Category Archives: బైబిలు

Permalink to single post

మెస్సయ్య మానవుడా?

యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] మానవుడా…?

అవును, కన్యమరియకు జన్మించిన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] అక్షరాలా మానవుడే! కాని, “ఆయన కేవలం మానవుడు మాత్రమేనా?” అన్నది ఇక్కడి అసలైన ప్రశ్న!

కొందరి వాదనా విధానం: మరి యేసు క్రీస్తు [యషువ మషియాఖ్]కు పుట్టుక వుంది మనకూ పుట్టుక వుంది. ఆయనకు దేవుడున్నాడు మనకూ దేవుడున్నాడు. ఆయనకు తండ్రి వున్నాడు మనకూ తండ్రి వున్నాడు. కనుక దేవుని ముందు యేసు క్రీస్తుకు మనకు ఆత్మీయంగా తేడాలున్నప్పటికిని అస్థిత్వంలో ఎలాంటి తేడా లేనట్లే కదా?!

అసలు ఆయనకు మనకు తేడా వుందా…? వుంటే అది ఎలాంటి తేడా…?

యేసు క్రీస్తు [యషువ మషియాఖ్]కు మనకు మధ్య కొన్ని ప్రాథమిక వ్యత్యాసాలున్నాయి

మొదటి ప్రాథమిక వ్యత్యాసం: ఆయన ఈలోకములోకి ప్రవేశించాడు; మనం ఈలోకంలో సృష్టించబడ్డాము.

అప్పుడు యెహోవా నేను సృజించిన [בָּרָא/bara/బరా] నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; (ఆది.కాం.6:7)
నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసి కొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించి [בָּרָא/bara/బరా] యున్నావు?” (కీర్తన.89:47)
వచ్చుతరము తెలిసికొనునట్లుగా ఇది వ్రాయబడ వలెను సృజింపబడబోవు [בָּרָא/bara/బరా] జనము యెహోవాను స్తుతించును.” (కీర్తన.102:22)

‘సృష్టించుట’ లేక ‘శూన్యములోనుండి ఉనికిలోకి తెచ్చుట’ అన్న అర్థాన్ని వ్యక్తపరిచే బరా [בָּרָא/bara/బరా] అనే హీబ్రూ పదం బైబిలు అంతటిలో ఒక్కసారికూడా యేసు క్రీస్తుకు [యషువ మషియాఖ్] అన్వయించబడలేదు అన్నది గమనార్హమైన అంశం.

కాబట్టి ఆయన [యేసు క్రీస్తు/యషువ మషియాఖ్] ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు.బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి.” (హెబ్రీ.10:5)

రెండవ ప్రాథమిక వ్యత్యాసం: ఆయన దేవుని అసలైన కుమారుడు; మనం ఆయనయందున్న విశ్వాసమువలన దేవుని కుమారులముగా మార్చబడ్డాము

యేసు క్రీస్తు [యషువ మషియాఖ్]క దేవుని యొద్దనుండి లేక దేవునిలోనుండి వచ్చాడు. కనుక ఆయన అక్షరాల (literally) దేవుని కుమారుడు, కాని భౌతికంగా కాదు. ఆ కారణాన్నిబట్టి లేఖనాలలో ఆయన అద్వితీయకుమారుడుగా [μονογενής υἱός/మొనొగెనెస్ హుయియొస్ = ప్రత్యేకమైన/ద్వితీయములేని కుమారుడు] పేర్కొనబడ్డాడు (యోహాను.3:16,18; హెబ్రీ.11:17; 1యోహాను.4:9). మనం అంటే నిజవిశ్వారులైనవారు ఈలోకములోనే సృష్టించబడ్డాము. అయినా నిజవిశ్వాసులు యేసు క్రీస్తునందు విశ్వాసమూలముగా దత్తపుత్రాత్మనుబట్టి దేవునికి కుమారులముగా మారాము (యోహాను.1:12-13; రోమా.8:15; గలతీ.4:5-7). ఇది అక్షరార్థమైన మరియు భౌతికమైన పుత్రత్వసంబంధము ఎంతమాత్రము కాదు. ఇది ఆత్మీయమైన మరియు అలంకారరూపమైన సంబంధము. 

ఆదియందు [సృష్టికి పూర్వం] వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద [πρὸς τὸν Θεόν] ఉండెను, వాక్యము దేవుడై యుండెను…ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన [యేసు క్రీస్తు/యషువ మషియాఖ్] మహిమను కనుగొంటిమి.” (యోహాను.1:1,14).

యేసు (యషువ) ఈ లోకములోనికి నరునిగా రాకముందు దేవునితో/దేవునిలో దేవుని వాక్కుగా ఉనికిని కలిగివుండి తన ఉనికికి ఆరంభము లేనివాడై తానే ఆదియై వున్నాడు (ప్రకటన.21:6; 22:13). ఆయన సృష్టించబడలేదు, కాని సమస్తమూ–నీవు నేను కూడా–ఆయనకొరకు ఆయనద్వారా సృష్టించబడ్డాయి. “కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు” (యోహాను.1:3). ఆయన కన్యమరియకు జన్మించకముందే దేవుని కుమారుడు! ఆ కారణాన్నిబట్టే దేవుడు తన కుమారుని ఈలోకములోనికి పంపెను అంటూ లేఖనాలు సాక్షమిస్తున్నాయి (సామెతలు.30:4; యోహాను 3:17, గలతీ.4:4; 1యోహాను.4:9).  

మూడవ ప్రాథమిక వ్యత్యాసం: ఆయన దేవుని మర్మము; మనం దేవుని చేతిపని మాత్రమే

ఈలోకములోకి మానవశరీరాన్ని ధరించి విచ్చేసిన సందర్భంగా (యోహాను.1:14; హెబ్రీ.10:5) యేసు [యషువ] ‘దేవుని వాక్కు’గా దేవునిలో వుండి దేవునిగా వున్న (యోహాను.1:1) కారణాన్నిబట్టి తనకున్న దైవత్వపు లక్షణాలను మరియు హక్కులను వినియోగించుకోకుండా వాటిని మరుగుపరచుకొని మానవ పరిధులకు తన్నుతాను పరిమితునిగా చేసుకున్నాడు (ఫిలిప్పీ.2:6-7; హెబ్రీ.2:14). 

పై లేఖన సత్యాలనుబట్టి ఒక నరునిగా జీవించిన యేసు క్రీస్తు దేవుని మర్మమై వున్నాడంటూ లేఖనాలు ఘోశిస్తున్నాయి (కొలొస్సీ.2:2). నిన్నూ నన్నూ లేక ఏనరున్నికూడా ‘దేవుని మర్మము’ అని లేఖనాలు ఎక్కడా ప్రకటించలేదు అన్నది ఈసందర్భంగా మనం జ్ఙాపకం చేసుకోవాలి. ఆయనకు మనకు మధ్య వున్న ఈ భేదం అత్యంత ప్రాముఖ్యమైనది. 

పై కారణాలను బట్టి దేవుని ఎదుట కారణజన్ముడు దైవాంశసంభూతుడు అయిన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] మరియు తతిమా మానవులందరు సమానం కాదు. ఈ రెండు వర్గాల మధ్య వున్న అస్థిత్వపు అగాధం అన్నది ఎప్పటికీ పూడ్చబడలేనిది. అందుకే ఆయన దేవున్ని సూచిస్తూ “నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడు” (యోహాను.20:17) అన్నడే కాని “మన దేవుడు మన తండ్రి” అంటు సంబోధించలేదు. ఈ సుక్ష్మమైన అదేసమయములో అత్యంత పాముఖ్యమైన వ్యత్యాసాన్ని విజ్ఙులుమాత్రమే గుర్తించగలరు గ్రహించగలరు.    

Permalink to single post

నిజదేవుని ప్రవృత్తి

సృష్టికర్త అయిన దేవుడు అనంతుడు. ఆయనను గూర్చిన జ్ఙానం కూడా అనంతమైనది. దేవుని గురించిన సంపూర్ణ జ్ఙానం సృష్టించబడిన ఏ వ్యక్తికీ అందనటువంటిది. అయినా, తన స్వరూపమందు తన పోలికచొప్పున సృష్టించబడిన మానవులకు ఉపకరించేందుకు వీలుగా దేవుడు తన గురించిన గ్రహింపును కొంతవరకు నిజమైన ప్రవక్తల/అపోస్తలుల గ్రంథాలలో అందించడము జరిగింది. ఆ ప్రత్యక్షత దేవుని ఆత్మ ప్రేరణలో (inspiration) యివ్వబడిందిగనుక దాని గ్రహింపునుకూడా ఆ దేవుని ఆత్మ నడిపింపులోనే (illumination) మానవులు గ్రహించగలరు. అయితే ఈ నడిపింపు అన్నది విశ్వాసుల విధేయత మరియు ఆత్మీయ పరిణితిపై ఆధారపడివుంది. ఈ కారణాన్నిబట్టి బైబిలులోని ప్రత్యక్షతలనుగురించిన విశ్వాసుల గ్రహింపులలో హెచ్చుతగ్గులుండే అవకాశముంది.

పాతనిబంధన గ్రంథములో అంటే యూదుప్రవక్తలద్వారా యివ్వబడిన హీబ్రూ లేఖనాలలో (తనాఖ్) తననుతాను ప్రత్యక్షపరచుకున్న సృష్టికర్త ప్రవృత్తిని అర్థం చేసుకోవడానికి రెండు ప్రాముఖ్యమైన హీబ్రూ పదాలను ధ్యానించడం ఆవశ్యకం–‘యఖీద్’ (יָחִיד = yahid or yachid) మరియు ‘ఎఖద్’ (אֶחָד = ehad or echad). ఎఖద్ అన్న పదానికి గణితశాస్త్ర సంఖ్య ఒకటి, సమిష్టి ఐఖ్యత, సామూహ ఏకత్వం వంటి అర్థాలు (ఉదా: ఆది.కాం. 2:24, 11:6; ద్వి.కాం.6:4), అలాగే యఖీద్ అన్న పదానికి ఏకైక, ఒకేఒక్క, ఏకాకి, ప్రియమైన, విశిష్టమైన, ప్రత్యేకమైన వంటి అర్థాలు (ఉదా: న్యాయాధిపతులు 11:34; కీర్తనలు 25:16; 68:6) ఉన్నాయి.

