]

మోషేధర్మశాస్త్రములో ప్రాయశ్చిత్తార్థ బలులు   

పాతనిబంధనా నియమాలతోకూడిన మోషేధర్మశాస్త్రములో ఆజ్ఙాతిక్రమాలనుండి, అపరాధాలనుండి లేక పాపాలనుండి పవిత్రపరచబడటానికి, క్షమాపణ పొందటానికి, మరియు ప్రాయశ్చిత్తం జరిపించబడటానికి మూడు రకాల బలులు నిర్ధేశించబడ్డాయి:

– దహన [עוֹלָה֙/ఒలా] బలులు (లే.కాం.1:4; యోబు.1:5; 42:8)
– పాపపరిహారార్థ [חַטָּאָה/ఖట్’టాహ్] బలులు (లే.కాం.4:3; 5:6-7,8-9)
– అపరాధపరిహారార్థ [אָשָׁם/ఆషాం] బలులు (లే.కాం.5:6-7,18-19; 6:6-7).

అదేసందర్భములో ఆ యా బలులను అర్పించాల్సిన విధానాలను గురించి కూడా విస్పష్టమైన సూచనలు యివ్వబడ్డాయి (లే.కాం.1-7 అధ్యాయాలు; సం.కాం.5,15 అధ్యాయాలు). మోషేధర్మశాస్త్రము ప్రకారము ప్రాయశ్చిత్తార్థబలులు రెండు దఫాలుగా అర్పించబడేవి. మొదట సమాజమంతటి ప్రాయశ్చిత్తార్థము బలులర్పించబడేవి. అటుతరువాత వ్యక్తిగత ప్రాయశ్చిత్తార్థము కొరకుకూడా బలులర్పించబడేవి.     

సమాజ బలులు

సమాజము తరపున అర్పించబడే బలులలో ప్రతిదినము ఉదయము ఒక బలి మరియు సాయంకాలము ఒక బలి దహనబలిగా అర్పించడేవి (ని.కాం.29:38-42; సం.కాం.28:3-8; 1దిన.వృ.16:40). ఈ సందర్భంగా బలిపీఠముపై అన్నివేళలలో నిత్యము దహనబలులను దహిస్తూ అగ్ని మండుచు వుండేది అన్న సత్యాన్ని జ్ఙాపకముంచుకోవాలి (లే.కాం.6:12-13)

తెలియక చేసిన పాపముల నిమిత్తం సమాజమంతా ప్రాయశ్చిత్తార్థ బలులను అర్పిస్తూ వుండాలి. తెలియకచేసిన పాపము తెలియపరచబడిన సందర్భములో సమాజము బలినర్పించాలి (లేవీ.4:13-21). ఇవిగాక, సంవత్సరానికి ఒకసారి ప్రధానయాజకుడు తనకు, తన కుటుంభముకు మరియు సమాజమంతటికి సమస్త పాపములనుండి అంటే, బలులు నిర్ధేశించబడిన పాపాలన్నింటికి లేక బలులు నిర్ధేశించబడిన తెలిసితెలియక చేసిన పాపాలన్నింటికి ప్రాయశ్చిత్తము కలుగుటకై బలినర్పించాలి (ని.కాం.30:10; లే.కాం.16:1-34).

ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులుగాని మీ మధ్యనుండు పరదేశులుగాని మీరందరు ఏడవనెల పదియవ నాడు ఏ పనియైనను చేయక మిమ్మును మీరు దుఃఖపరచు కొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపములనుండి [חַטָּאָה/ఖట్’టాహ్]పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను…మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. ​సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములనుబట్టి [חַטָּאָה/ఖట్’టాహ్] వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను.” (లే.కాం.16:29-34)

వ్యక్తిగత బలులు

వ్యక్తిగత ప్రాయశ్చిత్తార్థము అర్పించబడే బలులలో సమాజములోని ఒక వ్యక్తి తెలియక చేసిన పాపాల నిమిత్తం బలులర్పించబడేవి.

వ్యక్తిగత ప్రాయశ్చిత్తార్థము అర్పించబడే బలులలో భాగంగా సమాజములోని వ్యక్తులు వ్యక్తిగతంగా తాము తెలియక చేసిన పాపాలనుగురించి తెలుసుకున్నప్పుడు ప్రతివ్యక్తి తన స్వంత పాపాల నిమిత్తం బలులర్పించాలంటూ లేఖనాలు స్పష్టముగా సూచించాయి (లేవి.కాం.4:1-12; 5:1-19).

అయితే, ఈ సందర్భంగా యివ్వబడిన సూచనలలో ప్రాయశ్చిత్తార్థము బలిపషువును లేక బలిపక్షిని అర్పించే స్తోమత/ఆర్థిక పరిస్థితి లేని పేదవారి కొరకు యివ్వబడిన ప్రత్యేకమైన వెసళుబాటు వివరాలను మరియు సందర్భాన్ని సరిగ్గా అవగాహన చేసుకోలేక వాక్యసత్యాన్ని వక్రీకరిస్తూ “రక్తము/బలి ఒక్కటే ప్రాయశ్చిత్తానికి మార్గము కాదు” అనే వాక్యవ్యతిరేకమైన బోధను [దుర్బోధ] అబద్దబోధకులు ప్రవేశపెట్టారు.

లేవీయకాండములోని 5వ అధ్యాయములో పాపాల ప్రాయశ్చిత్తార్థము పేదవారి కొరకు యివ్వబడిన ప్రత్యేకమైన వెసళుబాటు వివరాలను మరియు సందర్భాన్ని పరిశీలించి చూద్దాము:

ఒకడు ఒట్టుపెట్టుకొనినవాడై తాను చూచినదాని గూర్చిగాని తనకు తెలిసినదానిగూర్చిగాని సాక్షియై యుండి దాని తెలియచేయక పాపము చేసినయెడల అతడు తన దోషశిక్షను భరించును. ​మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టినయెడల, అది అపవిత్రమృగ కళేబరమేగాని అపవిత్రపశు కళేబరమేగాని అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబరమేగాని అది అపవిత్రమని తనకు తెలియక పోయినను అతడు అపవిత్రుడై అపరాధి యగును. మనుష్యులకు తగులు అపవిత్రతలలో ఏదైనను ఒకనికి తెలియకుండ అంటినయెడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగినయెడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి యగును. మరియు కీడైనను మేలైనను, మనుష్యులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసెదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసెదనని యొకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనిన యెడల, అది తెలిసిన తరువాత వాడు అపరాధియగును. కాబట్టి అతడు వాటిలో ఏవిషయమందైనను అపరాధియగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాపవిషయమై యెహోవా సన్నిధికి మందలోనుండి ఆడు గొఱ్ఱపిల్లనేగాని ఆడు మేకపిల్లనే గాని పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయ శ్చిత్తము చేయును. అతడు గొఱ్ఱపిల్లను తేజాలని యెడల, అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని పాపపరిహారార్థబలిగా ఒకదానిని దహనబలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను. అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తరు వాత అతడు పాపపరిహారార్థమైనదానిని మొదట నర్పించి, దాని మెడనుండి దాని తలను నులమవలెను గాని దాని నూడదీయకూడదు. అతడు పాపపరిహారార్థబలి పశురక్త ములో కొంచెము బలిపీఠము ప్రక్కను ప్రోక్షింపవలెను. దాని రక్తశేషమును బలిపీఠము అడుగున పిండవలెను. అది పాపపరిహారార్థబలి. విధిచొప్పున రెండవదానిని దహనబలిగా అర్పింపవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. రెండు తెల్ల గువ్వలైనను రెండు పావురపు పిల్లలైనను తనకు దొరకనియెడల పాపముచేసినవాడు తూమెడు గోధుమపిండిలో పదియవవంతును పాపపరిహారార్థబలి రూపముగా తేవలెను. అది పాప పరిహారార్థబలి గనుక దానిమీద నూనెపోయవలదు. సాంబ్రాణి దానిమీద ఉంచవలదు. అతడు యాజకునియొద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమద్రవ్యముల రీతిగా బలిపీఠముమీద దానిని దహింపవలెను. అది పాపపరిహారార్థబలి. పై చెప్పినవాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్య శేషమువలె యాజకునిదగును.” (లేవి.కాం.5:1-13)

పై లేఖనాల వెలుగులో గమనించాల్సిన అంశాలు:

1) ప్రాయశ్చిత్తానికి రక్తము/బలి కాకుండా వేరే మార్గాలున్నాయి అంటూ లేఖనాలు ఎక్కడా ప్రకటించడము లేదు.

2) గొధుమపిండి వలన ప్రాయశ్చిత్తము కలుగుతుంది తద్వారా క్షమాపణ పొందవచ్చు అంటూ కూడా లేఖనాలు ఎక్కడా బోధించడము లేదు.

3) ప్రాయశ్చిత్తము చేయబడుటకు అర్పించాల్సిన బలుల విశయములో సమాజములోని కొందరికి [అందరికి కాదు] ఒక వెసళుబాటు యివ్వబడింది. అది, జంతుబలి లేక పక్షిబలి యివ్వలేని పక్షములో సదరు వ్యక్తి ఆ బలి స్థానములో గోధుమపిండిని అర్పించవచ్చు.

4) జంతుబలి/పక్షిబలి స్థానములో గోధుమపిండిని అర్పించవచ్చు అనే వెసళుబాటు అన్నది తెలిసిచేసిన పాపాలవిశయములో కాదు, అది కేవలము తెలియకచేసిన పాపాలవిశయములోనే యివ్వబడింది.

5) గొధుమపిండి వెసళుబాటు తెలియకచేసిన పాపాలలోని కేవలము మూడు పాపాలవిశయములోనే యివ్వబడింది. అది తెలియక చేసిన అన్ని పాపాల విశయములో వర్తించదు.

6) జంతుబలి స్థానములో స్తోమతలేనివారు తమ పాపాల ప్రాయశ్చిత్తముకొరకై గోధుమపిండి అర్పించినా అది అదివరకే సమాజములోని అందరి నిమిత్తము అర్పించబడి దహించబడుతున్న ఉదయకాలపు దహనబలితో కలిసి దహించబడుతుంది (ని.కాం.29:38-42; సం.కాం.28:3-8; 1దిన.వృ.16:40).
కనుక, జంతుబలిని/పక్షిబలిని అర్పించలేని వ్యక్తి కేవలము గోధుమపిండిని అర్పించినా అది దేవుని సన్నిధిలో దహనబలిగా అర్పించబడిన జంతుబలితో కలిసి దహించబడటాన్నిబట్టి దేవుని దృష్టికి జంతుబలిగా అంగీకరించబడుతుంది అన్నది సుస్పష్టం. ఆకారణాన్నిబట్టే ప్రాయశ్చిత్తము సాధ్యపడుతుంది. ఈ సందర్భములో అర్పించబడిన గోధుమపిండి కేవలము పిండిగానే బలిపీఠముపై దహించబడదు అన్నది గమనములో వుంచుకోవాలి.

పై లేఖనాధారమైన కారణాలనుబట్టి, “రక్తము/బలి ఒక్కటే ప్రాయశ్చిత్తానికి మార్గము కాదు” అన్న రబ్బీల బోధ/వాదన లేఖనాలకు విరుధమైన అబద్దబోధ లేక దుర్బోధ అన్నది నిరూపితమవుతున్నది.

ఇక, వ్యక్తిగత బలుల విశయములో తెలిసి చేసిన పాపాలనిమిత్తంకూడా ప్రత్యేకమైన బలులర్పించడాలి అన్నది మోషేధర్మశాస్త్రము యొక్క విస్పష్టమైన బోధ (లేవీ.కాం.6:1-7; సం.కాం.5:6-7). 

ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహముచేసి పాపియైన [חָטָא/ఖాటా] యెడల…​అతడు పాపముచేసి [חָטָא/ఖాటా] అపరాధి యగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మునుగూర్చి గాని బలాత్కారముచేతను అపహరించినదానిగూర్చిగాని తనకు అప్పగింపబడినదానిగూర్చిగాని, పోయి తనకు దొరి కినదానిగూర్చిగాని, దేనిగూర్చియైతే తాను అబద్ధప్రమాణము చేసెనో దానినంతయు మరల ఇచ్చుకొనవలెను. ఆ మూలధనము నిచ్చుకొని, దానితో దానిలో అయిదవ వంతును తాను అపరాధ [אַשְׁמָה/అష్మా] పరిహారార్థబలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకునియొద్దకు తీసికొని రావలెను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి యగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును.” (లేవీ.కాం.6:1-7) 

పురుషుడుగాని స్త్రీగాని యెహోవామీద తిరుగబడి మనుష్యులు చేయు పాపములలో [חַטָּאָה/ఖట్’టాహ్] దేనినైనను చేసి అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపమును [חַטָּאָה/ఖట్’టాహ్]ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధమువలని నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో అయిదవవంతు దానితో కలిపి యెవనికి విరోధముగా ఆ అపరాధము చేసిరో వానికిచ్చుకొనవలెను. ఆ అపరాధ నష్టమును తీసికొనుటకు ఆ మనుష్యునికి రక్తసంబంధి లేని యెడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును యాజకుని వగును.” (సం.కాం.5:6-7)

పై లేఖనాధారాలు, “రక్తము/బలి కేవలము తెలియక చేసిన పాపాలకు మాత్రమే ప్రాయశ్చిత్తము చేయగలదు” అన్న ఆధునిక రబ్బీల బోధ/వాదన లేఖనవిరుద్దమైన అబద్ధబోధ లేక దుర్బోధ అన్న సత్యానికి తిరిగులేని సాక్ష్యాలు!

ఇప్పుడు, రబ్బీలు చేస్తున్న మూడవ దుర్బోధ విశయములో లేఖనాలను పరిశీలించి చూద్దాము.

