Category Archives: మెస్సయ్య

Permalink to single post

రబ్బీల మతం Vs. మెస్సయ్య మార్గం

రబ్బీల మత ప్రారంభం

రబ్బీల మతం [జూడాయిజం] అన్నది ప్రవక్తలకాలం తరువాత ఉనికిలోకి వచ్చిన మతం.

పాతనిబంధన కాలములోని చివరి ప్రవక్త మలాకి తరువాత దేవునికి మరియు నరులకు మధ్య దాదాపు 400 సంవత్సరాల నిశబ్ధత నెలకొన్నది. అటుతరువాతే బాప్తీస్మమిచ్చు యోహానుద్వారా ప్రకటించబడిన మారుమనస్సుకొరకైన పిలుపు, మెస్సయ్య యొక్క ఉపదేశము (యెషయా.42:4), చివరగా మెస్సయ్య పంపిన అపోస్తలులద్వారా యివ్వబడిన క్రొత్తనిబంధనాగ్రంథాలు మానవకోటికి అందించబడ్డాయి.

పాతనిబంధనా కాలములోని చివరిప్రవక్తకు మరియు బాప్తీస్మమిచ్చు యోహానుకు మధ్య నెలకొనివున్న 400 సంవత్సరాల నిశబ్ధకాలములో యూదుమతబోధకుల ప్రాభల్యము పెరిగి వారి ప్రయత్నాలలో రబ్బీల మతం అయిన జూడాయిజం లేక యూదుమతం అన్నది మొలకెత్తింది. ఈమతస్తులు ఒకవైపు మోషేద్వారా యివ్వబడిన తోరా మరియు అటుతరువాత వచ్చిన ప్రవక్తలద్వారా యివ్వబడిన లేఖనాలలోని సందేశాలను సామాన్యులకు బోధిస్తూ తాముమాత్రము తమకిష్టమైన నియమాలను విధులను ఏర్పరచుకొని వాటిప్రకారం వేశధారజీవితం గడిపేవారు.

ప్రవక్తల ప్రవచనాలను నెరవేరుస్తూ మొదటిశతాబ్ధములో ఇశ్రాయేలీయుల మధ్యకు విచ్చేసిన మెస్సయ్య ఈ మతబోధకులను ఎదురిస్తూ వారి దైవవ్యతిరేక బోధలను ప్రజల ముందు యెండగడుతూ దారితప్పిన అమాయక ఇశ్రాయేలీయులను తన ఉపదేశముద్వారా తిరిగి దేవుని మార్గములోకి తీసుకురావడం మొదలుబెట్టాడు.

తనాక్ జూడాయిజమునుండి తాల్ముద్ జూడాయిజంలోకి

ఒకవైపు మెస్సయ్య పాపపరిహారార్థబలిగా మరణించి తిరిగిలేచి పరలోకానికి ఆరోహనమైన తరువాతి దినాలలో వేలాది యూదుమతస్తులు జూడాయిజమును వదిలి యేసును (యషువ) క్రీస్తుగా (మెస్సయ్య) గుర్తించి క్రైస్తవులుగా మారడం మొదలుబెట్టారు. మరొకవైపు 70 క్రీ.శ. లో జూడాయిజానికు కేంద్రంగా నిలిచిన యెరూషలేములోని దేవాలయమును రోమనులు ద్వంసం చేసారు. ఈ రేండు కారణాలనుబట్టి తనాక్ ఆధారంగా అంటే పాతనిబంధనాగ్రంథాన్ని ఆధారం చేసుకొని పాటించబడిన జూడాయిజం (తనాక్-జూడాయిజం) తొందరలోనే ఉనికిని కోల్పోవడంతో రెండవ శతాబ్ధములో యూదుమతబోధకుల ప్రమేయంతో ఒక క్రొత్త జూడాయిజం అంటే రబ్బీల బోధలపై ఆధారపడి ప్రస్తుతం విస్తరిస్తున్న రబ్బీల జుడాయిజం (తాల్ముద్-జూడాయిజం) పుట్టుకొచ్చింది.

జూడాయిజములోనుండి మెస్సయ్య మార్గములోనికి

పౌలుగా మారిన ఒకప్పటి సౌలు కూడా యేసే (యషువ) క్రీస్తు (మెస్సయ్య) అన్న ఉత్కృష్ట సత్యాన్ని గుర్తించకముందు జూడాయిజములో (యూదుమతములో) తాను నిష్టతో గడిపిన తన జీవితముగురించి చెప్పుకోవడం చూస్తాము (గలతీ.1:11-14). అయినా తాను యేసుక్రీస్తులో పొందబోయే మహిమతో పోలిస్తే అదంతా పెంటతో సమానమని కూడా (ఫిలిప్పీ.3:4-11) అపోస్తలుడైన పౌలు నిర్ద్వందంగా తేల్చేసాడు! తాను ఎంతో నిష్టగా పాటించిన జూడాయిజం తనను రక్షించలేకపోయిందని అయితే మెస్సయ్యగా వచ్చిన యేసే తనను రక్షించగలిగాడని సాక్ష్యమిచ్చి ఆ సత్యాన్ని ప్రకటిస్తూ ఆప్రయత్నములో తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి హతసాక్షిగా మారాడు.

అపోస్తలుడైన పౌలు ఒకప్పటి తన పాతజీవితాన్ని గురించి మాట్లాడుతూ క్రింది వివరాలనిచ్చాడు:

ఎనిమిదవదినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రవిషయము పరిసయ్యుడనై, ఆసక్తివిషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని” (ఫిలిప్పీ.3:5-6)

మెస్సయ్యను గుర్తించి వెంబడిస్తున్న తరువాత ఆ పాత జీవితములోని గొప్పల గురించి చెబుతూ అపోస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు,

అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చ యముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును, ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణవిషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.” (ఫిలిప్పీ.3:7-11)

పై లేఖనాలలో అపోస్తలుడైన పౌలు యొక్క జీవితములోని లాభకరమైన విశయాలు:

  1. ఎనిమిదవ దినమున సున్నతి పొందటం
  2. ఇశ్రాయేలువంశపువానిగా పుట్టడం
  3. బెన్యామీను గోత్రముకు చెందినవాడుగా ఉండటం
  4. హెబ్రీయ సంతానముకు చెందటం
  5. ధర్మశాస్ర విశయములో పరిసయ్యుడుగా జీవించటం
  6. ఆసక్తి విశయములో సంఘమును అంటే నిజ క్రైస్తవులను హింసించటం
  7. ధర్మశాస్త్రము యొక్క నీతి విశయములో నిందారహితుడుగా చూపించుకోవటం

అయినా, అపోస్తలుడైన పౌలు తాను క్రీస్తును సంపాదించుకొన్న తరువాత క్రీస్తునందలి విశ్వాసముద్వారా దేవుని నీతిని పొందిన కారణాన్నిబట్టి అలాగే క్రీస్తును పోలి వుండాలన్న ఆశనుబట్టి పై లాభకరమైన వాటినన్నిటిని నష్టముగా మరియు పెంటగా లెక్కించాడు! పౌలు భక్తుడు నష్టముగా మరియు పెంటగా లెక్కించినవాటిలోని కొన్నింటిని సంపాదించుకోవాలనే వృధా ప్రయత్నము చేసే వ్యక్తుల మానసికస్థితిగాని లేక స్వభావలక్షణాలనుగాని వివరించి చెప్పాల్సిన అవసరము లేదు!

అపోస్తలుడైన పౌలుకు భిన్నంగా ఈనాడు అనేకమంది క్రైస్తవులనబడినవారు [మత క్రైస్తవులు లేక నామకార్థ క్రైస్తవులు] జూడాయిజమువారి దుర్బోధలనుబట్టి మోసపోతూ తిరిగి అపోస్తలుడైన పౌలు నష్టముగా మరియు పెంటగా ఎంచినవాటివైపు మరలిపోతూ నిత్యజీవితాన్ని కోల్పోతున్నారు. అయ్యో అలాంటివారికి శ్రమ!

Permalink to single post

యేసు క్రీస్తు మరణపునరుత్థాన వివరాల మధ్య పొందిక

అవిశ్వాసుల అపోహలు మరియు అభ్యంతరాలు

– ఆదివారము తెల్లవారుజామున యేసుసమాధి వద్దకు వచ్చింది ఎంతమంది స్త్రీలు? ఒక్కరా అంటే మగ్ధలేనే మరియనా (యోహాను.20:1)? ఇద్దరా (మత్తయి.28:1)? ముగ్గురా (మార్కు.16:1)? లేక అనేకులా (లూకా.24:1)?
– యేసు సమాధిలో స్త్రీలు చూసింది ఒక వ్యక్తినా/దేవదూతనా (మత్తయి.28:2-7; మార్కు.16:4-7) లేక యిద్దరు వ్యక్తులనా/దేవదూతలనా (లూకా.24:4-8)?
– యేసు సిలువ వేయబడింది లేక మరణించింది యేరోజు?
– యేసు పునరుత్థానుడైన తరువాత మొట్టమొదట ఎవరికి కనిపించాడు? మగ్ధలేనే మరియకా (మార్కు.16:9) లేక యితర స్త్రీలకా (మత్తయి.28:8)?
– యేసు సమాధిలోనుండి లేచింది యేరోజు?
– యేసు సమాధిలో ఎన్ని గంటలు మరియు రోజులు వున్నాడు?
– యేసు మరణపునరుత్థానములో యోనా సూచక క్రియ ఏవిధంగా నేరవేర్చబడింది (మత్తయి.12:39-40)?

అవిశ్వాసులు మరియు బైబిలు వ్యతిరేకులు క్రొత్తనిబంధన గ్రంథములోని దైవసత్యాలను తిరస్కరించే తమ వ్యర్థ ప్రయత్నాలాలో భాగంగా పై ప్రశ్నలను లేవనెత్తడం సహజంగా జరిగే విశయమే. అయితే, సత్యం అన్ని వేళల సరళంగానే అందించబడాలి అన్న నియమమేదీ లేదు. మరిముఖ్యంగా, దైవ సత్యం అన్నది మానవాళికి చాలామట్టుకు మర్మఘర్బితంగా యివ్వబడింది అన్నది గమనములో వుంచుకోవాలి. 

క్రొత్తనిబంధన గ్రంథములోని వివరణలు సత్యాన్వేషకులకు మరియు సత్యద్వేషులకు వేరువేరుగా అగుపించే అవకాశాలు ఎక్కువ. బైబిలును తప్పు బట్టి తమ వక్రవ్యాఖ్యానాలద్వారా అమాయకులను తప్పు మార్గం పట్టించే సత్యద్వేషులకు బైబిలులోని ప్రతి సత్యం ఒక అసత్యంగా ప్రతి మర్మం పరస్పర వ్యతిరిక్తంగా కనిపించడం సర్వసాధారణమైన విశయం. అలాంటివారి అజ్ఙానాన్ని దుష్టప్రయత్నాలను ప్రక్కకు పెట్టి సహృదయముతో సత్యాన్ని స్వీకరించే సత్యాన్వేషకులకు సహకరించే సదుద్దేశముతో క్రింది వివరాలను మీముందు వుంచడమైనది. సత్యాన్వేషకులు, సహృదయులు, మరియు విజ్ఙులు అయిన వారిని క్రింది వివరాలను పరిశీలించి సత్యాన్ని స్వీకరించాల్సిందిగా సగౌరవంగా అహ్వానిస్తున్నాము.