(1) ఎఖద్ అనే “సమూహ ఏకత్వాన్ని” సూచించే హీబ్రూ భాషా పదం సృష్టికర్త యొక్క అస్తిత్వాన్ని ప్రకటించిన సంధర్భంలో ఆయన ఏకత్వాని సూచించడానికి యూదు లేఖనాలలో వుపయోగించబడింది (ద్వి.కాం.6:4). అయితే, ఈ పదం ఒక్కసారయినా నరుని ఏకత్వాన్ని సూచించడానికి వుపయోగించబడలేదు.”ఒక్క దేవుడు” అంటే సంఖ్యాపరంగా ఒకదేవుడని భావం (ఉదా: ఒక్క దేవుడు, యిద్దరుదేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళు…). ఒక్క/ఒక్కడు/ఒక్కటి అన్న గణితశాస్త్ర సంఖ్య గణితశాస్త్ర సూత్రాలకు లోబడుతుంది. అయితే నిజమైన దేవుడు ఏశాస్త్రానికి లోబడడు లేక పరిమితి కాజాలడు. కనుక, ఆ కారణాన్ని బట్టి గణితశాస్త్రపరమైన ఒక్కటి/ఒక్కడు (one/1) అన్న భావార్థం నిజదేవునికి అన్వయించతగదు.

“దేవుడు ఒక్కడు” (אֶחָד = ఎఖద్) అంటే వునికిలో నిజదేవునిగా ఉన్నవాడు ఒక్కడే అని భావం. ఇదే సత్యాన్ని మరొకవిధంగా చెప్పలంటే దేవుడు అద్వితీయుడు. అంటే, ఆయనను పోలినవాడు లేక ఆయనలాంటివాడు ఆయనకు వేరుగా సాటిగా పోటీగా ధీటుగా మరొక దేవుడు లేడు.

“దేవుడు ఏకాకి/ఒకేఒక్కడు” (יָחִיד = యఖీద్) అంటే దేవుడు ఒంటరివాడు మరియు ఆయనలో ‘సమూహ ఏకత్వం’ అన్నది యేదిలేదన్నది సూచించబడుతున్నది. అయితే, హీబ్రూలేఖనాలలో ఎక్కడా దేవుని ఉనికి/అస్తిత్వానికి సంబంధించి ఈవిశయం చెప్పబడలేదు అన్నది గమనించదగిన విశయం. దీన్ని బట్టి యూదు లేఖనాలలో తనను తాను ప్రత్యక్షపరచుకున్న సృష్టికర్త ఏకాకి లేక ఒకేఒక్కడు (יָחִיד = యఖీద్) కాదు అన్నది సుస్పష్టం.

(2) నరుని ఏకత్వాన్ని సూచించడానికి యూదు లేఖనాలలో వుపయోగించబడిన హీబ్రూ భాషా పదం యఖీద్. (ఉదా: న్యాయాధిపతులు 11:34). కాని, ఈ పదం ఒక్కసారయినా దేవుని ఏకత్వాన్ని సూచించడానికి ఉపయోగించబడలేదు అన్నది మరవకూడదు.”ఒక్క మనిషి” అంటే సంఖ్యాపరంగా ఒకమనిషని భావం (ఒక్క మనిషి, యిద్దరు మనుషులు, ముగ్గురు మనుషులు…). “మనిషి ఒక్కడు” (אֶחָד = ఎఖద్) అంటే వునికిలో మనిషిగా ఉన్నవాడు ఒక్కడే అని భావం. కాని, హీబ్రూ లేఖనాలలో యెక్కడాకూడా మనిషి వునికికి సంబంధించి ఈలాంటి పదజాలం వుపయోగించబడలేదు. ఇందును బట్టి యూదు లేఖనాలు మనిషి ‘ఒక్కడు’ (אֶחָד = ఎఖద్) లేక ‘సమూహ ఏకత్వం’ కలవాడు అని బోధించడం లేదన్న వాస్తవం నిర్ధారించుకోవచ్చు.

“మనిషి ఏకాకి/ఒకేఒక్కడు” (יָחִיד = యఖీద్) అంటే మనిషి ఒంటరివాడు మరియు అతనిలో ‘సమూహ ఏకత్వం’ ఏదీలేదన్నది సూచించబడుతున్నది. ఈ సత్యాన్ని హీబ్రూ భాషలోని యూదు లేఖనాలు నిర్ద్వంధంగా సూచిస్తున్నయి (కీర్తనలు 25:16; 68:6). దాదాపు ముప్ఫైమంది దైవాత్మచేత ప్రేరేపించబడిన ప్రవక్తలద్వార హీబ్రూలేఖన గ్రంథాలసంపుటి అయిన పాతనిబంధన మానవాళికి అందించబడింది. 39 లేఖన గ్రంథాల సంపుటి అయిన పాతనిబంధనలో ఎఖద్ అన్న పదం 967 సార్లు అలాగే యఖీద్ అన్న పదం 12 సార్లు వుపయోగించబడ్డాయి. అయితే, అందులో ఒక్క ప్రవక్త అయినా దేవుని ఏకత్వాన్ని సూచించేందుకు ‘యఖీద్’ (יָחִיד = yachid) అన్న పదాన్ని అలాగే నరుని ఏకత్వాన్ని సూచించేందుకు ‘ఎఖద్’ (אֶחָד = echad) అన్న పదాన్ని వుపయోగించడం అన్నది జరగలేదు.

దేవుడు ఒక్కడు/అద్వితీయుడు (ఎఖద్) 

అంటే, దేవుడు ద్వితీయము లేనివాడు. మరొకవిధంగా చెప్పలంటే, దేవుని పోలినవాడు లేక ఆయనలాంటివాడు ఆయనకు వేరుగా సాటిగా పోటీగా ధీటుగా మరొక దేవుడు లేడు. ఈ గ్రహింపునుబట్టి ‘దేవుడు ఒక్కడు (ఎఖద్) కాదు’ అన్నవాడు అబద్దికుడు. అదేసమయంలో, దేవుడు ఒంటరివాడు లేక ఏకాకి (యాఖిద్) కాదు అన్నదికూడా గ్రహించాలి. అంటే, దేవుని అంతర్గత వాస్తవికత (ఉన్నత) అన్నది (ఆయనకు వేరుగా లేక వెలుపల కాదు సుమా) మానవ అంతర్గత వాస్తవికతలా ఒంటరి లేక ఏకాకివంటిది (యాఖిద్) కాదు. కనుక, ఈ గ్రహింపునుబట్టి ‘దేవుడు ఏకాకి లేక ఒంటరివాడు (యాఖిద్)’ అన్నవాడుకూడా అబద్దికుడు.

యెహోవా ఒక్కడు/అద్వితీయుడు (ఎఖద్). అంటే, ద్వితీయము లేనివాడు. మరొకవిధంగా చెప్పలంటే, యెహోవాకు వేరుగా, సాటిగా, పోటిగా మరొకడు లేడు. ఆ గ్రహింపులో యెహోవా ఒక్కడు (ఎఖద్) కాదు అన్నవాడు అబద్దికుడు. అదేసమయంలో, యెహోవా ఒంటరివాడు లేక ఏకాకి (యాఖిద్) కాదు అన్నదికూడా గ్రహించాలి. అంటే, యెహోవా అంతర్గత వాస్తవికత (ఉన్నత) అన్నది (ఆయనకు వేరుగా లేక వెలుపల కాదు సుమా) మానవ అంతర్గత వాస్తవికతలా ఒంటరి లేక ఏకాకి వంటిది (యాఖిద్) కాదు. కనుక, ఈ గ్రహింపునుబట్టి ‘యెహోవా ఏకాకి లేక ఒంటరివాడు (యాఖిద్)’ అన్నవాడుకూడా అబద్దికుడు.

(ద్వి.కాం.6:4; యెషయా 45:5,6,14; 46:9; మార్కు 12:29; రోమా 3:30)

దేవుడు సర్వవ్యాప్తి

దేవుడు అంతటా వ్యాపించి వున్నాడు మరియు ఆయన లేని స్థలము అంటూ లేదు. ఈ గుణలక్షణాన్నిబట్టి నిజదేవుడు ఒకేసమయంలో తన ఇచ్ఛప్రకారం రెండు లేక అంతకన్న ఎక్కువ స్థలాలలో ప్రత్యక్షంకూడా కాగలడు. ఇది సృష్టికి (నరులకు) అసాధ్యం, కాని సృష్టికర్తకు (దేవునికి) సుసాధ్యం!

దేవుడు రెండు వేరువేరు స్థలాలలో ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులుగా ప్రత్యక్షమైన సందర్భంలో ఇద్దరు దేవుళ్ళు అనిలెక్కించడము లేక తీర్మానిచడము అవివేకం. ఆవిధంగా ప్రత్యక్షమవగలగడం అన్నది దేవుని ప్రవృత్తి. ఈ సందర్భంగా నిజదేవుడు గణితశాస్త్ర పరిధులకు అతీతమైనవాడు అన్న సత్యాన్ని పరిగణాలోకి తీసుకోవాలి. అలాంటి సందర్భాలలోకూడా ఆయన అద్వితీయుడేనన్నది మరువకూడదు. అది సృష్టికి అతీతంగా వుంటూ కేవళము సృష్టికర్తకు మాత్రమే చెందిన దైవప్రవృత్తి.

(కీర్తనలు 139:7-10; యిర్మీయ 23:24; అపో.కా.17:28)

దేవుని స్వభావం వైవిధ్యంతోకూడినది

అంటే, ఆయన ఏకాకి లేక ఒంటరివాడు కాదు. ఇంకా చెప్పలంటే దేవుని అంతర్ఘత అస్తిత్వం సృష్టించబడిన వ్యక్తుల అస్తిత్వాన్ని పోలిన ఏకత్వంలా వుండక సృష్టిలోనే లేని ‘వైవిధ్యంతో కూడిన ఏకత్వాన్ని’ (Unity in Diversity) కలిగి వున్నాడు. బైబిలు పరిభాషలో చెప్పాలంటే, ఆయన తండ్రికుమారపరిశుద్ధాత్ములనే వైవిధ్యంతో కూడిన ఏకత్వమై యున్న అద్వితీయదేవుడు [అద్వితీయుడు: ద్వితీయములేనివాడు; తనకు వేరుగా సాటిగా పోటిగా ధీటుగా మరొకడు లేనివాడు;].

(ఆది.కాం.1:26; యెషయా 48:15-16; జెకర్యా 2:8-11; మలాకి 3:1; మత్తయి 28:19; యోహాను 1:1, 18)

దేవుడు నరులను తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృష్టించినా ఆయన అనేక విధాలుగా నరులకన్నా ఎంతో గొప్పవాడు మరియు వైవిధ్యమున్నవాడు. కనుక, దేవుడు నరులలాంటి వాడు కాదు అన్నది నిరాపేక్షమైన మాట. సర్వసాధారణంగా ఒక నరునిలో/మానవదేహములో ఒక వ్యక్తిమాత్రమే అస్తిత్వాన్ని కలిగివుంటాడు. దేవుడుకూడా అలాగే వుండాలన్న నియమమేదీ లేదు. మరోమాటలో చెప్పాలంటే, నరులలో లేని వైవిధ్యం/బహుళత్వం దేవునిలో వుండే అవకాశం వుంది. నిజానికి వుంది అని గ్రహించడానికి పైన వివరించిన విధంగా లేఖనాలు తిరుగులేని ఆధారాలెన్నో అందిస్తున్నాయి.