“రక్తము/బలి లేకుండానే పశ్చత్తాపహృదయములోనుండి వచ్చిన మాటలు పాపములకు క్షమాపణను అందించగలవు” అనే తమ బోధను సమర్ధించుకునేందుకు రబ్బీలు పేర్కొనే ఐదు పాతనిబంధన [తనాక్] లేఖన భాగాలను మరియు అవి వారి బోధలను ఏవిధంగా వ్యతిరేకిస్తున్నాయోనన్నది పరిశీలించి చూద్దాము.

మొదటి లేఖన భాగం

“ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవుకావు కోరినయెడల నేను అర్పించుదును దహనబలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.” (కీర్తన.51:15-17)

51వ కీర్తన యొక్క సందర్భము: దావీదు బత్షేబతో వ్యభిచారము చేసి ఆమె భర్త అయిన ఊరియాను యుద్దములో పథకము ప్రకారం చంపించిన తరువాత నాతాను ప్రవక్త వచ్చి దావీదుకు దేవుని శిక్షను ప్రక్తటించాడు (2సాముయేలు.11:1-12:14). ఆ సందర్భములో దావీదు దేవుని ఎదుట తన స్వంత పతనావస్థనుబట్టి రచించిన కీర్తన.

పై లేఖనాల వెలుగులో గమనించగలిగే సత్యాలు:

  1. దావీదు బత్షేబ విశయములో మోషేనిబంధనలోని పది ఆజ్ఙలలో మూడు ఆజ్ఙలను మీరి పాపము చేసాడు–పొరుగువాని భార్యను ఆశించాడు, వ్యభిచరించాడు, మరియు నరహత్య చేసాడు.
  2. దావీదు చేసిన మూడు పాపాలలో రెండింటికి అంటే వ్యభిచారానికి మరియు నరహత్యకు ప్రాయశ్చిత్తబలులేవి ధర్మశాస్త్రము సూచించలేదు.
  3. దావిదు తాను విరచించిన కీర్తనలో “రక్తాపరాధమునుండి నన్ను విడిపింపుము” (కీర్తన.51:14) అంటూ తాను చేసిన నరహత్య పాపమునుండి విడిపించమంటూ దేవున్ని వేడుకున్నాడు.
  4. ధర్మశాస్త్రమంతటిలో దేవుడు నరహత్య పాపానికి ప్రాయశ్చిత్తముగా ఎలాంటి బలిని కోరలేదు నిర్దేశించనూలేదు. అంటే అలాంటి పాపానికి మానవులర్పించగలిగిన యేజంతుబలి సరిపోదు. అదే సత్యాన్ని దావీదు జ్ఙాపకం చేసుకుంటూ విరిగినలిగిన హృదయాన్నే దేవుని ముందు పెడుతూ తన పాపానికి క్షమాపణను కోరుతున్నాడు.
  5. నరహత్య చేసిన వ్యక్తిగా దావీదు అర్పించే బలులు/దహనబలులు దేవుని యిష్టమైనవి కావు.
  6. తాను చేసిన పాపాల తీవ్రతనుబట్టి తనలాంటి వ్యక్తి అర్పించే బలిని దేవుడు కోరేవాడు కాదు అలాగే తనలాంటి వ్యక్తి అర్పించే దహనబలి దేవునికి ఇష్టమైనది కాదు అన్నది దావీదు వ్యక్తపరుస్తున్నాడు (కీర్తన. 51:16). అంతేగాని, దేవుడు అసలు బలులనే యిష్టపడనివాడు అని కాదు.
  7. తనను తన పాపమునుండి విడిపించినతరువాత “అప్పుడు నీతియుక్తములైన బలులును దహనబలులును సర్వాంగ హోమములును నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠముమీద కోడెలనర్పించెదరు” (కీర్తన.51:19) అంటూ అదే కీర్తనలో దావీదు బలులు దేవునికి ఎప్పుడు అంగీకారముగా వుంటాయో ప్రకటిస్తున్నాడు.
  8. పాతనిబంధన లేఖనాలలోని బోధ ప్రకారము దేవున్ని ప్రేమించి ఆయనకు లోబడి అటుతరువాత పశ్చత్తాపహృదయముతో బలులను అర్పిస్తే అవి దేవునికి అంగీకారమవుతాయి. అలా కాకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ పాపములోనే కొనసాగుతూ హృదయశుద్ధిలేకుండా బలులర్పిస్తే అవి ఆయనకు అంగీకారము కాదు. ఈ లేఖన సత్యాన్ని యితర ప్రవక్తలుకూడా అనేక పర్యాయాలు వ్యక్తపరచడము జరిగింది (యెషయా.1:11-17; యిర్మీయా.6:19-20; హోషేయ.6:6-8; ఆమోసు.5:21-24).

రెండవ లేఖన భాగం

ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవాతట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటిని పరిహరింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.” (హోషేయ.14:1-2)

హోషేయ.14:1-2 యొక్క సందర్భము: ప్రవక్త అయిన హోషేయ ఉత్తరరాజ్యమైన ఇశ్రాయేలుకు చెందినవాడు. ఉత్తరరాజ్యం ఇశ్రాయేలు 722 క్రీ.పూ. అష్షూరీయులచేత చెరపట్టబడి కొనిపోబడటానికి ముందు హోషేయ గ్రంథములోని లేఖనపలుకులు యివ్వబడ్డాయి. ఆ సమయానికి దక్షిణరాజ్యం యూదాకుడా చెరపట్టబడలేదు, యెరూషలేములో దేవుని మందిరము నిలిచే వుంది. అక్కడ ధర్మశాస్త్రప్రకారము బలులు అర్పించబడుతూనే వున్నాయి. అయినా ఉత్తరరాజ్యవాసులైన తొమ్మిది గోత్రాల ఇశ్రాయేలీయులు తమ పాపాలలోనే కొనసాగుతూ గిలాదులో ఎడ్లను బలిగా అర్పిస్తుండేవారు (హోషేయ.12:11).

పై లేఖనాల వెలుగులో క్రింది విషయాలను గ్రహించగలము:

  1. ఉత్తరరాజ్య వాసులు దేవునికి విరుద్ధంగా పాపాలు చేస్తూ వాటిలోనే కొనసాగుతున్నారు.
  2. అయినా వారు ఎడ్లను బలిగా అర్పిస్తూ దేవుని సహాయాన్ని ఎదురుచూసారు
  3. ఆలాంటి పరిస్థితిలో జీవిస్తున్న ఉత్తరదేశవాసులను దేవుడు హోషేయ ప్రవక్తద్వారా హెచ్చరిస్తున్నాడు. వారు మొదట దేవునితట్టు తిరగాలి, తరువాత మాటలు సిద్ధపరచుకొని దేవుని యొద్దకు రావాలి. వారు గిలాదులో ఎడ్లను అర్పించడము కాదు, తమ స్వంత పెదాలను దేవునికి అర్పించాలి. వాటి ఫలమే ఎడ్లను బలిగా అర్పించటములాంటిది.
  4. అప్పుడు దేవుడు వారిని విశ్వాసఘాతకులు కాకుండా గుణపరుస్తాను అని మాటయిస్తున్నాడు (హోషేయ.14:4). దీనిభావం వారు యెరూషలేములో బలులను అర్పించంకుండానే దేవుడు వారి పాపాలను క్షమించి వారిని నీతిమంతులుగా తీరుస్తాడని కాదు. నిజానికి వారు ప్రవక్త మాటలకు లోబడితే వారిని గుణపరచి అవిశ్వాసమునుండి వారిని విడిపించి వారు దేవుని సన్నిధిలో ఆయనకు అంగీకారమయ్యే బలులను అర్పించే వారిగా వారిని మారుస్తాడన్నది దేవుని వాగ్ధానము. అంతేగాని, ఆసమయానికి బలులు నిశేధించబడ్డాయనిగాని లేక బలులు లేకుండానే ఇశ్రాయేలీయులను దేవుడు క్షమించబోతున్నాడనిగాని దాని భావము కాదు.

మూడవ లేఖన భాగం

ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసి కొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.” (దానియేలు.6:10)

ఈ లేఖన సత్యాన్ని గ్రహించటానికి గమనములో వుంచుకోవలసిన అంశాలు:

  1. పై లేఖనము మోషేధర్మశాస్త్ర కాలములో యూదులు బబులోను చెరలో జీవిస్తున్న సమయములోని సంఘటనను గురించి వివరిస్తున్నది.
  2. పై లేఖనభాగము ప్రభువైన దేవుడు యేర్పరచుకున్న ఒక ప్రవక్తను [దానియేలు] గురించినది.
  3. పై లేఖనము చెరలోవున్న ఒక యూదు ప్రవక్త యొక్క ప్రార్థన మరియు ఆరాధనను వివరిస్తున్నది.
  4. పై లేఖనము పాపాలను గురించిగాని లేక పాపప్రాయశ్చిత్తాలను గురించిగాని వివరించడము లేదు.
  5. పై లేఖన మాదిరి అన్యులకు వర్తించేది కాదు. అంతమాత్రమేగాక చెరలో జీవించని యూదులకుకూడా ఈ లేఖనములోని మాదిరి వర్తించదు.

కాబట్టి పై వాస్తవాల వెలుగులో పాతనిబంధనా గ్రంథము [తనాఖ్] ప్రకారము కూడా రక్తము చిందించబడకుండానే అంటే బలియాగము లేకుండానే ప్రాయశ్చిత్తము సంభవము అంటూ బోధిస్తున్న ఆధునిక రబ్బీల దుర్బోధ వారి స్వంత బోధే కాని లేఖనాధారమైనది కాదు అన్నది మరోసారి సుస్పష్టమవుతున్నది.

నాలుగవ లేఖన భాగం

యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణ మంతదూరము సంచరించుచు ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటనచేయగా నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి…ఈ నీనెవెవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను.” (యోనా.3:4-5…10)

మోషేధర్మశాస్త్ర కాలానికి చెందిన సంఘటనను వివరిస్తున్న పై లేఖన భాగము పాతనిబంధన కాలములోకూడా ప్రభువైన దేవుడు అన్యజనులను పాలిస్తూ, పోశిస్తూ, ప్రేమించే దేవుడని నిరూపిస్తున్నది. దీన్ని బట్టి అన్యజనులుకూడా ప్రభువైన దేవుని దృష్టిపథములో వున్నారు అన్నది స్పష్టమవుతున్నది.

పైలేఖన భాగము మోషేధర్మశాస్త్రాన్ని మరియు ప్రవక్తల గ్రంథాలను అందుకున్న (రోమా.9:4-5) దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను గురించికాదు, అవేవీ యివ్వబడని అన్యజనులను గురించినది. మోషేధర్మశాస్త్రము మరియు ప్రవక్తల గ్రంథాలు అందుకోని అన్యజనులు (కీర్తన.147:19-20) ఇశ్రాయేలీయుల వలె గాక దేవునియందు విశ్వాసముంచి తమ్ముతాము తగ్గించుకొని చెడునడతలను మానుకొనడముద్వారా దేవునికి ఇష్టులుగా మారవచ్చు అన్నది పై లేఖనాల బోధగా గ్రహించవచ్చు. ఇది అన్యజనులకు ఇవ్వబడిన విధానము, ఇశ్రాయేలీయులకు యివ్వబడినది కాదు.

ఈ లేఖనము అన్యజనులైన నినెవె పట్టణస్తులు మారుమనస్సు పశ్చత్తాపము పొందడాన్ని బట్టి దేవుడు వారిని క్షమించి వారిపై కుమ్మరించబోతున్న తన ఉగ్రతను ఆపేశాడు అన్న సత్యాన్ని ప్రకటిస్తున్నది. దేవుని ఎదుట అన్యులైన వారి మారిన జీవితము, వ్యక్తపరచిన విశ్వాసము, ప్రదర్శించిన తగ్గింపుస్వభావము అన్నవి వారిని దేవుని శిక్షనుండి తప్పించాయి. అయితే, దీనినిబట్టి వారి పాపాలన్నీ క్షమించబడి నీతిమంతులుగా తీర్చబడ్డారని తద్వారా వారికి నిత్యజీవము లభించబోతున్నదనిగాని లేక వారు దేవుని ప్రజలుగా మారి వాగ్ధానాలన్నింటికి వారసులయ్యారని కాదు.

దేవునినుండి మానవులను వేరుచేసే పాపాలకు ప్రాయశ్చిత్తము రక్తం చిందించబడటముద్వారా అంటే బలియాగముద్వారానే సంభవం అన్నది లేఖన బోధ. ఆ బోధకు వ్యతిరేకమైన సందేశమేది యోనా గ్రంథములో లేదు.

దేవుని ప్రజలుగా ప్రత్యేకపరచబడి దేవునిచేత వాగ్ధానాలు నిబంధనలు చేయబడిన ఇశ్రాయేలు ప్రజల విశయానికొస్తే వారు మోషేధర్మశాస్త్ర బద్ధంగా అలాగే ప్రవక్తల గ్రంథాల బోధలప్రకారం జీవిస్తూ అందులో సూచించబడిన బలులను అర్పించడముద్వారా పాపక్షమాపణ మరియు ప్రాయశ్చిత్తము పొందగలరు. ఇది బైబిలు బోధ. దీనికి విరుద్దమైన బోధ దుర్బోధ.

ఐదవ లేఖన భాగము

నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించునట్లు నా నామము అక్కడ ఉండునని యే స్థలమునుగూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన యీ మందిరముతట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి యుండునుగాక. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్ల, నీ నివాసస్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము; వినునప్పుడెల్ల మమ్మును క్షమించుము…మరియు ఇశ్రాయేలీయులగు నీ జనులు నీకు విరోధముగా పాపముచేయుటచేత తమ శత్రువులయెదుట మొత్తబడినప్పుడు, వారు నీతట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని యీ మందిరమందు నిన్నుగూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్ల నీవు ఆకాశమందు విని, ఇశ్రాయేలీయులగు నీ జనులు చేసిన పాపమును క్షమించి, వారి పితరులకు నీవిచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించుము.” (1రాజులు.8:29-34)

ప్రభువైన దేవుడు కోరుకున్న స్థలములో అంటే యెరూషలేములో క్రీస్తుపూర్వము పదవ శతాబ్ధములో అద్భుతమైన అతిసుందరమైన దేవాలయాన్ని కట్టడం పూర్తిచేసిన తరువాత ఆ దేవాలయాన్ని ప్రతిష్టించిన సందర్భములో రాజైన సొలోమోను ఒక సుధీర్ఘ ప్రార్థన చేసాడు. ఆ ప్రార్థనలోని కొంత భాగమే పై లేఖనాలలోని సొలోమోను పలికిన మాటలు.