నలుగురు సువార్తికులద్వారా యివ్వబడిన యేసు క్రీస్తు మరణపునరుత్థానాల వివరాల సమగ్ర సారాంశము

యూదులు దినాన్ని లెక్కించే విధానము ప్రకారము యేసు క్రీస్తును బుధవారము నిస్సాను 14వ తారీఖునాడు మధ్యరాత్రి తరువాత రోమా సైనికులు బంధించి తీసుకువెళ్ళారు. ప్రాతఃకాలము 6 గంటలకుముందే రోమా అధిపతి పొంతిపిలాతు అతనికి తీర్పుతీర్చి సిలువ వేయబడుటకు అప్పగించాడు (యోహాను.18:28; 19:14).

అదేదినము ఉదయము 9 గంటల ప్రాంతములో ఆయనను సిలువవేసారు (మార్కు.15:25). ఆరోజు మధ్యాహానము 12 గంటలనుండి 3 గంటలవరకు ఆదేశమంతా చీకటికమ్మింది (మత్తయి.27:45; మార్కు.15:33; లూకా.23:44). 3 గంటలకు ఆయన ప్రాణం విడిచాడు (మార్. 15:33-37).

అదేరోజు సాయంత్రము 6 గంటలలోపే ఆయన దేహాన్ని దగ్గరిలోనే వున్న ఒక తోటలోని రాతి సమాధిలో వుంచారు (మార్కు.15:42-47; యోహాను.19:41-42). ఇదంతా దగ్గరలోనే నిలుచుండి ఆయనను వెంబడించిన స్త్రీలు (యాకోబు మరియు యోసేపుల తల్లి మరియ, జెబదీ కుమారుల తల్లి, మగ్దలేనె మరియ, మరియు సలోమి) చూసి తమ యిళ్ళకు వెళ్ళి ఆ దినమంతా (బుధవారము సాయంత్రము మొదలుకొని గురువారము సాయంత్రమువరకు) విశ్రమించారు. అది ప్రత్యేకమైన లేక మహావిశ్రాంతిదినం (యోహాను.19:31). అదేదినం ఆ రాతిసమాధిని అధికారులు భద్రంచేసారు (మత్తయి.27:62-66). 

ఆ ప్రత్యేక లేక మహావిశ్రాంతిదినముగడిచిన తరువాత శుక్రవారమునాడు స్త్రీలు సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను కొని సిద్దపరచి (మార్కు 16:1) మరునాడు అంటే శనివారము సాధారణ విశ్రాంతిదినము గనుక తిరిగి ఆ దినమంతా విశ్రమించారు (లూకా.23:56).

శనివారము సాయంకాలము 6 గంటల ప్రాంతములో ఆయన సమాధినుండి తిరిగి లేచాడు! ఇది ఆయన చనిపోకముందు చెప్పిన ప్రవచనాల ఆధారంగా మూడు పగళ్ళు మూడు రత్రుళ్ళు గడచాయి (మత్తయి.12:40) గనుక ఆయన మరణాన్ని జయించి తిరిగిలేచింది శనివారపు చివరిలో లేక ఆదివారపు ప్రారంభములో (బైబిలు లెక్క ప్రకారము ఒక దినము అంటే సాయంత్రము మొదలుకొని మరుసటి సాయంత్రము వరకు) నన్నది గ్రహించవచ్చు.

 ఆదివారము పెందరాళ్ళే యింకా చాలా చీకటిగానున్నప్పుడే యేసు క్రీస్తును వెంబడించిన స్త్రీలు తాము శుక్రవారమునాడు సిద్దపరచిన సుగంధ ద్రవ్యాలను పరిమళ తైలాలను తీసుకొని ఆయన దేహానికి పూయడానికి సమాధివైపు బయలుదేరారు (మార్కు.16:1-2; లూకా.24:1). మగ్దలేనె మరియ వారిలో ఒకతి (మత్తయి.28:1; యోహాను.20:1). అయితే సమాధి ద్వారానికి అడ్డంగా వుంచబడిన రాతినిగురించి ఆ స్త్రీలు కొంత చింతనచేయాల్సి వచ్చింది (మార్కు.16:3).

ఆ స్త్రీలు సమాధిని సమీపించడానికి ముందే ఆదివారము తెల్లవారుజామున భూకంపము రావడము, పరలోకమునుండి దేవదూత వచ్చి సమాధికి అడ్డుగా వుంచబడిన రాతిని తొలగించి దానిపై కూర్చోవడం జరిగింది (మత్తయి.28:2). ఇదంతా చూసిన కావలివారు భయముతో స్పృహతప్పి పడిపోయారు (మత్తయి.28:4). అటుతరువాత దేవదూత సమాధిలోకి ప్రవేశించి యేసు దేహముంచబడిన స్థలములో ఆయన తల వుంచబడిన కుడిభాగములో కూర్చున్నాడు (మార్కు 16:5). మరికొంత సమయములోనే మరొక దేవదూత వచ్చి యేసు కాళ్ళు వుంచబడిన యెడమభాగములో కుర్చోవడము జరిగింది (లూకా.24:4).

స్త్రీలు యింకా సమాధికి దూరంగా వుండగానే సమాధి రాతి తొలగించబడినట్లు (మార్కు.16:4; లూకా 24:2; యోహాను 20:1) అక్కడే కావలివాళ్ళు నేలపై మృతజీవులలా నిశ్ఛలంగా పడివున్నట్లు గమనించారు (మత్తయి.28:5). ఆ దృశ్యాన్ని చూసిన స్త్రీలు యేసు శరీరాన్ని యెవరో యెత్తుకొనిపోయారన్న తీర్మానానికి వచ్చారు. దాంతో మగ్దలేనె మరియ పేతురుకు మరియు ఇతర శిష్యులకు ఆ విశయాన్ని తెలియచేయడానికి వెంటనే మిగతా స్త్రీలను వదిలి అక్కడినుండే వెనుదిరిగి తిరిగి నగరమువైపు వెళ్ళింది (యోహాను.20:2). 

మగ్దలేనే మరియ తమను విడిచి వెనక్కు వెళ్ళినతదుపరి తతిమా స్త్రీలు ధైర్యం కూడగట్టుకొని తెరచి వుంచిన సమాధిలోనికి ప్రవేశించి అక్కడ యేసు శరీరము లేకుండుట గమనించారు. అంతలోనే మొదట అక్కడ కుడివైపున ఆసీనుడైవున్న దేవదూత వారికి ప్రత్యక్షమయ్యాడు (మార్కు.16:5) ఆ దేవదూత వారిని చూసి లేచి మాట్లాడుతున్నప్పుడు రెండవదూత కూడ వారికి ప్రత్యక్షమై నిలబడ్డాడు (లూకా.24:4). కుడివైపునున్న దేవదూత యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి వారికి ప్రకటించి ఆ వార్తను యేసు శిష్యులకు తెలుపవలసినదంటూ వారికి సూచించాడు (మత్తయి.28:6-7). అదివిన్న ఆ స్త్రీలు భయముతోను ఆనందముతోను సమాధిని విడిచి వెళ్ళిపోయారు (మత్తయి.28:8; మార్కు.16:8).

వారందరు తిరిగి నగరములోకి వచ్చారు కాని తాము చూసిన మరియు విన్న విశయాలను యితరులకు చెప్పడానికి తటపటాయిస్తూ వుండిపోయారు (మార్కు.16:8). స్త్రీలు సమాధిని విడిచివెళ్ళిన తరువాత యిద్దరుదేవదూతలు అదృశ్యమయిపోయారు. చివరికి ధైర్యం కూడగట్టుకొని అ స్త్రీలు శిష్యులదగ్గరకు వెళ్ళి తాము చూసిన విశయాలను తెలియచేసారు (లూకా.24:9-12). 

రమారమి అదేసమయములో మగ్దలేనే మరియ యేసు శిష్యులను కలిసి యేసు దేహాన్ని ఎవరో ఎత్తుకుపోయారన్న వార్త అందించింది (యోహాను 20:2). మగ్దలేనే మరియ మరియు మిగత స్త్రీలు ఆశ్చర్యపరిచే అసాధారణవిశయాలను చెప్పడం శిష్యులు విని వారి మాటలను నమ్మలేక పోయారు (లూకా.24:11). పేతురు మరియు యోహానులు స్త్రీలు చెప్పినది వాస్తవమో కాదోనని తేల్చుకోవడానికి పరుగెత్తి సమాధివద్దకు వెళ్ళారు (లూకా.24:12; యోహాను.20:3). మగ్దలేనే మరియ వారివెంబడే బయలుదేరింది కాని వారిలా పరుగెత్త లేక వారికి చాలా దూరంగా వెనుకబడిపోయింది.

మొదటగా సమాధిని చేరుకున్న యోహాను తరువాత అతని వెనుకే వచ్చిన పేతురు ఇరువురూ కలిసి సమాధిలోనికి ప్రవేశించారు. వారికి యేసు శరీరానికుండిన వస్త్రాలు తప్ప యేసు దేహం కనిపించలేదు సమాధిలో. దాంతో ఆశ్చర్యచకితులై వారిద్దరూ తిరిగి తాముంటున్న ఇంటికి వచ్చేసారు (యోహాను.20:4-4-10). 

ఆ తరువాత అక్కడికి చేరుకున్న మగ్దలేనే మరియ సమాధిలోనికి ప్రవేశించింది. ఆమె ప్రవేశించడానికి ముందే యిద్దరు దేవదూతలు తిరిగి దృశ్యరూపులయ్యారు. సమాధిలోనికి ప్రవేశించిన మరియ ఆ యిద్దరు దేవదూతలను చూసింది. అందులోని కుడివైపుననున్న దూత ఆమెతో మాట్లాడాడు (యోహాను.20:11-13). అదివిని వెనుకకు తిరిగిన మరియకు అక్కడే నిలుచున్న యేసు కనిపించాడు, కాని ఆ ప్రాతఃకాల మసకచీకటిలో ఆమె అది యేసు అని గుర్తించలేక అతన్ని అక్కడి తోటమాలి అని భ్రమించింది. అయితే, అప్పుడే “మరియా” అంటూ యేసు ఆమెను సంబోధిస్తూ పిలవడంతో ఆమె అతన్ని గుర్తుపట్టింది (యోహాను.20:14-16).