సృష్టికర్త ప్రవృత్తిని సంపూర్ణంగా కాకపోయినా పరిమితస్థాయిలోనైనా సరిగ్గా అవగాహన చేసుకోవటానికి మానవ మేధస్సుకు వున్న పరిమితులే పెద్ద ఆటంకం అన్నది లేఖనాల ప్రకటన:

ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.” (1కొరింథీ.2:14)

Permalink to single post

తనాక్-జూడాయిజం

ఈనాటి యూదులు మరియు యూదామతప్రవిష్టులు క్రొత్తనిబంధన గ్రంథాన్ని దైవలేఖనాలుగా ఒప్పుకోరు విశ్వసించరు. వారిదృష్టిలో కేవళము క్రైస్తవులు పాతనిబంధన గ్రంథముగా పేర్కొనే 39 హిబ్రూ లేఖనగ్రంథాలు మాత్రమే దైవలేఖనాలు. దీన్నిబట్టి యూదులు/యూదామతప్రవిష్టులు తాము దైవలేఖనాలుగా విశ్వసించే 39 హిబ్రూ లేఖనగ్రంథాలను (పాతనిబంధన గ్రంథాన్ని) పాతనిబంధన గ్రంథము అని పేర్కొనకుండా “తనాక్” (TaNaK) అన్న ఒక క్రొత్తపేరుతో పిలుస్తారు. 

తనాక్ (TaNaK) అంటే యూదుల పరిభాషలో కేవళము 39 హిబ్రూ లేఖనగ్రంథాల సంపుటి అయిన పాతనిబంధన గ్రంథము. దీన్నే హిబ్రూ భాషలో మిక్రా (Mikra) అనికూడా సంబోధిస్తారు.తనాక్ లోని  39 హిబ్రూ లేఖనగ్రంథాలను యూదులు మూడు ప్రధాన భాగాలుగా విభజించారు–తోరా/Torah (మోషేద్వారా యివ్వబడిన పంచకాండాలు), నెవియిం/Nevi’im (ప్రవక్తలు), మరియు కెతువిం/K’etuvim (వ్రాతలు/లేఖనాలు). ఇవి పరిశుద్ధాత్మ ప్రేరణలో వ్రాయబడిన దైవ సందేశముతో కూడిన గ్రంథాలు. ఈ 39 గ్రంథాలు 1000 సంవత్సరాల కాలంలో వ్రాయబడ్డాయి (1400 క్రీ.పూ.— 400 క్రీ.పూ.). మూడు హిబ్రూ పదాలలోని (Torah, Nevi’im, K’etuvim) మొదటి అక్షరాలను చేర్చి తనాక్ (TaNaK) అన్న పదాన్ని యేర్పరచుకున్నారు యూదులు. 

“తనాక్ ధార్మిక మార్గం” అన్న మతవిశ్వాసం కేవలం తనాక్ (పాతనిబంధన గ్రంథము) లోని దైవలేఖనాలపై మాత్రమే ఆధారపడిన మతవిశ్వాసం. ఈ మతవిశ్వాసాన్ని బైబిలు విశ్వాసము అనికూడా పేర్కొనవచ్చు. ఇది యెరూషలేములో హేరోదు కట్టించిన రెండవ మందిరము 70 క్రీ.శ. లో నాశనము/ద్వంసము చేయబడినతరువాత క్రమక్రమంగా వునికిని కోల్పోయింది. అంతకు పూర్వము తనాక్ ధార్మిక మార్గం లోని భక్తిపరులు చాలావరకు యేసును (యషువను) క్రీస్తుగా (మెస్సయ్యగా) గుర్తించి ఆయనను వెంబడించి క్రైస్తవులుగా మారిపోయారు. ఆరకంగా తనాక్ ధార్మిక మార్గం తన అస్తమయసమయానికంటే ముందే తనలో రూపుదిద్దుకున్న బైబిలు-క్రైస్తవ్యానికి పురుడుపోసి దేవుని ఆత్మీయ ప్రణాలికలో తన పాత్రను ముగించుకొని తన వారసుడైన “క్రొత్తనిబంధన సమాజము”లో క్రొత్త పేరుతో చిరంజీవిగా నిలిచిపోయింది (యెషయా 65:15).

తనాక్-జూడాయిజం ప్రధానంగా మోషేనిబంధనలో భాగమైన మోషేధర్మశాస్త్రములోని ఆజ్ఙలు, విధులు, గుడారము/దేవాలయము లోని అర్చనాదులు, బలులు, నైవేధ్యాలు, శిక్షలు మొదలైనవాటిచుట్టు కేంద్రీకృతమైనది. అయితే, 70 క్రీ.శ.లో రోమాసైన్యము యెరూషలేములోని దేవుని మందిరాన్ని నాశనముచేసి యూదులమతకేంద్రాన్ని ద్వంసం చేయడముతో తనాక్-జూడాయిజం తన అంతిమదశకు చేరుకున్నది. నిజానికి 40 సంవత్సరాలకుముందే అంటే దాదాపు 30 క్రీ.శ.లో దేవుని ప్రణాలికలోని మానవనిర్మిత మందిరముకుండిన ప్రధాన వుద్దేశము నెరవేర్చబడి సంపూర్ణము చేయబడింది. దేవుని సన్నిధిలో సర్వకాలాలకు సరిపోయిన దైవసుతుని బలియాగము సృష్టిలో దైవసాక్షిగా అర్పించబడింది. దానికి సాదృశ్యంగా పరిశుద్ధస్థలానికి మరియు అతిపరిశుద్ధస్థలానికి మధ్యలో వుండిన తెర తొలగి ప్రతిసంవత్సరము ఒకసారిమాత్రమే దేవుని ప్రజల పాపాలప్రాయశ్చిత్తార్థమై ప్రధానయాజకుడు పశువుల రక్తముతో దేవునిమందిరములోని అతిపరిశుద్ధస్థలములోకి ప్రవేశించే ఆగత్యానికి తెరపడింది. ఈరకంగా తనాక్-జూడాయిజం యొక్క అంతిమదశకు నాంది పడింది. అక్కడే క్రొత్తనిబంధనాసమాజానికి అంకురార్పణ జరిగింది. అయితే, అదేసమయంలో తనాక్-జుడాయిజం కు వేరుగా మరియు ప్రతికూలంగా తాల్మూద్-జూడాయిజం అనే ఒక క్రొత్త జూడాయిజం మొలకెత్తింది. దాన్నే రబ్బీలజూడాయిజం అనికూడా పేర్కోంటారు. అదే ఇనాటి ప్రపంచములో యూదుమతంగా పేరొంది విస్తరిస్తున్నది.

“బైబిల్-క్రైస్తవ్యం” లేక “క్రొత్తనిబంధనాసమాజం” అన్నది మోషేనిబంధన కాలములోనే దేవుడు వాగ్ధానం చేసిన వేరొక నిబంధనకు చెందిన దేవునిప్రజలు (ద్వి.కాం.32:21; కీర్తన.82:8). ఆ వేరొకనిబంధననే “క్రొత్తనిబంధన” అని లేఖనాలు అభివర్ణించాయి. కొందరు తప్పుగా అభిప్రాయపడుతున్నట్లు ఇది నూతనపరచబడిన మోషేనిబంధన కాదు. అసలు యిది మోషేనిబంధనవంటిదేమాత్రము కాదు. “అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు” అంటూ దేవుడే విస్పష్టముగా సెలవిచ్చినవిధంగా ఆ “క్రొత్తనిబంధన” మోషేనిబంధనవంటిది కాదు అన్నది గమనార్హమైన విశయము. అంతేకాక దేవుడే ఈ నిబంధనకు ‘నిత్యనిబంధన’ అంటూ మోషేనిబంధనకులేని ఉత్కృష్టస్థానాన్ని గుర్తింపును తనముద్రగా యిచ్చాడు (యిర్మీయ 31:31-34, 32:37-40).

పాత/పూర్వ నిబంధనగా వున్న మోషేనిబంధనలో భాగంగా యివ్వబడిన మోషేధర్మశాస్త్రము గుడారము/దేవాలయము మరియు దాని ఆచారాలతో విధులతో ముడిపడివుంది. అయితే, క్రొత్తనిబంధనలో భాగంగా అక్షరార్థముగా అలాంటి ఆచారాలు విధులు ఎవీ లేని క్రొత్తధర్మశాస్త్రము లేక క్రీస్తుధర్మశాస్త్రము (Law of Christ—యెషయా.42:4; గలతీ.6:2) యివ్వబడింది (యోహాను 13:34, 14:26, 16:12-15; 1కొరింథీ.9:21; 1యోహాను 2:3-6). ఈ క్రొత్తనిబంధనాప్రజలే క్రీస్తు అనబడిన యేసు యొక్క శిష్యులు లేక క్రైస్తవులు. 30 క్రీ.శ.తరువాత ప్రారంభమైన క్రైస్తవ్యం మొదట్లో ఒక దశాబ్ధానికిపైగా కేవళము యూదులతో ప్రారంభమై యూదులమధ్యే విస్తరించింది. ఆ సమయములో కొన్ని వేల యూదులు సత్యాన్ని గ్రహించి జూడాయిజంను వదిలి క్రైస్తవ్యాన్ని స్వీకరించారు (అపో.కా.21:20).

క్రైస్తవుడు (Christian) అంటే ‘క్రీస్తును వెంబడించే వాడు’ (follower of Christ)అని భావం. ప్రారంభములో ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుల యొక్క ప్రత్యేకమైన విశ్వాసము మరియు అబ్బురపరచే జీవనవిధానాలు అన్యులను/అవిశ్వాసులను కదిలించివేసాయి. శిష్యులకున్న ఆ విశిష్ట గుణలక్షణాలే వారు క్రీస్తును వెంబడించే వారని అన్యులు/అవిశ్వాసులు గుర్తించేందుకు తోడ్పడ్డాయి. దాంతో అన్యులు/అవిశ్వాసులు శిష్యులను ఆ పేరుతో అంటే ‘క్రైస్తవులు’ అంటూ పిలవడం మొదలుబెట్టారు (అపో.కాం.11:26). యేసుక్రీస్తునందు విశ్వాసముద్వారా దేవుని పిల్లలైనవారికి క్రైస్తవులు (Christians) అన్న పేరు దైవలేఖనాలు ప్రమాణీకరించడాన్ని క్రొత్తనిబంధనలో చూడగలము (1పేతురు 4:16).