సొలోమోను చేసిన మందిరప్రతిష్ట ప్రార్థనలోని పై మాటలను పేర్కొంటూ కొందరు రబ్బీలు ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నారు:
దేవుడు అంగీకరించిన సొలోమోను ప్రార్థనలొ ఇశ్రాయేలీయులు పాపము చేసిన సందర్భాలలో చేయాల్సింది బలులను అర్పించటము కాదుగాని వారు తమ పాపాలవిశయములో పశ్చత్తాపపడి దేవునివైపుకు తిరిగి ప్రార్థించిన సందర్భములో వారికి క్షమాపణ మరియు విమోచన లభించాలి అన్నది సొలోమోను యొక్క ప్రార్థన భావం. సొలోమోను చేసిన ప్రార్థనలో పాపాలకు క్షమాపణ ప్రార్థనద్వారా కలుగాలని ఆయన ప్రభువైన దేవునికి విజ్ఙాపణ చేసాడు. ప్రభువైన దేవుడు ఆ ప్రార్థనను విని అంగీకరించాడు. సొలోమోను ప్రార్థన అంతటిలో క్షమాపణకొరకు బలులను అర్పించాలి అని ఒక్కసారికూడా సూచించబడలేదు. కనుక, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు పాపము చేసిన సందర్భాలలో వారు పశ్చత్తాపపడి తమ దేవునివైపుకు తిరిగి ప్రార్థించినప్పుడు దేవుడు వారికి క్షమాపణను అనుగ్రహిస్తాడు. మానవుల పాపాలు దేవుని ఎదుట క్షమించబడటానికి కావలసింది బలులు లేక రక్తం కాదు కావలసింది, పశ్చత్తాప హృదయం మరియు ప్రార్థన.

క్రింద పేర్కొనబడినట్లుగా ప్రభువైన దేవుడు సొలోమోను ప్రార్థనను అంగీకరించిన సందర్భాన్ని అలాగే ఆ ప్రార్థనలోని కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను గమనములో వుంచుకోవాలి:

(1) ఇశ్రాయేలీయుల పక్షంగా వారి క్షమాపణ నిమిత్తము దేవుడు అంగీకరించగలిగిన ప్రార్థనను రాజైన సొలోమోను చేయకముందు జరిగిన విశయం:
రాజైన సొలొమోనును అతనియొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలీయులగు సమాజకులందరును మందసము ముందర నిలువబడి, లెక్కింప శక్యముగాని గొఱ్ఱలను ఎడ్లను బలిగా అర్పించిరి.” (1రాజులు.8:5)

(2) రాజైన సొలోమోను ప్రార్థన చేయటము ముగించినతరువాత జరిగిన విశయము:
అంతట రాజును, అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా ​ఇరువది రెండువేల యెడ్లను, లక్ష యిరువదివేల గొఱ్ఱలను సొలొమోను సమాధానబలులగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలీయులందరును యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ​ఆ దినమున యెహోవా సముఖమందున్న యిత్తడి బలిపీఠముఆ దహనబలులను నైవేద్యములను సమాధానబలి పశువుల క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను గనుక రాజు యెహోవా మందిరము ముందరనున్న ఆవరణము మధ్యనుండు స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను నైవేద్యములను సమాధానబలి పశువుల క్రొవ్వును అర్పించెను.” (1రాజులు.8:62-64)

(3) దేవుడు స్వీకరించిన ప్రార్థన వర్తించే సమయము: సొలోమోను ప్రార్థనను బట్టి మందిరము వున్న సమయములో అంతమాత్రమేగాక ఆ మందిరమునందు లేక మందిరములో ప్రార్థనలు విన్నపములు జరిగే సమయములో…
మరియు ఇశ్రాయేలీయులగు నీ జనులు నీకు విరోధముగా పాపముచేయుటచేత తమ శత్రువులయెదుట మొత్తబడి నప్పుడు, వారు నీతట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని యీ మందిరమందు నిన్నుగూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్ల నీవు ఆకాశమందు విని, ఇశ్రాయేలీయులగు నీ జనులు చేసిన పాపమును క్షమించి, వారి పితరులకు నీవిచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించుము.” (1రాజులు.8:33-34)

(4) బలులను అర్పించే విశయము పేర్కొనకుండానే సొలోమోను దేవుని ప్రజలు దేవుని మందిరము వైపు తిరిగి ప్రార్థిస్తే క్షమించాలని దేవున్ని ప్రార్థించాడు, “పాపము చేయనివాడు ఒకడును లేడు, వారు నీకు విరోధముగా పాపము చేసినయెడల నేమి, నీవు వారిమీద కోపగించుకొని వారిని శత్రువులచేతికి అప్పగించినయెడలనేమి, వారు వీరిని దూరమైనట్టి గాని దగ్గరయైనట్టి గాని ఆ శత్రువుల దేశములోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొనిమేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసితిమని చెప్పి, తమ్మును చెరగా కొనిపోయిన వారిదేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసినయెడల తమ్మును చెరగా కొని పోయిన వారియొక్క దేశమందు పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను వారు నీ తట్టు తిరిగి, నీవు వారి పితరులకు దయచేసిన దేశముతట్టును నీవు కోరుకొనిన పట్టణము తట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరముతట్టును నిన్నుగూర్చి ప్రార్థనచేసిన యెడల ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి ​నీకు విరోధముగా పాపముచేసిన నీ జనులు ఏ తప్పులచేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి, వారిని చెరలోనికి కొనిపోయినవారు వారిని కనికరించునట్లు వారియెడల కని కరము పుట్టించుము.” (1రాజులు.8:46-50)

(5) సొలోమోను చేసిన ప్రార్థనను బట్టి ప్రభువైన దేవుడు సొలోమోను కట్టించిన మందిరాన్ని “బలులర్పించు మందిరముగా” కోరుకున్నాడు. అందునుబట్టే ఆ మందిరములో సదా బలులర్పించబడేవి. ఆ విధంగా ఉదయసాయంకాలాలలో అర్పించబడే విస్తారమైన బలులనుబట్టే దేవుడు ఆ మందిరములో చేయబడే ప్రార్థనలకు చెవియొగ్గి తన ప్రజలను క్షమిస్తాను అంటు మాటియిచ్చాడు. అంతేగాక, సొలోమోను చేసిన ప్రార్థనలోని కేవలము కొన్ని అంశాలనుమాత్రమే నిర్ధారిస్తూ తన ఆమోదాన్ని తెలియచేసాడు. అందులో కొన్ని ఈ క్రింది లేఖనాలలో పేర్కొనబడ్డాయి:
అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెనునేను నీ విన్నపము నంగీకరించి యీ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని…నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనమీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును…అయితే మీరు త్రోవ తప్పి, నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడచి, యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమ స్కారములు చేసిన యెడల ​నేను మీకిచ్చిన నా దేశ ములోనుండి మిమ్మును పెల్లగించి, నా నామమునకు నేను పరిశుద్ధపరచిన యీ మందిరమును నా సన్నిధినుండి తీసివేసి, సమస్త జనములలో దానిని సామెత కాస్పదముగాను నిందకాస్పదముగాను చేయుదును. అప్పుడు ప్రఖ్యాతి నొందిన యీ మందిరమార్గమున పోవు ప్రయాణస్థులందరును విస్మయమొంది యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసెనని యడుగగా జనులుఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశమునుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించెనని ప్రత్యుత్తరమిచ్చెదరు.” (2దిన.వృ.7:12-22)

ఈ సందర్భములో ప్రాముఖ్యమైనవిగా లేక్కించబడే పైన పేర్కొనబడిన ఐదు అంశాల వెలుగులో గ్రహించగలిగిన వాస్తవాలు:

సొలోమోను ప్రార్థనను ప్రభువైన దేవుడు అంగీకరించకముందు విస్తారమైన బలులను అర్పించటము జరిగింది. ఆ బలుల ఆధారంగానే దేవుడు ఆయన ప్రార్థనను అంగీకరించి సొలోమోను కట్టించిన మందిరాన్ని “తనకు బలులను అర్పించే మందిరముగా” నిర్ధారించాడు. ఈ కారణముచేత ఈ మందిరములో అర్పించబడే బలులనుబట్టే ఈ మందిరములో చేయబడే ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తాడు. అయితే, ఈసందర్భముగా సొలోమోను చేసిన ప్రార్థనలోని అన్ని విన్నపాలనుగాక కేవలము కొన్నింటిని మాత్రమే దేవుడు అంగీకరించాడు.

ప్రభువైన దేవుడు అంగీకరించిన అంశాలలో తన ప్రజలు తమ పాపాలను బట్టి పరాయి చెరలో వుంటూ పశ్చత్తాపపడి దేవుని వైపుకు మళ్ళి మందిరము తట్టు తిరిగి ప్రార్థించిన సందర్భములో వారి పాపాలను క్షమించాలంటూ సొలోమోను చేసిన ప్రార్థన లేదు. కనుక, ఈ సందర్భములో దేవుని ప్రజలు కేవలము తమ పాపాలనుబట్టి పశ్చత్తాపపడి దేవునివైపుకుమళ్ళి మందిరముతట్టుకు తిరిగి ప్రార్థిస్తే వారికి క్షమాపణను అనుగ్రహించాలన్న సొలోమోను విజ్ఙాపనను దేవుడు అంగీకరించలేదు. ఈ విధంగా “బలులులేకుండా కేవలం ప్రార్థనలద్వారానే క్షమాపణ పొందవచ్చు” అంటూ బోధించే రబ్బీల బోధ లేఖనాలకు వ్యతిరేకమైన దుర్బోధ అన్నది మరొక సారి నిరూపితమవుతున్నది.

అయితే, ఇశ్రాయేలీయులు ప్రాయశ్చిత్తార్థముగా అర్పించే బలులన్నవి అన్ని సందర్భాలలో అన్ని అతిక్రమాలకు విరుగుడుగా నియమించబడలేదు అన్న సత్యం మోషేధర్మశాస్త్రములోని అతి ప్రాముఖ్యమైన అంశము. నిజానికి ధర్మశాస్త్రప్రకారము కొన్ని పాపాల ప్రాయశ్చిత్తానికి బలులు లేవు క్షమాపణకూడా లేదు!

మరణకరమైన పాపములు

మోషేధర్మశాస్త్ర నియమాల ప్రకారం అనేక పాపాలకు [తెలిసి చేసినవి మరియు తెలియక చేసినవి] ప్రాయశ్చిత్తము పొందేందుకై మార్గాలున్నా కొన్ని నిర్దిష్టమైన పాపాలకు మరణము తప్ప మరో మార్గము లేదు. మోషేనిబంధనగా యివ్వబడిన పది ఆజ్ఙలలోని సగానికిపైగా ఆజ్ఙలను మీరితే ప్రాయశ్చిత్తార్థ బలిగాని లేక క్షమాపణను పొందే మార్గముగాని ఏదీ మోషేధర్మశాస్త్రములో లేదు. ఆ ఆజ్ఙలకు వ్యతిరేకంగా చేసిన పాపాలకు ప్రతిఫలం మరణదండన అన్నది మోషేధర్మశాస్త్రము యొక్క విస్పష్టమైన తీర్పు. అలాంటి పాపాలకు ఒడిగట్టిన సందర్భాలలో దేవుని వైపుకు తిరిగి పశ్చత్తాపహృదయముతో ప్రార్థిస్తే క్షమించబడతారు అన్న సూచనగాని లేక మాదిరిగాని ఏదీ మోషేధర్మశాస్త్రములో లేదు.

మోషేధర్మశాస్త్రము ప్రకారము మరణదండన విధించబడాల్సిన పాపాలు:

  • వ్యభిచారము [లే.కాం.20:10; ద్వి.కాం.22:22]
  • జంతుసంభోగము [ని.కాం.22:18; లే.కాం.20:15]
  • దేవదూషణ [లే.కాం.24:16]
  • అబద్దసాక్ష్యము [ద్వి.కాం.19:16-19]
  • అబద్ద ప్రవచనము [ద్వి.కాం.13:6; 18:20]
  • విగ్రహారాధన (లే.కాం.20:2; ద్వి.కాం.13:7-19; 17:2-7)
  • ఆకాశంలోని సూర్య, చంద్ర, నక్షత్రాదులను పూజించి సేవించటం [ద్వి.కాం.17:3]
  • న్యాయాధికారి మాట తిరస్కరించుట [ద్వి.కాం.17:12]
  • మానవ అపహరణ [ని.కాం.21:16; ద్వి.కాం.24:7]
  • స్వళింగసంపర్కము [లే.కాం.18:22; 20:11-14]
  • నరహత్య [ని.కాం.21:12; లే.కాం.24:17; సం.కాం.35:16]
  • మానభంగము [ద్వి.కాం.22:25-27]
  • తల్లిదండ్రులకు అవిధేయత [ని.కాం.21:15,17; లే.కాం.20:9; ద్వి.కాం.21:18-21]
  • విశ్రాంతిదినాచారాన్ని మీరుట [ని.కాం.31:15; 35:2; సం.కాం.15:32-36]
  • చిల్లంగితనము [ని.కాం.22:18; లే.20:27]

మోషేధర్మశాస్త్రములో పేర్కొనబడిన పై పాపాలకు అదే ధర్మశాస్త్రములో ఎలాంటి క్షమాపణ లేక ప్రాయశ్చిత్త మార్గము లేదు!