యేసు ఆమెతో సంభాశించి తన శిష్యులకు తెలుపమంటూ ఒక సందేశాన్ని యిచ్చి ఆమెను వారిదగ్గరకు పంపించాడు (మార్కు.16:9; యోహాను.20:17). పునరుత్థానుడైన యేసు ప్రభువును మొట్టమొదట చూసింది మగ్దలేనే మరియ (మార్కు.16:9). దీని తరువాత సమాధిలో తాము చూసిన విన్న విశయాలను శిష్యులకు చెప్పి అక్కడినుండి తమలోని ఒకరి ఇంటికి వెళ్ళిన స్త్రీలకు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. వారు పునరుత్థానుడైన ప్రభువును చూసి ఆయనను పూజించారు. వారి ఆరాధనను స్వీకరించిన యేసు వారితో మాట్లాడి వారికో సందేశాన్ని యిచ్చి తన శిష్యులదగ్గరకు తిరిగి పంపించాడు (మత్తయి 28:9-10). 

పై సంఘటనలన్నీ జరుగుతున్న సమయములో కావలివారు స్పృహలోకివచ్చి లేచి నగరములోకి పరిగెత్తుకొనిపోయి యూదామతనాయకులకు తాము చూసినవి తమకు జరిగినవి అన్నీ వివరించి చెప్పారు (మత్తయి.28:11-15). 

ఈసమయానికంతా తోమా తప్ప మిగతా శిష్యులంతా చేరి తప్పిపోయిన ప్రభువు శరీరమును గురించి చర్చించసాగారు. అంతలో ప్రభువైన యేసు మరణములోంచి లేచి సజీవునిగా కనిపించాడంటూ వారిని ఆశ్చర్యముతో తలమునకలుచేసే వార్తను మగ్దలేనే మరియ మోసుకొచ్చింది (మార్కు.16:11; లూకా.24:10; యోహాను.20:18). ఇదే వార్తను నిర్ధారిస్తూ తతిమా స్త్రీలు కూడా శిష్యుల వద్దకు వచ్చి తమకు ప్రభువు తమకు కనిపించి చెప్పిన విశయాలన్నిటిని వారికి పూసగుచ్చినట్లు వివరించి చెప్పారు (లూకా.24:9). 

ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయినతరువాత మూడు సంపూర్ణదినాలు అంటే 72 గంటల సమయం భూగర్భములో (పాతాళములో) వున్నాడు అనటానికి మూడు లేఖన ఆధారాలు

1. “ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము [μεγάλη=గొప్ప; పెద్ద;] గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి.” యోహాను.19:31)

పాతనిబంధన గ్రంథములో వివరించిన ప్రకారము సబ్బాతు లేక విశ్రాంతిదినము అన్నది ఒక ప్రత్యేకమైన దినము. ఆ దినములో ఇశ్రాయేలీయులు సమాజముగా దేవుని ఎదుట కూడాలి మరియు వారు ఆదినము జీవనోపాధియైన ఏపనీ చేయకూడదు. విశ్రాంతిదినము రెండు రకాలు. ఒకటి, వారాంతములో వచ్చే సాధారణ విశ్రాంతిదినము (ఏడవదినము లేక శనివారము). రెండు, సంవత్సరములో ఒకేసారి వచ్చే యేడు ప్రత్యేకమైన పండుగ దినాలు. ఈ ప్రత్యేకమైన మహావిశ్రాంతిదినాలు వారములోని ఏదినమైనా రావచ్చు. అవి క్రింద యివ్వబడిన పండుగలు: 

(i) పులియనిరొట్టెల పండుగ యొక్క మొదటి దినము లేక “పెసహ్” ( ఆబీబు/నిసాను మాసము 15వ దినము)–లే.కాం.23:7; సం.కాం.28:17-18
(ii) పులియనిరొట్టెల పండుగ యొక్క చివరి/యేడవ దినము లేక “యోం తొవ్” ( ఆబీబు/నిసాను మాసము 21వ దినము)–ని.కాం.12:18, 13:6; లే.కాం.23:8; సం.కాం.28:25
(iii) పెంతెకోస్తు పండుగ లేక “షవూత్” (సివాను మాసము 6వ దినము)–లే.కాం.23:15-21
(iv) బూరధ్వనుల పండుగ లేక “రోష్-హ షాన” (తిష్రీ మాసము మొదటి దినము)–లే.కాం.23:24-25; సం.కాం.29:1
(v) పాపప్రాయశ్చిత్తార్థదిన పండుగ లేక “యోం కిప్పూర్” (తిష్రీ మాసము 10వ దినము)–లే.కాం.23:23-32; సం.కాం.29:7-8
(vi) పర్ణశాలల పండుగ లేక “సుక్కోత్” (తిష్రీ మాసము 15వ దినము)–లే.కాం.23:33-35; సం.కాం.29:12
(vii)పర్ణశాలల పండుగ యొక్క చివరి దినము లేక “షెమిని అట్జెరెత్” (తిష్రీ మాసము 22వ దినము)–లే.కాం.23:36,39; సం.కాం.29:35 

పై ఏడు పండుగదినాలు మహావిశ్రాంతిదినాలు. ఆదినాలలో ఇశ్రాయేలీయులు దేవుని ఎదుట కూడి సమాజముగా ఆరాధించాలి మరియు వారు ఆదినమంతటిలో జీవనోపదియైన ఏపని చేయకూడదు. యేసు ప్రభువు మరణించిన దినానికి మరుసటి దినము ఏడు ప్రత్యేకమైన మహావిశ్రాంతిదినాలలోని ఒక దినము (యోహాను.19:31). ఒకవేళ, యేసు ప్రభువు మరణించిన దినపు మరుసటి రోజు అయిన మహావిశ్రాంతిదినము కూడా సాధారణ విశ్రాంతిదినమైన శనివారమునాడే వస్తే అది ఒక అసాధారణమైన విశయముగా పరిగణించవచ్చు. అలాంటి అసాధారణ సంఘటన సంభవిస్తే నలుగురు సువార్తికులలో ఒక్కరైనా ఆవిశయాన్ని పేర్కొని వుండేవారు. కాని అలా జరుగలేదు అన్నది యిక్కడ గమనార్హమైన విశయము. 

2. “విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి.” (మార్కు.16:1)
ఆ దినము సిద్ధపరచు దినము; విశ్రాంతి దినారంభము కావచ్చెను. అప్పుడు గలిలయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి.” (లూకా.23:54-56) 

మర్కు 16:1 ప్రకారము స్త్రీలు విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత సుగంధద్రవ్యములను కొన్నారు (సిద్ధపరచారు). లూకా 23:56 ప్రకారము స్త్రీలు సుగంధద్రవ్యములను సిద్ధపరచి (కొని) విశ్రాంతిదినాచారము ప్రకారము విశ్రమించారు. ఈ రెండు వివరాలు వాస్తవమవటానికి రెండు విశ్రాంతిదినాలు వుండాలి–ఒకటి ప్రత్యేకమైన విశ్రాంతిదినము మరొకటి సాధారణమైన విశ్రాంతిదినము. దీన్ని సమర్థిస్తూ యోహాను 19:31లో యేసుక్రీస్తు మరణించిన మరుసటిదినము మహా విశ్రాంతిదినముగా పేర్కొనబడింది. అలాకాని పక్షములో అంటే శుక్రవారమే యేసు ప్రభువు చనిపోయిన దినము అయితే రెండు వివరాలలో ఒకటిమాత్రమే వాస్తవమవుతుంది! 

3. “యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును.” (మత్తయి.12:40) 

పై వాక్యములో ఒకవేళ “మూడు దినాలు” అని వ్రాయబడితే యూదులు దినాన్ని లెక్కించే పద్దతిలో శుక్రవారములోని కొంత భాగము, శనివారము అంతా, మరియు ఆదివారములోని కొంతభాగము కలిపి “మూడుదినాలు” అని లెక్కించే అవకాశముంది. కాని, లేఖనము “మూడు రాత్రింబగళ్ళు” అంటూ చాలా విస్పష్టముగా మూడు సంపూర్ణదినాలను అంటే 72 గంటల సమయాన్ని నొక్కి వక్కాణిస్తున్నది. లేఖనములోని ఈ స్పష్టతను తిరస్కరిస్తున్నవారు ఒకవేళ లేఖనము మూడు సంపూర్ణ దినాల లేక 72 గంటల సమయపు స్పష్టతను వ్యక్తంచేయాల్సివస్తే ఏలాంటి పదజాలాన్ని వుపయోగించాలోనన్నది ఉదాహరణతో వివరించాలి. 

పాతనిబంధన గ్రంథము (తనాక్) ప్రకారము పస్కా పండుగను ఆచరించడములోని కొన్ని ప్రధాన ఆజ్ఙలు మరియు ఘట్టాలు

1. ఆబీబు/నిసాను మాసము 10వ దినాన నిర్దోషమైన ఏడాది వయసున్న పస్కా పశువును ఏర్పరచుకోవాలి (ని.కాం.12:3)
2. పస్కా పశువును ఆబీబు (నిసాను) మాసము 14వ దినము వరకు సిద్ధపరచాలి (ని.కాం.12:7)
3. నిసాను మాసము 14వ దినము సాయంకాలము పస్కా పశువును వధించాలి (ని.కాం.12:7; యెహోషువ 5:10)
4. ఆరాత్రే పస్కా పశువు మాంసమును కాల్చి పొంగని/పులియని రొట్టెలతో చేదు కూరలతో దాన్ని తినవలెను (ని.కాం.12:8)
5. పస్కా పండుగను ఇశ్రాయేలీయులు మాత్రమే పాటించాలి (ని.కాం.12:42-45)
6. పస్కా పండుగను యెరూషలేములోనే ఆచరించాలి (ద్వి.కాం.16:2-7)
7. పస్కా పశువు వధింపబడిన తరువాతే పులియనిరొట్టెలతోకూడిన పస్కా పండుగను ఆచరించాలి (ని.కాం.12:1-11; ద్వి.కాం.16:2-7)

క్రొత్తనిబంధన గ్రంథము ప్రారంభములో అంటే యేసుక్రీస్తు ఈలోకములో జీవించిన సమయములో నిసాను 14వ దినాన వచ్చే పస్కా పండుగను దానివెంటనే అదే మాసములో 15వ దినాన మొదలయ్యే పులియనిరొట్టెల పండుగను కలిపి పులియనిరొట్టెల పండుగ కాలముగా పరిగణించేవారు (లూకా.22:1). అయితే అదే పండుగ కాలాన్ని ఈనాటి యూదులు పస్కా పండుగ కాలంగా పరిగణించడం గత రెండువేల సంవత్సరాల పరిధిలో జరిగిన మార్పు అన్నది గ్రహించాలి. 