Permalink to single post

యెషయాలో మెస్సయ్యా

యెషయా గ్రంథములో దేవుడైన యేహోవా చేత ‘నా సేవకుడు’ అని పిలువబడింది ఎవరు? 

యెషయా 52:13 – 53:12 వరకున్న లేఖనాలలో ఇశ్రాయేలీయులనందరిని సమిష్టిగా పేర్కొంటూ ‘నా సేవకుడు’ అన్న పదజాలము ఉపయోగించబడింది అంటూ కొందరు అలాగే ఇశ్రాయేలు చరిత్రలో నీతిమంతులయిన ఇశ్రాయేలీయులనందరిని కలిపి సాదృశ్యముగా సూచించడానికి ‘నా సేవకుడు’ అన్న అలంకార పదజాలము ఉపయోగించబడింది అంటు మరికొందరు భాష్యం చెప్పే ప్రయత్నం చేస్తూంటారు.  మరి అలాంటి అభిప్రాయాలను లేఖనాలు సమర్ధిస్తున్నాయా అన్నదే ఇక్కడ కీలకమైన ప్రశ్న. 

1) ‘నాసేవకుడు ‘ (עַבְדִּ֑י=అబ్’ది) అన్నఏకవ్యక్తి పదజాలం యెషయా గ్రంథములో అనేకసార్లు ఉపయోగించబడింది
 
– 16 సార్లు వుపయోగించబడింది.  
– ప్రవక్త యెషయా ‘నా సేవకుడు’ గా పేర్కొనబడ్డాడు (యెషయా 20:3)  
– హిల్కియా కుమారుడు ఎల్యాకీము  ‘నా సేవకుడు’ గా పేర్కొనబడ్డాడు (యెషయా 22:20)
– రాజైన దావీదు ‘నా సేవకుడు’  గా పేర్కొనబడ్డాడు (యెషయా 37:35)    
– యాకోబు సంతానము లేక ఇశ్రాయేలు జనాంగము ‘నా సేవకుడు’ గా పేర్కొనబడింది (యెషయా 41:8-9; 44:1,2,21; 45:4; 49:3).  
– అప్పటికింకా నామము బహిర్గతం చేయబడని ఒక విశిష్టమైన వ్యక్తి ‘నా సేవకుడు’ గా పేర్కొనబడ్డాడు (యెషయా 42:1,19; 43:10; 49:5-8; 52:13-53:12).  

2) యెషయా గ్రంథములో ప్రభువైన దేవుడు ఉపయోగించిన ‘నాసేవకుడు’ అన్న పదజాలం భవిష్యత్తులో రాబోవుతున్న ఒక ప్రత్యేకమైన వ్యక్తి విశయంలో ఉపయోగించబడింది. అయితే, అదివరకేవచ్చిన/ఉండిన వ్యక్తులనుగాని లేక జనాంగాన్నిగాని ఉద్దేశించి ‘నాసేవకుడు’ అంటూ పేర్కొంటునప్పుడు ఆవ్యక్తియొక్క లేక జనాంగము యొక్క నామాన్ని కూడా అదేసందర్భములో స్పష్టంగా పేర్కొనడం చూస్తాము.    

యెషయా గ్రంథములో దేవుడు (ప్రభువైన యెహోవా) ఏర్పరచుకున్న ప్రత్యేకమైన ‘సేవకుడు’ ప్రవక్త అయిన యెషయా కాదు, రాజైన దావీదు కాదు, కోశాధికారి అయిన ఎల్యాకీముకూడా కాదు. ఆమాటకొస్తే, ఆయన యాకోబు సంతానమైన ఇశ్రాయేలీయుల సమిష్టి జనాంగము యొక్క సాదృశ్య రూపము అంతకన్నా కాదు.    

3) దేవుడైన యెహోవా ‘నాసేవకుడు’ అంటూ ప్రవక్త అయిన  యెషయాద్వారా పరిచయం చేసిన ఆప్రత్యేకమైన కారణజన్ముని గూర్చి లేఖనాలు సెలవిస్తున్న సత్యాలు

– అతడు దేవుడైన యెహోవాకు ప్రాణప్రియుడు (యెషయా.42:1)  [ఇది అనంతకాలమునుండే కొనసాగుతున్నది]
– అతనియందు యెహోవా ఆత్మ వుండును (యెషయా.42:1) [ఇది అనంతకాలమునుండే కొనసాగుతున్నది]
– అతడు అన్యజనులకు న్యాయము అందిస్తాడు (యెషయా.42:1) [తండ్రి మహిమతో రాజుగా వచ్చినప్పటినుండి] 
– అతని ఉపదేశము/ధర్మశాస్త్రము (తోర) కొరకు దూరప్రాంత ప్రజలలుకూడా ఎదురుచూస్తారు (యెషయా.42:4) [ఆయన పరిచర్య ప్రారంభించినప్పటినుండి]
– అతడు ప్రభువైన యెహోవాచేత అన్యజనులకు వెలుగుగా నియమించబడ్డాడు (యెషయా.42:7) [ఆయన పరిచర్య ప్రారంభించినప్పటినుండి]
– అతడు యెహోవా యొక్క దూత (యెషయా.42:19) [పాతనిబంధన కాలమునుండి]
– అతడు యెహోవా యొక్క సాక్షి (యెషయా.43:10) [ఆయన పరిచర్య ప్రారంభించినప్పటినుండి]  
– అతడు ఇశ్రాయేలీయులను తిరిగి యెహోవ యొద్దకు తీసుకు వచ్చేవాడు (యెషయా.49:5) [పరిచర్య ప్రారంభించినది మొదలుకొని తాను తిరిగి వచ్చేంతవరకు]
– అతడు భూదిగంతములవరకు యెహోవా కలుగజేయు రక్షణకు సాధనముగా వుంటాడు (యెషయా.49:6) [క్రొత్తనిబంధననుండి తాను తిరిగి వచ్చేంతవరకు]
– అతడు అన్యజనులకు వెలుగుగా వుండేందుకు యెహోవా చేత నియమించబడ్డాడు (యెషయా.49:6) [క్రొత్తనిబంధననుండి తాను తిరిగి వచ్చేంతవరకు]
– అతడు మనుషులచేత నిరాకరించబడినవాడు (యెషయా.49:7, 53:2) [ఆయన ఇహలోకములో నరునిగా జీవించిన సమయములో]
– అతడు జనులచేత అసహ్యించుకోబడ్డవాడు (యెషయా.49:7, 53:3) [ఆయన ఇహలోకములో నరునిగా జీవించిన సమయములో]    
– అతడు యెహోవాచేత ప్రజలకు నిబంధనగా (క్రొత్తనిబంధనగా) నియమించబడ్డవాడు (యెషయా.42:7; 49:8) [క్రొత్తనిబంధననుండి తాను తిరిగి వచ్చేంతవరకు] 
– అతడు మన (ప్రజల) రోగములను, వ్యసనములను వహిస్తాడు (యెషయా.53:4)
– అతడు మన (ప్రజల) స్థానములో శిక్ష అనుభవిస్తాడు (యెషయా.53:5)
– అతడు పొందే శిక్షనుబట్టి మనము (ప్రజలు) స్వస్థత పొందుతాము (యెషయా.53:5) 
– అతడు దేవుని ప్రజల స్థానములో శిక్షించబడుతాడు మరియు ప్రాణత్యాగము చేస్తాడు (యెషయా.53:8)
– అతడు ఏ పాపము చెయకున్నా మరణశిక్షను అనుభవిస్తాడు (యెషయా.53:9)
– అతడు తననుతాను పాపపరిహారార్థబలిగా చేసుకుంటాడు (యెషయా.53:10)
– అతడు (మరణములోనుండి తిరిగి బ్రతుకుటద్వారా) దీర్ఘాయుష్మంతుడవుతాడు (యెషయా.53:10)
– అతనిద్వారా యెహోవా యొక్క ప్రణాలిక నెరవేర్చబడుతుంది (యెషయా.53:10)
– అతడు నీతిమంతుడైన యెహోవా సేవకుడు (యెషయా.53:11) 
– అతడు ప్రజల దోషములను తాను భరించి వారిని నిర్దోషులుగా చేస్తాడు (యెషయా.53:11)
– అతడు మరణమునొందునంతగా తన ప్రాణమును ధారపోస్తాడు (యెషయా.53:12)
– అతడు ప్రజల పాపములను భరిస్తూ వారి కొరకు విజ్ఙాపన చేస్తాడు (యెషయా.53:12)

పై వైశిష్టాలన్నీకూడా కన్యమరియ యొక్క కుమారుడైన యేసు (యషువ) జీవితములో ప్రస్పుటముగా నేరవేర్చబడటాన్ని క్రొత్తనిబంధన లేఖనాలలో వివరించబడింది. ఈ రకంగా ఇశ్రాయేలీయుడైన ఒక వ్యక్తి జీవితములో పై ప్రత్యేకతలన్నీ నెరవేర్చబడటమన్నది చరిత్రలో కన్యమరియ కుమారుడు యేసు (యషువ) జీవితములో తప్ప మరొకరి జీవితములో నెరవేర్చబడలేదు. ఇది దేవుడే మాట యిచ్చి నెరవేర్చాడన్న సత్యము కేవళము సత్యాన్వేషకులైన విజ్ఙులు గ్రహించగలరు. తద్వారా అలాంటివారు మాత్రమే పరమతండ్రి యొక్క నిత్యసంకల్పములోని యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) యొక్క పాత్రను గుర్తించి స్వీకరించగలరు.

జూడాయిజములోని కొందరు దుర్బోధకులు లేఖనాలను వక్రీకరించే ప్రయత్నములో యెషయా గ్రంథములోని “నా సేవకుడు” అన్నది కన్యమరియ కుమారుడు యేసు [యషువ] కాదు అంటూ అసందర్భ అభ్యంతరాలను అనేకం లేవనెత్తుతుంటారు. అలాంటివారు చెప్పేది సత్యమయితే మరి పైన చూపిన యెషయా గ్రంథములోని “నా సేవకుడు” అనబడిన ఆ వ్యక్తి ఎవరు? ఆవ్యక్తిలో పైన ప్రవచనాత్మకంగా పేర్కొనబడ్డ విశయాలు నెరవేర్చ బడ్డాయా? ఆ వివరాలను అందిస్తేతప్ప ఆ వ్యక్తి యేసు కాదు అనడానికి వారికి అర్హత లేదు.