ఈసందర్భంగా, మోషేధర్మశాస్త్రము యొక్క తీర్పును ప్రతిబింబిస్తూ మానవుల ప్రాయశ్చిత్తార్థ వెల ఎంతగొప్పదో దావీదుద్వారా యివ్వబడిన లేఖనాలు స్పష్టంగా ప్రకటిస్తున్నాయి:

వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే.” (కీర్తన.49:9)

ధర్మశాస్త్రము చేయలేనిదాన్ని దేవుడు చేసాడు

ధర్మశాస్త్ర విధుల ప్రకారము మరణశిక్షను సంపాదించే పాపాలవిశయములో క్షమాపణా మార్గాన్ని మోషేధర్మశాస్త్రము చూపించలేకపోయింది. అయితే, దాన్ని దేవుడే ధర్మశాస్త్రానికి వేరుగా సాధించి చూపాడు.

మానవాళి రక్షణకై సృష్టికర్త సిద్ధపరచిన రక్షణ మార్గములో మూడు ప్రధాన ఘట్టాలున్నాయి. అవి, (i) విమోచించటము [Redemption], (ii) పరిశుద్ధులనుగా మార్చటము [Sanctification], (iii) నీతిమంతులనుగా తీర్చటము [Justification]. ఈ మాదిరిని ప్రభువైన దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వములోనుండి రక్షించటములో కనుగొనవచ్చు.

ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములో దాసత్వములో కృశించిపోతున్న సందర్భములో వారి మొఱను ఆలకించి దేవుడు మొదట వారిని ఐగుప్తు దాసత్వములోనుండి విమోచించాడు, తరువాత వారిని పరిశుద్ధపరిచాడు, అటుతరువాత వారు దేవుని ఎదుట తమ జీవితాన్ని కొనసాగిస్తూ తమను నిత్యజీవానికి వారసులనుచేసే నీతిని పొందే మార్గాన్ని చూపించాడు. ఆ మార్గానికి సంబంధించిన సూచనల సమీకరణే మోషేధర్మశాస్త్రముగా ఇశ్రాయేలీయులకు యివ్వబడింది.

మన దేవుడైన యెహోవా మన కాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనునప్పుడు మనకు నీతి కలుగును.” (ద్వి.కాం.6:25)

విమోచన

బైబిలులో తరచుగా పేర్కొనబడిన “విమోచన” అన్న ప్రక్రియ ఎంతో ఆత్మీయ ప్రాముఖ్యతతో కూడినది. పాతనిబంధనా గ్రంథములోని నిర్గమాకాండము 13వ అధ్యాయములో ఈ పదముయొక్క ప్రాథమిక అర్థం వివరించబడింది.

యెహోవా నీతోను నీ పితరులతోను ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత ప్రతి తొలి చూలుపిల్లను, నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగసంతానము యెహోవా దగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి [హీబ్రూ మూలపదం: פָּדָה/పదహ్ = విమోచన] దానికి మారుగా గొఱ్ఱపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని [פָּדָה/పదహ్] యెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలియైన ప్రతి మగవానిని వెలయిచ్చి విడిపింపవలెను [פָּדָה/పదహ్]. ఇకమీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలముచేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులోనుండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనలను పోనియ్యకుండ తన మనస్సును కఠినపరచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తుదేశములో తొలి సంతాన మంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగ దైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును; అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని [פָּדָה/పదహ్] చెప్పవలెను. ” (నిర్గ.కాం.13:11-15)

ఒక వ్యక్తిని విమోచించటం లేక వెల యిచ్చి విడిపించటం అంటే ఆ వ్యక్తి స్థానములో దేవుడు నిర్ణయించిన వెలను చెల్లించి ఆ వ్యక్తిని విడిపించటం. అయితే మానవులు నిత్యజీవం పొందేందుకు తమ పాపాలనుండి విమోచించబడాలి. అటుతరువాత నీతిని అంటే నీతికార్యాలను/పుణ్యకార్యాలను/దైవకార్యాలను చేసి వాటి ఫలితంగా పొందగలిగే నీతిని తగిన పరిమాణములో సంపాదించి వుండాలి. అప్పుడే మోక్షం పొందటం సాధ్యం. అయితే, ఏభేదము లేకుండా మానవులందరు పాపానికి దాసులుగా మారిన పరిస్థితినిబట్టి (1రాజులు.8:46; కీర్తన.14:2-3; 143:2; ప్రసంగి.7:20; రోమా.3:23; 5:12) ఈ రకమైన విమోచన అన్నది మానవులలో ఏఒక్కరు పొందలేరు మరియు మరొక మానవునికి అందించనూలేరు అని లేఖనం స్పష్టపరుస్తున్నది:

ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే.” (కీర్తన.49:7-9)

ఈ పరిస్థితినిబట్టి ఇక మానవులు మోక్షాన్ని పొందటానికి మిగిలిన ఏకైక మార్గం దైవజోక్యం మాత్రమే. కనుక, దేవుడే మానవులను విమోచించి [פָּדָה/పదహ్], వారిని పరిశుద్ధపరచి, వారు నిత్యజీవితాన్ని పొందేందుకు అవసరమైన నీతిని సంపాదించి వారికి ఆపాదించేందుకు తద్వారా వారికి నీతిమంతుడైన రక్షకునిగా ఉండేందుకు నడుము కట్టాడు. ఈ దైవకార్యాన్ని సూచిస్తూ పాతనిబంధనా లేఖనాలు క్రింది ప్రకటనలను చేస్తూ వచ్చాయి:

కూపములోనికి దిగిపోకుండ నా ప్రాణమును ఆయన విమోచించియున్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది.” (యోబు.33:28)
నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే.” (కీర్తన.31:5)
యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు.” (కీర్తన.34:22)
ఇశ్రాయేలీయుల దోషములన్నిటినుండి ఆయన వారిని విమోచించును.” (కీర్తన.130:8)
“యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు నిత్యసంతోషము వారి తలలమీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును
.” (యెషయా.51:11)
అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయ మెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు.” (హోషేయ.13:14)
నీవు చేసినది అంతటినిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసికొందువు; ఇదే యెహోవా వాక్కు.” (యెహెజ్కేలు.16:63)

పై వాగ్ధానాలద్వారా మోషేధర్మశాస్త్రము చేయలేనిదాన్ని దేవుడు చేసాడు. అనేక ఆజ్ఙాతిక్రమాల ఫలితంగా మానవులు కూడగట్టుకునే విపరీతమైన పాపాలకు మరిముఖ్యముగా మరణపాత్రమైన పాపాలకు ప్రాయశ్చిత్తమార్గాన్ని ధర్మశాస్త్రముకూడా చూపలేకపొయింది. అలాంటి పాపాలకు పరిష్కారం ధర్మశాస్త్రానికి వేరుగా దేవుడు సిద్ధపరచాడు. అయితే, ఇది ఆయన తన పరిశుద్ధత, న్యాయతత్వం, మరియు ప్రేమల సమిష్టి సహకారంతోనే సిద్ధపరచాడు.

మానవాళి రక్షణ [మోక్షం] కై దైవప్రణాలికాబద్దమైన కార్యసాధనకు ప్రభువైన దేవుడు తనలో భాగమై యున్న తన “వాక్కు” [דָבָר/దాబార్ = λόγος/లొగోస్] ను అభిశేకించి ఈలోకములోకి మెస్సయ్యగా [దేవుని కుమారునిగా లేక దేవుని సేవకునిగా] పంపించాడు. అ దైవాంశసంభూతుని గురించి లేఖనాలిస్తున్న సాక్ష్యం:

బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.” (మీకా.5:2)

ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (మాకి.3:1)

పంపబడబోతున్న మెస్సయ్య మొదట తన బలియాగముచేత దేవుని న్యాయతత్వాన్ని తృప్తిపరచి తద్వారా మానవుల పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని చేసి తన పునరుత్థానము తదుపరి వారికి నీతిపాలన అందించబోతున్నాడన్న సత్యాన్ని లేఖనాలు భవిశ్యవాణి రూపంలో అందిస్తున్నాయి. అయితే, ఈ సత్యానికి సంచకరువుగా తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో ఒక వాగ్ధానం చేస్తూ పరమతండ్రి వారి విమోచనకు తగిన ప్రాయశ్చిత్తాన్ని తానే యేర్పాటుచేయబోతున్నట్లు ప్రకటించాడు:

నేను యెహోవానని నీవు తెలిసికొనునట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను. నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసికొందువు; ఇదే యెహోవా వాక్కు.” (యెహెజ్కేలు.16:62-63)

తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును…ఈ అరువదిరెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును.” (దానియేలు.9:24…26)

అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.” (యెషయా.53:10-11)

రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారునిపోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.” (దానియేలు.7:14)

పాతనిబంధనాగ్రంథములో ప్రవచనాత్మకంగా తెలియచేయబడిన పై దైవప్రణాలికా ప్రకటనలు ప్రభువైన యేసు [యషువ] నందు నెరవేర్చబడటాన్ని గూర్చి క్రొత్తనిబంధనా లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి:

అంతట ఆయనమోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపుచున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను.” (లూకా.24:44-49)

ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరి యందు ప్రశంసింపబడుటకును, ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి.” (2థెస్స.1:6-10)

మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావ మును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.” (ప్రకటన.1:6)

ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు — ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.” (ప్రకటన.11:15)

పరిశుద్ధత మరియు నీతి

కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.” (1కొరింథీ.1:2)

మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చ బడితిరి.” (1కొరింథీ.6:11)

ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై,నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది. ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.” (రోమా.3:21-24)

పై లేఖనాలు ప్రకటిస్తున్న విధంగా మానవులు యేసు క్రీస్తును [యషువ మషియాఖ్] ను విశ్వసించటముద్వారా పరిశుద్ధతను మరియు నీతిని పొందగలరు.

ఏనరుడు మానవుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయజాలడు. కనుక, సృష్టికర్త తానే ఆ కార్యాన్ని నరరూపధారియైన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] నందు నిర్వర్తించాడు. మానవులందరి నిమిత్తం ఏర్పరచబడిన ఈ విమోచనా కార్యం దేవుని అనాదికాల సంకల్పములోనిది. అందునుబట్టే ఆ కార్యపు నెరవేర్పు కాలప్రవాహములో ఒకానొక నిర్దుష్టమైన సమయములో సంపూర్తిచేయబడినా దానికి ముందు అలాగే దానికి తరువాతకూడా ఆదిలోనే తాను నిర్దేశించిన ఆ కార్యాన్ని ఆధారం చేసుకొనే దేవుడు నరుల పాపాలను క్షమించి మోక్షాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇది న్యాయవర్తనుడైన సృష్టికర్త యొక్క కృపా విధానం.

ఈ విమోచనా సాఫల్యతకు ఏకాలములోనైనా స్వంతనీతిపై లేక స్వంతభక్తిపై ఆధారపడకుండా కేవలము సృష్టికర్తపై మరియు ఆయన సందేశంపై ఆధారపడే అచంచల విశ్వాసమే నరులకు కావలసిన అర్హత.

అటుతరువాతే అంటే ఈలోకములో దైవక్షమాపణను పొంది మోక్షవాగ్ధానాన్ని అందుకున్న తరువాతే పవిత్రమైన ప్రేమాయుక్తమైన నీతి జీవితం సాధ్యమవుతుంది. అది సృష్టికర్త నీనుంచి ఆశిస్తున్న జీవితం.

ప్రభువైన దేవుడు మిమ్ములను దీవించి సర్వసత్యములోకి నడిపించును గాక!

Permalink to single post

ధర్మశాస్త్రము

ధర్మశాస్త్రము (תּוֹרָה) — పదవివరణ 

ధర్మశాస్త్రము అన్న తెలుగు పదము హీబ్రూ లేఖనాలలోని తోరాహ్ (תּוֹרָה/Torah) అన్న హీబ్రూభాషా పదపు అనువాదము. ఈ హీబ్రూ పదము హీబ్రూ లేఖనాల సంపుటి అయిన పాతనిబంధన (తనాక్/TaNaK) గ్రంథములో 219 సార్లు వుపయోగించబడింది.  

ధర్మశాస్త్రము/తోరాహ్ (תּוֹרָה/Torah) అన్నపదము యొక్క అర్థము 

తోరాహ్ (תּוֹרָה/Torah) అనే హీబ్రూ పదానికి వున్న ప్రధానమైన అర్థాలు: ఉపదేశము; చట్టము. (నియమము, ఆజ్ఙ, సూచన మొదలైన భావాలు కూడా వున్నాయి)

ధర్మశాస్త్రము/తోరాహ్ (תּוֹרָה/Torah) అన్న పదం బైబిలులో వుపయోగించబడిన విధానము 

తోరాహ్ (תּוֹרָה/Torah) అన్న హీబ్రూ పదం హీబ్రూ లేఖనాలలో వుపయోగించబడిన విధానాలు మరియు సందర్భాలు: 

  • ఇది దేవుడు ఇశ్రాయేలీయులకు మోషేద్వారా యిచ్చిన ఉపదేశము/సుచనలకు విరివిగా వాడబడింది.
    “మోషే ధర్మశాస్త్రగ్రంథములో [תּוֹרָה/torah] వ్రాయబడిన ప్రకారము” (యెహోషువ 8:30) 
  • దేవుడు అబ్రహాముకు చేసిన ఉపదేశము/సూచనలకు ఉపయోగించబడింది.
    “ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను [תּוֹרָה/torah] గైకొనెనని చెప్పెను.” (ఆది.కాం.26:5) 
  • దహనబలినిగూర్చి చేయబడిన ఉపదేశము/సూచనకు ఉపయోగించబడింది.
    “నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనుము ఇది దహనబలినిగూర్చిన విధి [תּוֹרָה/torah].” (లే.కాం.6:9) 
  • కుష్టరోగానికి సంబంధించిన ఉపదేశము/సూచనలకు వాడబడింది.
    “ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో, యెప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమును గూర్చిన విధి [תּוֹרָה/torah].” (లేవీ.కాం.14:57)  
  • అలాగే తల్లి తన కుమారునికి చేసే ఉపదేశానికి వాడబడింది.
    “నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును [תּוֹרָה/torah] త్రోసివేయకుము.” (సామెతలు 6:20) 
  • ఈ పదం గుణవంతురాలయిన భార్య చేసే ఉపదేశానికి/సూచనలకు కూడా వాడబడింది.
    “జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము [תּוֹרָה/torah] ఆమె బోధించును.” (సామెతలు 31:26) 
  • చివరకు, రాబోవు మెస్సయ్య అన్యజనులకు చేయబోయె బోధను సూచిస్తూకూడా ఈ పదం ఉపయోగించబడింది.
    “భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు నలుగుడుపడడు ద్వీపములు అతని బోధ [תּוֹרָה/torah] కొరకు కనిపెట్టును.” (యెషయా.42:4) 

ధర్మశాస్త్రము/తోరాహ్ (תּוֹרָה/Torah) అన్న పదము బైబిలులో దేన్ని సూచిస్తుంది?