క్రీస్తుశకం రెండవ శతాబ్ధమునుండి పస్కా పండుగ/పులియనిరొట్టెల పండుగ జరుపుకునే విధానములో అనేక ఆచారాలను రబ్బీలు అంటే యూదా మతాధికారులు చొప్పించడము జరిగింది. ఇవేవీ మొదటి శతాబ్ధములోని యూదులు పాటించలేదు. ఈనాడు యూదులు పాటించే “పస్కా సెదెర్” (పస్కా పండుగను ఆచరించే క్రమము) కాలక్రమములో మార్పులు చేర్పులు చెందుతూ నేటి స్థాయికి చేరుకుంది. రెండువేల సంవత్సరాల క్రితం అనుసరించబడిన పస్కా సెదెర్ ఈనాడున్న పస్కా సెదెర్ లా విస్త్రుతమైన ఆచారాలతో కూడింది కాదు. ఈ కారణాన్నిబట్టి యేసు ప్రభువు మరియు ఆయన శిష్యులు పాటించిన పస్కా సెదెర్ కు ఈనాడు యూదులు పాటించే పస్కా సెదెర్ కు మధ్య వ్యత్యాసాలుండటం కద్దు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు/యూదులు మొదటి శతాబ్ధము వరకు పస్కా పశువును వధించి పండుగను ఆచరించేవారు (2ది.వృ.35:1; ఎజ్రా.6:19-21; మార్కు.14:12). ఈనాడు రబ్బీల-జూడాయిజమును అనుసరిస్తున్నవారు ఆ ఆచారమును పాటించడము లేదు. 

పాతనిబంధన గ్రంథములో (తనాక్) పస్కా పండుగను ఆచరించాల్సిన ప్రజలను గురించి, కారణాన్ని గురించి, విధానాన్ని గురించి, అలాగే ఆచరించాల్సిన స్థలమును గురించి దేవుడు వివరించడమేగాక రాబోవు తరాలు అనుసరించదగిన కొన్ని దృష్టాంతాలను కూడా పాతనిబంధన గ్రంథములో (తనాక్) అందించాడు. ఈ వాస్తవాన్ని బట్టి పాతనిబంధన గ్రంథ కాలములో అలాగే క్రొత్తనిబంధన గ్రంథ కాలములో అంటే 1400 క్రీ.పూ. నుండి 100 క్రీ.శ. వరకు దేవుని స్పష్టమైన ఆజ్ఙ ప్రకారము మోషేధర్మశాస్త్రాన్ని (పంచకాండాలను) అనుసరించిన ఇశ్రాయేలీయులు పస్కా పండుగను దేవుడేర్పరచుకున్న యెరూషలేమునగరములోనే లేఖనాల క్రమములో జరుపుకునేవారు.

ఈనాడు యూదులమంటూ చెప్పుకుంటున్నవారు యూదుమతములో చేరినవారు తనాక్ (పాతనిబంధన) బోధలను ప్రక్కకుబెట్టి ఈ పండుగను ఆచరించే విశయములో దేవుడిచ్చిన స్పష్టమైన ఆజ్ఙలను తుంగలో తొక్కి రబ్బీల బోధల ప్రకారము అంటే రబ్బీల-జూడాయిజం ప్రకారము పస్కా పండుగను తాముంటున్న దేశములో తాము నివసిస్తున్న ఊరిలో రబ్బీలు నిర్దేశించిన క్రమమములో రబ్బీలు యేర్పరచిన ఆచారాలతో జరుపుకుంటున్నారు! 

ప్రభువైన యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) జీవితములోని చివరి వారములో జరిగిన ప్రధాన సంఘటనల సంక్షిప్త సూచిక

మూడవదినము/మంగళవారము: పగలు (ఆబీబు/నిసాను మాసము 13వ తారీఖు) — శిష్యులు వెళ్ళి యేసు చెప్పిన మాటల ప్రకారము మేడగదితో కూడిన ఇంటిని కనుగొనటము; 

మూడవదినము/మంగళవారము:రాత్రి/సాయంత్రము (ఆబీబు/నిస్సాను మాసము 14వ తారీఖు ప్రారంభము — యూదుల/బైబిలు బుధవారపు ప్రారంభము) యేసు ప్రభువు మరియు శిష్యులు పస్కా పండుగ భోజనము చేయుట; గెత్సేమనే తోటలో ప్రార్థించటము; రోమా సైనికులచేత యేసు ప్రభువు బంధించబడటము; యూదు మతాదికారులముందు యేసు ప్రభువును నిలబెట్టడటము; మరునాడు అంటే నిస్సాను మాసము 15వ తారీఖునాడు పులియనిరొట్టెల పండుగ యొక్క మహావిశ్రాంతిదినము అనబడే మొదటిదినము. కనుక, ఈదినము మరుసటిదినానికి సిద్దపరచు దినము; 

నాలుగవదినము/బుధవారము: పగలు (ఆబీబు/నిసాను మాసము 14వ తారీఖు కొనసాగింపు) — రోమా అధికారి పిలాతుముందు యేసు ప్రభువును దోషిగా నిలబెట్టడము; ఉదయము 9:00 గంటలకు యేసు ప్రభువును సిలువపైకి ఎక్కించడము; మధ్యాహానము 3:00 గంటలకు యేసు ప్రభువు చివరి శ్వాస; ఆరోజు చివరలో యేసు ప్రభువు యొక్క ఆత్మ/ప్రాణము భూగర్భములోకి అంటే పాతాళములోకి వెళ్ళడము మరియు ఆయన మృతదేహము రాతిలో తొలచబడిన సమాధిలో వుంచబడటము; 

నాలుగవదినము/బుధవారము: రాత్రి/సాయంత్రము (ఆబీబు/నిసాను మాసము 15వ తారీఖు ప్రారంభము — యూదుల/బైబిలు గురువారపు ప్రారంభము); యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన మొదటిరాత్రిప్రారంభము; మహా విశ్రాంతిదినపు ప్రారంభము; యేసు ప్రభువును వెంబడించిన స్త్రీలు తమ ఇండ్లకు వెళ్ళి విశ్రమించారు; 

ఐదవదినము/గురువారము (బేస్తవారము): పగలు (ఆబీబు/నిసాను మాసము 15వ తారీఖు కొనసాగింపు) — యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన మొదటిపగలు; మహా విశ్రాంతిదినపు కొనసాగింపు; స్త్రీలు విశ్రాంతిదినాన్ని పాటించారు; ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులు పిలాతు అనుమతితో సమాధిని భద్రం చేసారు (మత్తయి.27:62-66); 

ఐదవదినము/గురువారము (బేస్తవారము): రాత్రి/సాయంత్రము (ఆబీబు/నిసాను మాసము 16వ తారీఖు ప్రారంభము — యూదుల/బైబిలు శుక్రవారపు ప్రారంభము) యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన రెండవరాత్రి ప్రారంభము; మహా విశ్రాంతిదినము సమాప్తి; ఈదినం సాధారణ విశ్రాంతిదినానికి అంటే శనివారపు విశ్రాంతిదినానికి సిద్దపరచు దినము; 

ఆరవదినము/శుక్రవారము:పగలు (ఆబీబు/నిసాను మాసము 16వ తారీఖు కొనసాగింపు) — యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన రెండవపగలుకొనసాగింపు; సిద్దపరచు దినపు కొనసాగింపు; మరునాడు సాధారణ విశ్రాంతిదినము (శనివారము); యేసు ప్రభువును వెంబడించిన ఆ స్త్రీలు ఆయన దేహానికి పూయవలేనని సుగంధద్రవ్యములను కొన్నారు (మార్కు 16:1); 

ఆరవదినము/శుక్రవారము: రాత్రి/సాయంత్రము (ఆబీబు/నిసాను మాసము 17వ తారీఖు ప్రారంభము — యూదుల/బైబిలు శనివారపు ప్రారంభము); సాధారణ విశ్రాంతిదినపు ప్రారంభము; ఇది యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన మూడవరాత్రిప్రారంభము; యేసు ప్రభువును వెంబడించిన స్త్రీలు తిరిగి విశ్రాంతిదినాచారము ప్రకారము విశ్రమించారు (లూకా.23:56) 

ఏడవదినము/శనివారము: పగలు (ఆబీబు/నిసాను మాసము 17వ తారీఖు కొనసాగింపు); సాధారణ విశ్రాంతిదినపు కొనసాగింపు; యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన మూడవపగలుకొనసాగింపు; స్త్రీలు విశ్రాంతిదినాచారాని కొనసాగించారు; 

ఏడవదినము/శనివారము: రాత్రి/సాయంత్రము (ఆబీబు/నిసాను మాసము 18వ తారీఖు ప్రారంభము — యూదుల/బైబిలు ఆదివారము లేక మొదటిదినము ప్రారంభము); మూడు రాత్రింబగళ్ళు గడిచిపోయాయి; ప్రభువైన యేసు క్రీస్తు (ఆత్మ/ప్రాణము) తన శరీరముతో ఐక్యపరచబడి మృత్యుంజయుడై పునరుత్థానుడయ్యాడు, మరియు మహిమశరీరముతో సమాధిలోనుండి వెళ్ళిపోయాడు; 

మొదటిదినము/ఆదివారము: తెల్లవారుజామున (ఆబీబు/నిసాను మాసము 18వ తారీఖు కొనసాగింపు); స్త్రీలు తాము సిద్దపరచిన సుగంధద్రవాలతో సమాధి దగ్గరకు వచ్చారు; సమాధిలో యేసు ప్రభువు దేహము లేదు; 

Permalink to single post

మెస్సయ్య మానవుడా?

యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] మానవుడా…?

అవును, కన్యమరియకు జన్మించిన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] అక్షరాలా మానవుడే! కాని, “ఆయన కేవలం మానవుడు మాత్రమేనా?” అన్నది ఇక్కడి అసలైన ప్రశ్న!

కొందరి వాదనా విధానం: మరి యేసు క్రీస్తు [యషువ మషియాఖ్]కు పుట్టుక వుంది మనకూ పుట్టుక వుంది. ఆయనకు దేవుడున్నాడు మనకూ దేవుడున్నాడు. ఆయనకు తండ్రి వున్నాడు మనకూ తండ్రి వున్నాడు. కనుక దేవుని ముందు యేసు క్రీస్తుకు మనకు ఆత్మీయంగా తేడాలున్నప్పటికిని అస్థిత్వంలో ఎలాంటి తేడా లేనట్లే కదా?!

అసలు ఆయనకు మనకు తేడా వుందా…? వుంటే అది ఎలాంటి తేడా…?

యేసు క్రీస్తు [యషువ మషియాఖ్]కు మనకు మధ్య కొన్ని ప్రాథమిక వ్యత్యాసాలున్నాయి

మొదటి ప్రాథమిక వ్యత్యాసం: ఆయన ఈలోకములోకి ప్రవేశించాడు; మనం ఈలోకంలో సృష్టించబడ్డాము.