4) యెషయా గ్రంథము 42:1-7; 43:10; 49:5-8; 52:13-53:12 వాక్యాలలో ప్రభువైన యెహోవా చేత ‘నాసేవకుడు’ అంటు పేర్కొనబడింది యాకోబు సంతానమైన ఇశ్రాయేలీయుల సమిష్టి జనాంగాని సూచించే ఒక అలంకార రూపమైన వ్యక్తి కాదుగాని, దేవుడే యెన్నుకొన్న ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని గ్రహించడానికిగల కారణాలు:

అ) యెషయా.42:1-7 వచనాల ధ్యానము: ఈ వాక్యాలలో ప్రవక్త అయిన యెషయా పేరుగాని, రాజైన దావీదు పేరుగాని, లేక కోశాధికారి ఎల్యాకీము పేరుగాని పేర్కొనబడలేదు. అంతమాత్రమేగాక యాకోబు లేక ఇశ్రాయేలు అన్న జనాంగము పేరుకూడా పేర్కొనబడలేదు. కనుక, ఈ వాక్యాలలో పేర్కొనబడిన వ్యక్తి అప్పటికింకా పేరు వెల్లడి చేయబడని దేవుడైన యెహోవా చేత ఏర్పరచుకోబడిన ఒక ప్రత్యేకమైన వ్యక్తి అన్నది సుస్పష్టము.       

అంతేకాక, దేవుడైన యెహోవా ఈ వ్యక్తిని కాపాడి ప్రజలకు అంటే కేవలం అన్యులకే అనికాదు అందరికీ (ఇశ్రాయేలీయులకు మరియు అన్యులకు) నిబంధనగా నియమించబోటున్నట్లు వాగ్ధానము చేసాడు. ప్రజలతో అంటే మానవులందరితో చేయబడే నిబంధన నోవహునిబంధన తరువాత మెస్సయ్యనందు చేయబడే క్రొత్తనిబంధనే. 

ఆ) యెషయా.43:10 వచన ధ్యానము:

ఇ) యెషయా.49:5-6 వచనాల ధ్యానము:

“యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు.” 

– పై వాక్యాలలోని ‘నా సేవకుడు ‘ అన్నది యాకోబు/ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేషించి వాడబడిన పదజాలము కాదు. అది యెహోవా యెన్నుకొనిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఉద్దేషించి పేర్కొనబడింది. ఆ వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలను తిరిగి ప్రభువైన దేవుని  యొద్దకు తీసుకువచ్చేవాడు, వారిని ఉద్దరించేవాడు. ఆ ప్రత్యేకమైన వ్యక్తే ‘నా సేవకుడు ‘ (మత్తయి 12:18) లేక ‘తన సేవకుడు ‘ (అపొ.కా.3:13) అనబడిన యేసు (యషువ) అన్న సత్యాన్ని దేవుడు తన ఆత్మ ప్రేరణతో క్రొత్తనిబంధన లేఖనాలలో స్పష్టపరచాడు.   

ఈ) యెషయా.52:13-53:12 వచనాల ధ్యానము

– అది ఇశ్రాయేలు ప్రజలనుద్దేషించి కాదు. ‘నా సేవకుడు ‘ అంటూ ఇశ్రాయేలు ప్రజలను సంబోధించిన ప్రతిసారి యాకోబు లేక ఇశ్రాయేలు అన్న నామాన్ని విస్పష్టముగా పేర్కొనడాన్ని యెషయా గ్రంథములో చూడగలము. అయితే ఇక్కడ ‘నా సేవకుడు ‘ అని ప్రకటిస్తున్న సందర్భములో యాకోబు అనిగాని ఇశ్రాయేలు అనిగాని పేర్కొనలేదన్నది గమనించాలి. దీన్ని బట్టి ఇక్కడ వివరించబడుతున్నది ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి కాదుగాని ప్రభువైన దేవుడు తానే ఎన్నుకొనిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి అన్నది గ్రహించాలి.  

– ఇక్కడ ‘నా సేవకుడు ‘ అన్నది ఇశ్రాయేలు ప్రజలనుద్దేషించి కాదు. కారణం, ఇక్కడ వివరించబడుతున్న ‘నా సేవకుడు ‘  “తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును.” (యెషయా 53:10). అపరాధపరిహారార్థబలి/పాపపరిహారార్థబలి విశయములో లేఖనాలు సెలవిస్తున్న ప్రకారం “ఎవడైనను పాపపరిహారార్థబలిగా అర్పించుటకు గొర్రెను తీసికొని వచ్చినయెడల నిర్దోషమైనదాని తీసికొనివచ్చి” (లేవి.కాం.4:32).

అయితే, మోషే మొదలుకొని మలాకి వరకు గల సమయంలో పరమతండ్రి మాటలలో ఇశ్రాయేలీయులు…

  • లోబడనొల్లని ప్రజలు [ని.కాం.32:9]
  • పాపుల సంతానం [సం.కాం.32:14]
  • దేవునికి విరోధముగా సణిగే సమాజం [సం.కాం.14:27]
  • పాపిష్టి జనము [యెషయా.1:4]
  • సొదొమ మరియు గొమొఱ్ఱా జనులు [యెషయా.1:10]
  • విగ్రహారాధికులు [యిర్మీయ.11:17]
  • హృదయ సున్నతిలేనివారు [యిర్మీయా.9:25]
  • వేశ్య [యెహెజ్కేలు.16:15]
  • అపవిత్రులు [యెహెజ్కేలు.36:16]
  • బహిష్ట స్త్రీ వంటి అపవిత్రత గలవారు [యెహెజ్కేలు.36:16]
  • వ్యభిచారులు [1ది.వృ.5:25; హోషేయ.1:2]
  • అనీతిమంతులు [ఆమోసు.5:7, 6:13]
  • కిరాతకులు [ఆమోసు.7:2]
  • ముష్కరులు మరియు భ్రష్టులు [జెఫన్యా.3:1]
  • దొంగలు మరియు శాపగ్రస్తులు [మలాకి.3:9]

– అత్యంత గమనార్హమైన విషయం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు ‘నీతిమంతులు’ అంటూ బైబిల్ అంతటిలో మచ్చుకు ఒక్కసారి అయినా లేఖనాలు పేర్కొనటంలేదు, గుర్తించటంలేదు! కనుక, ఇశ్రాయేలీయులకు అపరాధపరిహారార్థబలిగా ఉండే అర్హత ఏమాత్రములేదు. ఆమాటకొస్తే, వారికే అంటే వారినే ప్రక్షాళనము చేసేందుకు ఒక  అపరాధపరిహారార్థబలి అవసరమన్నది సుస్పష్టము. ఆ బలి ప్రభువైన దేవుడు ఎన్నుకొనిన ‘ఆయన సేవకుడు,’ ఆ సేవకుడు మెస్సయ్యగా విచ్చేసిన యషువ [యేసు].        

– ఇక్కడ ‘నా సేవకుడు’ అన్నది ఇశ్రాయేలు ప్రజలను గురించి కాదు. “అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలోచించినవారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానముచేత అనేకులను నిర్దోషులుగా చేయును.”  (యెషయా 53:8-11).  

పై వాక్యాలలోని అతడు యెవరు? నా జనులు ఎవరు? నా జనులు అంటే ఇశ్రాయేలు ప్రజలు. అయితే ‘అతడు’ ఇశ్రాయేలీయుల కొరకు బలిపశువుగా మారాడు అన్నది అర్థమవుతున్నది. మరి ‘అతడే’ ఇశ్రాయేలు జనాంగము అని కాదు! ఆ ‘అతడు’ ప్రభువైన దేవుని యొక్క ‘నీతిమంతుడైన నా సేవకుడు.’ ఆయనే మెస్సయా. పై వాక్యాలలో పేర్కొనబడ్డట్టుగా ఆ మెస్సయ్య నిర్వర్తించబోయే కార్యాలను నిర్వర్తించినది యేసు (యషువ). దీన్ని బట్టి కూడా యేసు (యషువ) మెస్సయా (మషియాఖ్/క్రీస్తు) అని నిరూపితమవుతున్నది.  

Permalink to single post

బైబిలు వెలుగులో యషువ (యేసు)

దేవుడు ఈలోకములోని కొందరు వ్యక్తులను ఎన్నుకొని వారిద్వారా తన సందేశాన్ని మానవులకు అందిస్తూ వచ్చాడు. దేవునిచేత ఎన్నుకోబడి దేవుని తరపున పంపించబడినవారిలో ప్రధానమైనవాడు మోషే (ని.కాం.3:14-15).

మోషే తరువాత వచ్చిన ప్రవక్తలందరుకూడా (యిర్మీయ.26:5) ఈలోకములోనుండి దేవునిచేత ఎన్నుకోబడి పంపబడ్డవారే. ఈ రకంగా దేవుడు మోషే మొదలుకొని మలాకి వరకు దాదాపు వెయ్యి సంవత్సరాల వ్యవధిలో అనేకమంది ప్రవక్తలను ఎన్నుకొని తన సందేశాలతో తన ప్రజల యొద్దకు పంపిస్తూ వచ్చాడు. అయినా వారిలో ఒక్కరుకూడా పరలోకములోనుండి దిగివచ్చినవారు లేరు. బాప్తీస్మమిచ్చు యోహానుకూడా ఇదే కోవకు చెందినవాడు.

దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను.” (యోహాను.1:6)

అయితే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు మానవాళికి కేవలము తన అంతిమ సందేశాన్ని అందించటానికి మాత్రమేగాక వారికి రక్షకునిగా మారి వారి పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని అందించే పరిపూర్ణ బలిగా తననుతాను అర్పించుకునేందుకై అద్వితీయుడైన తన స్వంత కుమారున్ని పరలోకములోనుండి ఈ లోకములోనికి పంపించాడు అన్నది లేఖనాలు ఘంఠాపథంగా చేస్తున్న ప్రకటన.

పరలోకములోనుండి ఈలోకములోకి దైవాంశసంభూతునిగా విచ్చేసిన యేసు క్రీస్తుకు మరియు ఈ లోకములోనుండే ప్రవక్తలుగా ఎన్నుకోబడిన వారికి మధ్య ఉన్న ప్రాథమిక అస్తిత్వ వ్యత్యాసాన్ని గ్రహించలేని ఆత్మీయ అంధత్వముతోకూడిన దుర్బోధకులు ప్రభువైన యేసు క్రీస్తును కేవలము ఒక నరునిగా మరియు ప్రవక్తలలో ఒకనిగా మాత్రమే చిత్రీకరించె ప్రయత్నం చేస్తారు. ఈ వాస్తవాన్ని బట్టి దైవ సంబంధులు లేఖనాల సమిష్టి బోధను పరిశీలించి అబద్ధ బోధకుల వక్రవ్యాఖ్యానాలకు ప్రతికూలంగా యివ్వబడిన లేఖన బోధలోని సత్యాన్ని గ్రహించాలి.