ధర్మశాస్త్రము/తోరాహ్ (תּוֹרָה/Torah) అన్న పదము బైబిలులో దేన్ని సూచిస్తున్నదోనన్నది తెలుసుకోవడానికి అది వుపయోగించబడిన సందర్భమే ప్రధానము. సందర్భాన్ని సరిగ్గా అర్థముచేసుకోగలిగితే అది సూచిస్తున్నదాన్ని కూడా సరిగ్గా అర్థము చేసుకోగలము. అయితే, సర్వసాధారణంగా బైబిలులో ఈపదము ఈ క్రింది వాటిని సూచిస్తుంది:

(1) దేవుని ఉపదేశము–ఒక ప్రవక్తకు/ప్రవక్తద్వారా యివ్వబడిన ఉపదేశము కావచ్చు లేక ప్రవక్తలందరి ద్వారా యివ్వబడిన సమిష్టి ఉపదేశము కావచ్చు.
(2) మోషేద్వారా దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు సంబంధించిన ఉపదేశము అలాగే అందులో భాగంగా యివ్వబడిన నియమవిధులు అంటే పది ఆజ్ఙలు మరియు మతాచారాలు, పండుగలు, బలులు, శిక్షలు మొదలైనవి. 
(3) మోషే వ్రాసిన పంచకాండాలు—ఆదికాండము, నిర్గమాకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము.
(4) తనాక్ (TaNaK) లోని గ్రంథాలన్ని—39 (ఆదికాండము మొదలుకొని మలాకి గ్రంథము వరకు)

మోషేధర్మశాస్త్రము

మోషేధర్మశాస్త్రము అంటే అది మోషే స్వంతంగా వ్రాసి ఇచ్చిన చట్టమనిగాని లేక మోషే వ్యక్తిగతంగా ప్రతిపాదించిన చట్టమనిగాని కాదు. ప్రభువైన దేవుడే తాను ప్రత్యేకపరచుకొన్న జనాంగముతో ఒక నిబంధన చేసి అందులో భాగంగా ఆ నిబంధన వీగిపోకుండా నిలిచుండెందుకు ఆ జనాంగము పాటించాల్సిన నియమాల వివరాలను మోషేద్వారా అందించడము జరిగింది. ఆ నిబంధన నియమాల సంపుటినే మోషేధర్మశాస్త్రముగా లేఖనాలు పేర్కొంటున్నాయి. ఇందుకుగల లేఖన సాక్ష్యాలు:

యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసికొని వచ్చినప్పుడు,మోషేద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రముగల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కన బడెను.” (2దినవృ.34:14)
మోషే ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన ప్రకారము” (యెహోషువ.8:30)
కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించు టకు మనస్సు దృఢము చేసికొని, యెడమకు గాని కుడికి గాని దానినుండి తొలగిపోక” (యెహోషువ.23:6)
నీ దేవుడైన యెహోవా అప్పగించినదానిని కాపాడి,ఆయన మార్గముల ననుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము;” (1రాజులు.2:3)
ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణతగల శాస్త్రిమరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును.” (ఎజ్రా.7:6)
ఏడవ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై యుండిరి. అప్పుడు జనులందరును ఏక మన స్కులై, నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చియెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రగ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా” (నెహెమ్యా.8:1)
అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయు లగునట్లు దేశపు జనులలో ఉండకుండ తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నెతీనీయులు అందరును, దేవుని దాసుడైన మోషేద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచు, మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి.” (నెహెమ్యా.10:28)
ఇశ్రాయేలీయులందరు నీ ధర్మశాస్త్రము నతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితివిు గనుకనేను శపించెదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసియున్నట్లు ఆ శాపమును మామీద కుమ్మరించితివి.” (దానియేలు.9:11)

మోషేధర్మశాస్త్రము (מֹשֶׁ֣ה תּוֹרַ֖ת /tawrat Moshe)…

  • మేలైనది
  • నీతిగలది
  • శ్రేష్టమైనది
  • సత్యమైనది
  • నమ్మదగినది
  • పరిశుద్ధమైనది
  • ప్రయోజనకరమైనది
  • దేవుడు నియమించినది
  • పూర్వ/పాత నిబంధనలోనిది
    (నెహెమ్యా 9:13; కీర్తనలు. 19:7, 119:72,142; రోమా. 7:12,16; 15:4; 1కొరింథీ.10:1-11; 1తిమోతి.1:11; 2తిమోతి.3:16-17)

మోషేధర్మశాస్త్రము యివ్వబడిన ప్రజలు

మోషేధర్మశాస్త్రము మోషేద్వారా చేయబడిన నిబంధనలోని ప్రధానమైన భాగము. దేవుడు తాను ఎన్నుకొనిన ప్రజలైన ఇశ్రాయేలీయులతో అలాగే వారిమధ్య జీవిస్తూ వారితోపాటు ప్రయాణం చేస్తూ వాగ్ధత్తదేశములో ప్రవేశించబోతున్న అన్యులతో, అంతేగాక వారందరి రాబోవు తరాలతోకూడా చేసిన నిబంధన మోషేనిబంధన. (ని.కాం.24:7-8; లేవీ.కాం.26:9; ద్వి.కాం.5:2-3, 29:10-29; న్యాయాధిపతులు 2:1; 2దిన.వృ.5:10)

మోషేద్వారా దేవుడు తన వాక్కులను అంటే ధర్మశాస్త్రాన్ని తాను ఎన్నుకున్న యాకోబు సంతానానికి అందించినది మొదలుకొని దాదాపు నాలుగువందల సంవత్సరాల కాలవ్యవధి తరువాతకూడా అన్యజనాంగాలకు దేవుని వాక్కులుగాని లేక న్యాయవిధులుగాని తెలియపరచబడలేదు అన్న నగ్నసత్యాన్ని లేఖనాలు నిర్ద్వందంగా నిర్ధారిస్తున్నాయి:

ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి. యెహోవాను స్తుతించుడి.” (కీర్తన.147:19-20)

వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి. పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. (రోమా.9:4-5)

పది ఆజ్ఙలు కాని, మోషే ధర్మశాస్త్రము కాని లేక దేవుని వాక్కులు కాని అందుకోని అన్యజనులందరు దేవునికి మరియు తోటివారికి వ్యతిరేకంగా పాపము చేయవచ్చు అని పై వాక్యముల యొక్క భావము కాదు.

ఆదాము సంతానముగా ఈలోకములో జన్మిస్తున్న ప్రతివ్యక్తి మంచి చెడుల జ్ఙానాన్ని సహజసిద్ధంగా పెంపొందించుకుంటాడన్నది లేఖన బోధ (ఆది.కాం.3:22; యెషయా.7:15). దానితో పాటు ప్రతివ్యక్తి యొక్క మనసాక్షికూడా ధర్మశాస్త్రము లేని అన్యులలో ధర్మశాస్త్రము యొక్క పాత్రను పోశిస్తుందని లేఖనాలు వివరిస్తున్నాయి:

దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతి మంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను…” (రోమా.2:11-16)

ఆయా కాలాలలో ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తులకు దేవుడు కట్టడలు/ఆజ్ఙలు ఇచ్చాడు. ఇది ప్రత్యక్షంగా యివ్వబడిన దేవుని వాక్కులద్వారానైన జరుగవచ్చు లేక మంచి చెడుల జ్ఙానముతోకూడిన మనసాక్షిద్వారానైనా జరుగవచ్చు. ఆయా వ్యక్తులు ఆయా కట్టడలకు/ఆజ్ఙలకు విధేయులై నడుచుకోవాలి. సార్వత్రిక కట్టడలకు/ఆజ్ఙలకు మాత్రం అందరు అన్నివేళల విధేయులై నడుచుకోవాలి.

ఇందునుబట్టి, ధర్మశాస్త్రము ఇవ్వబడిన ఇశ్రాయేలీయులైనా లేక ధర్మశాస్త్రము ఇవ్వబడని అన్యజాతులవారైనా అందరూ దేవునియందు భయభక్తులు కలిగి దేవుని కట్టడలలో అంటే సార్వత్రిక కట్టడలలో/ఆజ్ఙలలో నడుచుకుంటూ జీవించాలి అంటూ లేఖనాలు ఘోషిస్తున్నాయి:

దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల (מִצְוֹתָ֗יו/mishvota) ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.” (ప్రసంగి.12:13)

మోషేనిబంధన అన్యులందరితో లేక లోకములోని ప్రజలందరితో చేసిన నిబంధన కాదు. అదేవిధంగా అందులోని భాగమైన మోషేధర్మశాస్త్రముకూడా లోకములోని ప్రజలందరికి యివ్వబడిన ధర్మశాస్త్రము కాదు.

దేవుడు అబ్రహాముకు వాగ్ధానముచేసిన పాలస్తీనా దేశస్వాస్థ్యమును తిరిగి మోషేద్వారా వాగ్ధానముగా పొందిన ఇశ్రాయేలీయులు, వారి మధ్య నివసించిన అన్యులు, మరియు వారందరి రాబోవు తరాలకు మాత్రమే మోషేధర్మశాస్త్రము యివ్వబడింది.

మోషేధర్మశాస్త్రములో మార్పులు

అ. మోషే కాలములో మార్పులు

  • నిర్గమాకాండములో ఆజ్ఙాపించినదాని ప్రకారము పస్కా పశువును ఐగుప్తులో వారు నివసిస్తున్న స్థలములో వధించి దాని మాంసమును తమతమ ఇండ్లలోనే భుజించాలి లేక ఒక్క ఇంటిలోనే భుజించాలి మరియు దాని మాంసములో కొంచెమైనను బయటికి తీసుకుపోకూడదు (ని.కాం.12:7-11, 21-23, 46-47)
    ద్వితీయోపదేశకాండములో ఆజ్ఙాపించినదాని ప్రకారము పస్కాపశువును తాము నివసిస్తున్న స్థలములో లేక పురములో వధించకూడదు. అయితే పస్కాపశువును యెరూషలేములోనే వధించి, దాన్ని అక్కడే కాల్చి భుజించి ఉదయమున తిరిగి తమతమ ఇండ్లకు వెళ్ళాలి (ద్వి.కాం.16:5-7)
  • దేవుడు హోరేబులో మోషేద్వారా ఇశ్రాయేలీయులతో నిబంధన చేసి యిచ్చిన ధర్మశాస్త్రము (ద్వి.కాం.అధ్యాయాలు 1-28)
    దేవుడు హోరేబుతరువాత మోయాబు దేశములో మోషేద్వారా ఇశ్రాయేలీయులకు యిచ్చిన ధర్మశాస్త్రము (ద్వి.కాం.అధ్యాయాలు 28-31)

ఆ. ప్రవక్తల కాలములో మార్పులు

(1) మోషేధర్మశాస్త్ర ప్రకారము రాజు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు (ద్వి.కాం.17:17)

ప్రవక్తల బోధ ప్రకారము రాజైన దావీదు అనేకమంది స్త్రీలను వివాహము చేసుకున్నాడు. (2సముయేలు.12:7-8 & 1ది.వృ.3:1-9, 14:3)

(2) మోషేధర్మశాస్త్రపు బోధ ప్రకారము దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ప్రతి సంవత్సరము యేడు పండుగలను జరుపుకోవాలి (లేవీ.కాం.23:1-44).