అప్పుడు యెహోవా నేను సృజించిన [בָּרָא/bara/బరా] నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; (ఆది.కాం.6:7)
నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసి కొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించి [בָּרָא/bara/బరా] యున్నావు?” (కీర్తన.89:47)
వచ్చుతరము తెలిసికొనునట్లుగా ఇది వ్రాయబడ వలెను సృజింపబడబోవు [בָּרָא/bara/బరా] జనము యెహోవాను స్తుతించును.” (కీర్తన.102:22)

‘సృష్టించుట’ లేక ‘శూన్యములోనుండి ఉనికిలోకి తెచ్చుట’ అన్న అర్థాన్ని వ్యక్తపరిచే బరా [בָּרָא/bara/బరా] అనే హీబ్రూ పదం బైబిలు అంతటిలో ఒక్కసారికూడా యేసు క్రీస్తుకు [యషువ మషియాఖ్] అన్వయించబడలేదు అన్నది గమనార్హమైన అంశం.

కాబట్టి ఆయన [యేసు క్రీస్తు/యషువ మషియాఖ్] ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు.బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి.” (హెబ్రీ.10:5)

రెండవ ప్రాథమిక వ్యత్యాసం: ఆయన దేవుని అసలైన కుమారుడు; మనం ఆయనయందున్న విశ్వాసమువలన దేవుని కుమారులముగా మార్చబడ్డాము

యేసు క్రీస్తు [యషువ మషియాఖ్]క దేవుని యొద్దనుండి లేక దేవునిలోనుండి వచ్చాడు. కనుక ఆయన అక్షరాల (literally) దేవుని కుమారుడు, కాని భౌతికంగా కాదు. ఆ కారణాన్నిబట్టి లేఖనాలలో ఆయన అద్వితీయకుమారుడుగా [μονογενής υἱός/మొనొగెనెస్ హుయియొస్ = ప్రత్యేకమైన/ద్వితీయములేని కుమారుడు] పేర్కొనబడ్డాడు (యోహాను.3:16,18; హెబ్రీ.11:17; 1యోహాను.4:9). మనం అంటే నిజవిశ్వారులైనవారు ఈలోకములోనే సృష్టించబడ్డాము. అయినా నిజవిశ్వాసులు యేసు క్రీస్తునందు విశ్వాసమూలముగా దత్తపుత్రాత్మనుబట్టి దేవునికి కుమారులముగా మారాము (యోహాను.1:12-13; రోమా.8:15; గలతీ.4:5-7). ఇది అక్షరార్థమైన మరియు భౌతికమైన పుత్రత్వసంబంధము ఎంతమాత్రము కాదు. ఇది ఆత్మీయమైన మరియు అలంకారరూపమైన సంబంధము. 

ఆదియందు [సృష్టికి పూర్వం] వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద [πρὸς τὸν Θεόν] ఉండెను, వాక్యము దేవుడై యుండెను…ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన [యేసు క్రీస్తు/యషువ మషియాఖ్] మహిమను కనుగొంటిమి.” (యోహాను.1:1,14).

యేసు (యషువ) ఈ లోకములోనికి నరునిగా రాకముందు దేవునితో/దేవునిలో దేవుని వాక్కుగా ఉనికిని కలిగివుండి తన ఉనికికి ఆరంభము లేనివాడై తానే ఆదియై వున్నాడు (ప్రకటన.21:6; 22:13). ఆయన సృష్టించబడలేదు, కాని సమస్తమూ–నీవు నేను కూడా–ఆయనకొరకు ఆయనద్వారా సృష్టించబడ్డాయి. “కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు” (యోహాను.1:3). ఆయన కన్యమరియకు జన్మించకముందే దేవుని కుమారుడు! ఆ కారణాన్నిబట్టే దేవుడు తన కుమారుని ఈలోకములోనికి పంపెను అంటూ లేఖనాలు సాక్షమిస్తున్నాయి (సామెతలు.30:4; యోహాను 3:17, గలతీ.4:4; 1యోహాను.4:9).  

మూడవ ప్రాథమిక వ్యత్యాసం: ఆయన దేవుని మర్మము; మనం దేవుని చేతిపని మాత్రమే

ఈలోకములోకి మానవశరీరాన్ని ధరించి విచ్చేసిన సందర్భంగా (యోహాను.1:14; హెబ్రీ.10:5) యేసు [యషువ] ‘దేవుని వాక్కు’గా దేవునిలో వుండి దేవునిగా వున్న (యోహాను.1:1) కారణాన్నిబట్టి తనకున్న దైవత్వపు లక్షణాలను మరియు హక్కులను వినియోగించుకోకుండా వాటిని మరుగుపరచుకొని మానవ పరిధులకు తన్నుతాను పరిమితునిగా చేసుకున్నాడు (ఫిలిప్పీ.2:6-7; హెబ్రీ.2:14). 

పై లేఖన సత్యాలనుబట్టి ఒక నరునిగా జీవించిన యేసు క్రీస్తు దేవుని మర్మమై వున్నాడంటూ లేఖనాలు ఘోశిస్తున్నాయి (కొలొస్సీ.2:2). నిన్నూ నన్నూ లేక ఏనరున్నికూడా ‘దేవుని మర్మము’ అని లేఖనాలు ఎక్కడా ప్రకటించలేదు అన్నది ఈసందర్భంగా మనం జ్ఙాపకం చేసుకోవాలి. ఆయనకు మనకు మధ్య వున్న ఈ భేదం అత్యంత ప్రాముఖ్యమైనది. 

పై కారణాలను బట్టి దేవుని ఎదుట కారణజన్ముడు దైవాంశసంభూతుడు అయిన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] మరియు తతిమా మానవులందరు సమానం కాదు. ఈ రెండు వర్గాల మధ్య వున్న అస్థిత్వపు అగాధం అన్నది ఎప్పటికీ పూడ్చబడలేనిది. అందుకే ఆయన దేవున్ని సూచిస్తూ “నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడు” (యోహాను.20:17) అన్నడే కాని “మన దేవుడు మన తండ్రి” అంటు సంబోధించలేదు. ఈ సుక్ష్మమైన అదేసమయములో అత్యంత పాముఖ్యమైన వ్యత్యాసాన్ని విజ్ఙులుమాత్రమే గుర్తించగలరు గ్రహించగలరు.    

Permalink to single post

యెషయాలో మెస్సయ్యా

యెషయా గ్రంథములో దేవుడైన యేహోవా చేత ‘నా సేవకుడు’ అని పిలువబడింది ఎవరు? 

యెషయా 52:13 – 53:12 వరకున్న లేఖనాలలో ఇశ్రాయేలీయులనందరిని సమిష్టిగా పేర్కొంటూ ‘నా సేవకుడు’ అన్న పదజాలము ఉపయోగించబడింది అంటూ కొందరు అలాగే ఇశ్రాయేలు చరిత్రలో నీతిమంతులయిన ఇశ్రాయేలీయులనందరిని కలిపి సాదృశ్యముగా సూచించడానికి ‘నా సేవకుడు’ అన్న అలంకార పదజాలము ఉపయోగించబడింది అంటు మరికొందరు భాష్యం చెప్పే ప్రయత్నం చేస్తూంటారు.  మరి అలాంటి అభిప్రాయాలను లేఖనాలు సమర్ధిస్తున్నాయా అన్నదే ఇక్కడ కీలకమైన ప్రశ్న. 

1) ‘నాసేవకుడు ‘ (עַבְדִּ֑י=అబ్’ది) అన్నఏకవ్యక్తి పదజాలం యెషయా గ్రంథములో అనేకసార్లు ఉపయోగించబడింది
 
– 16 సార్లు వుపయోగించబడింది.  
– ప్రవక్త యెషయా ‘నా సేవకుడు’ గా పేర్కొనబడ్డాడు (యెషయా 20:3)  
– హిల్కియా కుమారుడు ఎల్యాకీము  ‘నా సేవకుడు’ గా పేర్కొనబడ్డాడు (యెషయా 22:20)
– రాజైన దావీదు ‘నా సేవకుడు’  గా పేర్కొనబడ్డాడు (యెషయా 37:35)    
– యాకోబు సంతానము లేక ఇశ్రాయేలు జనాంగము ‘నా సేవకుడు’ గా పేర్కొనబడింది (యెషయా 41:8-9; 44:1,2,21; 45:4; 49:3).  
– అప్పటికింకా నామము బహిర్గతం చేయబడని ఒక విశిష్టమైన వ్యక్తి ‘నా సేవకుడు’ గా పేర్కొనబడ్డాడు (యెషయా 42:1,19; 43:10; 49:5-8; 52:13-53:12).  

2) యెషయా గ్రంథములో ప్రభువైన దేవుడు ఉపయోగించిన ‘నాసేవకుడు’ అన్న పదజాలం భవిష్యత్తులో రాబోవుతున్న ఒక ప్రత్యేకమైన వ్యక్తి విశయంలో ఉపయోగించబడింది. అయితే, అదివరకేవచ్చిన/ఉండిన వ్యక్తులనుగాని లేక జనాంగాన్నిగాని ఉద్దేశించి ‘నాసేవకుడు’ అంటూ పేర్కొంటునప్పుడు ఆవ్యక్తియొక్క లేక జనాంగము యొక్క నామాన్ని కూడా అదేసందర్భములో స్పష్టంగా పేర్కొనడం చూస్తాము.    

యెషయా గ్రంథములో దేవుడు (ప్రభువైన యెహోవా) ఏర్పరచుకున్న ప్రత్యేకమైన ‘సేవకుడు’ ప్రవక్త అయిన యెషయా కాదు, రాజైన దావీదు కాదు, కోశాధికారి అయిన ఎల్యాకీముకూడా కాదు. ఆమాటకొస్తే, ఆయన యాకోబు సంతానమైన ఇశ్రాయేలీయుల సమిష్టి జనాంగము యొక్క సాదృశ్య రూపము అంతకన్నా కాదు.    