I. యషువ ఈలోకములో శరీరధారిగా ప్రవేశించకముందు ఉనికిని కలిగివున్నవాడు

“యేసు వారితో ఇట్లనెను దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చి [ἐξῆλθον/ఎక్సెల్తోన్ = came out of/లోనుండి వచ్చాను] యున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను.” (యోహాను.8:42)

“నేను తండ్రియొద్దనుండి బయలుదేరి [ἐξῆλθον/ఎక్సెల్తోన్ = came out of/లోనుండి వచ్చాను] లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.” (యోహాను.16:28)

(i) మట్టిలోనుండి సృష్టించబడిన ఆదాములా గాక పరలోకములోనుండి వచ్చాడు:

“నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగివచ్చితిని.” (యోహాను.6:38)
దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి యుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నాడు.” (యోహాను.6:47)
“అలాగైతే మనుష్యుకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు?” (యోహాను.6:62)
“యేసునేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పు కొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు.” (యోహాను.8:14)
“మీరు నన్ను ప్రేమించి, నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమి్మతిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.” (యోహాను.16:27-28)
“మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు.” (1కొరింథి.15:47)

(ii) ఈలోకములోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఆయనకు తండ్రి ఒక శరీరాన్ని అమర్చాడు:

“దేవుడు తన సొంత కుమారుని పాపశరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.” (రోమా.8:4)
“కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి.” (హెబ్రీ.10:5)

(iii) విశ్వాసుల తండ్రియైన అబ్రహాముకంటే ముందు ఉన్నవాడు [ఉండినవాడు కాదు]:

“యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని [I am, not I was] మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.” (యోహాను.8:58)

(iv) తండ్రియైన దేవుని యొద్ద వసించాడు:

“మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.” (యోహాను.3:13)
“నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.” (యోహాను.16:28)
“జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవమునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము.” (1యోహాను.1:1-2)

(v) తండ్రియైన దేవునితో సృష్టికార్యములో పాల్గొన్నాడు:

ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.” (యోహాను.1:2-3)
“ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.” (1కొరింథీ.8:6)
“ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.” (కొలొస్సీ.1:16-17)
“ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.” (హెబ్రీ.1:2)
తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది. నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.” (హెబ్రీ.8-12)

(vi) ఉనికికి ప్రారంభము లేనివాడు:

“బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.” (మీకా.5:2)
“అతడు తండ్రిలేనివాడును తల్లిలేనివాడును వంశావళిలేనివాడును, జీవితకాలమునకు ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు.” (హెబ్రీ.7:3)

(vii) దేవుని వాక్కుగా [Λόγος/లోగొస్] దేవునితో వున్నాడు:

“ఇవి జరిగినతరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.” (ఆది.కాం.15:1)
“అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా” (2సమూయేలు.7:4)
“అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.” (1రాజులు.6:11)
“ఆ రాత్రియందు దేవునివాక్కు నాతానునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.” (1ది.వృ.17:3)
యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.” (యెషయా.38:4)
“మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.” (యిర్మీయా.2:1)
“ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను…ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి” (యోహాను.1:1-2,14)
“రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.” (ప్రకటన.19:13)

(viii) దేవుని రూపము [μορφή/మోర్ఫే=form] నందుండి దైవత్వములోని అంతర్గత వాస్తవముగా [Internal Reality] ఉన్న వ్యక్తి:

ఆయన దేవుని స్వరూపము [μορφή/మోర్ఫే=form/రూపము] కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని” (ఫిలిప్పీ.2:6)

II. లోకములోనికి యషువ ప్రవేశము

బైబిలులో ‘లోకము’ [గ్రీకు మూల పదం: κόσμος/కాస్మోస్] అన్న పదము మూడు వివిధ అర్థాలను వ్యక్తపరుస్తూ ఉపయోగించబడింది. కొన్ని సందర్భాలలో ‘లోకము’ అన్న పదం విశ్వమంతటిని సూచిస్తూ ఉపయోగించబడింది (మత్తయి.13:35; యోహాను.13:1; 17:5,24), మరికొన్ని సందర్భాలలో భూమిపై వసిస్తున్న నరులందరిని సూచిస్తూ ఉపయోగించబడింది (మత్తయి.4:8; యోహాను.1:29; 3:16; 4:42; 17:6), ఇంకొన్ని సందర్భాలలో కేవలము భూలోకములోని అవిశ్వాసులను మాత్రమే సూచించటానికి వుపయోగించబడింది (యోహాను.1:10; 3:17; 7:7: 14:17; 17:14,18). ఈ పదము ఉపయోగించబడిన లేఖన సందర్భమే ఆ పదం ఏ భావముతో అక్కడ ఉపయోగించబడిందో గ్రహించటానికి ప్రధాన ఆధారము.

ఈలోకములోకి శరీరధారిగ విచ్చేయకముందు ఆయనకున్న స్థాయి మరియు అస్తిత్వము

(i) దేవుడైన తండ్రికి కుమారుడు: కన్యమరియకు జన్మించక పూర్వమే ఆయన దేవునికి కుమారుడు (కీర్తనలు 2:7,12; సామెతలు 30:4). మరోవిధంగా చెప్పుకోవాలంటే ఆయన దేవునిలోనుండి ఉద్భవించినవాడు! ఆ కారణాన్నిబట్టే ఆయన ఈ లోకములోనికి రాకముందే ఆయనను దేవుని కుమారుడంటూ లేఖనాలు పేర్కొంటున్నాయి:

“లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి [భూమిపై వసిస్తున్న నరుల మధ్యకు] పంపలేదు.” (యోహాను.3:17)
తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి [విశ్వములోనికి] పంపినవానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?” (యోహాను.10:36)
“నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు [విశ్వములోనికి] వచ్చియున్నాను; మరియు లోకమును [విశ్వమును] విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.” (యోహాను.16:28)
“అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి,” (గలతీ.4:4)
“దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి [భూమిపై వసిస్తున్న నరుల మధ్యకు] పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.” (1యోహాను.4:8-10)

(ii) దైవత్వములోని వ్యక్తి: దైవత్వపు లక్షణాలను కలిగిన వ్యక్తిగా ఆయనను లేఖనాలు పరిచయం చేస్తున్నాయి (మీకా 5:2; యోహాను 1:1,14, 20:28; రోమా.9:5; ఫిలిప్పీ.2:5-6; కొలొస్సీ.1:15,17; తీతుకు.1:13; హెబ్రీ.1:3,8)

(iii) నిత్యత్వములో తండ్రిచేత ప్రేమించబడ్డాడు: సృష్టికిముందే తండ్రియైన దేవునితో వసించాడు మరియు తండ్రిచేత ప్రేమించబడ్డాడు (యోహాను 17:5,24)

III. ఈలోకములోనికి యషువ విచ్చేసిన విధానము

– తన దైవత్వపు అధికారాలను/హాక్కులను ఉపయోగించకుండా రిక్తునిగా చేసుకోవటముద్వారా దైవత్వాన్ని మరుగుపరచుకొన్నాడు (ఫిలిప్పీ.2:7; హెబ్రీ.2:9,17-18)
– శరీరధారిగా అంటే పాపశరీరాకారముతో (పాపశరీరముతో కాదు సుమా!) వచ్చాడు (యోహాను 1:14; రోమా.8:4; హెబ్రీ.10:5). కనుకనే ఒక మనిషిగా జన్మించిన ఆయనకు తల్లిదండ్రులు, తోబుట్టువులు, అలాగే దేవుడు కూడా వున్నారు. అంతేగాక, ఈలోకములో మానవులకివ్వబడిన పరిమితులలో జీవించాడు.
– దాసునిస్వరూపములో వచ్చాడు (ఫిలిప్పీ.2:7-8)

IV. దేవుడు ఈ లోకస్తుల యెదుట యషువకు నిర్దేశించిన స్థానము/పాత్ర

– ‘రక్షకుడు’ మరియు ‘ప్రభువు’ (కీర్తనలు 110:1; మత్తయి.1:21; లూకా.1:43, 20:41-44; అపో.కార్య.2:36)
– దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా వసించిన దేవుని ‘మర్మము’ (కొలొస్సీ.2:2,9)
– దేవునికి మరియు నరులకు ‘మధ్యవర్తి’ (1తిమోతి.2:5-6). కేవలం ఒక నరుడు మాత్రమే దేవునికి మరియు నరులకు నడుమ మధ్యవర్తి కాలేడు. అలాగే, కేవలం దేవుడు మాత్రమే నరులకు మరియు దేవునికి మధ్య మధ్యవర్తిగా వుండలేడు. దైవత్వములో దేవునిగావుంటూ అదేసమయములో నరులమధ్య నరునిగా వున్న దైవాంశసంభూతుడే దేవునికి మరియు నరులకు మధ్య నిజమైన మధ్యవర్తిగా వుండగలడు.

V. ఈ సృష్టి అంతటిలో యషువకున్న గొప్పతనం

– ఆదాముకంటే గొప్పవాడు (1కొరింథీ.15:22,45)
– సొలొమోనుకంటే గొప్పవాడు (మత్తయి 12:42; లూకా 11:31)
– యోనాకంటే గొప్పవాడు (మత్తయి 12:41; లూకా 11:32)
– దావీదుకంటే గొప్పవాడు (కీర్త.110:1; మత్తయి 22:44; ప్రకటన 22:16)
– మోషేకంటే గొప్పవాడు (హెబ్రీ. 3:1-6)
– యాకోబు/ఇశ్రాయేలుకంటే గొప్పవాడు (యోహాను.4:12-14)
– అబ్రహాముకంటే గొప్పవాడు (యోహాను 8:54-58)
– మెల్కీసెదెకుకంటే గొప్పవాడు (హెబ్రీ.7:1-25)
– దేవదూతలకంటే గొప్పవాడు (మత్తయి 13:41-42; హెబ్రీ 1:4,6)
– విశ్రాంతిదినముకంటే గొప్పవాడు (మత్తయి 12:8; యోహాను.5:17-18)
– అందరికంటే గొప్పవాడు (ఎఫెసీ 1:20-21; ఫిలిప్పీ 2:9-11)
– దేవుని మందిరముకంటే గొప్పవాడు (మత్తయి.12:6; యోహాను.2:19-21)

VI. యషువ తనకు మరియు తండ్రికి మధ్య వున్న అవినాభావసంబంధాన్ని గురించి తెలియజేసిన సత్యాలు

– “తండ్రియందు నేనును నాయందు తండ్రియు యున్నాము” (యోహాను 10:38; 14:10-11).
– “నేనును తండ్రియును ఏకమై యున్నాము.” (యోహాను 10:30)
– “నావన్నియు నీవి, నీవియు నావి; వారియందు నేను మహి మపరచబడి యున్నాను.” (యోహాను 16:15; 17:10)
– “తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెను” (యోహాను 5:23).
– “నన్ను చూసినవాడు తండ్రిని చూచియున్నాడు” (యోహాను 12:45; 14:9).
– “నాయందు విశ్వాసముంచు వాడు…నన్ను పంపిన వానియందు విశ్వాసముంచుచున్నాడు. (యోహాను 12:44)
– “కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడుకాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించు వాడు.” (1యోహాను 2:23)
– “నన్ను ద్వేశించువాడు నా తండ్రినికూడా ద్వేశించుచున్నాడు.” (యోహాను. 7:7; 15:23)
– “తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడుగాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.” (మత్తయి 11:27)
– “నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము.” (యోహాను 17:2)