ప్రవక్తల బోధ ప్రకారము దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు/యూదులు పూరీము అనే మరొక పండుగనుకూడా ప్రతి సంవత్సరము జరుపుకోవాలని నిర్ణయించబడింది (ఎస్తేరు.9:20-32)

(3) మోషేధర్మశాస్త్ర ప్రకారము విధవరాలిని పెండ్లిచేసుకోకూడదు (లే.కాం.21:7-14)

ప్రవక్తల బోధ ప్రకారము యాజకులకు భార్యలై విధవరాడ్రుగా మారిన వారిని పెండ్లిచేసుకోవచ్చు (యెహెజ్కేలు 44:22)

(4) మోషేధర్మశాస్త్ర ప్రకారము అపవిత్రత తరువాత యేడు దినములు లెక్కించాలి (సం.కాం.19:11-14)

ప్రవక్తల బోధ ప్రకారము పవిత్రుడైనతరువాత యేడుదినములు లెక్కించాలి (యెహెజ్కేలు 44:26)

(5) మోషేధర్మశాస్త్ర ప్రకారము జారస్త్రీని/వ్యభిచారిని దేవుడు శిక్షిస్తాడు (సం.కాం.5:29-31)

ప్రవక్తల బోధ ప్రకారము జారస్త్రీని/వ్యభిచారిని దేవుడు శిక్షించడు (హోషేయ 4:14)

(6) మోషేధర్మశాస్త్ర ప్రకారము విడాకుల పత్రము వ్రాయడముద్వారా భర్త భార్యను పరిత్యజించవచ్చు (ద్వి.కాం.24:1-4; యిర్మీయ.3:8)

ప్రవక్తల బోధ ప్రకారము భర్త భార్యను పరిత్యజించడము దేవునికి అసహ్యము (మలాకి.2:16)

(7) మోషేధర్మశాస్త్ర ప్రకారము దేవుడు బలులర్పించడాన్ని నిర్దేశించాడు (లేవీ.కాం.4:1-35; 5:4-12)

ప్రవక్తల బోధ ప్రకారము దేవుడు బలులను కోరడములేదు (1సమూయేలు.15:22; కీర్తన.40:6, 51:16; హోషేయ.6:6)

(8) మోషేధర్మశాస్త్ర ప్రకారము దేవుని సన్నిధిలో (గుడారములో) దేవుని మందసము ఎదుట పాటలు పాడేవారిని వాయిద్యాలు వాయించేవారిని మోషే నియమించలేదు. దేవుని సన్నిధిలో బూరలను వూదాలి కాని ఆర్భాటము చేయకూడదు (సం.కాం.10:7-10)

ప్రవక్తల బోధ ప్రకారముదేవుని మందసము ఎదుట పాటలు పాడుటకు వాయిద్యములు వాయించుటకు సేవకులను దావీదు నియమించెను. (1దిన.వృత్తాం.15:16-22, 16:4-6, 25:1-8; 2దిన.వృత్తాం.23:18; 29:25-30)

(9) మోషేధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచార పాపానికి మరియు నరహత్య పాపానికి శిక్ష మరణదండన (లే.కాం.20:10; ద్వి.కాం.22:22; ని.కాం.21:12; లే.కాం.24:17; సం.కాం.35:16)

ప్రవక్తల బోధ ప్రకారము బత్షేబ విశయములో అలాగే ఆమె భర్త అయిన ఊరియా విషయములో  దావీదు చేసిన పాపాలకు శిక్షగా దావీదుకు మరణదండన విధించబడలేదు (2సమూయేలు.12:13)

(10) మోషేధర్మశాస్త్ర ప్రకారము అబద్ధ సాక్ష్యానికి మరియు నరహత్యకు శిక్ష మరణదండన (ద్వి.కాం.19:16-19 & ని.కాం.21:12; లే.కాం.24:17; సం.కాం.35:16)

ఆహాబు తన పొరుగువాడైన నాబోతు ద్రాక్షాతోటను ఆశపడి నాబోతుకు వ్యతిరేకంగా అబద్ధ సాక్షాన్ని సృష్టించి అతని మరణానికి కారకుడయ్యాడు. అయినా, ప్రవక్తల బోధ ప్రకారము మరణదండనను పొందకుండా క్షమాపణను పొందగలిగాడు (1రాజులు.21:1-29) 

(11) మోషేధర్మశాస్త్ర ప్రకారము విగ్రహారాధన మరియు చిల్లంగితనము మరణదండనకు పాత్రమైన పాపాలు (లే.కాం.20:2; ద్వి.కాం.13:7-19; 17:2-7 & ని.కాం.22:18; లే.20:27)

మనష్షె దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన మరియు చిల్లంగితనము చేశాడు, కాని ప్రవక్తల బోధ ప్రకారము మరణదండనను పొందకుండ క్షమాపణను పొందాడు (2దిన.వృ.33:1-13)  

(12) మోషేధర్మశాస్త్ర ప్రకారము యాజకధర్మము అహరోనుకు మరియు అతని కుమారులకు యివ్వబడింది. యాజకధర్మానికి వేరేవారు సమీపిస్తే మరణశిక్ష విధించాలి (సం.కాం.3:10, 38, 16:40)

ప్రవక్తల బోధ ప్రకారము దావీదు వంశములోనుండి రాజుగా వచ్చే మెస్సయ్య యాజకునిగాకూడా వుండబోతున్నాడు (కీర్తన.110:4; జెకర్యా.6:12-13)

(13) పండుగదినాలలో/నియామక కాలములలో అర్పించబడవలసిన బలులు మరియు నైవేద్యములు (సం.కాం.15:4-10) 
– గొర్రెపిల్ల + ముప్పావు ద్రాక్షారసము 
– పొట్టేలు + పడి నూనె + నాలుగు పళ్ళ పిండి + పడి ద్రాక్షారసము 
– కోడెదూడ  + పడిన్నర నూనె + ఆరుపళ్ళ గొధుమ పిండి 

పండుగదినాలలో/నియామక కాలములలో అర్పించబడవలసిన బలులు మరియు నైవేద్యములు (యెహెజ్కేలు.46:11)  
– ఎద్దు/పొట్టేలు + తూమెడు పిండి 
– గొర్రెపిల్ల + శక్తికొలది పిండి + తూము ఒకటింటికి మూడుపళ్ళ నూనె

() మెస్సయ్య కాలములో మార్పులు

పాతనిబంధన గ్రంథములో వాగ్ధానముచేయబడిన రాబోవు మోషేవంటి ప్రవక్త, మెల్కీజెదెకు క్రమములోని యాజకుడు, మరియు దావీదు వంశములోని రాజు మూడు పాత్రల సమ్మేళనమే రాబోవు మెస్సయ్య.

ఇశ్రాయేలీయులమధ్య, వారిలోనుండి వారికొరకు మోషేవంటి ప్రవక్తగా విచ్చేసిన యషువ మెషియాఖ్ (యేసు క్రీస్తు) ద్వారా దేవుడు తాను వాగ్ధానము చేసిన విధంగా తన మాటలను (ధర్మశాస్త్రాన్ని/ఉపదేశాన్ని) మానవకోటికి అందించాడు:

“ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. ​మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పిన మాట మంచిది; ​వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణ చేసెదను.” (ద్వి.కాం.18:16-19)

మెస్సయ్యగా వచ్చిన యేసు (యషువ) మోషేధర్మశాస్త్రనికన్నా శ్రేష్టమైన ధర్మశాస్త్రాన్ని మనకందించాడు:

“ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్‌ప్రయోజన మైనందునను అది నివారణ చేయబడియున్నది; అంత కంటె శ్రేష్ఠమైన నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడెను. దీనిద్వారా, దేవునియొద్దకు మనము చేరుచున్నాము.” (హెబ్రీ.7:18-19)

నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.” (మత్తయి.28:20)

నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింప లేరు. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును. తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని.” (యోహాను.16:12-15)

మోషేధర్మశాస్త్రము యొక్క ఉద్దేశము

దేవుని పరిశుద్ధత మరియు న్యాయం అన్న రెండు ప్రాముఖ్యమైన దైవప్రామాణికతలనుగూర్చిన సాక్ష్యాన్ని అందించటం (లేవీ.కాం.11:44-45, 19:2; ద్వి.కాం.32:4).

దేవుడెన్నుకున్న ప్రజలు నీతిని సంపాదించే మార్గాన్ని చూపటం (ద్వి.కాం.6:25; రోమా.2:13).

దేవుని ప్రజలు దేవుడు వాగ్ధానము చేసిన పాలస్తీనాదేశములోకి ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొనుటకు (ద్వితీ.కాం.4:1…5-6).

రాబోవు దినాలలో మెస్సయ్య యొక్క ఆగమనము, ఉపదేశము, మరియు ప్రాయశ్చిత్తార్థ బలియాగమునందు ప్రేమాధారంగా అనుగ్రహించబడబోయే దేవుని నీతి యొక్క ప్రత్యక్షతకు ఛాయారూపాన్ని అందించటం (హెబ్రీ.10:1).

మోషే వంటి ప్రవక్త రాబోతున్న మెస్సయ్య. ఆయన తన ఆగమనముతో మోషే ఉపదేశానికి (ధర్మశాస్త్రానికి) సంపూర్ణత చేకూర్చి నూతన నిబంధనకు నూతన ఉపదేశానికి (ధర్మశాస్త్రానికి) నాంది పలుకుతాడు. ఆయన రాకడతో మోషే ఉపదేశానికన్నా శ్రేష్టమైన ఆయన ఉపదేశానికి తలవొగ్గాలి. ఆయన మాట విననివాడు సర్వనాశనమవుతాడు అన్నది లేఖన హెచ్చరిక:

ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయ మున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను.  ​మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పిన మాట మంచిది; ​వారి సహో దరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞా పించునది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణ చేసెదను.” (ద్వి.కాం.18:16-18)

ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది.” (కొలొస్సీ.2:17)

మోషే యిట్లనెనుప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట విన వలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.” (అపో.కా.3:22-23)

మోషేధర్మశాస్త్రపు అనువర్తన (applicability)

మోషేనిబంధన నోవహునిబంధనలా, అబ్రహామునిబంధనలా, మరియు దావీదునిబంధనలా నిత్యనిబంధన కాదు. అందునుబట్టి, మోషేనిబంధనలో భాగమైన మోషేధర్మశాస్త్రముకూడా నిత్యమూ వర్తించేది కాదు.

మోషేధర్మశాస్త్రానికి ప్రారంభము వుంది (1446 క్రీ.పూ.; సీనాయి పర్వతము; నిర్గమాకాండము 19-20 అధ్యాయాలు; ద్వి.కాం.4:8; నెహెమ్యా.9:13-14).
అలాగే దానికి అంతము కూడా వుంది (యిర్మీయా.31:32-33; యెషయా 24:5; యెహెజ్కేలు 44:7; 30 క్రీ.శ.; కలువరి కొండ; లూకా 22-24 అధ్యాయాలు; రోమా 10:4; గలతీ.3:19; ఎఫెసీ.2:14; హెబ్రీ.8:13, 10:9). 

మోషేధర్మశాస్త్రము యొక్క అధికారము అమలులోవుండే కాలపరిమితి:

  • అబ్రహాముకు వాగ్ధానము చేయబడిన “సంతానము” అంటే మెస్సయ్య వచ్చువరకు యివ్వబడింది (గలతి.3:17-19) 
  • దేవుని ప్రజలను విశ్వాసమునుబట్టి నీతిమంతులుగా తీర్చే మెస్సయ్య (యషువ మషియాఖ్/מָשִׁ֣יחַ יְהוֹשׁוּעַ) దగ్గరకు నడిపించే వరకు (గలతి.3:24) 
  • మెస్సయ్య (యషువ మషియాఖ్/מָשִׁ֣יחַ יְהוֹשׁוּעַ) రెండవ నిబంధనను స్థిరపరచే వరకు (హెబ్రీ.10:9) 
  • ప్రవక్తలద్వారా వాగ్ధానము చేయబడిన క్రొత్తనిబంధన ప్రారంభమయ్యే వరకు (యిర్మీయ 31:32-33; యెహెజ్కేలు 16:60-62; హెబ్రీ.8:13) 
  • మెస్సయ్య (యషువ మషియాఖ్/מָשִׁ֣יחַ יְהוֹשׁוּעַ) నందు మోషేధర్మశాస్త్రము యొక్క లక్ష్యము నెరవేరే వరకు (రోమా.10:4; 2కొరింథీ.3:14)
  • మెస్సయ్య (యషువ మషియాఖ్/מָשִׁ֣יחַ יְהוֹשׁוּעַ) సిలువలో ఒక అడ్డుగోడగా వున్న దాన్ని తొలగించినంత వరకు (ఎఫెసి.2:14; కొలస్సీ.2:13-15) 
  • దానికన్నా శ్రేష్టమైనది ప్రవేశపెట్టబడినంతవరకు (రోమా.8:2; హెబ్రీ.7:18-19) 

మోషేనిబంధన స్థానములో చేయబడిన మెస్సయ్యనిబంధన లేక క్రొత్తనిబంధనలో భాగంగా క్రీస్తుధర్మశాస్త్రము/క్రీస్తునియమము/క్రీస్తువుపదేశము యివ్వబడింది [νόμον/నొమోస్ = గలతీ.6:2; మెస్సయ్యతోర–యెషయా 42:4 = యోహాను.13:34, 14:26, 16:12-15; 1కొరింథీ.9:21; 1యోహాను 2:3-6].

క్రొత్తనిబంధనద్వారా దేవుని సంబంధులుగా మారిన నిజవిశ్వాసులు యిప్పుడు క్రీస్తుధర్మశాస్త్రము ప్రకారము జీవించబద్ధులై ఉన్నారు:

నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.” (మత్తయి.28:20)

నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండు టకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసి కొందుము.” (1యోహాను.2:3)

మోషేధర్మశాస్త్రము యొక్క పరిమితి

మోషేధర్మశాస్త్రము పరిమితులు గలది. దానిలో సంపూర్ణత లేని కారణాన్ని బట్టి దేవుడు తిరిగి ప్రవక్తలద్వారా తన వాక్కులను అందిస్తూ ధర్మశాస్త్రానికి మార్పులు చేయటము జరిగింది. పైన ఆధారాలతో వివరించిన విధంగా దేవుడు మోషే కాలములోనేగాక ప్రవక్తల కాలములోకూడా తన ధర్మశాస్త్రానికి మార్పులు చేశాడు. దానితో దేవుని పక్షంగా మానవకోటికి అవసరమైన పరిపూర్ణ మరియు సంపూర్ణ ధర్మశాస్త్రము అందివుండింటే ఇక మెస్సయ బోధ/తోర (యెషయా:42:4) యొక్క ఆవశ్యకత వుండేది కాదు.

అయితే, ప్రవక్తల కాలములో సవరించబడిన ధర్మశాస్త్రముకూడా సంపూర్ణమైనది లేక పరిపూర్ణమైనది కాదు. ఆ కారణాన్నిబట్టి దేవుడు తన ప్రియకుమారుడైన మెస్సయ్య ద్వారా శ్రేష్టమైన, సంపూర్ణమైన, మరియు పరిపూర్ణమైన ధర్మశాస్త్రాన్ని అందించాడు. అదే నూతననిబంధనలో భాగంగా యివ్వబడిన నూతననిబంధనాగ్రంథపు బోధ.