3) దేవుడైన యెహోవా ‘నాసేవకుడు’ అంటూ ప్రవక్త అయిన  యెషయాద్వారా పరిచయం చేసిన ఆప్రత్యేకమైన కారణజన్ముని గూర్చి లేఖనాలు సెలవిస్తున్న సత్యాలు

– అతడు దేవుడైన యెహోవాకు ప్రాణప్రియుడు (యెషయా.42:1)  [ఇది అనంతకాలమునుండే కొనసాగుతున్నది]
– అతనియందు యెహోవా ఆత్మ వుండును (యెషయా.42:1) [ఇది అనంతకాలమునుండే కొనసాగుతున్నది]
– అతడు అన్యజనులకు న్యాయము అందిస్తాడు (యెషయా.42:1) [తండ్రి మహిమతో రాజుగా వచ్చినప్పటినుండి] 
– అతని ఉపదేశము/ధర్మశాస్త్రము (తోర) కొరకు దూరప్రాంత ప్రజలలుకూడా ఎదురుచూస్తారు (యెషయా.42:4) [ఆయన పరిచర్య ప్రారంభించినప్పటినుండి]
– అతడు ప్రభువైన యెహోవాచేత అన్యజనులకు వెలుగుగా నియమించబడ్డాడు (యెషయా.42:7) [ఆయన పరిచర్య ప్రారంభించినప్పటినుండి]
– అతడు యెహోవా యొక్క దూత (యెషయా.42:19) [పాతనిబంధన కాలమునుండి]
– అతడు యెహోవా యొక్క సాక్షి (యెషయా.43:10) [ఆయన పరిచర్య ప్రారంభించినప్పటినుండి]  
– అతడు ఇశ్రాయేలీయులను తిరిగి యెహోవ యొద్దకు తీసుకు వచ్చేవాడు (యెషయా.49:5) [పరిచర్య ప్రారంభించినది మొదలుకొని తాను తిరిగి వచ్చేంతవరకు]
– అతడు భూదిగంతములవరకు యెహోవా కలుగజేయు రక్షణకు సాధనముగా వుంటాడు (యెషయా.49:6) [క్రొత్తనిబంధననుండి తాను తిరిగి వచ్చేంతవరకు]
– అతడు అన్యజనులకు వెలుగుగా వుండేందుకు యెహోవా చేత నియమించబడ్డాడు (యెషయా.49:6) [క్రొత్తనిబంధననుండి తాను తిరిగి వచ్చేంతవరకు]
– అతడు మనుషులచేత నిరాకరించబడినవాడు (యెషయా.49:7, 53:2) [ఆయన ఇహలోకములో నరునిగా జీవించిన సమయములో]
– అతడు జనులచేత అసహ్యించుకోబడ్డవాడు (యెషయా.49:7, 53:3) [ఆయన ఇహలోకములో నరునిగా జీవించిన సమయములో]    
– అతడు యెహోవాచేత ప్రజలకు నిబంధనగా (క్రొత్తనిబంధనగా) నియమించబడ్డవాడు (యెషయా.42:7; 49:8) [క్రొత్తనిబంధననుండి తాను తిరిగి వచ్చేంతవరకు] 
– అతడు మన (ప్రజల) రోగములను, వ్యసనములను వహిస్తాడు (యెషయా.53:4)
– అతడు మన (ప్రజల) స్థానములో శిక్ష అనుభవిస్తాడు (యెషయా.53:5)
– అతడు పొందే శిక్షనుబట్టి మనము (ప్రజలు) స్వస్థత పొందుతాము (యెషయా.53:5) 
– అతడు దేవుని ప్రజల స్థానములో శిక్షించబడుతాడు మరియు ప్రాణత్యాగము చేస్తాడు (యెషయా.53:8)
– అతడు ఏ పాపము చెయకున్నా మరణశిక్షను అనుభవిస్తాడు (యెషయా.53:9)
– అతడు తననుతాను పాపపరిహారార్థబలిగా చేసుకుంటాడు (యెషయా.53:10)
– అతడు (మరణములోనుండి తిరిగి బ్రతుకుటద్వారా) దీర్ఘాయుష్మంతుడవుతాడు (యెషయా.53:10)
– అతనిద్వారా యెహోవా యొక్క ప్రణాలిక నెరవేర్చబడుతుంది (యెషయా.53:10)
– అతడు నీతిమంతుడైన యెహోవా సేవకుడు (యెషయా.53:11) 
– అతడు ప్రజల దోషములను తాను భరించి వారిని నిర్దోషులుగా చేస్తాడు (యెషయా.53:11)
– అతడు మరణమునొందునంతగా తన ప్రాణమును ధారపోస్తాడు (యెషయా.53:12)
– అతడు ప్రజల పాపములను భరిస్తూ వారి కొరకు విజ్ఙాపన చేస్తాడు (యెషయా.53:12)

పై వైశిష్టాలన్నీకూడా కన్యమరియ యొక్క కుమారుడైన యేసు (యషువ) జీవితములో ప్రస్పుటముగా నేరవేర్చబడటాన్ని క్రొత్తనిబంధన లేఖనాలలో వివరించబడింది. ఈ రకంగా ఇశ్రాయేలీయుడైన ఒక వ్యక్తి జీవితములో పై ప్రత్యేకతలన్నీ నెరవేర్చబడటమన్నది చరిత్రలో కన్యమరియ కుమారుడు యేసు (యషువ) జీవితములో తప్ప మరొకరి జీవితములో నెరవేర్చబడలేదు. ఇది దేవుడే మాట యిచ్చి నెరవేర్చాడన్న సత్యము కేవళము సత్యాన్వేషకులైన విజ్ఙులు గ్రహించగలరు. తద్వారా అలాంటివారు మాత్రమే పరమతండ్రి యొక్క నిత్యసంకల్పములోని యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) యొక్క పాత్రను గుర్తించి స్వీకరించగలరు.

జూడాయిజములోని కొందరు దుర్బోధకులు లేఖనాలను వక్రీకరించే ప్రయత్నములో యెషయా గ్రంథములోని “నా సేవకుడు” అన్నది కన్యమరియ కుమారుడు యేసు [యషువ] కాదు అంటూ అసందర్భ అభ్యంతరాలను అనేకం లేవనెత్తుతుంటారు. అలాంటివారు చెప్పేది సత్యమయితే మరి పైన చూపిన యెషయా గ్రంథములోని “నా సేవకుడు” అనబడిన ఆ వ్యక్తి ఎవరు? ఆవ్యక్తిలో పైన ప్రవచనాత్మకంగా పేర్కొనబడ్డ విశయాలు నెరవేర్చ బడ్డాయా? ఆ వివరాలను అందిస్తేతప్ప ఆ వ్యక్తి యేసు కాదు అనడానికి వారికి అర్హత లేదు.

4) యెషయా గ్రంథము 42:1-7; 43:10; 49:5-8; 52:13-53:12 వాక్యాలలో ప్రభువైన యెహోవా చేత ‘నాసేవకుడు’ అంటు పేర్కొనబడింది యాకోబు సంతానమైన ఇశ్రాయేలీయుల సమిష్టి జనాంగాని సూచించే ఒక అలంకార రూపమైన వ్యక్తి కాదుగాని, దేవుడే యెన్నుకొన్న ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని గ్రహించడానికిగల కారణాలు:

అ) యెషయా.42:1-7 వచనాల ధ్యానము: ఈ వాక్యాలలో ప్రవక్త అయిన యెషయా పేరుగాని, రాజైన దావీదు పేరుగాని, లేక కోశాధికారి ఎల్యాకీము పేరుగాని పేర్కొనబడలేదు. అంతమాత్రమేగాక యాకోబు లేక ఇశ్రాయేలు అన్న జనాంగము పేరుకూడా పేర్కొనబడలేదు. కనుక, ఈ వాక్యాలలో పేర్కొనబడిన వ్యక్తి అప్పటికింకా పేరు వెల్లడి చేయబడని దేవుడైన యెహోవా చేత ఏర్పరచుకోబడిన ఒక ప్రత్యేకమైన వ్యక్తి అన్నది సుస్పష్టము.       

అంతేకాక, దేవుడైన యెహోవా ఈ వ్యక్తిని కాపాడి ప్రజలకు అంటే కేవలం అన్యులకే అనికాదు అందరికీ (ఇశ్రాయేలీయులకు మరియు అన్యులకు) నిబంధనగా నియమించబోటున్నట్లు వాగ్ధానము చేసాడు. ప్రజలతో అంటే మానవులందరితో చేయబడే నిబంధన నోవహునిబంధన తరువాత మెస్సయ్యనందు చేయబడే క్రొత్తనిబంధనే. 

ఆ) యెషయా.43:10 వచన ధ్యానము:

ఇ) యెషయా.49:5-6 వచనాల ధ్యానము:

“యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు.” 

– పై వాక్యాలలోని ‘నా సేవకుడు ‘ అన్నది యాకోబు/ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేషించి వాడబడిన పదజాలము కాదు. అది యెహోవా యెన్నుకొనిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఉద్దేషించి పేర్కొనబడింది. ఆ వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలను తిరిగి ప్రభువైన దేవుని  యొద్దకు తీసుకువచ్చేవాడు, వారిని ఉద్దరించేవాడు. ఆ ప్రత్యేకమైన వ్యక్తే ‘నా సేవకుడు ‘ (మత్తయి 12:18) లేక ‘తన సేవకుడు ‘ (అపొ.కా.3:13) అనబడిన యేసు (యషువ) అన్న సత్యాన్ని దేవుడు తన ఆత్మ ప్రేరణతో క్రొత్తనిబంధన లేఖనాలలో స్పష్టపరచాడు.   

ఈ) యెషయా.52:13-53:12 వచనాల ధ్యానము

– అది ఇశ్రాయేలు ప్రజలనుద్దేషించి కాదు. ‘నా సేవకుడు ‘ అంటూ ఇశ్రాయేలు ప్రజలను సంబోధించిన ప్రతిసారి యాకోబు లేక ఇశ్రాయేలు అన్న నామాన్ని విస్పష్టముగా పేర్కొనడాన్ని యెషయా గ్రంథములో చూడగలము. అయితే ఇక్కడ ‘నా సేవకుడు ‘ అని ప్రకటిస్తున్న సందర్భములో యాకోబు అనిగాని ఇశ్రాయేలు అనిగాని పేర్కొనలేదన్నది గమనించాలి. దీన్ని బట్టి ఇక్కడ వివరించబడుతున్నది ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి కాదుగాని ప్రభువైన దేవుడు తానే ఎన్నుకొనిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి అన్నది గ్రహించాలి.  

– ఇక్కడ ‘నా సేవకుడు ‘ అన్నది ఇశ్రాయేలు ప్రజలనుద్దేషించి కాదు. కారణం, ఇక్కడ వివరించబడుతున్న ‘నా సేవకుడు ‘  “తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును.” (యెషయా 53:10). అపరాధపరిహారార్థబలి/పాపపరిహారార్థబలి విశయములో లేఖనాలు సెలవిస్తున్న ప్రకారం “ఎవడైనను పాపపరిహారార్థబలిగా అర్పించుటకు గొర్రెను తీసికొని వచ్చినయెడల నిర్దోషమైనదాని తీసికొనివచ్చి” (లేవి.కాం.4:32).