VII. యషువ యెడల నిజవిశ్వాసులకుండాల్సిన దృక్పథము/వైఖరి విశయములో తండ్రి చిత్తము

– దేవుని స్వరూపియైన ఆయన మహిమను చూడాలి (2కొరింథీ.4:4; కొలొస్సీ.1:15)
– ఆయన దేవుని అద్వితీయ కుమారుడని విశ్వాసముంచాలి (యోహాను 3:36, 12:44; 1యోహాను 5:10)
– తండ్రిని ఘనపరచునట్లుగా/అదేవిధంగా [καθὼς/కాతోస్=just as/same as/even as; అదేవిధంగా/ఆరకంగానే] ఆయనను ఘనపరచవలెను (మత్తయి.2:9-11, 28:9,17; యోహాను 5:23, 20:28; హెబ్రీ.1:6; ప్రకటన 5:8-14)
– ఆయనను దేవుని అద్వితీయ కుమారునిగా గుర్తించి దేవుని అద్వితీయ కుమారునికి ఏస్థానమిచ్చి ఏవిధంగా గౌరవించాలోనన్నది అపోస్తలుల వ్రాతలలో మరియు వారి మాదిరిలో చూపించబడిందో ఆవిధమైన స్థానాన్ని గౌరవాన్ని ఆయనకు యివ్వనివ్యక్తి తండ్రినే అగౌరవపరచి త్రుణీకరించినవాడుగా లెక్కించబడుతాడు (యోహాను 5:23). అలాంటివాడే క్రీస్తువిరోధి (1యోహాను 2:22-23)

యషువ మషియాఖ్ (యేసు క్రీస్తు) కు నిజవిశ్వాసులు ఇవ్వాల్సిన స్థానము గురించి అపోస్తలుల బోధ మరియు మాదిరి

– అపోస్తలుల బోధ ప్రకారం ఆయన దేవున్ని తన తండ్రిగా ప్రకటించుకొని దేవునితో సమానునిగా చేసుకొన్నాడు (యోహాను 5:18, 10:30-38)
– అపోస్తలులు ఆయనను దేవునిగా గుర్తించారు (యోహాను 1:1, 20:28; 2కొరింథీ.4:4; ఫిలిప్పీ.2:6; రోమా.9:5; కొలొస్సీ.1:15; తీతుకు 1:13; హెబ్రీ.1:8). తండ్రి మరియు కుమారుడు ఇరువురిని ఒకే దేవుడు అని దైవాత్మచేత నడిపించబడిన అపోస్తలులు గుర్తించడానికి నిజదేవుని ప్రవృత్తే కారణం!
– అపోస్తలుల బోధ ప్రకారము అంటే క్రొత్తనిబంధన బోధప్రకారము ప్రొస్కినియో (προσκυνέω=bowing down/worship/show reverance;మ్రొక్కుట/ఆరాధన/పూజ్యభావముతోకూడిన నమస్కారము) అన్నది కేవలము దేవునికే చెందాలి (మత్తయి 4:10). మనుషులకు ఆపాదించకూడదు (అపో.కా.10:26). దేవదూతలకుకూడా ఆపాదించకూడదు (ప్రకటన 19:10, 22:9). అయినా, ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రొస్కినియో (προσκυνέω) ను దేవునిచే దర్శించబడి నడిపించబడిన తూర్పుదేశ జ్ఙానులు ఆపాదించారు (మత్తయి 2:9-11), సాధారణ యూదులు ఆపాదించారు (యోహాను 9:38), అపోస్తలులుకూడా ఆపాదించారు (మత్తయి 28:9,17), మరియు  దేవదూతలు సహితం ఆపాదించారు (హెబ్రీ.1:6). మనుషులు తనకు ప్రొస్కినియో (προσκυνέω) ఆపాదిస్తున్నప్పుడు పేతురు తిరస్కరించాడు, దేవదూత నివారించాడు, కాని ప్రభువైన యేసుక్రీస్తు మాత్రము దాన్ని అంగీకరించి స్వీకరించాడు. కారణం, ఆయన ప్రొస్కినియోకు (προσκυνέω) అర్హుడు! అందుకే యుగాంతమందుకూడా సృష్టియావత్తూ తండ్రికి మరియు కుమారునికి సమిష్టిగా ప్రొస్కినియో (προσκυνέω) అర్పించబోతున్నారన్నది లేఖనము ప్రవచనాత్మకంగా మనకు ప్రకటిస్తున్నది (ప్రకటన 5:8-16).

“దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగసంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.” (2కొరింథీ.4:4-5)

Permalink to single post

అనువాదం vs అపోహ

బైబిలులో నామము/పేరు అన్నది కేవలం…

  • ఒక సిరాగుర్తుల సంకలనం కాదు  
  • హీబ్రూ భాషలోని అక్షరాల కూర్పు కాదు  
  • హీబ్రూ భాషాపదాల ఉచ్చారణ అంతకన్నా కాదు

నామము లేక పేరు అన్నది వ్యక్తి యొక్క గుర్తు/గుర్తింపు. వ్యక్తి యొక్క ముద్ర లేక ప్రాతినిథ్యం. 

నామము అన్నది అనామాన్ని ధరించిన వ్యక్తిని సూచిస్తుంది అంతేకాక ఒకరకంగా ఆ వ్యక్తితో అనుసంధానం చేస్తుంది. అయితే, ఈ సందర్భంగా మనం గమనములో వుంచుకోవలసిన మూడు ప్రాథమిక అంశాలున్నాయి. అవి: వ్యక్తి, ఆ వ్యక్తిని వుద్దేశించి వుపయోగించబడుతున్న నామము, ఆ నామాన్ని వుపయోగిస్తున్న వ్యక్తి. వీటిలోని నామము సూచిస్తున్న “వ్యక్తి” విశయములో ఆ నామాన్ని వుపయోగిస్తున్న వ్యక్తికి స్పష్టత వున్నంతవరకు వుపయోగించబడిన “నామము” భాషాశాస్త్రానికనుగుణంగా మర్పుచెందితే తప్పుకాదు అందులో ఏ సమస్యాలేదు. 

ఉదాహరణకు, శ్రీనివాస్, హరి, శంకర్, విష్ను, కృష్ణ, సరస్వతి, లక్ష్మి, పార్వతి మొదలైన పేర్లున్న హైందవ మిత్రులు మనందరికి వున్నారు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ పేర్లు అన్నీకూడా అన్యదేవుల్ల/దేవతల పేర్లు. మీ స్నేహితులను వుద్దేశించి వారి పేర్లతో వారిని సంబోధిస్తున్నప్పుడు మీ దృష్టిపథం లో వుండేదెవరు…? అన్యదేవుల్లా/దేవతలా లేక ఆ పేరును పెట్టుకున్న మీ స్నేహితుడు/స్నేహితురాలా…? మీ స్నేహితుడు లేక స్నేహితురాలు మాత్రమే మీ దృష్టిపథంలో వుండేది. అందులో ఏసమస్యా లేదు! “అపొల్లొ” అన్నది గ్రీకు మరియు రోమనుల దేవుని పేరు. తల్లిదండ్రులచేత ఆ నామము పెట్టబడిన ఒక వ్యక్తి తాను పెద్దవాడిగా ఎదిగిన తరువాత యేసే [యషువనే] లేఖనాలలో ప్రవచించబడిన క్రీస్తు [మషియాఖ్] అని గ్రహించి విశ్వాసిగా మారాడు. విశ్వాసిగా మారిన తరువాతకూడా అతను అదే పేరుతో పిలువబడ్డాడు. ఆ పేరును లేఖనాలుకూడా వుపయోగించాయి (అపో.కా.18:24). లేఖనాలలో వున్న “అపొల్లొ” అన్న పదం గ్రీకు/రోమను దేవున్ని సూచించడములేదు. ఆ పేరును ధరించి వున్న ఒక వ్యక్తిని ఒక విశ్వాసిని సూచిస్తున్నాయి. నామము యొక్క భాషారూపము కాదు ప్రధానము, ఆ నామము సూచిస్తున్న వ్యక్తి ప్రధానము.

లేఖనము శాశిస్తున్నది, “…వేరొక దేవుని పేరు ఉచ్చరింప కూడదు; అది నీ నోటనుండి రానియ్య తగదు.” (ని.కాం.23:13)
అయితే, మీరు శ్రీనివాస్, హరి, శంకర్, విష్ను, కృష్ణ, సరస్వతి, లక్ష్మి, పార్వతి వంటి మొదలైన పేర్లతో మీ పరిచయస్తులను సంబోధిస్తున్న ప్రతిసారి మీరు అన్య దేవుల్ల/దేవతల పేర్లను ఉచ్చరిస్తున్నట్లా…? అలా అయిన పక్షములో మీరు ఆ పేర్లను ఉచ్చరించిన ప్రతిసారి పై లేఖనానికి వ్యతిరేకంగా పాపము చేసినట్లే కదా!

నిజానికి ఈ పేర్లను ఉపయోగించిన సందర్భములో మీరు దృష్టిస్తున్నది మీ తోటి వ్యక్తులను, అన్య దేవుల్లను/దేవతలను కాదు. కనుక, మీ పరిచయస్తులను ఉద్దేశించి వాటిని వుపయోగిస్తున్న సందర్భాలలో మీకు ఏపాపము ఆపాదించబడదు. కారణం, మీరు వుపయోగిస్తున్న పేర్లు మీరు వుపయోగిస్తున్న సందర్భాలలో కేవలం ఆ వ్యక్తులను సూచించే పేర్లు మాత్రమే.

క్రీస్తుకు పూర్వపు అనువాదాలు

హీబ్రూ లేఖనాలను అంటే తనాక్ (పాతనిబంధనను) ను క్రీస్తుకు పూర్వం మూడవ శతాబ్ధములోనే 72 మంది యూదు పండితులు భక్తులు గ్రీకు భాషలోనికి అనువదించారు. ఆ అనువదాన్నే సెప్టూజింట్ (Septuagint) అని పేర్కొంటారు.        