ఈ సందర్భంగా మోషేధర్మశాస్త్రము చేయలేనివాటిలోని కొన్ని ప్రాముఖ్యమైన వాటిని ఈ క్రింద చూడవచ్చు:

  • ధర్మశాస్త్రములోని విధులను గైకొనక మరియు వాటిని స్థిరపరచకుండుటనుబట్టి శాపగ్రస్తులుగా మారిన వ్యక్తులకు తిరిగి నీతిమంతులయ్యే మార్గం ధర్మశాస్త్రము చూపలేదు (ద్వి.కాం.27:26)
  • తెలిసిచేసిన అనేక పాపాలకు క్షమాపణ/ప్రాయశ్చిత్తం పొందే మార్గం యివ్వలేదు
  • మరణకరమైన పాపాలకు క్షమాపణ మార్గం నిర్దేశించలేదు
  • అన్యులకు అంటే యూదేతరులకు పరిశుద్దస్థలములోకి ప్రవేశించె అనుమతి యివ్వలేదు
  • అన్యులకు యూదులతో సమానంగా ఆత్మీయ మేళ్ళను అందించలేదు
  • అన్యులకు యూదులలాంటి స్థానాన్ని యివ్వలేదు
  • ఒక్క పాపినికూడా నీతిమంతునిగా/నీతిమంతురాలుగా తీర్చలేకపోయింది (రోమా.3:20; అపో.కా.13:39; గలతీ.2:16)

అయితే, పరమతండ్రి అయిన సృష్టికర్త మోషేధర్మశాస్త్రానికి వేరుగా అది చేయలేని వాటిని చేశాడు:

  • విశ్వాసమూలముగా మానవులను నీతిమంతులను చేసాడు [అబ్రహాము (ఆది.కాం.12:11-13; 15:6; 20:1-2, 5; రోమా.4:3; గలతీ.3:6)]
  • తెలిసీతెలియక చేసిన అన్ని పాపాలకు (పరిశుద్ధాత్మ దూశణకు తప్ప) క్షమాపణ/ప్రాయశ్చిత్తం పొందే మార్గం అనుగ్రహించాడు (అపో.కా.13:39; కొలొస్సీ.2:13; 1యోహాను.1:9)
  • మరణకరమైన పాపాలకు సహితం క్షమాపణను అందించాడు [దావీదు (2సమూయేలు.12:1-13)]
  • అన్యులకు అంటే యూదేతరులకు పరిశుద్దస్థలములోకి ప్రవేశించె అనుమతి ఇచ్చాడు (ఎఫెసీ.2:11-22; 1పేతురు.2:9-10) 
  • అన్యులకు యూదులతో సమానంగా ఆత్మీయ మేళ్ళను అనుగ్రహించాడు (2పేతురు.1:1)
  • అన్యులకు యూదులలాంటి స్థానాన్ని ఇచ్చాడు (గలతీ.3:28-29)
  • పాపులైన అనేకమందిని యూదులు మరియు యూదేతరులు అన్న భేదం లేకుండా నీతిమంతులుగా మార్చాడు (రోమా.3:23-30)

మోషేధర్మశాస్త్రము – క్రొత్తనిబంధన విశ్వాసులు

అన్యజనుల రక్షణ మరియు మోషేధర్మశాస్త్రము

అన్యజనులు రక్షణ పొందటనికి అలాగే వారు రక్షణలో కొనసాగటానికి మోషేధర్మశాస్త్రమును పాటించనవసరము లేదు. ఈవిశయములో యూదయనుండివచ్చిన కొందరు దుర్బోధకులు వారితోపాటు వారిని సమర్ధించిన పరిసయ్యుల తెగలోనుండి క్రొత్తనిబంధన విశ్వాసులుగా మారిన వారికి మరియు అపోస్తలులకు మధ్య వాగ్వివాధం జరగడం తద్వారా అన్యజనులలోనుండి విశ్వాసులుగా మారిన వారు తాము పాటించాల్సిన నియమాల వివరాలను అపోస్తలులు అందించటాన్ని గురించి క్రింది లేఖనాలలో చూడవచ్చు:

కొందరు యూదయనుండి వచ్చిమీరు మోషేనియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహో దరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘమువలన సాగనంపబడి, ఫేనీకే సమరయ దేశములద్వారా వెళ్లుచు, అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచి సహో దరులకందరికిని మహా సంతోషము కలుగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా, సంఘపువారును అపొస్తలులును పెద్దలును వారిని చేర్చుకొనిరి; దేవుడు తమకు తోడైయుండి చేసినవన్నియు వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరులేచి, అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు, మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. అప్పుడు అపొస్తలులును పెద్దలును ఈ సంగతినిగూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియును. మరియు హృద యములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి, వారినిగూర్చి సాక్ష్య మిచ్చెను. వారి హృదయములను విశ్వాసమువలన పవిత్ర పరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీ రెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా? అలాగే వారును రక్షణ పొందుదురు అనెను.” (అపో.కా.15:1-11)

కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. ఏలయనగా, సమాజమందిరములలో ప్రతి విశ్రాంతిదినమున మోషే లేఖనములు చదువుటవలన మునుపటి తరములనుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను.” (అపో.కా.16:19-21)

అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరుగల యూదాను సీలను తమలో ఏర్పరచుకొని, పౌలుతోను బర్నబాతోను అంతియొకయకు పంపుట యుక్తమని అపొస్తలులకును పెద్దలకును వీరు వ్రాసి, వారిచేత పంపిన దేమనగా అపొస్తలులును పెద్దలైన సహోదరులును అంతియొకయ లోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్యజనులుగానుండిన సహోదరులకు శుభము. కొందరు మాయొద్దనుండి వెళ్లి, తమ బోధచేత మిమ్మును కలవరపరచి, మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మే మధికారమిచ్చి యుండలేదు గనుక మనుష్యులను ఏర్పరచి, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుకొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతోకూడ మీయొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను. కాగా యూదాను సీలను పంపి యున్నాము; వారును నోటిమాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విస ర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక.”

పై లేఖనాలలోని సారాంశము…

యూదయ నుండి వచ్చిన కొందరు మరియు వారితో ఏకీభవించిన పరిసయ్యుల తెగలోనుండి విశ్వాసులుగా మారినవారు చేసిన బోధ: రక్షణపొందుటకు మోషేధర్మశాస్త్రమును పాటించాలి.

పౌలు మరియు బర్నబాల బోధ: రక్షణపొందుటకు మోషేధర్మశాస్త్రమును పాటించనవసరము లేదు.

అపోస్తలుల సమాలోచన: అన్యజనులలోనుండి విశ్వాసులుగా మారిన వారు తమ విశ్వాసముద్వారా దేవుని పరిశుద్ధాత్మను పొంది దేవుని చేత సాక్ష్యము పొందారు. వారి విశ్వాసమును బట్టి దేవుడు వారి హృదయాలను పవిత్ర పరచాడు. ఈ కారణాన్నిబట్టి మనమైనను మన పితరులైనను మోషేధర్మశాస్త్రమును పాటించుట అన్న మోయలేకపోయిన కాడిలాంటిదాన్ని వారిపై మోపకూడదు. అన్యజనులలోనుండి దేవుడు రక్షించుకున్న వారిపై మోషేధర్మశాస్త్రమనే కాడీని మోపే ప్రయత్నము చేస్తే అది దేవున్ని శోధించడమే.

అన్యులలోనుండి వచ్చిన విశ్వాసులకు అపోస్తలుల లేఖ: కొందరు అంటే యూదయనుండి వచ్చినవారు అలాగే పరిసయ్యుల తెగలోనుండి విశ్వాసులుగా మారినవారు మీవద్దకు వచ్చి మీ విశ్వాసాన్ని కలవరపరచడం జరిగింది. వారిని మేము పంపలేదు, వారు బోధించిన విశయాలను చెప్పే అధికారము మేము వారికి యివ్వలేదు. మీరు పాటించాల్సిన ఆవశ్యకమైనవి ఇవి: విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.

క్రొత్తనిబంధనలో పాలుపొందినవిశ్వాసులకు మోషేధర్మశాస్త్రము పట్ల ఉండాల్సిన వైఖరిని గురించి అపోస్తలుడైన పౌలుద్వారా యివ్వబడిన లేఖనాలలో మరికొంత స్పష్టత యివ్వబడింది:

యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని.” (1కొరింథీ.9:20)

మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయ బడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయముల మీదనున్నది గాని వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.” (2కొరింథీ.3:14-16)

నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను; నీతి ధర్మశాస్త్రమువలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్‌ప్రయోజనమే.” (గలతీ.2:19-21)

ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగాధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడిన విధులన్నియుచేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.” (గలతీ.3:10)

ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతి క్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను.” (గలతీ.3:19)

కాబట్టి మనము విశ్వాసమూలమున నీతి మంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడి పించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను. అయితే విశ్వాసము వెల్లడియాయెను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము.” (గలతీ.3:24-25)

మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృప లోనుండి తొలగిపోయి యున్నారు.” (గలతీ.5:4)

మోషేధర్మశాస్త్రము యొక్క పాత్ర

మెస్సయ్యకు పూర్వం:

1) సృష్టికర్తయైన దేవున్ని మరియు ఆయన నైజాన్ని తెలియపరుస్తుంది (ని.కాం.18:11; ద్వి.కాం.4:35)
2) రాబోవు వాటికి మరియు క్రీస్తుకు ఛాయ రూపము (కొలొస్సీ.2:17; హెబ్రీ.10:1)    
3) ఇశ్రాయేలీయులకు బాలశిక్షకుడు (గలతీ.3:24) 
4) పాపమంటే యేమిటో తెలియపరుస్తుంది (రోమా.7:7) 
5) మానవ ప్రయత్నాల దివాళుకోరుతనాన్ని మరియు విమోచకుని ఆవశ్యకతను నొక్కివక్కాణిస్తుంది (రోమా.3:9,19)
6) హృదయాలలో నిరీక్షణను కలిగిస్తుంది (రోమా.15:4) 
7) విశ్వాసనికి మాదిరిని చూపిస్తుంది (హెబ్రీ.11:4) 
8) ఆత్మీయ సత్యాలను అలంకారరూపంలో అందిస్తుంది (గలతీ.4:24) 
9) బుద్దిచెబుతుంది/బోధిస్తుంది  (రోమా.15:4; 1కొరింథీ.10:5-11)     
10) ధర్మవిరోధుల కొరకు మరియు పాపులకు కొరకు నియమింపబడినది (గలతీ.3:19; 1తిమోతి 1:8-11)  
11) వాగ్ధానము చేయబడిన సంతానము అంటే మెస్సయ్యా వచ్చువరకు నియమించబడింది (గలతీ.3:19)
12) నెరవేర్చబడాల్సినవన్నీ నెరవేర్చబడేవరకు వునికిలో వుంటుంది (మత్తయి.5:18)

మెస్సయ్య నుండి:

1) ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది (2తిమోతి.3:16-17)
2) పాపమంటే యేమిటో తెలియపరుస్తుంది (రోమా.7:7) 
3) విశ్వాసనికి మాదిరిని చూపిస్తుంది (హెబ్రీ.11:4) 
4) ఆత్మీయ సత్యాలను అలంకారరూపంలో అందిస్తుంది (గలతీ.4:24) 
5) బుద్దిచెబుతుంది/బోధిస్తుంది  (రోమా.15:4; 1కొరింథీ.10:5-11) 
6) ధర్మవిరోధుల కొరకు మరియు పాపులకు కొరకు నియమింపబడినది (గలతీ.3:19; 1తిమోతి 1:8-11)

మెస్సయ్య మోషేధర్మశాస్త్రాన్ని తప్పుబట్టి కొట్టివేయడానికి రాలేదు. అయితే, ఒక యూదునిగా దాన్ని పరిపూర్ణంగా పాటించడమే [φυλάσσω/ఫులస్సో=అనుసరించుట/పాటించుట] కాకుండా దానిలోని ఛాయారూపాలను నెరవేర్చి [πληρόω/ప్లెరూహ్=నెరవేర్చబడుట/సంపూర్తి అవుట] మానవుల రక్షణ/మోక్షముకై దేవుడేర్పరచిన ప్రణాలికలోని దాని పాత్రను సంపూర్తి పూర్తిచేయటానికి వచ్చాడు (మత్తయి.5:17; గలతీ.3:25).

ఇప్పుడు మోషేధర్మశాస్త్రము పట్ల ఉండాల్సిన దైవసంబధుల వైఖరి

క్రొత్తది అంటే క్రొత్తనిబంధన మరియు అందులోని భాగమైన క్రీస్తుధర్మశాస్త్రము [Law of Christ (గలతీ.6:2)] లేక మెస్సయ్యతోర [యెషయా 42:4 = యోహాను 13:34, 14:26, 16:12-15; 1కొరింథీ.9:21; 1యోహాను 2:3-6] వచ్చినదనుక మోషేధర్మశాస్త్రము రద్దుచేయబడి [καταργέω/కతర్గెవొ=తొలగుట/రద్దు—రోమా.7:1-6; 2కొరింథీ.3:14; ఎఫెసి.2:14; కొలస్సీ.2:13-15]  తొలగించబడింది [ἀθέτησις/అథెటెసిస్=నివారణ/రద్దు; ἀναιρέω/అనాహిరెయొ=ముగింపు/తీసివేయుట–హెబ్రీ.7:18-19, 8:13, 10:9]. 