అయితే, మోషే మొదలుకొని మలాకి వరకు గల సమయంలో పరమతండ్రి మాటలలో ఇశ్రాయేలీయులు…

  • లోబడనొల్లని ప్రజలు [ని.కాం.32:9]
  • పాపుల సంతానం [సం.కాం.32:14]
  • దేవునికి విరోధముగా సణిగే సమాజం [సం.కాం.14:27]
  • పాపిష్టి జనము [యెషయా.1:4]
  • సొదొమ మరియు గొమొఱ్ఱా జనులు [యెషయా.1:10]
  • విగ్రహారాధికులు [యిర్మీయ.11:17]
  • హృదయ సున్నతిలేనివారు [యిర్మీయా.9:25]
  • వేశ్య [యెహెజ్కేలు.16:15]
  • అపవిత్రులు [యెహెజ్కేలు.36:16]
  • బహిష్ట స్త్రీ వంటి అపవిత్రత గలవారు [యెహెజ్కేలు.36:16]
  • వ్యభిచారులు [1ది.వృ.5:25; హోషేయ.1:2]
  • అనీతిమంతులు [ఆమోసు.5:7, 6:13]
  • కిరాతకులు [ఆమోసు.7:2]
  • ముష్కరులు మరియు భ్రష్టులు [జెఫన్యా.3:1]
  • దొంగలు మరియు శాపగ్రస్తులు [మలాకి.3:9]

– అత్యంత గమనార్హమైన విషయం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు ‘నీతిమంతులు’ అంటూ బైబిల్ అంతటిలో మచ్చుకు ఒక్కసారి అయినా లేఖనాలు పేర్కొనటంలేదు, గుర్తించటంలేదు! కనుక, ఇశ్రాయేలీయులకు అపరాధపరిహారార్థబలిగా ఉండే అర్హత ఏమాత్రములేదు. ఆమాటకొస్తే, వారికే అంటే వారినే ప్రక్షాళనము చేసేందుకు ఒక  అపరాధపరిహారార్థబలి అవసరమన్నది సుస్పష్టము. ఆ బలి ప్రభువైన దేవుడు ఎన్నుకొనిన ‘ఆయన సేవకుడు,’ ఆ సేవకుడు మెస్సయ్యగా విచ్చేసిన యషువ [యేసు].        

– ఇక్కడ ‘నా సేవకుడు’ అన్నది ఇశ్రాయేలు ప్రజలను గురించి కాదు. “అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలోచించినవారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానముచేత అనేకులను నిర్దోషులుగా చేయును.”  (యెషయా 53:8-11).  

పై వాక్యాలలోని అతడు యెవరు? నా జనులు ఎవరు? నా జనులు అంటే ఇశ్రాయేలు ప్రజలు. అయితే ‘అతడు’ ఇశ్రాయేలీయుల కొరకు బలిపశువుగా మారాడు అన్నది అర్థమవుతున్నది. మరి ‘అతడే’ ఇశ్రాయేలు జనాంగము అని కాదు! ఆ ‘అతడు’ ప్రభువైన దేవుని యొక్క ‘నీతిమంతుడైన నా సేవకుడు.’ ఆయనే మెస్సయా. పై వాక్యాలలో పేర్కొనబడ్డట్టుగా ఆ మెస్సయ్య నిర్వర్తించబోయే కార్యాలను నిర్వర్తించినది యేసు (యషువ). దీన్ని బట్టి కూడా యేసు (యషువ) మెస్సయా (మషియాఖ్/క్రీస్తు) అని నిరూపితమవుతున్నది.  

Permalink to single post

బైబిలు వెలుగులో యషువ (యేసు)

దేవుడు ఈలోకములోని కొందరు వ్యక్తులను ఎన్నుకొని వారిద్వారా తన సందేశాన్ని మానవులకు అందిస్తూ వచ్చాడు. దేవునిచేత ఎన్నుకోబడి దేవుని తరపున పంపించబడినవారిలో ప్రధానమైనవాడు మోషే (ని.కాం.3:14-15).

మోషే తరువాత వచ్చిన ప్రవక్తలందరుకూడా (యిర్మీయ.26:5) ఈలోకములోనుండి దేవునిచేత ఎన్నుకోబడి పంపబడ్డవారే. ఈ రకంగా దేవుడు మోషే మొదలుకొని మలాకి వరకు దాదాపు వెయ్యి సంవత్సరాల వ్యవధిలో అనేకమంది ప్రవక్తలను ఎన్నుకొని తన సందేశాలతో తన ప్రజల యొద్దకు పంపిస్తూ వచ్చాడు. అయినా వారిలో ఒక్కరుకూడా పరలోకములోనుండి దిగివచ్చినవారు లేరు. బాప్తీస్మమిచ్చు యోహానుకూడా ఇదే కోవకు చెందినవాడు.

దేవునియొద్దనుండి [παρὰ Θεοῦ/పారా థియూ=from God] పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను.” (యోహాను.1:6)

అయితే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు మానవాళికి కేవలము తన అంతిమ సందేశాన్ని అందించటానికి మాత్రమేగాక వారికి రక్షకునిగా మారి వారి పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని అందించే పరిపూర్ణ బలిగా తననుతాను అర్పించుకునేందుకై అద్వితీయుడైన తన స్వంత కుమారున్ని పరలోకములోనుండి ఈ లోకములోనికి పంపించాడు అన్నది లేఖనాలు ఘంఠాపథంగా చేస్తున్న ప్రకటన.

పరలోకములోనుండి ఈలోకములోకి దైవాంశసంభూతునిగా విచ్చేసిన యేసు క్రీస్తుకు మరియు ఈ లోకములోనుండే ప్రవక్తలుగా ఎన్నుకోబడిన వారికి మధ్య ఉన్న ప్రాథమిక అస్తిత్వ వ్యత్యాసాన్ని గ్రహించలేని ఆత్మీయ అంధత్వముతోకూడిన దుర్బోధకులు ప్రభువైన యేసు క్రీస్తును కేవలము ఒక నరునిగా మరియు ప్రవక్తలలో ఒకనిగా మాత్రమే చిత్రీకరించె ప్రయత్నం చేస్తారు. ఈ వాస్తవాన్ని బట్టి దైవ సంబంధులు లేఖనాల సమిష్టి బోధను పరిశీలించి అబద్ధ బోధకుల వక్రవ్యాఖ్యానాలకు ప్రతికూలంగా యివ్వబడిన లేఖన బోధలోని సత్యాన్ని గ్రహించాలి.

I. యషువ ఈలోకములో శరీరధారిగా ప్రవేశించకముందు ఉనికిని కలిగివున్నవాడు

“యేసు వారితో ఇట్లనెను దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చి [Θεοῦ ἐξῆλθον/థియూ ఎక్సెల్తోన్ = came out of God/దేవునిలోనుండి వచ్చాను] యున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను.” (యోహాను.8:42)

“నేను తండ్రియొద్దనుండి బయలుదేరి [ἐξῆλθον/ఎక్సెల్తోన్ = came out of/లోనుండి వచ్చాను] లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.” (యోహాను.16:28)

(i) మట్టిలోనుండి సృష్టించబడిన ఆదాములా గాక పరలోకములోనుండి వచ్చాడు:

“నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగివచ్చితిని.” (యోహాను.6:38)
దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి యుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నాడు.” (యోహాను.6:47)
“అలాగైతే మనుష్యుకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు?” (యోహాను.6:62)
“యేసునేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పు కొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు.” (యోహాను.8:14)
“మీరు నన్ను ప్రేమించి, నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమి్మతిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.” (యోహాను.16:27-28)
“మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు.” (1కొరింథి.15:47)

(ii) ఈలోకములోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఆయనకు తండ్రి ఒక శరీరాన్ని అమర్చాడు:

“దేవుడు తన సొంత కుమారుని పాపశరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.” (రోమా.8:4)
“కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి.” (హెబ్రీ.10:5)

(iii) విశ్వాసుల తండ్రియైన అబ్రహాముకంటే ముందు ఉన్నవాడు [ఉండినవాడు కాదు]:

“యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని [I am, not I was] మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.” (యోహాను.8:58)

(iv) తండ్రియైన దేవుని యొద్ద వసించాడు:

“మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.” (యోహాను.3:13)
“నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.” (యోహాను.16:28)
“జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవమునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము.” (1యోహాను.1:1-2)

(v) తండ్రియైన దేవునితో సృష్టికార్యములో పాల్గొన్నాడు:

ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.” (యోహాను.1:2-3)
“ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.” (1కొరింథీ.8:6)
“ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.” (కొలొస్సీ.1:16-17)
“ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.” (హెబ్రీ.1:2)
తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది. నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.” (హెబ్రీ.8-12)

(vi) ఉనికికి ప్రారంభము లేనివాడు:

“బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.” (మీకా.5:2)
“అతడు తండ్రిలేనివాడును తల్లిలేనివాడును వంశావళిలేనివాడును, జీవితకాలమునకు ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు.” (హెబ్రీ.7:3)

(vii) దేవుని వాక్కుగా [Λόγος/లోగొస్] దేవునితో వున్నాడు:

“ఇవి జరిగినతరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.” (ఆది.కాం.15:1)
“అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా” (2సమూయేలు.7:4)
“అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.” (1రాజులు.6:11)
“ఆ రాత్రియందు దేవునివాక్కు నాతానునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.” (1ది.వృ.17:3)
యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.” (యెషయా.38:4)
“మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.” (యిర్మీయా.2:1)
“ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను…ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి” (యోహాను.1:1-2,14)
“రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.” (ప్రకటన.19:13)

(viii) దేవుని రూపము [μορφή/మోర్ఫే=form] నందుండి దైవత్వములోని అంతర్గత వాస్తవముగా [Internal Reality] ఉన్న వ్యక్తి:

ఆయన దేవుని స్వరూపము [μορφή/మోర్ఫే=form/రూపము] కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని” (ఫిలిప్పీ.2:6)

II. లోకములోనికి యషువ ప్రవేశము

బైబిలులో ‘లోకము’ [గ్రీకు మూల పదం: κόσμος/కాస్మోస్] అన్న పదము మూడు వివిధ అర్థాలను వ్యక్తపరుస్తూ ఉపయోగించబడింది. కొన్ని సందర్భాలలో ‘లోకము’ అన్న పదం విశ్వమంతటిని సూచిస్తూ ఉపయోగించబడింది (మత్తయి.13:35; యోహాను.13:1; 17:5,24), మరికొన్ని సందర్భాలలో భూమిపై వసిస్తున్న నరులందరిని సూచిస్తూ ఉపయోగించబడింది (మత్తయి.4:8; యోహాను.1:29; 3:16; 4:42; 17:6), ఇంకొన్ని సందర్భాలలో కేవలము భూలోకములోని అవిశ్వాసులను మాత్రమే సూచించటానికి వుపయోగించబడింది (యోహాను.1:10; 3:17; 7:7: 14:17; 17:14,18). ఈ పదము ఉపయోగించబడిన లేఖన సందర్భమే ఆ పదం ఏ భావముతో అక్కడ ఉపయోగించబడిందో గ్రహించటానికి ప్రధాన ఆధారము.