2200 సంవత్సరాల క్రితమున్న యూదు పండితులు సెప్టూజింటులో హీబ్రూ పదాలైన ఎలోహిం (אֱלהִים) ను తియోస్ (θεός) గా, యోద్ హే వవ్ హె (הָיָה) ను కురియొస్ (Κύριος) గా, యషువ/యెహోషువ (יְהוֹשׁוּעַ) ను (ఈసు/యేసు/Ἰησοῦ) గా, మెస్సయా/మషియాఖ్ (מָשִׁ֣יחַ) ను క్రీస్తు (Χριστοῦ) గా అనువదించారు. ఈ రకమైన అనువాద మార్పులవెనుకనున్న ఆంతర్యము ఉచ్చారణ మరియు వ్యాకరణ నియమాలతో ముడిపడివున్న భాషాశాస్త్రము (Linguistics), పదఅధ్యయనశాస్త్రము (Semantics), శబ్దవ్యుత్పత్తిశాస్త్రము (Etymology), సంజ్ఞానామకపరిశీలనాశాస్త్రము (Onomastics) మొదలనవాటిలో పరిజ్ఙానము ప్రవేశము లేనివారికి ససేమిరా అర్థముకాని లోతైన అంశాలు.

విజ్ఙులు ఈ వాస్తవాన్ని గమనములో వుంచుకొని భాషాపరమైన అనువాదాల విశయములో తమ తీర్పులను అదుపులోవుంచుకుంటారు. విజ్ఙానశూన్యులు మాత్రమే ఇవేవి గమనములోకి తీసుకోకుండా విపరీత తీర్పులకు ప్రకటనలకు దిగజారుతుంటారు. ఈనాడు బైబిలులోని నామాల/పేర్ల అనువాదాన్ని తప్పుబట్టుతున్న వాళ్ళు సెప్టూజింటును అందించిన యూదు పండితులను భక్తులనుకూడా తప్పుబట్టి వారికి తీర్పుతీర్చి తమపైకి నాశనాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు!   

పాతనిబంధన గ్రంథముగా పేరుపొందిన తనాక్ గ్రంథములో మోషే దేవుని ప్రవక్తలలో అతిగొప్ప ప్రవక్త. “మోషే” [משֶׁה] అన్న అతని పేరు అన్యదేవతలను పూజించే ఒక అన్యురాలైన ఐగుప్తీయురాలిద్వారా యివ్వబడింది అన్న సత్యాన్ని ఈసందర్భంగా జ్ఙాపకం చేసుకోవాలి (ని.కాం.2:10). మోషే అనే పేరు మొదట “మెస్” (కుమారుడు) అన్న ఐగుప్తు భాషా పదం లోనుండి వచ్చింది. అటుతరువాత బాలుడైన మోషే నీళ్ళలోనుండి రక్షించబడిన సంఘటన తరువాత ఆ పేరులోనుండి బయటికి లాగబడటము అన్న అర్థాముతోకూడిన మషాహ్ (משה) అన్న హీబ్రూ పదప్రయోగం మొదలయ్యింది. ఒక విగ్రహారాధికురాలు పెట్టిన మోషే అనే పేరును ప్రభువైన దేవుడు లేఖనాలలో తన ప్రవక్తకు వుపయోగించడం గమనార్హమైన విశయం.  

లేఖనాల సాక్ష్యం: భాషల అనువాదము దేవుడు అంగీకరించిన ప్రక్రియ

వ్యక్తులను లేక సందేశాలను వ్యక్తీకరించటములో భాషలు పరికరాలుగా ఉపయోగపడుతాయి. ఈ ప్రక్రియను సృష్టికర్త ఎప్పుడు ఎక్కడా నిశేధించలేదు. ఈ కారణాన్నిబట్టే సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలులో [పాత మరియు క్రొత్త నిబంధన గ్రంథాలలో] అనువాదాల ప్రక్రియను గూర్చిన సాక్షాధారాలు వున్నాయి.

పాతనిబంధన గ్రంథం

యోసేపు ఐగుప్తు అధికారిగా వున్నసమయములో తనను అప్పటికి గుర్తించని తన స్వంత అన్నలు ధాన్యాన్ని కొనుగోలు చేసే సందర్భములో వారితో ఐగుప్తు భాషలో మాట్లాడినా ఆ మాటల యొక్క హీబ్రూ అనువాదములో “దేవుడు” [הָאֱלֹהִ֖ים/హ ఎలోహిం] అన్న పదాన్ని వుపయోగించటాన్ని లేఖనాలే ధృవపరుస్తున్నాయి (ఆది.కాం.42:18-23).
దానియేలు గ్రంథములోని లేఖనాలు అరామిక్ భాషానువాదములో వ్రాయబడ్డాయి (దానియేలు.2:4-7:28).

క్రొత్తనిబంధన గ్రంథం

“మరియు యొప్పేలో తబితా [అరామిక్ భాషా పదము] అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమెకు భాషాంతరమున దొర్కా [గ్రీకు భాషా పదము] అని పేరు. ఆమె సత్‌ క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి యుండెను.” (అపో.కా.9:36)
“పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను.” (ప్రకటన.9:11)

అన్యభాషలలో నుండి మరియు అన్యదేవుళ్ళ లేక దేవతల పేర్లలో నుండి వచ్చిన పేర్లుగా భావించబడే పాతనిబంధన గ్రంథములోని [తనాఖ్] కొన్నినామాలు:

1. ఎస్తేరు [אֶסְתֵּר]: బబులోను ప్రజలు పూజించిన దేవుడు “ఇష్తార్” నుండి వచ్చిన అరామిక్ భాషా నామము (ఎస్తేరు.2:7).   
2. జెరుబ్బాబేలు [זְרֻבָּבֶל]: “బబులోను పుత్రుడు” అనే అర్థముతో కూడిన అరామిక్ భాషా నామము (ఎజ్రా.2:2).
3. ఎలాహ్ [אַלָהּ]: “దేవుడు” అన్న భావాన్ని వ్యక్తపరచే అరామిక్ భాషా పదం “దేవుడు” గానే అనువదించబడింది (దానియేలు.4:2).  

పై నామాలను దేవుడు/లేఖనాలు ఏ అభ్యంతరము లేకుండా వుపయోగించడము జరిగింది. కారణం, సృష్టికర్తకు భాషలకన్నా భావవ్యక్తీకరణ మరియు వ్యక్తులు ప్రధానం!

ఒకే వ్యక్తికున్న నామము యొక్క వివిధ భాషలలోని అనువాద రూపాలు 

యషువ మషియాఖ్ (מָשִׁ֣יחַ יְהוֹשׁוּעַ)
ఈసూ క్రిస్టూ (Ἰησοῦ Χριστοῦ)
జీసస్ క్రైస్ట్ (Jesus Christ)
ఈసా అల్-మసీహ్ (عيسى المسي)
యేసు క్రీస్తు
[యేసు (యషువ) అన్న నామానికి అర్థం ‘యెహోవాయే రక్షకుడు’ లేక ‘యెహోవా రక్షించును;’ క్రీస్తు (మషియాఖ్) అన్న బిరుదుకు అర్థం ‘అభిషిక్తుడు’ లేక ‘మెస్సయ్యా’

పైవాటిలోని ఏదో ఒక నామాన్ని/పేరును వుపయోగిస్తున్న నా దృష్టిపథంలో అలాగే మీ దృష్టిపథంలో వున్నది ఒకే వ్యక్తి! అతనే పరమతండ్రిలోనుండి బయలుదేరి వచ్చిన ఆయన ప్రియకుమారుడు (కీర్తన. 2:7; యోహాను.6:38, 62; అపో.కా.13:33; హెబ్రీ.1:5, 5:5), మానవాళికున్న ఏకైక ప్రభువు మరియు రక్షకుడు.   

మానవాళికి రక్షణ యేసు (మానవాళి రక్షణకై తనను తాను బలియాగము చేసుకున్న దేవుని ప్రియకుమారుడు) నామములోనే…అంటే ఆపేరును తెలిపే గుర్తులలో అనికాదు లేక ఆపేరు వ్రాయబడే అక్షరాలలో అనికాదు లేక అపేరు యొక్క ఉచ్చరణలో అనికాదు. రక్షణ అన్నది ఆపేరు ఎవరిని సూచిస్తున్నదో లేక ఎవరికి ప్రాతినిథ్యంవహిస్తున్నదో సాక్షాత్తు ఆ వ్యక్తిలోనే సిద్ధంచేయబడింది, ఆ వ్యక్తినందు ఆ వ్యక్తిద్వారానే అనుగ్రహించబడుతుంది!          

“మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే (యేసు/యషువ) మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.” (అపొ.కా.4:12) 

ఈయన (యేసు/యషువ) తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.” (హెబ్రీ.7:25) 

“తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు (యషువ) అను పేరు పెట్టుదువనెను.” (మత్తయి 1:21)  

ఆయనయందు (యేసు/యషువ) విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్త లందరు ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నారనెను.” (అపొ.కాం.10:43) 

“మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయము లన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయనవలననే (యేసు/యషువ) నీతి మంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియు గాక.” (అపొ.కాం.13:39) 

“అందుకు వారు ప్రభువైన యేసు (యషువ) నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి.” (అపొ.కాం.16:31-32)  

గమనిక:

కొందరు అభిప్రాయపడుతున్నట్లుగా దేవుడు హీబ్రూ భాషను దైవభాషగ లేక ఆత్మీయభాషగా ఉద్దేశిస్తే పాత నిబంధన గ్రంథములోని కొన్ని లేఖనాలను అరామిక్ భాషలో వ్రాయబడటానికి (ఎజ్రా 4:8–6:18; దానియేలు 2:4–7:28) దేవుడు అనుమతించేవాడు కాదు. 

సృష్టికర్త తాను యిచ్చిన మోషేధర్మశాస్త్రములోని 613 ఆజ్ఙలలో ఒక్క ఆజ్ఙకూడా హీబ్రూభాషకు సంబంధించినది యివ్వలేదు. దీని కారణము భాషలన్నీ దేవునిముందు సమానమేనన్నది విజ్ఙులు గ్రహించగలరు!    

వివిధ భాషల ప్రారంభమన్నది బాబేలులోని నరుల పాపమునుబట్టే కనుక దేవున్ని/సృష్టికర్తను సంబోధించటానికి లేక ఆరాధించటానికి అన్యభాషలను వుపయోగించరాదు అంటూ ఎవరైనా అభ్యంతరపడితే అలాంటివారు దుస్తులను ధరించి దేవున్ని/సృష్టికర్తను ఆరాధించటానికి కూడా అభ్యంతరపడక తప్పదు. కారణం, ఏదేను తోటలోని ఆదిదంపతుల పాపమును బట్టే దుస్తులను ధరించటమన్నది ప్రారంభమైంది అన్నది లేఖన సత్యం.

భాషలను అనువాదాలను వ్యతిరేకించేవారు ఆలోచించాల్సిన విశయాలు స్పందించాల్సిన ప్రశ్నలు అనేకం వున్నాయి…

Recent Entries »