దీనిభావం…

  • మోషేధర్మశాస్త్రము ఉనికిలో లేకుండా అదృశ్యమయిందని కాదు.
  • మోషేధర్మశాస్త్రన్ని చదవకూడదని కాదు.
  • మోషేధర్మశాస్త్రములో తెలుసుకోవలసిన విశయాలు లేవని కాదు.
  • మోషేధర్మశాస్త్రములో విశ్వాసులు అన్వయించుకోవలసిన విశయాలు లేవని కాదు.
  • మోషేధర్మశాస్త్రాము యొక్క అధికారము క్రింద విశ్వాసులు లేరని (రోమా.6:14; గలతీ.4:21, 5:18).
  • మోషేధర్మశాస్త్రము యొక్క ఆజ్ఙలు/విధులను పాటించడముద్వారా నీతిని పొందే ఆగత్యము విశ్వాసులకు లేదని (గలతీ.5:4).
  • మోషేధర్మశాస్త్రము విశ్వాసులకు కాదు అవిశ్వాసులకు నియమించబడిందని (1తిమోతి.1:8-10).
  • మోషేధర్మశాస్త్రాన్ని విశ్వాసులు ధర్మానుకూలంగా ఉపయోగించాలి. అంటే, క్రొత్తనిబంధన బోధల వెలుగులో క్రొత్తనిబంధన బోధలకు వ్యతిరిక్తముకానివాటిని విశ్వాసులు ఉపయోగించుకోవాలి (1తిమోతి.1:11).

పది ఆజ్ఙలు

మోషేధర్మశాస్త్రములో అందించబడిన కొన్ని బోధలను మెస్సయ్య బోధలో తిరిగి ప్రవేశపెట్టడమైనది. అందులోని అతి ప్రధానమైన భాగం దశాజ్ఙలు. క్రొత్తనిబంధనలో ప్రవేశించి దేవుని ప్రజలుగా మారిన నిజవిశ్వాసులు దశాజ్ఙలకు వ్యతిరేకంగా జీవించకూడదు. అయితే, ఇది మోషేధర్మశాస్త్రాన్ని బట్టి కాదుగాని మెస్సయ్య ధర్మశాస్త్రాన్నిబట్టి మాత్రమే నన్నది గుర్తుంచుకోవాలి.

మొదటి ఆజ్ఙ
బైబిలులో ప్రత్యక్షపరచుకున్న దేవున్నితప్ప వేరొక దేవున్ని కలిగిఉండకూడదు.”
పాతనిబంధన తరువాత: ని.కాం.20:3; ద్వి.కాం.5:7 =
క్రొత్తనిబంధనకు ముందు: మత్తయి.4:10; లూకా.4:8
క్రొత్తనిబంధన తరువాత: ప్రకటన.14:7

రెండవ ఆజ్ఙ
పూజించుటకు సృష్టిలోని రూపాలను లేక విగ్రహాలను చేసికోకూడదు.”
పాతనిబంధన తరువాత: ని.కాం.20:4-6; ద్వి.కాం.5:8-10 =
క్రొత్తనిబంధన తరువాత: అపో.కా.15:20; 1కొరింథీ.6:9-10; గలతీ.5:19-20; ఎఫెసీ.5:5

మూడవ ఆజ్ఙ
దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్ఛరింపరాదు.”
పాతనిబంధన తరువాత: ని.కాం.20:7; ద్వి.కాం.5:11 =
క్రొత్తనిబంధనకు ముందు: మత్తయి.5:33-37
క్రొత్తనిబంధన తరువాత: 1తిమోథి.6:1; యాకోబు.2:7

నాలుగవ ఆజ్ఙ
విశ్రాంతిదినాన్ని పరిశుద్ధముగా ఆచరించవలెను.”
పాతనిబంధన తరువాత: ని.కాం.20:8-11; ద్వి.కాం.5:12-15 =
క్రొత్తనిబంధనకు ముందు: మత్తయి.12:8; లూకా.23:56

ఐదవ ఆజ్ఙ
తల్లిని తండ్రిని సన్మానించవలెను.”
పాతనిబంధన తరువాత: ని.కాం.20:12; ద్వి.5:16 =
క్రొత్తనిబంధనకు ముందు: మత్తయి.15:4-9; 19:19; మార్కు.10:19; లూకా.18:20
క్రొత్తనిబంధన తరువాత: రోమా.1:29-30; ఎఫెసీ.6:1-3

ఆరవ ఆజ్ఙ
నరహత్య చేయకూడదు.”
పాతనిబంధన తరువాత: ని.కాం.20:13; ద్వి.కాం.5:17 =
క్రొత్తనిబంధనకు ముందు: మత్తయి.5:21-22; 19:18; మార్కు.10:19; లూకా.18:20
క్రొత్తనిబంధన తరువాత: రోమా.1:29-30, 13:9

ఏడవ ఆజ్ఙ
వ్యభిచరింపకూడదు.”
పాతనిబంధన తరువాత: ని.కాం.20:14; ద్వి.కాం.5:18 =
క్రొత్తనిబంధనకు ముందు: మత్తయి.5:27-28, 19:18; మార్కు.10:11-12, 19; లూకా.16:18, 18:20
క్రొత్తనిబంధన తరువాత: రోమా.7:2-3, 13:9

ఎనిమిదవ ఆజ్ఙ
దొంగిలకూడదు.”
పాతనిబంధన తరువాత: ని.కాం.20:15; ద్వి.కాం.5:19 =
క్రొత్తనిబంధనకు ముందు: మత్తయి.19:18; మార్కు.10:19; లూకా.18:20
క్రొత్తనిబంధన తరువాత: రోమా.13:9; ఎఫెసీ.4:28; 1పేతురు.4:15; ప్రకటన.9:21

తొమ్మిదవ ఆజ్ఙ
పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు.”
పాతనిబంధన తరువాత: ని.కాం.20:16; ద్వి.కాం.5:20 =
క్రొత్తనిబంధనకు ముందు: మత్తయి.19:18; మార్కు.10:19; లూకా.18:20
క్రొత్తనిబంధన తరువాత: అపో.కా.5:3-4; రోమా.13:9; ఎఫెసీ.4:25

పదవ ఆజ్ఙ
పొరుగువాని భార్యనైనను, ఆస్థినైనను లేక దేనినైనను ఆశింపరాదు.”
పాతనిబంధన తరువాత: ని.కాం.20:17; ద్వి.కాం.5:21 =
క్రొత్తనిబంధనకు ముందు: లూకా.12:15
క్రొత్తనిబంధన తరువాత: రోమా.1:29, 7:7, 13:9; 1 కొరింథీ.6:9-10; గలతీ.5:19-21; ఎఫెసీ.5:3,5

Permalink to single post

రబ్బీల మతం Vs. మెస్సయ్య మార్గం

రబ్బీల మత ప్రారంభం

రబ్బీల మతం [జూడాయిజం] అన్నది ప్రవక్తలకాలం తరువాత ఉనికిలోకి వచ్చిన మతం.

పాతనిబంధన కాలములోని చివరి ప్రవక్త మలాకి తరువాత దేవునికి మరియు నరులకు మధ్య దాదాపు 400 సంవత్సరాల నిశబ్ధత నెలకొన్నది. అటుతరువాతే బాప్తీస్మమిచ్చు యోహానుద్వారా ప్రకటించబడిన మారుమనస్సుకొరకైన పిలుపు, మెస్సయ్య యొక్క ఉపదేశము (యెషయా.42:4), చివరగా మెస్సయ్య పంపిన అపోస్తలులద్వారా యివ్వబడిన క్రొత్తనిబంధనాగ్రంథాలు మానవకోటికి అందించబడ్డాయి.

పాతనిబంధనా కాలములోని చివరిప్రవక్తకు మరియు బాప్తీస్మమిచ్చు యోహానుకు మధ్య నెలకొనివున్న 400 సంవత్సరాల నిశబ్ధకాలములో యూదుమతబోధకుల ప్రాభల్యము పెరిగి వారి ప్రయత్నాలలో రబ్బీల మతం అయిన జూడాయిజం లేక యూదుమతం అన్నది మొలకెత్తింది. ఈమతస్తులు ఒకవైపు మోషేద్వారా యివ్వబడిన తోరా మరియు అటుతరువాత వచ్చిన ప్రవక్తలద్వారా యివ్వబడిన లేఖనాలలోని సందేశాలను సామాన్యులకు బోధిస్తూ తాముమాత్రము తమకిష్టమైన నియమాలను విధులను ఏర్పరచుకొని వాటిప్రకారం వేశధారజీవితం గడిపేవారు.

ప్రవక్తల ప్రవచనాలను నెరవేరుస్తూ మొదటిశతాబ్ధములో ఇశ్రాయేలీయుల మధ్యకు విచ్చేసిన మెస్సయ్య ఈ మతబోధకులను ఎదురిస్తూ వారి దైవవ్యతిరేక బోధలను ప్రజల ముందు యెండగడుతూ దారితప్పిన అమాయక ఇశ్రాయేలీయులను తన ఉపదేశముద్వారా తిరిగి దేవుని మార్గములోకి తీసుకురావడం మొదలుబెట్టాడు.

తనాక్ జూడాయిజమునుండి తాల్ముద్ జూడాయిజంలోకి

ఒకవైపు మెస్సయ్య పాపపరిహారార్థబలిగా మరణించి తిరిగిలేచి పరలోకానికి ఆరోహనమైన తరువాతి దినాలలో వేలాది యూదుమతస్తులు జూడాయిజమును వదిలి యేసును (యషువ) క్రీస్తుగా (మెస్సయ్య) గుర్తించి క్రైస్తవులుగా మారడం మొదలుబెట్టారు. మరొకవైపు 70 క్రీ.శ. లో జూడాయిజానికు కేంద్రంగా నిలిచిన యెరూషలేములోని దేవాలయమును రోమనులు ద్వంసం చేసారు. ఈ రేండు కారణాలనుబట్టి తనాక్ ఆధారంగా అంటే పాతనిబంధనాగ్రంథాన్ని ఆధారం చేసుకొని పాటించబడిన జూడాయిజం (తనాక్-జూడాయిజం) తొందరలోనే ఉనికిని కోల్పోవడంతో రెండవ శతాబ్ధములో యూదుమతబోధకుల ప్రమేయంతో ఒక క్రొత్త జూడాయిజం అంటే రబ్బీల బోధలపై ఆధారపడి ప్రస్తుతం విస్తరిస్తున్న రబ్బీల జుడాయిజం (తాల్ముద్-జూడాయిజం) పుట్టుకొచ్చింది.

జూడాయిజములోనుండి మెస్సయ్య మార్గములోనికి

పౌలుగా మారిన ఒకప్పటి సౌలు కూడా యేసే (యషువ) క్రీస్తు (మెస్సయ్య) అన్న ఉత్కృష్ట సత్యాన్ని గుర్తించకముందు జూడాయిజములో (యూదుమతములో) తాను నిష్టతో గడిపిన తన జీవితముగురించి చెప్పుకోవడం చూస్తాము (గలతీ.1:11-14). అయినా తాను యేసుక్రీస్తులో పొందబోయే మహిమతో పోలిస్తే అదంతా పెంటతో సమానమని కూడా (ఫిలిప్పీ.3:4-11) అపోస్తలుడైన పౌలు నిర్ద్వందంగా తేల్చేసాడు! తాను ఎంతో నిష్టగా పాటించిన జూడాయిజం తనను రక్షించలేకపోయిందని అయితే మెస్సయ్యగా వచ్చిన యేసే తనను రక్షించగలిగాడని సాక్ష్యమిచ్చి ఆ సత్యాన్ని ప్రకటిస్తూ ఆప్రయత్నములో తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి హతసాక్షిగా మారాడు.

అపోస్తలుడైన పౌలు ఒకప్పటి తన పాతజీవితాన్ని గురించి మాట్లాడుతూ క్రింది వివరాలనిచ్చాడు:

ఎనిమిదవదినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రవిషయము పరిసయ్యుడనై, ఆసక్తివిషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని” (ఫిలిప్పీ.3:5-6)

మెస్సయ్యను గుర్తించి వెంబడిస్తున్న తరువాత ఆ పాత జీవితములోని గొప్పల గురించి చెబుతూ అపోస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు,

అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చ యముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును, ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణవిషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.” (ఫిలిప్పీ.3:7-11)

పై లేఖనాలలో అపోస్తలుడైన పౌలు యొక్క జీవితములోని లాభకరమైన విశయాలు:

  1. ఎనిమిదవ దినమున సున్నతి పొందటం
  2. ఇశ్రాయేలువంశపువానిగా పుట్టడం
  3. బెన్యామీను గోత్రముకు చెందినవాడుగా ఉండటం
  4. హెబ్రీయ సంతానముకు చెందటం
  5. ధర్మశాస్ర విశయములో పరిసయ్యుడుగా జీవించటం
  6. ఆసక్తి విశయములో సంఘమును అంటే నిజ క్రైస్తవులను హింసించటం
  7. ధర్మశాస్త్రము యొక్క నీతి విశయములో నిందారహితుడుగా చూపించుకోవటం

అయినా, అపోస్తలుడైన పౌలు తాను క్రీస్తును సంపాదించుకొన్న తరువాత క్రీస్తునందలి విశ్వాసముద్వారా దేవుని నీతిని పొందిన కారణాన్నిబట్టి అలాగే క్రీస్తును పోలి వుండాలన్న ఆశనుబట్టి పై లాభకరమైన వాటినన్నిటిని నష్టముగా మరియు పెంటగా లెక్కించాడు! పౌలు భక్తుడు నష్టముగా మరియు పెంటగా లెక్కించినవాటిలోని కొన్నింటిని సంపాదించుకోవాలనే వృధా ప్రయత్నము చేసే వ్యక్తుల మానసికస్థితిగాని లేక స్వభావలక్షణాలనుగాని వివరించి చెప్పాల్సిన అవసరము లేదు!

అపోస్తలుడైన పౌలుకు భిన్నంగా ఈనాడు అనేకమంది క్రైస్తవులనబడినవారు [మత క్రైస్తవులు లేక నామకార్థ క్రైస్తవులు] జూడాయిజమువారి దుర్బోధలనుబట్టి మోసపోతూ తిరిగి అపోస్తలుడైన పౌలు నష్టముగా మరియు పెంటగా ఎంచినవాటివైపు మరలిపోతూ నిత్యజీవితాన్ని కోల్పోతున్నారు. అయ్యో అలాంటివారికి శ్రమ!

« Older Entries