ఈలోకములోకి శరీరధారిగ విచ్చేయకముందు ఆయనకున్న స్థాయి మరియు అస్తిత్వము

(i) దేవుడైన తండ్రికి కుమారుడు: కన్యమరియకు జన్మించక పూర్వమే ఆయన దేవునికి కుమారుడు (కీర్తనలు 2:7,12; సామెతలు 30:4). మరోవిధంగా చెప్పుకోవాలంటే ఆయన దేవునిలోనుండి ఉద్భవించినవాడు! ఆ కారణాన్నిబట్టే ఆయన ఈ లోకములోనికి రాకముందే ఆయనను దేవుని కుమారుడంటూ లేఖనాలు పేర్కొంటున్నాయి:

“లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి [భూమిపై వసిస్తున్న నరుల మధ్యకు] పంపలేదు.” (యోహాను.3:17)
తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి [విశ్వములోనికి] పంపినవానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?” (యోహాను.10:36)
“నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు [విశ్వములోనికి] వచ్చియున్నాను; మరియు లోకమును [విశ్వమును] విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.” (యోహాను.16:28)
“అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి,” (గలతీ.4:4)
“దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి [భూమిపై వసిస్తున్న నరుల మధ్యకు] పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.” (1యోహాను.4:8-10)

(ii) దైవత్వములోని వ్యక్తి: దైవత్వపు లక్షణాలను కలిగిన వ్యక్తిగా ఆయనను లేఖనాలు పరిచయం చేస్తున్నాయి (మీకా 5:2; యోహాను 1:1,14, 20:28; రోమా.9:5; ఫిలిప్పీ.2:5-6; కొలొస్సీ.1:15,17; తీతుకు.1:13; హెబ్రీ.1:3,8)

(iii) నిత్యత్వములో తండ్రిచేత ప్రేమించబడ్డాడు: సృష్టికిముందే తండ్రియైన దేవునితో వసించాడు మరియు తండ్రిచేత ప్రేమించబడ్డాడు (యోహాను 17:5,24)

III. ఈలోకములోనికి యషువ విచ్చేసిన విధానము

– తన దైవత్వపు అధికారాలను/హాక్కులను ఉపయోగించకుండా రిక్తునిగా చేసుకోవటముద్వారా దైవత్వాన్ని మరుగుపరచుకొన్నాడు (ఫిలిప్పీ.2:7; హెబ్రీ.2:9,17-18)
– శరీరధారిగా అంటే పాపశరీరాకారముతో (పాపశరీరముతో కాదు సుమా!) వచ్చాడు (యోహాను 1:14; రోమా.8:4; హెబ్రీ.10:5). కనుకనే ఒక మనిషిగా జన్మించిన ఆయనకు తల్లిదండ్రులు, తోబుట్టువులు, అలాగే దేవుడు కూడా వున్నారు. అంతేగాక, ఈలోకములో మానవులకివ్వబడిన పరిమితులలో జీవించాడు.
– దాసునిస్వరూపములో వచ్చాడు (ఫిలిప్పీ.2:7-8)

IV. దేవుడు ఈ లోకస్తుల యెదుట యషువకు నిర్దేశించిన స్థానము/పాత్ర

– ‘రక్షకుడు’ మరియు ‘ప్రభువు’ (కీర్తనలు 110:1; మత్తయి.1:21; లూకా.1:43, 20:41-44; అపో.కార్య.2:36)
– దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా వసించిన దేవుని ‘మర్మము’ (కొలొస్సీ.2:2,9)
– దేవునికి మరియు నరులకు ‘మధ్యవర్తి’ (1తిమోతి.2:5-6). కేవలం ఒక నరుడు మాత్రమే దేవునికి మరియు నరులకు నడుమ మధ్యవర్తి కాలేడు. అలాగే, కేవలం దేవుడు మాత్రమే నరులకు మరియు దేవునికి మధ్య మధ్యవర్తిగా వుండలేడు. దైవత్వములో దేవునిగావుంటూ అదేసమయములో నరులమధ్య నరునిగా వున్న దైవాంశసంభూతుడే దేవునికి మరియు నరులకు మధ్య నిజమైన మధ్యవర్తిగా వుండగలడు.

V. ఈ సృష్టి అంతటిలో యషువకున్న గొప్పతనం

– ఆదాముకంటే గొప్పవాడు (1కొరింథీ.15:22,45)
– సొలొమోనుకంటే గొప్పవాడు (మత్తయి 12:42; లూకా 11:31)
– యోనాకంటే గొప్పవాడు (మత్తయి 12:41; లూకా 11:32)
– దావీదుకంటే గొప్పవాడు (కీర్త.110:1; మత్తయి 22:44; ప్రకటన 22:16)
– మోషేకంటే గొప్పవాడు (హెబ్రీ. 3:1-6)
– యాకోబు/ఇశ్రాయేలుకంటే గొప్పవాడు (యోహాను.4:12-14)
– అబ్రహాముకంటే గొప్పవాడు (యోహాను 8:54-58)
– మెల్కీసెదెకుకంటే గొప్పవాడు (హెబ్రీ.7:1-25)
– దేవదూతలకంటే గొప్పవాడు (మత్తయి 13:41-42; హెబ్రీ 1:4,6)
– విశ్రాంతిదినముకంటే గొప్పవాడు (మత్తయి 12:8; యోహాను.5:17-18)
– అందరికంటే గొప్పవాడు (ఎఫెసీ 1:20-21; ఫిలిప్పీ 2:9-11)
– దేవుని మందిరముకంటే గొప్పవాడు (మత్తయి.12:6; యోహాను.2:19-21)

VI. యషువ తనకు మరియు తండ్రికి మధ్య వున్న అవినాభావసంబంధాన్ని గురించి తెలియజేసిన సత్యాలు

– “తండ్రియందు నేనును నాయందు తండ్రియు యున్నాము” (యోహాను 10:38; 14:10-11).
– “నేనును తండ్రియును ఏకమై యున్నాము.” (యోహాను 10:30)
– “నావన్నియు నీవి, నీవియు నావి; వారియందు నేను మహి మపరచబడి యున్నాను.” (యోహాను 16:15; 17:10)
– “తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెను” (యోహాను 5:23).
– “నన్ను చూసినవాడు తండ్రిని చూచియున్నాడు” (యోహాను 12:45; 14:9).
– “నాయందు విశ్వాసముంచు వాడు…నన్ను పంపిన వానియందు విశ్వాసముంచుచున్నాడు. (యోహాను 12:44)
– “కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడుకాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించు వాడు.” (1యోహాను 2:23)
– “నన్ను ద్వేశించువాడు నా తండ్రినికూడా ద్వేశించుచున్నాడు.” (యోహాను. 7:7; 15:23)
– “తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడుగాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.” (మత్తయి 11:27)
– “నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము.” (యోహాను 17:2)

VII. యషువ యెడల నిజవిశ్వాసులకుండాల్సిన దృక్పథము/వైఖరి విశయములో తండ్రి చిత్తము

– దేవుని స్వరూపియైన ఆయన మహిమను చూడాలి (2కొరింథీ.4:4; కొలొస్సీ.1:15)
– ఆయన దేవుని అద్వితీయ కుమారుడని విశ్వాసముంచాలి (యోహాను 3:36, 12:44; 1యోహాను 5:10)
– తండ్రిని ఘనపరచునట్లుగా/అదేవిధంగా [καθὼς/కాతోస్=just as/same as/even as; అదేవిధంగా/ఆరకంగానే] ఆయనను ఘనపరచవలెను (మత్తయి.2:9-11, 28:9,17; యోహాను 5:23, 20:28; హెబ్రీ.1:6; ప్రకటన 5:8-14)
– ఆయనను దేవుని అద్వితీయ కుమారునిగా గుర్తించి దేవుని అద్వితీయ కుమారునికి ఏస్థానమిచ్చి ఏవిధంగా గౌరవించాలోనన్నది అపోస్తలుల వ్రాతలలో మరియు వారి మాదిరిలో చూపించబడిందో ఆవిధమైన స్థానాన్ని గౌరవాన్ని ఆయనకు యివ్వనివ్యక్తి తండ్రినే అగౌరవపరచి త్రుణీకరించినవాడుగా లెక్కించబడుతాడు (యోహాను 5:23). అలాంటివాడే క్రీస్తువిరోధి (1యోహాను 2:22-23)

యషువ మషియాఖ్ (యేసు క్రీస్తు) కు నిజవిశ్వాసులు ఇవ్వాల్సిన స్థానము గురించి అపోస్తలుల బోధ మరియు మాదిరి

– అపోస్తలుల బోధ ప్రకారం ఆయన దేవున్ని తన తండ్రిగా ప్రకటించుకొని దేవునితో సమానునిగా చేసుకొన్నాడు (యోహాను 5:18, 10:30-38)
– అపోస్తలులు ఆయనను దేవునిగా గుర్తించారు (యోహాను 1:1, 20:28; 2కొరింథీ.4:4; ఫిలిప్పీ.2:6; రోమా.9:5; కొలొస్సీ.1:15; తీతుకు 1:13; హెబ్రీ.1:8). తండ్రి మరియు కుమారుడు ఇరువురిని ఒకే దేవుడు అని దైవాత్మచేత నడిపించబడిన అపోస్తలులు గుర్తించడానికి నిజదేవుని ప్రవృత్తే కారణం!
– అపోస్తలుల బోధ ప్రకారము అంటే క్రొత్తనిబంధన బోధప్రకారము ప్రొస్కినియో (προσκυνέω=bowing down/worship/show reverance;మ్రొక్కుట/ఆరాధన/పూజ్యభావముతోకూడిన నమస్కారము) అన్నది కేవలము దేవునికే చెందాలి (మత్తయి 4:10). మనుషులకు ఆపాదించకూడదు (అపో.కా.10:26). దేవదూతలకుకూడా ఆపాదించకూడదు (ప్రకటన 19:10, 22:9). అయినా, ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రొస్కినియో (προσκυνέω) ను దేవునిచే దర్శించబడి నడిపించబడిన తూర్పుదేశ జ్ఙానులు ఆపాదించారు (మత్తయి 2:9-11), సాధారణ యూదులు ఆపాదించారు (యోహాను 9:38), అపోస్తలులుకూడా ఆపాదించారు (మత్తయి 28:9,17), మరియు  దేవదూతలు సహితం ఆపాదించారు (హెబ్రీ.1:6). మనుషులు తనకు ప్రొస్కినియో (προσκυνέω) ఆపాదిస్తున్నప్పుడు పేతురు తిరస్కరించాడు, దేవదూత నివారించాడు, కాని ప్రభువైన యేసుక్రీస్తు మాత్రము దాన్ని అంగీకరించి స్వీకరించాడు. కారణం, ఆయన ప్రొస్కినియోకు (προσκυνέω) అర్హుడు! అందుకే యుగాంతమందుకూడా సృష్టియావత్తూ తండ్రికి మరియు కుమారునికి సమిష్టిగా ప్రొస్కినియో (προσκυνέω) అర్పించబోతున్నారన్నది లేఖనము ప్రవచనాత్మకంగా మనకు ప్రకటిస్తున్నది (ప్రకటన 5:8-16).

“దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగసంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.” (2కొరింథీ.4:4-5)

Recent Entries »